ప్రపంచబ్యాంకు… పాలేరు … ఓ బషీరుబాగ్

ఆ మహా దురంతానికి ఇదిగో నా సాక్ష్యం
2000 ఆగస్టు 28.
అంటే సరిగ్గా ఈరోజుకు పదేళ్లు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదు.
ఇందిరాపార్కు నుంచి శాసనసభ వరకూ –
అరుణ పతాకాల రెపరెపలు … ఎటు చూసినా ఎరుపు. ఎర్రెర్రని ఎరుపు. పతాకాలు ఎరుపు – ఆడ, మగ దుస్తులు ఎరుపు – వారి నడకలో ఎరుపు – వారి అరుపులో ఎరుపు – వారి ముఖంలో ఎరుపు – బిగించిన పిడికిలో ఎరుపు.
ఒక్కొక్కరు ఓ మహా ప్రజాసైనికుడు … తమ ఆదాయాలను కొల్లగొడుత్ను ప్రభుత్వంపై ఆగ్రహం – శాసనసభవద్దకు చేరి నేతల్ని నిలదీయాలన్న ఉద్రేకం – ప్రపంచబ్యాంకు విధానాల పట్ల నిరసన – అడ్డుకుంటున్న పోలీసులపట్ల అసహస్యం.
జనం జనం జనమే జనం – ఒకటే జనం … కదిలొస్తున్న  కొండల్లా జనం – పోటెత్తిన సంద్రంలా జనం.
బషీర్‌బాగ్‌, పైదారి…
జన గర్జన … జనహోరు …  సునామీ కెరటాల్లా జనం. శాసనసభవైపుకు పరుగులు… ఉరుకులు… కట్టలు తెంచుకుని లక్ష్యంవైపుగా గురి. గుర్రాలు- పోలీసులు- లాఠీలు- ముళ్లకంచెలా? మాకడ్డంకి అన్నట్లుగా … పదండి ముందుకు- పదండి పోదాం… పదండి తోసుకు- పదండి పదండి. ఎక్కడిదా ప్రపంచబ్యాంకు? ఎవడిచ్చాడు వాడికి ఆదేశించే హక్కు?
చంద్రబాబు… కాదు మన ముఖ్యమంత్రి – ప్రపంచబ్యాంకు జీతగాడు. తేల్చుకుందాం. ఈ భారాలు ఎన్నాళ్లు? ఈ దోపిడి ఎందాకా?
పదండి ముందుకు … పదండి ముందుకు…
అదిగో అదే సమయంలో….
పైదారి కింద –
విరిగిన లాఠీల చప్పుళ్లు …
అయినా చలించని జనం.
గుర్రాల పద ఘట్టనలు…
అయినా ముందుకే ఉరుకుతున్న కార్యకర్తలు.
ఠాం.. ఠాం.. ఠాం.. ఠాం.. ఠాం.. ఠాం.. పోలీసు తుపాకులు…
ఒకడు పడిపోతే వందల మంది…
పెరిగిన ఆగ్రహం …పెరిగిన నినాదాల హోరు
ఓ మహిళామతల్లి… చేతిలో అరుణపతాక.
కటిక పేదరాలుగా కన్పిస్తోంది.
చిరుగుపాతల చీర- అంతకు మించి అతుకులమారి రవిక.
కాళ్లకు అరిగిపోయిన, పాత రెండు రకాల రబ్బరు చెప్పులు.
ముఖంలో ఆగ్రహం. తన బిడ్డల ఉసురుతీసిన కర్కశులపై కట్టలు తెంచుకున్న కోపం.
