Archive for జూలై, 2010

(లో)పాలు

ప్రైవేటు డెయిరీ ఏజంట్ల మాటేమోగానీ, హైదరాబాదు నగరంలో విజయ డెయిరీ ప్రతినిధులు మాత్రం వినియోగదారులతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధర వసూలు చేయటం, కోరిన ఎస్‌ఎన్‌ఎఫ్‌ పాలు లేవనటం, 200 మిల్లీ లీటర్ల ప్యాకింగ్‌ అడిగితే ఊరు పేరూ లేని డెయిరీవి ఇవ్వటం, అదేమని అడిగితే తిట్లకు దిగటం మామూలయింది. రాంనగర్‌ చౌరాస్తా ఏజంటు విజయడెయిరీతోపాటు అన్ని రకాల పాలూ విక్రయిస్తాడు. వాస్తవానికి ఇలా అన్ని రకాలూ అమ్మటం నిబంధనలకు విరుద్ధం. సరే చూసీచూడనట్లు పోదామనుకుంటే విజయ పాలకు బదులు వేరు రకం అంటగడుతుంటాడు. ప్రత్యేకించి 200 మిల్లీలీటర్ల విజయ డెయిరీ ప్యాకెట్లను దాచిపెట్టి సుగుణ పాలు అమ్మటం కద్దు. ఎవరయినా విజయపాలు కావాలని అడిగినా, లేవంటాడు. చూసి అడిగితే వాటిని దుకాణాల వాళ్లకోసం తెప్పించానని తప్పుకోజూస్తాడు. విజయపాల ప్యాకెట్లు పగిలిపోతున్నందున తెప్పించటం లేదంటాడు. దీనికితోడు రూ. 4.50కు బదులు రూ. 5 వసూలు చేస్తాడు. అడిగితే చిల్లర లేదంటాడు. గట్టిగా అడిగితే చిల్లర తెచ్చుకుని తీసుకుపొమ్మంటాడు. అదే ఇతర డెయిరీల 200 మిల్లీలీటర్ల పాలకు మాత్రం రూ. 5.50 తీసుకుని చిల్లర ఇస్తాడు. ఇదంతా విజయ డెయిరీ యాజమాన్యం అనుసరిస్తోన్న దివాలాకోరు విధానాల ఫలితంగానే జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, అక్రమార్కుల నుంచి సొంత లబ్ధి పొంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందునే వినియోగదారుల మన్నన పుష్యలంగా ఉన్న ప్రభుత్వ సంస్థ ఇలా ఏడుస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమంటే ఇదేనన్న జ్ఞానం విజయ డెయిరీ సిబ్బందికి ఉంటే పరిస్థితి ఇలా ఉండదు. ఎవరన్నా ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా, చర్య తీసుకోకపోగా ఫలానావాడు మీ మీద ఆరోపణలు చేస్తున్నాడని ఏజంట్లకే ఉప్పందిస్తారు. దీంతో ఆ ఏజంటు ఆ వినియోగదారుడిని ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తాడు. చిల్లరలేదంటాడు ఒకసారి, స్టాకు లేదంటాడు మరోరోజు, అవసరమయి అడిగితే రోజూకన్నా ఎక్కువ పాలు ఇవ్వనంటూ పేచీలకు దిగుతాడు. ఇదీ విజయ డెయిరీ (లో)పాల కథ.

అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష అక్రమాలకు తెర

కీర్తిశేషులు నార్ల వెంకటేశ్వరరావు అంటారూ – అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. ప్రజాస్వామ్య మహాసౌథానికి నాలుగో స్తంభమని భావించే పత్రికారంగం నిజాయితీగా వ్యవహరిస్తే … అదే సిరాచుక్క లక్ష అక్రమాలకు తెర.
దీనికి ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో నేను ఈనాడులో రాసిన ప్రత్యేక కథనం నిలువుటద్దం …. ఆ వార్తా కథనంతోపాటు ఆనాడు చోటుచేసుకున్న సంఘటల్నీ ఈ రోజు మీతో పంచుకోనీయండి!
పాపయ్య, పెద్ద పాపాలభైరవుడు. ఒంగోలు పురపాలక సంఘంలో కమిషనరుగా పనిచేసిన ఈయన ఆచరణలో క’మీ’షనరు. అంటే చీటికీ మాటికీ కమీషన్లు కొడుతుంటాడనేగా. ”ముడుపులు ముట్టను – పర్సంటేజీలు పట్టను” … పాపయ్య కమిషనరుగా ఒంగోలులో బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నేను రాసిన వార్తకు శీర్షిక. ప్రజా సేవలో నిమగ్నమయి తాను వైవాహిక జీవన మాధుర్యాన్ని కూడా అనుభవించలేకపోతున్నానని తొలిరోజే ఆయన నాతో నేరుగానే చెప్పటం విశేషం. నా కథనంలో ఇది కూడా ఓ ముఖ్యమయిన అంశమే అయినందున దీన్ని ప్రస్తావించాల్సి వచ్చినందుకు క్షమించండి.
ఈ పాపి అందరిమాదిరిగానే వారంరోజులు అదరగొట్టాడు. ఇతర అధికారుల్నీ, సిబ్బందినీ పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత చూడండి పాపయ్య పాపాలకు అంతేలేకుండా సాగటం మొదలయింది. దానికి అనుగుణంగానే నేనూ నిత్యం వెంటబడి కలం కదిలించాను. ముడుపులు మూటగట్టుకోవటంతోపాటు, కార్యాలయంలోనే రోజుకొకరితో పడకేసేవాడు పాపి. ఓ రోజు పాపి సహా నలుగురు అధికారులు కార్యాలయం తలుపులు బిగించుకుని మరీ బండబూతులు తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. సమగ్ర మరుగుదొడ్ల నిర్మాణ పథకం గుత్తేదారు నుంచి ముట్టిన ముడుపులన్నింటినీ (16 శాతం) కమీషనరు మూటగట్టుకుని తీసుకోవటమే దీనికి కారణం. నాలుగు గోడల మధ్య సాగిన ఈ వ్యవహారం కూడా యధాతథంగా మరునాడే రంగులు పూసుకుని ప్రకాశం మినీ మొదటి పేజీలో పాఠకులకు దర్శనమిచ్చింది. దీంతో కలకలం చెలరేగింది. నాలుగు గోడల మధ్యసాగిన వ్యవహారం ఈనాడు విలేకరి కావెసురా( వెంకట సుబ్బారావు కావూరి)కి ఎలా తెలిసింది???? ఇదీ చర్చ. ఆ నలుగురూ మళ్లీ తలుపులు బిగించుకుని, కావూరికి నువ్వు చెప్పావంటే, నువ్వు చెప్పావంటూ మళ్లీ చెంపలు వాయించుకున్నారు గుట్టుగా. అదీ మళ్లీ మరునాడే పత్రికకు ఎక్కింది. మున్సిపాలిటీతో సంబంధమున్న అందరికీ మతి పోయింది. ఇచ్చినవాడు చెప్పడు, తిన్నవాడు చెప్పడు, అడిగినవాడు చెప్పడు, కొట్టినవాడు చెప్పడు, కొట్టించుకున్నవాడు చెప్పడు…. మరి విలేకరికి పూసగుచ్చినట్లు ఎలా తెలుస్తోంది? సమాధానం దొరక్క చివరకు ఒక నిర్ధారణకు వచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన మైక్రో కెమెరాలను కావూరి ఎక్కడో బిగించాడు. వాటి ఆధారంగానే రహస్యాలు రాబడుతున్నాడని ఒకరికొకరు చెప్పుకున్నారు. విలేకరులు అదే నమ్మారు. నాతోనూ అదే చెప్పారు. నేను నవ్వి ఊరుకున్నాను. వాస్తవానికి నా దగ్గర ఏ కెమెరాలూ లేవు. ఉన్నదల్లా కమీషనరు అటెండరుతో స్నేహం, కారు డ్రైవరుతో అనుబంధం. అంతే. ఎంత రహస్యమయినా అటెండర్లను బయటకు పంపరు. డ్రైవరుకు తెలియకుండా కారులో ఏదీ జరగదు. అదీ అసలు రహస్యం. అటెండరు మిత్రులు, డ్రైవరు సాబ్‌లు ఎప్పటికప్పుడు అయినదానినీ, కానిదానినీ నాకు పూసగుచ్చేవాళ్లు. విలేకరి మిత్రులూ చూసుకోండి మరి. సరే నా వార్తల ఆధారంగా పాపిమీద ఏసీబీ దాడి చేసింది. ప్రభుత్వం సస్పెండు చేసింది. అయితే పాపి మేనమామ అధికారపార్టీలో పలుకుబడి కలవాడవటంతో (ఆర్టీసీ ఛైర్మను పదవి వెలగబెట్టేవాడు) కొద్ది రోజుల్లోనే విముక్త్తుడయ్యాడు. పాపి మామూలోడు కాదుగదా! నాలుగు రోజులకే మళ్లీ ప్రారంభించాడు పాపపు పనులన్నింటినీ. నా కలమూ కదులుతూనే ఉంది. ఓ రోజు పాపి నాకు ఫోను చేసి ఎంత కావాలో కోరుకోమన్నాడు. వద్దని సూటిగా చెప్పాను. పోనీ పత్రికకు ప్రకటనలు ఇస్తానని ఎరవేశాడు. ఆ పని నాది కాదని నిర్ధ్వందంగా తేల్చి చెప్పాను. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టి ఊచలు లెక్కపెట్టిస్తానంటూ స్వరం పెంచాడు. నీకు చేతనయింది చేసుకోమన్నాను. గూండాల్ని పెట్టి కాళ్లూ, చేతులు తీయిస్తానంటూ ఫోను పెట్టేశాడు. ఓ అరగంట తర్వాత సాక్ష్యం కోసం కొందరు కౌన్సిలర్లను వెంటబెట్టుకుని వెళ్లి పాపిని కలిసి నీకు చేతనయింది చేసుకో, నా ప్రాణం ఉన్నంతవరకూ, నాచేతిలో కలం ఉంచినంతవరకూ దేన్నీ దాయకుండా పౌరులకు చెబుతూనే ఉంటానని నేరుగా చెప్పి వచ్చేసాను. పాపి మొదటిసారిగా వణకటం చూశాను. మనసు తీరా నవ్వుకున్నాను. ఓ అక్రమార్కుడిని అంతలా భయపెడున్నందుకు తెగ గర్వపడిపోయాను. మరో ఆరు నెలలు గడిచింది. పాపి వ్యవహారాలు రోజూ వార్తలయి పౌరులకు చేరుతుండటంతో పాలక పెద్దలకు కూడా విసుగు పుట్టింది. పాపిని పంపేసి ఆ స్థానంలో ఆంజనేయుల్ని (అసలు పేరుకాదు) తెచ్చుకున్నారు. అయితే పాపిని ఊరక పంపదలచుకోలేదు. ఒంగోలు రంగారాయుడు చెరువులో కోటి రూపాయల ఎంపీ నిధులతో ఏర్పాటు చేయదలచిన బోట్‌క్లబ్‌ పనుల్ని పార్టీ విధేయుడొకరికి అక్రమంగా కట్టబెట్టేందుకుగాను చీకటి పనుల్ని పాపి చేతుల మీదుగా పూర్తి చేయించుకున్నారు. దీనికిగాను పాపికి ఏక మొత్తంగా ఓ లకారందాకా ఇచ్చారు. మందు, బిర్యానీ సరేసరి. అర్ధరాత్రి వేళ కార్యాలయంలోనే తలుపులేసుకుని పాపి ఈ వ్వవహారాన్నంతా చక్కబెట్టాడు. బోటుక్లబ్బు టెండర్ల ప్రచురణ కోసం ఎప్పుడూ కనపడని ఓ స్థానిక పత్రికను ఎంచుకున్నారు. పత్రికను డీటీపీ చేయించి కంప్యూటరులోనే రెండు, మూడు ప్రతుల్ని తీయించారు. రెండో పత్రికగా ఒంగోలులో అంతగా కొనుగోలుదారులు లేనిదానిని ఎంచుకున్నారు. ప్రకటన ప్రచురితమయిన రోజున అక్కడికి వచ్చే 50 ప్రతుల్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇలా పనులన్నీ ఒకేరాత్రి పూర్తి చేశారు. కొత్త కమిషనరుతో సంతకం చేయించి ఊపిరిపీల్చుకున్నారు. ఈ వ్యవహారమంతా రెండో రోజున ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో పాఠకులకు చేరింది. అంతే గుత్తేదార్లు, ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. కొందరు గుత్తేదార్లు వార్త ప్రతుల్ని ఏసీబీ మొదలు ముఖ్యమంత్రిదాకా గుట్టుగా పంపారు.
పాలకులు పట్టించుకోలేదుగానీ, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర అధికారులు కన్నేశారు. వివరాలన్నింటినీ సేకరించారు. ఇద్దరు కమిషనర్లు, ఎంఈ, డిఈ, ఏఈ ఇలా ఐదుగురిపై ఒకేసారి వేటేస్తూ డిసెంబరు 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పౌరులంతా నూతన సంవత్సర వేడులు జరుపుకుంటున్న వేళ పాపి అండ్‌కోకు ఈ ఉత్తర్వులు చేరాయి. కాలం మార్పుతో (క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా) బతుకులు మారబోవన్న ఇంకిత జ్ఞానం ఉన్నవాడిగా నూతన సంవత్సర వేడుకలకు సాధారణంగా దూరంగా ఉండే నాకు ఆ రోజు వార్త సాధించిన స్పందనతో నిజమయిన పండుగ జరుపుకున్నాను. ఆనాటి నుంచీ నా బీటుకు సంబంధించిన అధికారులు, నాయకులు కంటారా ఏ రోజూ నిద్రపోలేదంటే నిజ్జంగా నిజం. మద్యం గురించి నాకు ఈనాటికీ ప్రాథమిక విషయాలు కూడా తెలియవుగానీ, తాము సాధారణంగా సేవించేదానికి రెట్టింపు తాగినా కిక్కురాక, నిద్రపట్టక అల్లాడిపోతున్నామని కొందరు నాతోకూడా అప్పుడప్పుడూ వాపోయేవారు. కాస్త చూసీచూడనట్లు పొమ్మని అభ్యర్థించేవారు. అయినా నా కలానికి ఎన్నడూ పదును పోగొట్టి చూసీచూడనట్లు పోలేదు. అదే నాకు సంతృప్తి. దాంతోనే నా జన్మ ధన్యమయిందని నమ్ముతాను. ‘పత్రికొక్కటున్న చాలు పదివేల సైన్యమ్ము’ అని అందుకేగదా పెద్దలన్నది.

సొసంత్ర దినాన మా ఊళ్లో ఉచిత వైద్యశిబిరం

ఇప్పటి బుడుగులు, సీగానపెసూనాంబలూ ఇండిపెండెంట్స్‌ డే అంటూ పలికే ఆంగ్ల పలుకుల్ని మేము చిన్నప్పుడు నాలుక తిరక్క సొసంత్ర దినమని అనేవాళ్లం. కేవలం చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకునేందుకే స్వాతంత్య్ర దినోత్సవాన్ని వికృతిగా రాశాను.
సరే అసలు విషయానికొస్తాను.  మా నాన్న కావూరి కోటేశ్వరరావు ప్రథమ వర్థంతి సందర్భంగా గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ మా గ్రామంలో (ఈదుమూడి, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా)  ఉచిత వైద్యశిబిరం తదితర కార్యక్రమాల్ని నిర్వహించాను. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15న ‘కాకోరాజ్ఞాసం’ (కావూరి కోటేశ్వరరావు జ్ఞాపకార్థ సంస్థ) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఈ శిబిరంలో కన్ను, దంత, మధుమేహం, సాధారణ వైద్య నిపుణులు పాల్గొంటారు. మధుమేహూలతోపాటు, వచ్చే అవకాశం ఉందని గుర్తించినవారికి కూడా రక్త పరీక్షలు చేయిస్తాము. బరువు, బీపీ, ఎత్తు కొలిచి కాకోరాజ్ఞాసం ప్రచురించిన చేతి పుస్తకంలో నమోదు చేసి వారికి అందజేస్తాము. అన్నట్లు ఈ పుస్తకంలో మధుమేహ సంబంధిత సమాచారాన్ని ప్రచురిస్తున్నాము. తమ ఆరోగ్య పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేందుకు వీలుగా పట్టికల్ని కూడా ఇస్తున్నాము. ఉచితంగా మందులు అందజేస్తాము. పిల్లలకు టూత్‌పేస్ట్‌, బ్రష్‌ ఇస్తాము. అవసరమయినవారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించేందుకు ఒంగోలులో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఫిబ్రవరిలో తొలుత గ్రామంలో ఆరోగ్య సర్వే నిర్వహించాము. గ్రామంలో 400 మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. కుటుంబ నేపథ్యం, ఊబకాయం తదితర అంశాల ఆధారంగా మరొక 300 మంది త్వరలో మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆహార అలవాట్లను మార్చుకుని, రోజూ అరగంటపాటు నడిస్తే మధుమేహం సమస్యను మూడేళ్ల నుంచి పదేళ్ల వరకూ వాయిదా వేసేందుకు అవకాశం ఉందని నిపుణలు వారికి సూచించారు. గ్రామంలో 600 మందికి రక్తపోటు ఉంది. ఇక 45 ఏళ్లు దాటిన వారందరూ ఏదో ఒక స్ధాయిలో కాళ్లనొప్పులబారిన పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రతినెలా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని ఆనాడు భావించాను. అయితే హైదరాబాదులో ఉంటున్నందున దూరాభారం రీత్యా నా కోరికను అమలు చేయలేకపోయాను. అందుకనే ముఖ్యమయిన సందర్భాలలోనయినా వైద్య సేవలు అందించేందుకు సమాయత్తమవుతున్నాను. పలువురు మిత్రుల సహకారంతో వేలాది రూపాయల విలువయిన సేవల్ని నా జన్మభూమికి అందజేస్తున్నాను. ఇది నా కనీస ధర్మంగా భావిస్తున్నాను. ఉపాధ్యాయుడిగా పేరుగడించిన మా నాన్నకు నేనిచ్చే నివాళి ఇది.

నిన్న సొమరిపోతు నేడు రామదూత బాబా

అవును. మొన్నటి సోమరిపోతు ఎంకటేసుల్లు నేడు రామదూతగా వెలుగొందుతున్నాడు. వీధులెంట అడుక్కుతిన్న ఎంకటేసుల్లు బాబాగా ఎదిగి 110 ఎకరాల సాగునీటి చెరువును ఆక్రమించాడు. మరోపక్కనున్న అటవీభూమిని కబ్జాచేసి కట్టడాలు నిర్మించాడు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్రమంత్రి బాలు, రాష్ట్ర డిజిపి గిరీష్‌కుమార్‌, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సునీల్‌శర్మ సహా ఎందరో రాజకీయ ప్రముఖులు, మరెందరో ఉన్నతాధికారులు ఇప్పుడు ఆయన శిష్యులు. వీళ్లంతా తరచూ రామదూత ఆశ్రమాన్ని సందర్శిస్తుండటం బహిరంగ రహస్యం. గిరీష్‌కుమార్‌ అయితే ఎంకటేసుల్లు ఉరఫ్‌ రామదూత ఉరఫ్‌ కబ్జాదారు కాళ్లమీద బహిరంగంగా బోర్లాపడటం వ్యక్తిగా ఆయనిష్టమేగానీ, ఓ ఉన్నతాధికారిగా చేయకూడని నేరం, ఘోరం.
శాస్త్రీయతపట్ల మక్కువగల పౌరుడిగా, పాత్రికేయుడిగా నేను ఈ ఎంకటేసులుపై 2002లోనే అందరికన్నా ముందు కలంతో పోరాటానికి తెరలేపాను. అన్నట్లు ఈ ఎంకటేసుల్లు ఆశ్రమం ప్రకాశం జిల్లా చాగల్లు గ్రామం చెంత ఓ వైపు కొల్‌కతా – చెన్నయ్‌ రైలు మార్గానికీ ఐదో నంబరు జాతీయ రహదారికి నడుమన విస్తరిస్తోంది. తిరుపతి, చెన్నయ్‌కు రైల్లోనో, బస్సులోనే వెళ్లే ప్రయాణికులు సింగరాయకొండ దాటిన తర్వాత కావలికి చేరబోతున్నామనగా ఈ ఆశ్రమాన్ని చూడవచ్చు. ఐదో నంబరు రహదారి వెంట 60 – 70 అడుగుల ఎత్తున దేవతా విగ్రహాలు ఉన్నదే రామదూత ఆశ్రమం.
అప్పుడప్పుడే ఆశ్రమం మొగ్గతొడుగుతున్న సమయంలో నేనూ, నా సహచర పాత్రికేయుడు ఎస్‌వీ బ్రహ్మంతో కలిసి రామదూతను 2002 ప్రథమార్ధంలోనే ఓ ఆటాడించాను. ఓ చక్కటి ఉదయాన రామదూతను ఆశ్రమంలో కలిసి పేరుసహా అన్నీ అబద్ధాలే చెప్పి నా సమస్యలకు పరిష్కారం కోరాను. ఎవ్వరి భవిష్యత్తునయినా తాను ముందే రంగరించి చెబుతానని చెప్పుకునే ఎంకటేసుల్లు ఒక్కటంటే ఒక్క అబద్ధాన్నీ పట్టుకోలేకపోవటంలో ఆశ్ఛర్యం ఏముంది. ఆశ్రమానికి పది వేలు సమర్పించుకుంటే చాలు డిఎస్‌సీలో నాకు ఉపాధ్యాయ ఉద్యోగం రాకుండా అడ్డగిస్తోన్న శని బలహీన పడుతుందని నాతో రామదూత బేరం పెట్టాడు. అంత ఇచ్చుకోలేని పేదవాడినని వేడుకోగా, కనీసం ఐదు వేలన్నా ఇచ్చి, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత ఎక్కువ ఇచ్చు కుంటే నా భవిష్యత్తు అంత బాగుంటుందని భరోసా ఇచ్చాడు. ఉపాధ్యాయ ఉద్యోగం రావటం మాట అంటుంచండి, నాకు డిఎస్సీ రాసేందుకు అవసరమయిన డీఎడ్‌గానీ, బీఎడ్‌గానీ లేదు. నిరుద్యోగిలాగా నటించి, డిఎస్సీలో ఉద్యోగం వస్తుందో? రాదో? రాకుంటే ఏమి చేయాలో? చెప్పమనగానే ఓ తమలపాకుపై పిచ్చిగీతలు గీసి పదివేలకు ఎర వేశాడు. నేను చెప్పిన అబద్ధాలన్నీ ఇక్కడ రాయాలంటే  చాట భారతమే అవుతుందని నమ్మండి. చెరువు భూమిని కాపాడుకోవటానికి రాజకీయనాయకుల్ని బుట్టలో వేసుకున్న ఎంకటేసుల్లు, అటవీ భూమి అక్రమణ కేసుల్నుంచి తప్పించుకోవటానికి ఆ శాఖాధికారి భార్యనే బుట్టలో వేసుకున్న ఘనుడు. ఆమె కూడా ఈ ఆశ్రమంలోనే శాంభవీమాతగా పూజలందుకుంటోంది. ఆమెగారి భర్తగారికి ప్రభుత్వం ఇచ్చిన వాహనం నిత్యం ఆశ్రమంలోనే కొలువుదీరి ఉంటుంది. అయ్యగారితో ముఖాముఖి పూర్తయిన తర్వాత రోజునుంచీ వరుసగా ఆరు రోజులపాటు ప్రజాశక్తి దినపత్రికలో ప్రత్యేక కథనాలు రాశాను. దీంతో ఎంకటేసుల్లు, ఆయన పరివారమూ భయపడిపోయి పెద్దల్ని రోజూ రాయబారం పంపేవాడు. అన్ని రకాలుగా సహకరిస్తానని మొదలు పెట్టి చివరకు బెదిరింపులకూ దిగాడు. అంతకు మునుపే అదే ప్రాంతంలో తిష్టవేసిన బండ్లమాంబతో పోరాటం చేసిన నేను రామదూత శాపనార్ధాలకు లొంగటం అసంభం కదా?. ఆసక్తిదాయకమయిన బండ్లమాంబపై పోరాటం మరోసారి చెబుతానూ! కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో కృష్ణస్వామిపై నేను చేసిన కలం యుద్ధంలో డాక్టర్‌ సమరం కూడా నేరుగా పాలుపంచుకోవటం ఎన్నడూ మరచిపోలేనిది.
సరే చివరిగా చెప్పొచ్చేదేమిటంటే…. మొక్కై వంగనిది మానయి వంగదని పెద్దలన్నట్లుగా ఈ బాబాలు, అమ్మలు పుట్టేందుకు మన సమాజంలో బోలెడు, బోలెడు అవకాశాలున్నాయి. ప్రశ్నకు తావులేని సమాజంలో ఎంకటేసుల్లు, బండ్లమాంబలూ పుట్టగొడుగుల్లా పుడతారంతే. కనీసం ఎవడయినా ప్రశ్నించినప్పుడయినా ఆరా తీసి మద్దతిస్తే, శిక్షిస్తే…. అప్పుడు చాగల్లు సాగునీటి చెరువులు కబ్జా కావు. అటవీ భూములు ఈ తీరున ఆక్రమణలకు గురికావు. అమ్మాయిల జీవితాలు బండ్లమాంబ ఆశ్రమంలో అర్ధాంతరంగా ముగిసిపోవు. కృష్ణస్వామి అక్రమ శృంగారానికి యువకులు బలయిపోరు. సర్వే జన సుఖినోభవంతు అంటూ దీవిస్తే సుఖాలు వళ్లో వాలవు. సర్వ జనులకూ ప్రశ్నించటం నేర్పితే ఈ సమాజం అభివృద్ధి పథం పడుతుంది. ఆసక్తి ఉన్న మిత్రులను చర్చకు ఆహ్వానిస్తున్నాను.

కొణిజేటి రోశయ్య – కన్పించేంత అమాయఁడు కాదండోయ్‌!

పదిహేన్నేళ్లకు పైగా పత్రికా రంగంలో పనిచేస్తోన్నందున ఆ రంగం విశేషాల్ని మీతో పంచుకోనివ్వండివాళ. మీడియాలో పాత్రికేయుల సమావేశాలకు ప్రాధాన్యత తెలియందికాదు. అందులోనూ రాజకీయ నాయకులు, వేదికలు ఏర్పాటు చేసే ప్రెస్‌మీట్ల తీరును కనుక పరిశీలిస్తే, ఆయా పార్టీల నడవడికను మనం అర్ధం చేసుకునే అవకాశముంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో ఒకనాటి అనుభవాన్ని ముందుగా ప్రస్తావించటం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను. అది 1998. అప్పటికే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎదుర్కోబోతోన్న తొలి ఎన్నికలు అవి. తెలుగుదేశానికే వాతావరణం అనుకూలంగా ఉందన్న భావన నెలకొని ఉంది. ఆ సమయంలో కాంగ్రెసు నాయకుడు కొణిజేటి రోశయ్య ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చారు. ప్రకటించిన ఆనాటి కార్యక్రమం మాత్రం ఒంగోలు బస్సుస్టాండు పక్కనే నిర్మించిన వైశ్యా భవన్‌ ప్రారంభం. కానీ అంతర్గతంగా ఎన్నికల సంబంధిత వ్యవహారం విధిగా ఉండే ఉంటుందని అప్పట్లో ఒంగోలు పట్టణంలో ఈనాడు విలేకరిగా పనిచేస్తున్న నేను ముందే ఊహించాను. కీడెంచి మేలెంచటం విలేకరులు అనుసరించాల్సిన విధానమని నా నమ్మకం. ఆ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి రోశయ్య పోటీబడుతున్నారు. అందులోనూ మా గురువు (కీర్తిశేషులు) బీసీ నారాయణరావు ఎప్పుడూ అంటారూ, ”పోటీచేసినా, చేయకపోయినా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రోశయ్య కొత్త కోటీశ్వరుడవుతాడయ్యా”. ఇదీ నా మనస్సులో ఉంది. ఈ నేపథ్యంలో నేను అప్రమత్తంగా ఉన్నాను. వైశ్యా భవన్‌ ప్రారంభ కార్యక్రమం, అనంతరం సభకూడా ముగిసింది. ఇంకేముంటుందని విలేకరులంతా పుస్తకమూ, పెన్నూ సర్దుకుని వెళ్లిపోయారు. వాళ్లకు కనపకుండా పక్కకు తప్పుకుని, బహిరంగంగా ఏర్పాటు చేసిన సభలోకి ప్రవేశించాను. గుంపు మధ్య ఆసీనుడయ్యాను. అక్కడున్నవాళ్లంతా మాట్లాడుకుంటుండటంతో వాతావరణం గందరగోళంగా ఉంది. కొద్ది నిమిషాల్లోనే ప్రారంభమయింది అసలు వ్యవహారం. జిల్లా నలుమూలల నుంచీ అరుదెంచిన వాణిజ్య ప్రముఖులు ఒక్కొక్కరుగా వేదికమీదున్న రోశయ్య వద్దకు చేరటం… తొలుత దండ వేయటం … చెవిలో గుసగుస … ఎవరికి తగిన విధంగా వాళ్లు మూట అందజేసి కిందకు దిగటం. దాన్నంతా ఆసక్తిగా గమనిస్తూ అవసరమయిన సమాచారాన్ని బుర్రలో ముద్రేసుకుంటున్నాను. రాసుకుంటుంటే బయట పడతాను కదా మరి!. అలా అలా గంటకు పైగా గడిచింది. ఆ సమయంలో నన్ను గమనించిన వాళ్లెవరో ఎవరికో ఉప్పందించినట్లుంది. అంతే ఒక్కసారిగా నా వైపు చేతులు చూపిస్తూ నలుగురయిదుగురు, ”ఒరేయ్‌, ఈనాడోడురా, పట్టుకోండి – పట్టుకోండి” అంటూ అరుపులు, కేకలతో నావైపు దూసుకు రావటం కన్పించింది. అంతే… నేనూ అప్రమత్తమయ్యాను. లేస్తూనే పరుగందుకున్నాను. సమీపంలోని రోడ్డును దాటి అవతలున్న రెండు నక్షత్రాల హోటల్లో దూరాను. నా వెంట పడ్డవాళ్లు స్ధానికులు కానందున రోడ్డు దాటి వచ్చేందుకు సాహసించలేదు కాబట్టి బతికిపోయాను. కాసేపు అక్కడే గడిపి చల్లగా ఆఫీసుకు చేరిపోయి వార్త రాసేశాను. ఆ వార్త పూర్తి పాఠం ప్రచురణకు నోచుకోకపోవటం వేరే విషయమనుకోండి. మరోసారి పాత్రికేయుల సమావేశంలో రోశయ్యను ప్రశ్నించటాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు బూతులతో నన్ను ఎదుర్కోవటం ఎన్నటికీ మరచిపోలేను. ఇదండీ సౌమ్యుడని అత్యధికులు భావించే మన ముఖ్యమంత్రి రోశయ్య(అనుయాయుల)తో నా (భయంకర) అనుభవం.

రేడియో పెట్టటం తప్ప ఆపటం తెలియక దుప్పట్లు కప్పిన తాత

మొన్నటి తరం తీరూతెన్నుల్ని నేటి తరానికి పరిచయం చేయాలన్న ఆశయంతో మా వేలువిడిచిన తాతగారి సంగతిని గుర్తుచేయనీయండి.! ల్యాప్‌ట్యాప్‌ను సైతం మూడు క్షణాల్లో విప్పేసి, ఆరు క్షణాల్లో బిగించే ఈనాటి సాంకేతిక నైపుణ్య తరానికీ స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి తరానికీ – నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ూంది.
మా నాన్న ద్వారా నేను విన్న ఈ సంఘటనకు స్వతంత్ర భారతదేశమంత వయస్సు ూండి ూంటుందని నా ఊహ. అన్నట్లు ఈ సంఘటనతో సంబంధంలేదుగానీ మా నాన్నను స్వతంత్రపార్టీ నాయకుడు ఆచార్య ఎన్‌జి. రంగా (అత్యధికులకు ఆయన కాంగ్రెసు నాయకుడిగానే తెలుసేమో?) ూపాధ్యాయ ఉద్యోగం వేయించారు. రాజకీయాలంటేనూ, సాహిత్యం అంటేనూ చెవికోసుకునే మానాన్న, రేడియో కార్యక్రమాల్ని ఇంట్లో ఉన్న అత్యధిక సమయం వెచ్చించి బీరుపోకుండా (ఈ పదానికి అర్ధం ఒక్కటీ వదలకుండా అని) వింటుండేవాడు. రేడియో అంటే అంతిష్టం ఉన్నందునేమో, ఆ రోజుల్లోనే రూ. 500 వెచ్చించి జపాను తయారీ శాన్యో రేడియోను కొనుగోలు చేశారు. మొన్నమొన్నటిదాకా కూడా ఉన్న ఆ రేడియోతో నాకు కూడా చెప్పుకోదగిన అనుబంధమే ఏర్పడింది. అసలు కథనంతో సంబంధం లేని మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించనీయండి…. దాదాపు అన్ని పాటల్నీ ఘంటసాల, పీ సుశీల పాడినట్లు చెప్పటం రేడియోలో వినీవిని వాళ్లిద్దరూ భార్యాభర్తలని అనుకునేవాడ్ని నేను. ఆ రేడియో శబ్ధం జగ్గయ్య కంఠంలా ఖణఖణలాడేది.
ఓ రోజు మానాన్న పాఠశాల జీతాల సొమ్ము తెచ్చేపనిలో ఒంగోలు వెళ్లాడు. మా ఊళ్లో పంచాయతీది కాక మా ఇంట్లో మాత్రమే ఆ రోజుల్లో రేడియో ఉండేదట. అందువలన సాయంత్రం అయ్యేసరికి ఊరి పెద్దలంతా రేడియో వినేందుని మా ఇంటికి వేంచేసేవారు. రేడియో కొన్న తర్వాత మొట్టమొదటిసారిగా మా నాన్న ఊళ్లో లేకపోవటంతో ఆ సాయంత్రం ఇంటికొచ్చిన పెద్దలు రేడియో పెట్టమంటూ మా ఇంట్లోనే ఒక భాగంలో  ఉండే మా చిన్న నాయనమ్మ భర్త కోటయ్యను కోరారు. మా నాన్న రేడియో పెడుతుండగా రోజూ చూసిన తాత సులభంగానే మోత మోగించాడు. ఆ రోజుల్లో గ్రామాల్లో ఏడు గంటలకల్లా భోజనాలు పూర్తిచేసి పడుకుంటుండేవారు. అందువలన ఆ సమయానికల్లా రేడియో శ్రోతలు ఇళ్లకు వెనుదిరిగి వెళ్లిపోయేవారు. ఆ ఆనవాయితీ ప్రకారమే శ్రోతలంతా వెళ్లిపోగానే రేడియోను ఆపేయాల్సి వచ్చింది. అదిగో, అప్పుడొచ్చిపడింది అసలయిన చిక్కు. తాత రేడియో ఆపటం చూడకపోవటంతో ఏమి చేయాలో తెలియక తికమకపడ్డాడు. చేతికందిన వాటినీ, వీటినీ తిప్పాడు. ఎంతకీ రేడియో  ఆగిపోలా. చివరకు ఆయనకు ఒక విచిత్రమయిన ఆలోచన తట్టింది. ఇంకేమంది దాన్ని అమలు చేశాడు. ఇంట్లో అదనంగా ఉన్న ఒక్కొక్క దుప్పటినీ రేడియోపై కప్పి చూశాడు. ఉన్న బట్టలన్నీ కప్పినా పాటలో, మాటలో విన్పిస్తూను ూన్నాయి. అప్పుడు గోనె సంచులన్నీ తీయించి వాటిపై కప్పించాడు. మొత్తం మీద రేడియో మీద కొండలా కప్పుపడిన తర్వాత దాని పలుకులు బయటకు వినపడఁండా పోవటంతో తాతతోపాటు ఇంట్లోవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. విద్యాశాఖ కార్యాలయంలో పని ూండటంతో ఆ రోజంతా ఒంగోలులోనే ఉండి మరుసటి రోజు బడి సమయానికి ఇంటికి తిరిగొచ్చిన మా నాన్న రేడియో స్థానంలో గోనె సంచుల కుప్ప కనపడి అదేమని అడగటంతో అసలు విషయం బయట పడింది. ఎంతో ఇష్టంతో, శక్తికి మించి వ్యయం చేసి కొన్న రేడియోకు తాత పట్టించిన గతిని చూసిన ఆయనకు కోపం తారాస్థాయికి చేరింది. తనదైన పద్ధతిలో తాతపై కోపం వ్యక్తం చేశాడు మా నాన్న. ఆనాటి నుంచీ తాత రాచపుండు వ్యాధితో చనిపోయేదాక కూడా ఆయనతో మాట్లాడలేదంటే మా నాన్న ఏస్థాయిలో రేడియోను ప్రేమించాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజులు అలాంటివి మరి. పాత తరం పంతాలూ, పట్టింపులూ అలా ఉండేవి. సంప్రదాయాల్నీ, నమ్మకాల్ని కూడా అదేతీరున అమలు చేసేవాళ్లు. అవి మంచివయినా, చెడువయినా!

బాలారిష్టాలు తీరాయి … ఇక బ్లాగు బాగు చూడాలి

జూన్‌ 2010న ప్రారంభించిన నా తెలుగిల్లు. వర్డ్‌ప్రెస్‌. కాం బ్లాగుకు ఇప్పటికి బాలారిష్టాలు తీరినట్లనిపిస్తోంది. బ్లాగు ప్రారంభం తప్ప మరే విషయమూ తెలియని నేను కుంచెం కుంచెం నేర్చుకుంటూ ఇప్పుడు నా మానసిక విన్యాసాలకు ఎప్పటికప్పుడు అక్షరరూపమిచ్చి పోస్ట్‌ చేయగలుగుతున్నాను. రోజూ ఒకరిద్దరయినా నా విన్యాసాలు చూసి స్పందించటం నన్ను ఉత్సాహపరుత్సోంది. ముఖ్యంగా మిత్రుడు జయదేవ్‌ గారు రోజూ తన భావాలను పంచుకోవటాన్ని స్వాగతిస్తూ, వినమ్రంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా (ఈదుమూడి) ఊరి ఫొటోను బ్లాగులో పెట్టగానే స్పందించి, బాగుందని అభినందిస్తూ, దానిని తెవికీలో పెట్టేందుకు రవిచంద్ర ఎనగంటిగారు అనుమతి కోరినా, జవాబిచ్చే దారి తెలియక బాధగానే మౌనం వహించాను. రవిచంద్రగారూ – మా గ్రామ చిత్రపటం, చాన్నాళ్లుగా తెవికీలో ఉంది. మీరు స్పందించినందుకు మాగ్రామస్తులందరి ధన్యవాదాలు అందుకోండి. మీకు సమాధానం చెప్పలేకపోవటాన్ని అర్ధం చేసుకుని నన్ను మన్నిస్తారుకదూ? ఇక మీదట వెంటనే స్పందిస్తానని మిత్రులందరికీ మాటిస్తున్నాను. తర్వాత ప్రస్తావించవలసిన వారు కొత్తపాళి. బలిపీఠం కథకు సంబంధించిన పోస్ట్‌కు ఆయన స్పందించి రవిగాంచనిచో కవిగాంచునంటూ దీవించినందుకూ, నా పోస్ట్‌లో నెలకొన్న సాంకేతిక లోపాలను ఎత్తిచూపినందుకూ ధన్యవాదాలు. నా బ్లాగు చక్కగా ఉందని అభినందించిన కేవీఎస్‌వీగారికి ధన్యవాదాలు. కొడిహళ్లి మురళీమోహన్‌గారు ఈ-మెయిల్‌ చేయమని కోరారు. ఆయన ఏమి కోరారో, ఎలా చేయాలో నాకు ఇప్పటికీ తెలియనందుకు క్షమించగలరు. మా మిత్రబృందం పెట్టబోయే రాజకీయ తెలుగు వార పత్రికకు పేరు సూచించమని కోరగా, స్పందించిన మిత్రులను ఎన్నడూ మరవబోము. అందులోనూ సీనియర్‌ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావుగారు స్పందించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు. వారి సూచించిన పేరును ఉపయోగించు కుంటామో లేదోగానీ, రష్యాలో జర్నలిస్టుగా పనిచేసిన భండారుగారిని ఆయన అనుమతిస్తే మా పత్రిక కాలమిస్టుగా ఆహ్వానించాలని అనుకుంటున్నాము. కూడలికి దయకలిగేనా అని ప్రార్థించగానే రంజనిగారు ప్రత్యక్షమవటం సంతోషదాయకం. సరే ఈ చరిత్రను అవతలబెట్టి భవిష్యత్తును పరకాయించి చూస్తే ఇంకా పరిష్కారం కావలసిన సాంకేతిక సమస్యలు కొన్ని ఉన్నాయి. ఎవరయినా చేయూత ఇస్తే సంతోషిస్తాను.
1. నా బ్లాగుకు సొంత మాస్ట్‌హెడ్‌ (టెంప్లీట్‌ అనుకుంటాను) చేర్చాలి. ఎలా?
2. పోస్ట్‌ పాంట్‌ రూపం చిన్నదిగా ఉంది. దాన్ని రెట్టింపు చేయాలంటే దారేమిటి?
3. ఉప శీర్సికలవారీగా పేజీలు ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఆయా శీర్షికల్ని ఆ పేజీల్లోనే పోస్ట్‌ చేయలేకపోతున్నాను. ఈ సమస్యను అధిగమించవచ్చా?
4. పోస్ట్‌ వర్గాల్ని ఎలా ఏర్పాటు చేయాలి?
5. వ్యాఖ్యలు నేరుగా పోస్ట్‌ కింద పడేందుకు ఏమి చేయాలి. (ఇప్పుడు నా అనుమతి కోసం వేచి చూస్తున్నాయి మరి. దానికి కొంత ధైర్యం కావాలని తెలుసు.)
ఈ సమస్యల్ని గనుక అధిగమిస్తే అంతోఇంతో బాగా రాయగలడన్న పేరున్న జర్నలిస్టుగా నేను తెలుగు బ్లాగర్ల లోకానికి శక్తివంతంగా సేవలు అందించగలనని నమ్ముతున్నాను. మిత్రులు ప్రత్యేకించి ఈ- తెలుగు మిత్రులు చేయూత అందిస్తారని ఆశిస్తున్నాను. చేయూత అంటే దూరంగా ఉండి చెప్పటం కాదు. చేయి పట్టి (చక్రవర్తిగారూ, అంత మంతమతిని మరి) బ్లాగాడించాలని వినమ్రంగా కోరుతున్నాను.
మీ స్పందనల కోసం నిజ్జంగా ఎదెరెదురు చూస్తానూ…. మీ వెంకట సుబ్బారావు కావూరి.

ఏమి సేతురా లింగా, ఏమీ సేతు ! పొరబాటు, గ్రహపాటు దశలు దాటెరా లింగా !! అవినీతి అలవాటయ్యెరా లింగా !!

!
వైఎస్‌ జగన్‌ : ఏవోయ్‌, పెద్ద కాంట్రాక్టరూ, మా నాన్న విగ్రహం పనుల్లోనూ నొక్కుడేనా?
పె.కాం : నేను మొదటిసారిగా కట్టిన మనూరు వంతెన మూడోనాటికల్లా కూలిపోయింది చిన్నయ్యా. అప్పుడు మీ తాత నన్ను పిలిచి అడిగాడు. ఏమి చేసేదయ్యా? పొరబాటు జరిగిందని చెప్పాను.
వైఎస్‌ జగన్‌ : తర్వాత?
పె.కాం : రెండో పని స్కూలు బిల్డింగు కట్టాను చిన్నయ్యా. అది వారంరోజులుండీ మరీ కూలిపోయింది. ఆనాడు మీ నాన్న రాజశేఖరరెడ్డి పిలిచి అడిగితే గ్రహపాటని చెప్పి తప్పుకున్నా.
వైఎస్‌ జగన్‌ : ఈ విగ్రహం సంగతేంటి?
పె. కాం : సంగతేముందయ్యా! అక్రమాలు చేసిచేసి అలవాటయ్యిందయ్యా, చిన్నయ్యా!
వైఎస్‌ జగన్‌ : అంతేనంటావా?
పె. కాం : ఏమి సేతురా లింగా, ఏమీ సేతు !
పొరబాటు, గ్రహపాటు దశలు దాటెరా లింగా !!
అవినీతి అలవాటయ్యెరా లింగా !!!
(కడప పట్టణం తిరుపతి రోడ్డులో జులై ఎనిమిదో తేదీన ప్రారంభించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం 15 రోజులకే కుప్పకూలిపోయిన సందర్భంగా ఈ వ్యంగ్యం)

నిన్నటి తరం అమ్మ కదా, మరి!

”వానా వానా వల్లప్ప, వానా తమ్ముడు సోమప్ప” వర్షంలో తడుస్తూ పాడుకునేవాళ్లం నా చిన్నప్పుడు. చేతులు చాపి గుండ్రంగా తిరుగేవాళ్లం మా పల్లెటూరు ఈదుమూడిలో. వర్షానికి అలుపొచ్చేదేమోగానీ, మాకు అలుపే వచ్చేది కాదు. అన్నట్లు మా పెద్దవాళ్లు కూడా ఇప్పటిలా జలుబు చేస్తుందనో, జ్వరం వస్తుందనో మమ్మల్ని భయపెట్టి లోపలికి లాక్కెళ్లేవాళ్లు కాదు. తీరికగా  ఉంటే మమ్మల్ని చూస్తూ వాళ్లూ ఆనందపడేవాళ్లు. కాకపోతే చిన్నంగా తిరగండ్రా పడిపోతారనో, దూరదూరంగా తిరగండి ఒకరికొకరు తగిలి పడిపోతారనో జాగ్రత్తలు చెప్పేవాళ్లు. అలా ఎంతసేపు తడిచినా జ్వరం కాదుగదా, కనీసం చివ్వున చీదేవాళ్లం కాదు. హాచ్‌…హాచ్‌లూ విన్పించేవే కాదు. అదంతా ఆనాటి తిండి మహిమ అని నా నమ్మకం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, శనివారం మధ్యాహ్నం హైదరాబాదులో వాన కురుస్తుండగా స్కూలు బస్సు దిగి ఇంటికొస్తూ తడుస్తోన్న ఓ బుడుగునీ, వాడి చెల్లలు కాబోలు సీగాన పెసూనాంబనూ వాళ్ల మమ్‌ రాస్కెల్స్‌, ఫూల్స్‌ అంటూ ఇంగ్లీషులో నానా గడ్డీ పెడుతోంది. ”కోల్డ్‌ ఎటాక్‌ అయితే టుమారో స్కూలుకు డుమ్మకొట్టాలనే?. అంటూ గాబరాపడిపోతోంది. ఫ్యూవర్‌ వస్తే రాత్రింబవళ్లూ కాచుకూచోవటం కష్టమంటోంది. పైగా వాళ్ల డాడ్‌తో తిట్లు తినాల్సి వస్తుందని భయంభయంగా చెబుతోంది వాళ్లతో. అయితే బుడుగుకీ, పెసూనాంబకూ వాళ్ల మమ్‌ తిట్లమీ తలకెక్కలేదనిపించింది నాకు. చెరోపక్క గొడుగు కింద నడుస్తూనే చేతులు చాపి వాన ధారను ఒడిసిపట్టి ఆనందపడటం కన్పించింది. అప్పుడు గుర్తుకొచ్చింది నా చిన్ననాటి జీవనం. వర్షం పడుతుండగా, బడికి పోతూ వర్షంలో ఎన్నెన్ని తమాషాలు చేసేవాళ్లమో! అకస్మాత్తుగా ఎగిరి దూకి తోటివారిమీద బురుదనీళ్లు పడేలా చేసేవాళ్లం. కాగితాలతో చేసి ఆడే పడవలాట సరేసరి. పడవల కోసం నోట్‌పుస్తకంలో సగం మాయమయ్యేది. మామూలు పడవ, కత్తి పడవ అలా రెండు రకాలు చేసేవాళ్లం. కాగితాన్ని మడిచి పడవను చేయలేని వాళ్లు నాలాంటి చేతనయినవాళ్లకు రెండు కాగితాలు ఇస్తే వాటితో పడవలు చేసి చెరొకటి తీసుకుని ఆడుకునేవాళ్లం. పడవల్లో చిన్నచిన్న పువ్వుల్నీ, పుల్లల్నీ, బఠానీల్నీ పెట్టి మద్రాసుకు రవాణా చేస్తున్నామంటూ చెప్పుకుని తెగ సంబరపడిపోయేవాళ్లం. అలా అంతులేకుండా సాగిపోయేవి మా ఆటలు. అలా ఆటల్లో పడి ఓరోజు మధ్యాహ్నం బడికి వెళ్లాల్నిన సమయానికి ఇంటికి చేరకపోవటంతో కంగారు పడిన మా అమ్మ నన్ను వెదుక్కుంటూ వస్తుండగా నా స్నేహితుల్లో ఒకడు చూసి ”ఒరేయ్‌, మిమ్మరా” అంటూ కేకేశాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి నా బట్టల్ని చూసుకుంటే భయమేసింది. నా తెల్ల చొక్కాకు అక్కడక్కడా బురద పులుముకుంది. వెంటనే చొక్కా విప్పి అమ్మ అక్కడికి వచ్చేలోగా తిరగేసి వేసుకుని ఎదురెళ్లాను. ” అబ్బాయ్‌, బడికి టైమవుతుంటే ఇంకా ఆడితే ఎట్లా?” అంటూ మొహం మీదున్న మట్టిని తుడిచింది అమ్మ. చొక్కొ తిరగేసి ఉండటాన్ని అప్పుడు చూసింది. నెమ్మదిగా గుండీలు విప్పి, ”అయ్యో బురదయ్యిందే” అంటూ నా చేతి రెక్క పట్టుకుని ఇంటికి తీసుకుపోయింది. గబగబా నీళ్లు పోసంది. ఉతికిన చొక్కా వేసింది. జేబులో కాసింత కారప్పూస పోసింది. తింటూ బడికెళ్లమని బయటదాకా సాగనంపింది. నిన్నటి తరం అమ్మ కదా మరి.

ఖూనీ (కథ) వెంకట సుబ్బారావు కావూరి

అర్ధరాత్రి దాటి అప్పటికి పావుగంట గడిచింది. డిసెంబరు మాసపు చలిగాలి వణుకు పుట్టిస్తోంది.
హైదరాబాదు శివారులోని చైతన్యపురిలో వీధి దీపాల వెలుగుల్ని మంచు తెరలు అడ్డగిస్తున్నాయి. ఎక్కడన్నా ఒకటీ అరా ఇళ్లలో తప్ప అలికిడి సద్దుమణిగింది. గూర్ఖా లాఠీ టకటకలు ూండుండి ప్రతిధ్వనిస్తున్నాయి. లాఠీ చప్పుళ్లకు కుక్కలు బౌభౌమంటూ ప్రతిస్పందిస్తున్నాయి. ”నీ తోలు వలుస్తాం” అన్నట్లుగా ఎగిరెగిరి దూకుతున్నాయి.
దేవాలయం వీధి మొగదల్లో ూన్న మానస బహూళ అంతస్తుల భవనంలోని శరత్‌బాబు నివాసంలో ఇంకా దీపాలు వెలుగుతున్నాయి. ూయ్యాల మంచంమీద మీద అడ్డదిడ్డంగా పడుకుని చదువుకుంటున్నాడు శరత్‌బాబు. రచయిత కర్లపాలెం హనుమంతరావు ‘తెలుగు తక్కువతనం’ శీర్షికతో ఆనాటి దినపత్రికలో రాసిన వ్యాసాన్ని దీక్షగా చదువుతున్నాడు. ”రాళ్లులేని బియ్యమైనా చౌకధరల దుకాణాల్లో దొరకటం తేలికేమోగానీ దొరల భాష దొర్లని తెలుగు పలుకులు వినటం దుర్లభంగా ఉంది”. మొదటి వాక్యం చదవటంతోనే ”ఈ కర్లపాలెం ఎవరోగానీ ఇన్నాళ్లుగా నేను పడుతోన్న వేదనను అర్ధం చేసుకున్నాడల్లే ఉంది” అనుకున్నాడు మనస్సులో. ”తెలుగు పంతుళ్లకు సైతం తెలుగులో సంతకం చేయటం నామోషీ” ”అబ్బబ్బ ఎంత బాగా చెప్పాడో” అనందం పట్టలేక పైకే అనేశాడు. రచయితకు జేజేలు పలికాడు. వ్యాసం చదవటం పూర్తయేసరికి శరత్‌బాబును మాతృభాషాభిమానం పూర్తిగా ఆవరించింది. ఏదో తెలియని ఆవేశం అతడిని ూక్కిరిబిక్కిరి చేసింది. మాతృభాష మృతభాషయితే తెలుగు జాతి బానిస బంధాల్లోకి చేరినట్లే. సొంత భాషను కోల్పోయిన జాతి తన సంస్కృతినీ, సంప్రదాయాలనూ చేజార్చుకోకతప్పదని శరత్‌బాబు దృఢాభిప్రాయం. చివరకు వ్యక్తికీ, సంఘానికీ ముఖ్యమయిన ఆలోచనలు సైతం పరాయీకరణ పొందుతాయని అతని భయం. పగలంతా కంప్యూటరుతో కుస్తీపట్టిన మనసు విశ్రాంతి కోరుకుంటున్నట్లుగా ఆవలింతలు మొదలయ్యాయి. ఆలోచనలు గింగరాలు తిరుగుతూ నిద్రను చెడగొడుతున్నాయి.”ఏదో ఒకటి చేయాలి” అనుకుంటూ కళ్లు మూసుకున్నాడు. గోడమీదున్న గడియారం కేసి చూస్తూనే లేచాడు శరత్‌బాబు. గబగబా బట్టలు మార్చుకుని కిందకు దిగాడు. తన వాహనం చెంతకు చేరుతూనే ద్వారం తాళం తీయమంటూ భవనం కాపలాదారు అదవానీని కేకేశాడు. అదవానీ తన గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
”నమస్తే, శరత్‌ భాయ్‌” గుత్తిలో తాళం వెదుక్కుంటూ చెప్పాడు అదవానీ. అదవానీది రాజస్తాన్‌. తండ్రి హయాంలోనే ఆయన కుటుంబం పని వెదుక్కుంటూ హైదరాబాదుకు చేరుకుంది. అదవానీ ఇక్కడే పుట్టాడు. ఇక్కడే పెరిగాడు. ఇంట్లో హిందీ ూపయోగించినా బయటి స్నేహాల కారణంగా తెలుగు మాట్లాడటం బాగానే అలవాటయింది.
”పగలూ, రాత్రి పనిచేస్తే ఆరోగ్యం పాడవుద్ది. జర జాగ్రత్తగా ఉండుండ్రి భాయ్‌” బిడ్డకు తండ్రి చెప్పినట్లుగా హెచ్చరించాడు అదవానీ తలుపుల్ని బార్లా తెరుస్తూ.
వాహనం బయలుదేరగానే వినయంగా వంగి మళ్లీ నమస్కరించాడు. అలా ఏ సమయానబడితే ఆ సమయాన శరత్‌బాబు వెళ్తుండటం అదవానీకి అనుభవమే. రెండేళ్ల క్రితం ఎంటెక్‌ పూర్తిచేసుకున్న వెంటనే లయ కంప్యూటర్స్‌లో ఆరెంకల జీతంతో ఉద్యోగంలో చేరాడు శరత్‌బాబు. తాను బాగా ఇష్టపడే గ్రామీణ వాతావరణం పూర్తిగా లేకపోయినా, నగరం వెలుపల ప్రశాంతత పుష్కలంగా ఉన్న చైతన్యపురిలో ఇల్లు కొనుక్కుని ఉంటున్నాడు. ఇల్లు కట్టిచూడు, పెళ్లిచేసి చూడని పెద్దలు ఏనాటి నుంచీ భయపెడుతున్నారోగానీ శరత్‌బాబు ఇల్లు చూసుకున్నాడు. అయితే పెళ్లి చేయాలన్న అతని తల్లిదండ్రుల కోరిక రెండేళ్లగా నెరవేరటం లేదు. ూద్యోగంలో చేరిన తొలి ఏడాది కొన్ని సంబంధాలు వచ్చినా శరత్‌బాబుకు నచ్చక అవేవీ మూడు ముళ్లు – ఏడడుగులదాకా రాలేదు. ఆ తర్వాత రాజీపడ్డా పిల్ల దొరకటం లేదు. పైసా కట్నం వద్దన్నా సంబంధాలు కుదరటం లేదు. బ్రహ్మచారి ముదిరి పాకాన పడుతుంటే తల్లిదండ్రుల్లో దిగులు అంతకంతకూ పెరుగుతోంది. ఆనాటి బాధలరీత్యా మనసా, వాచా, కర్మణా అమ్మాయిలు పుట్టకూడదనుకున్న నిన్నటితరం దంపతుల ఆలోచనలు, చేష్టలు ఈనాడు శరత్‌బాబులాంటి బ్రహ్మచారులపాలిట శాపమయికూర్చుంది. పిండికొద్దీ రొట్టె అన్నట్లుగా కర్మ కొద్దీ ఖర్మ మరి. బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ 12వ వీధిలోకి శరత్‌బాబు వాహనం మలుపు తిరిగింది. తనకు కావాల్సిన చిరునామా వెదుక్కునే పనిలో వాహన వేగం తగ్గించాడు. అతని మదిలో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. ‘ఎపుడోకపుడు…ఎవరో ఒకరు వేయరా ముందుగా అడుగు అటో ఇటో ఎటోవైపు” అతనికిష్టమయిన అంకురం సినిమా పాట వింటూ దోవ వెదుక్కుంటూ వాహనాన్ని నడుపుతున్నాడు. ”ఉరిశిక్ష పడినా సరే, అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయాల్సిందే. త్రాష్టులకు గుణపాఠం నేర్పాల్సిందే.” ఎడమచేతి వేళ్లను గుప్పిటపట్టి ధృడంగా అనుకున్నాడు మనస్సులోనే. వాహనం జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషను దాటింది. అక్కడ మరో వీధిలోకి వాహనాన్ని మలుపు తిప్పుతూనే అతని కళ్లు దేనికోసమో వెదికాయి. ఆ వీధి రెండు వైపులా చీలిపోయే దగ్గర ఎదురుగా ఉన్న భవనంపై శరత్‌బాబు దృష్టి పడింది. ‘రేడియో కారం కారం ఎఫ్‌ఎం స్టేషన్‌’ దగ్గరయేకొద్దీ ఆ భవనం రెండో అంతస్తు గోడకు వేలాడదీసి ఉన్న బోర్డు అక్షరాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. శరత్‌బాబు మనస్సు ఆ అక్షరాలను చదవగా, పటపటమని పళ్లు శబ్దించాయి. రక్తమంతా పోగుబడిందా అన్నట్లుగా ముఖం ఎర్రబారింది. ఆ భవనానికి కొంచెం దూరంగా వాహనాన్ని నిలిపేసి దిగాడు. చేతులు కొద్దిగా వణకటం ప్రారంభమయింది. అయినా మనస్సు మాత్రం ఛలించలేదు. రెండు పిడికిళ్లూ బిగించాడు. కళ్లు మూసుకుని నిలబడ్డాడు. ‘రిలాక్స్‌ … రిలాక్స్‌ … రిలాక్స్‌’ సైక్రియాటిస్ట్‌ పట్టాభిరాం దగ్గర నేర్చుకున్న స్వీయ హిప్నటిజంతో ఒత్తిడి నుంచి క్షణాల్లోనే బయటపడ్డాడు. అక్కడ నుంచి ముందుకు కదిలాడు. కుర్చీలోనే కునికిపాట్లు పడుతోన్న కాపలాదారు శరత్‌బాబు రాకను చూడలేదు. దీంతో కారంకారం ఎఫ్‌ఎంస్టేషను లోపలికి పోవటం సులభమయింది. వరుసగా ఉన్న గదుల ద్వారాల పక్కన రాసిన పేర్లు చదువుకుంటూ ముందుకెళ్తుండగా, అతనికి కావలసిన గది దొరికింది. ‘రెస్ట్‌ రూం’ మరొక్కసారి చదివాడు. అతను వెదికేది ఆ గది కోసమే. పని ముగిసినా రాత్రివేళ ఇళ్లకు వెళ్లలేని జాకీలు, ఉదయాన్నే పనిలోకి దిగాల్సిన వారూ అందులో విశ్రాంతి తీసుకుంటారని శరత్‌బాబు ముందే తెలుసుకున్నాడు. నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలకు అడుగుపెట్టాడు. ఉదయాన్నే పనిలోకి దిగాల్సిన జాకీ కిసీజా నిద్ర రాకపోవటంతో ఏదో పుస్తకం చదువుకుంటోంది. తలుపు తీసిన చప్పుడికి తలెత్తి చూసిందామె. ”ఎవరు కావాలి” ప్రశ్నించింది. ”ఎవరో ఒకరు, నువ్వు దొరికావుగా చాలు” కరుకుగా సమాధానమిచ్చాడు శరత్‌బాబు. శరత్‌బాబు సమాధానంతోపాటు ముఖంలోనూ తేడా గమనించిన కిసీజాకు ఒకింత భయమేసింది. కుర్చీలో నుంచి తటాల్న లేచింది. అతని తీరుచూసి ఆమె అణువణువూ వణకటం ప్రారంభమయింది. అయినా ధైర్యం తెచ్చుకుని ”హA ఆర్‌ యూ,…హA ఆర్‌ యూ” గద్గద స్వరంతో ప్రశ్నించింది. అయినా శరత్‌బాబు మారుమాటాడకుండా మీదకు వస్తుండటంతో కిసీజా లేస్తూనే కుర్చీని పక్కకు నెట్టేసింది. అంతేవేగంగా వెనక్కు జరిగి గోడకు అతుక్కుపోయింది. అదే సమయంలో తన చొక్కా పైకెత్తి జీన్సు పంట్లాములో దోపి ఉన్న పిస్తోలును బయటకు తీశాడు. ఆమెకు గురిపెట్టాడు. కిసీజాకు ఏమి జరుగుతుందో అర్ధమే కావటం లేదు. అరుద్దామంటే నోరు పెగలటం లేదు. నోరు క్షణంలో పిడచకట్టుకు
పోయింది. కనీసం తనజోలికి రావద్దని బతిమలాడుదామన్నా పెదాలు విప్పారటం లేదు. పారిపోయేందుకు
ముందుకు గెంతబోతుండగానే, శబ్దనివారిణి ూన్న పిస్తోలు పేలటం ప్రారంభమయింది. వెంటవెంటనే బులెట్లు ఆమె శరీరంలోకి దూసుకుపోయి మాటాపలుకు లేకుండా కిందకు వాలిపోయింది. ఆమె శరీరం నుంచి స్రవిస్తోన రక్తం తెల్లటి గ్రానైటు రాయిని ఎర్రబరుస్తోంది. శరత్‌బాబు ముఖం విప్పారింది. మనసారా నవ్వుకున్నాడు. ముందే రాసి తెచ్చిన ఓ లేఖను జేబునుంచి తీసి నిర్లక్ష్యంగా మేజాబల్ల మీదకు విసిరాడు. అది గాలికి ఎగిరిపోకుండా బరువు పెట్టాడు. ఇక తనపని అయిపోయిందన్నట్లుగా వెనుదిరిగాడు. ఇంత జరిగినా కాపాలాదారు మేల్కోకపోవటంతో లోపలకు వెళ్లినంత సులభంగానే బయటకు వచ్చాడు శరత్‌బాబు. రోజూ పదమూడు పద్నాలుగు గంటలు పనిచేసే కాపాలాదార్లు ఏ మాత్రం అవకాశం చిక్కినా కునకటం కద్దు. అదే అవకాశంగా హత్యచేసి కూడా శరత్‌బాబు పట్టుబడకుండానే బయటపడ్డాడు. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా వాహనాన్ని ముందుకు దూకించాడు. అక్కడే వెనక్కు తిప్పుకుని జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషను వైపు పోనిచ్చాడు.
”సార్‌” బల్లపై కాళ్లుపెట్టి నిద్రపోతోన్న ఎస్‌ఐని పిలిచాడు శరత్‌బాబు. అలికిడి విని కునికిపాట్లు పడుతోన్న కానిస్టేబులు మేలుకుని హడావుడి పడ్డాడు. శరత్‌బాబు చెంతకు వస్తూనే ”ఎవరు నువ్వు? ఏం కావాలి?” ప్రశ్నలు సంధించాడు గబగబా.
”ఎస్‌ఐ గారిని లేపండి, చెబుతాను” సున్నితంగా చెప్పాడు శరత్‌బాబు.
”అవసరమయితే లేపుతాగానీ, నీ పనేందో ముందు నాకు చెప్పవయ్యా.” విసుక్కున్నాడు కానిస్టేబులు.
”నేను ఖూనీ చేశాను” శరత్‌బాబు నెమ్మదిగా చెబుతూ జేబులో నుంచి పిస్తోలును తీసి టేబుల్‌మీద పెట్టాడు.
కానిస్టేబులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అంతలోనే తేరుకుని…. ”ఏంటీ? ఖూనీ చేశావా? ఎవర్ని? ఎక్కడ? వెంటవెంటనే ప్రశ్నించాడు. ”ఎస్‌ఐని లేపు, ఆయనతోనే చెబుతాను” శరత్‌బాబు కరుకుగా సమాధానం చెప్పటంతో చేసేదిలేక ఆయనను నెమ్మదిగా తట్టిలేపాడు కానిస్టేబులు. ఎస్‌ఐకు ఎంతకూ ఆవలింతలు ఆగలేదు. అది గమనించిన కానిస్టేబుల్‌ బిస్లరీ మినరల్‌ వాటరు బాటిల్‌ తెచ్చి ఎస్‌ఐకి అందించాడు. ఎస్‌ఐ దాహం తీర్చుకుని, మొహం కడుక్కున్నాడు. ఏమిటన్నట్లుగా శరత్‌బాబు ముఖంలోకి చూశాడు. ”కారం కారం ఎఫ్‌ఎం రేడియో జాకీని చంపేశాను సార్‌…..శరత్‌బాబు చెప్పటం ప్రారంభించాడు.
అది ప్రత్యేక న్యాయస్థానం. కారం-కారం ఎఫ్‌ఎం రేడియో జాకీ కిసీజా హత్య సంఘటన నేపధ్యం ప్రత్యేకమయినదని భావించిన హైకోర్టు ప్రత్యేక విచారణకు ఆదేశించింది. వారం క్రితమే విచారణ పూర్తయింది. కిసీజాను తాను హత్య చేసినట్లు అంగీకరించి, వాదనకు దిగాలని శరత్‌బాబు ముందే నిర్ణయించుకున్నందున న్యాయస్థానం పని సులువయింది. న్యాయవాదిని పెట్టుకోకుండా న్యాయస్థానానికి చెప్పాల్సిందేదో తనే సూటిగా చెప్పాడు. కిసీజా మరణానికి కారణమయిన బులెట్లు కూడా అతని పిస్తోలువేనన్న నివేదిక అంతకు ముందే న్యాయమూర్తికి చేరింది. సాయంత్రం నాలుగు గంటలవుతుండగా ప్రత్యేక న్యాయస్థానం సమావేశం ప్రారంభమయింది. రెండు మూడు వందల పేజీలున్నట్లుగా కన్పిస్తోన్న ఓ లావుపాటి పుస్తకాన్ని తీసి న్యాయమూర్తి చదవటం ప్రారంభించారు. ” ……. నిందితుడు శరత్‌బాబు ఆరోపించినట్లుగా తెలుగు భాషను ఎఫ్‌ఎం రేడియో జాకీలు ఖూనీ చేస్తున్న మాట వాస్తవమేనని ఈన్యాయస్థానంతోపాటు ప్రత్యేకంగా నేను కూడా అంగీకరిస్తున్నాను. వాళ్లు తెలుగు భాషను నిలెవెత్తున హత్య చేస్తున్న మాట కూడా నిజమే. మాతృభాషలో చదివే విద్యార్థుల సంఖ్య 30 శాతం లోపుకు పడిపోయినందున తెలుగు త్వరలోనే మృత భాష జాబితాలో చేరనుందని ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించిన మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకోక తప్పదు……. తెలుగు భాషలో ప్రసారాలు చేస్తామని అనుమతులు తీసుకున్న ఎఫ్‌ఎం రేడియో సంస్థల యాజమాన్యాలే దీనిలో అసలయిన నేరస్తులు. ఏ భాషో తెలిసే వీలేలేకుండా మాట్లాడే వాళ్లనే జాకీలుగా నియమించటమే వాళ్ల తొలి నేరం. ఒకటి రెండు తెలుగు పదాలకు సొంత యాసతో పలికే ఆంగ్లం, మరికొంత ఉరుదు, ఇంకొంత హిందీ, కొందరయితే ఇంకేవేవో మరికొన్ని భాషలనూ కలగలిపి మాట్లాడే జాకీల తీరు మాతృభాషాభిమానులకు నిజంగానే పిచ్చెక్కిస్తుందంటే మరో వాదానికి తావులేదనే నేనే భావిస్తున్నాను. భాషా దినోత్సవం సందర్భంగా ఏవేవో హామీలు గుప్పించటం తప్ప నానాటికీ నామరూపాలు లేకుండా పోతోన్న తెలుగు భాషనూ, సంస్కృతినీ, సంప్రదాయాలనూ రక్షించుకునేందుకు ప్రభుత్వంగానీ, అధికారులుగానీ, చివరకు తెలుగు భాషా సంఘం కూడా పట్టించుకోకపోవటం క్షంతవ్యంకాని నేరం……. అన్నట్లు ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం లేదుగానీ, ఈ మధ్య అనుకోకుండా నేను విన్న ఎఫ్‌ఎం రేడియో జాకీల భాషని ఈ సందర్భంగా గుర్తుచేయాలనుకుంటున్నాను. ‘హ్యెలో, హెవ్వార్యూ, మీస్‌ జోతిక్క….మొదట మగ గొంతుక ప్రశ్నించింది. హెAయ్‌, ఆం ఫై షుణీళ్‌, మన ప్రోగ్రాం కోసం గైస్‌ అండ్‌ గాళ్స్‌ తెగతెగ ఎదురుచూస్తున్నామంటూ సెల్స్‌ బరాబర్‌ మోగిపోతూనే ఉన్నాయ్‌. ఆ…. గైస్‌ అండ్‌ గాళ్స్‌, వెలకం ఫ్రం జోతిక్క, అండ్‌ షుణీళ్‌’ అలా సాగింది వాళ్లిద్దరి సంభాషణ. అది ఏ భాషో నాకు అర్ధం కాక మా పిల్లల్ని అడిగాను. మా అబ్బాయి, అమ్మాయి తెగ ఆశ్చర్యపోతూ, ‘అదేంటి తాతయ్యా, మీరు తెలుగు భాషకు వీరాభిమానులు, మీకే అర్ధం కాలేదా’ అంటూ ఎదురు ప్రశ్నంచారు. నాకు మతి పోయినంత పనియిందంటే నమ్మండి. కనీసం పదవీ విరమణ తర్వాతయినా తెలుగు భాషను బతికించటానికి ఏదో ఒకటి చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే భాషను ఖూనీచేసినవారిని ఖూనీ చేస్తే ఆశయం నెరవేరుతుందని ఒక న్యాయమూర్తిగానే కాదు, తెలుగువాడిగా, మాతృభాషాభిమానిగా కూడా నేను నమ్మను. ఒకవేళ సాధ్యమవుతుందనుకున్నా రాజ్యాంగం అంగీకరించదు. సమాజమూ ఒప్పుకోదు. అందువలన సమాజ హితం కోరి నేరం చేసినా, చట్టం ప్రకారం శరత్‌బాబును శిక్షించకుండా వదిలేయలేము. నిందితుడు శరత్‌బాబుకు ఈ న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తున్నది. ఒక తెలుగు భాషాభిమానిగా ఈ తీర్పును వెలువరించటం బాధగా ూంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చక తప్పదు. దీనికి సంబంధించి కర్మాగార విభాగాధిపతులు తదుపరి చర్యలు తీసుకోవాలని ఇందుమూలంగా వారిని ఆదేశిస్తున్నాను.” అంటూ న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పు ప్రసంగాన్ని ముగించారు. అప్పటిదాకా నవ్వులు చిందిస్తూ బోనులో నిలబడున్న శరత్‌బాబు” తెలుగు భాష …. జిందాబాద్‌, తెలుగును ఖూనీ చేసిన వారిని ఖూనీ చేయటమే నా మార్గం” అంటూ నినాదాలు చేయటం ప్రారంభించటంతో పోలీసులు అతని చుట్టుముట్టారు. లాఠీలు ఝళిపించారు.
పోలీసులతో పెనుగులాడుతూ దభీమని కిందపడ్డాడు శరత్‌బాబు.
శరత్‌బాబుకు మెలకువ వచ్చింది. మొదట తాను ఎక్కడుందీ అర్ధం కాలేదు. న్యాయస్థానంలో ఉండాల్సిన తాను ఇంట్లో ఎలా ఉన్నానా? అని అయోమయంలో పడ్డాడు. రెండు, మూడు నిమిషాల తర్వాతగానీ తాను ఇప్పటిదాకా కలగన్నానన్న విషయం అతనికి అర్ధం కాలేదు. తెలుగు కథ నూరేళ్ల వేడుకల కార్యక్రమానికి ఆ రోజు సాయంత్రం హాజరయిన వీర మాతృభాషాభిమాని శరత్‌బాబు, అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన నుంచి తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను కొనుక్కొని తెచ్చుకున్నాడు. వస్తూనే మంచంపై వాలిపోయి వాటి పని పట్టటం ప్రారంభించాడు. మాట్లాడే భాషే రాత భాష కావాలని జీవితాంతం పోరాడిన గిడుగు జీవిత చరిత్ర పుస్తకం చదివేశాడు. ఆనాటి దినపత్రికలో కర్లపాలెం హనుమంతరావు రాసిన ‘తెలుగు తక్కువతనం’ వ్యాసం జిరాక్స్‌ ప్రతుల్ని ఎవరో భాషాభిమాని ఒకరు పంచగా దాన్నీ తెచ్చుకున్నాడు. దాన్ని చదువుతూనే నిద్రలోకి జారిపోయాడు. తెలుగు భాషను ఖూనీ చేస్తోన్న తెలుగు ఎఫ్‌ఎం రేడియో జాకీలపై ఎన్నాళ్లుగానో పెంచుకున్న కోపాన్ని తీర్చుకునేందుకు వారిలో ఒకరిని ఖూనీచేసినట్లు కలగంటూ కిందపడ్డాడు. ఆలోచనలు జిగిబిగితో ఆరోజిక నిద్రాదేవి అతనిని రుణించలేదు మళ్లీ. కలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ ఎప్పుడో వేకువ వేళ నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు. తూర్పుదిక్కున అరుణకిరణాలు పొడజూపిన వేళకల్లా లేచి బయటికొచ్చాడు. ూదయాగమన సుందర దృశ్యం అతని కళ్లబడింది.

(అయిపోయింది)