”చెడు నాబట్టల్లారా! ఎక్కడి లంజకొడకల్లారా మీరు!! మడుసులేనురా మీరు? ఒకబ్బకి, ఒకమ్మకి పుట్టార్రా?. నిలువునా బిడ్డల ప్యాణాలు తీశారే?! అరెరే! ఎన్నడయినా సూశనా? ఈ అన్నాయాన్ని?” తిడుతూ ఊగిపోతోందా తల్లి. నాకయితే ఆమె భారతమాతే అనిపించింది. ఒక్కసారిగా వంతెన గోడదగ్గరకు పరుగు తీసింది మధ్యనుంచి. చేత్తో చెప్పులు ఊడబీకుతుంటే చూసేవాళ్లంతా ”అయ్యో! దూకేలాగుందే” అనుకుని, అని ఉరికి ఆమెను పొదిపి పట్టుకున్నారు. భరతమాత ఊరుకుందా? విదిల్చిపారేసింది అందరినీ. చేతనున్న చెప్పుల్ని కిందున్న పోలీసులకేసి కసిదీరా విసిరింది ఒకదానివెంట మరొకటి. అవి పోలీసులకు తగిలాయో? లేదో? కానీ మిన్నంటిన జనాగ్రహానికి ప్రతీక ఆమె.
ముగ్గురి ఉసురు తీసిన మానవ మృగాలు…
వందలాది మందిని గాయపరిచిన అనాగరికులకు…
అక్కడ జనం ఉండటం ఇష్టంగా లేదు. తరిమేయటానికి ఉపక్రమించారు.
పైదారి మధ్యలో ఉన్న నేను మిత్రులతో కలిసి వెనక్కు మళ్లక తప్పలేదు. అయినా వాళ్లు పోలీసులు కదా! లాఠీలతో వడ్డనలు… ఇటు ఉండనివ్వరు, అటు పోనివ్వరు. చేసేది లేక వంతెన గోడలు దూకే ప్రయత్నం చేస్తే వాటర్‌ క్యానన్లతో రసాయనికాలు, రంగులు కలిపిన నీళ్ల పిచికారీ. ఆ నీళ్లు మీదపడితే మొదట బట్టలకు రంగు, కొద్దిసేపటికే ఒళ్లంతా జిల. కళ్లు మంటలు. ప్రాణాలే కోల్పోయిన యోధులు, ఒళ్లంతా గాయాలపాలయిన వందలాది కార్యకర్తలు కళ్లముందుండగా వళ్లు జిల, కళ్ల మంటల్ని ఎవరు పట్టించుకునేది. పోలీసులు తరమటంతో పక్కనే ఉన్న ఓ శ్మశానంలో రెండు గంటలపాటు నిరీక్షించి, తర్వాత బంధువుల ఇంటికి చేరుకున్నాము.
భోజనం అనంతరం మళ్లీ వీధుల్లో బడి ఆసుపత్రి వెంట ఆసుపత్రికి వెళ్లి ఒంగోలువాళ్లు ఎక్కడెక్కడున్నారో తెలుసుకుంటూ… ఆహారం, మందులు అందించాం. అవసరమయినవాళ్లకు అవసరంమేర నగదు కూడా ఇచ్చాము. అదీ ఆనాటి నా అనుభవం.
అప్పుడు నేను ఒంగోలు పట్టణంలో ఈనాడు విలేకరిగా పనిచేస్తున్నాను. ప్రపంచబ్యాంకు ఆదేశాలమేరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్తు ధరల్ని పెంచింది. ఇది  వినియోగదారులకు భారమయింది. వామపక్షాలు రోడ్డెక్కాయి. వంద రోజులపాటు నిత్యం ఆందోళనే. నిత్యం నిరసనలే. పాత్రికేయుడిగా పోరాటాల సమాచారాన్ని సేకరిస్తూ, వార్తలు రాస్తూ నేనూ భాగస్వామినయ్యాను. పోరాటాన్ని ఉదృతం చేసే లక్ష్యంతో హైదరాబాదులో నిరసన తెలిపే కార్యక్రమానికి వామపక్షాలు పిలుపు. కాంగ్రెసుకూడా జతచేరింది.
ఆ రోజు రోజూ మాదిరిగానే తెల్లవారింది.
ఒంగోలు మిత్రులతో కలిసి నిరసనలో పాల్గొనేందుకు ఉదయాగమన వేళ నేనూ హైదరాబాదు చేరుకున్నాను.
ఇందిరాపార్కు నుంచి ఊరేగింపు.
ఆ తర్వాత కాసేపటికే కాల్పులు.
ఆ సాయంత్రం మాత్రం రోజూ మాదిరిగా పొద్దుగుంకలేదు.
ప్రపంచబ్యాంకు కాలుపెట్టిన ప్రతిచోటా జరిగిన విధ్వంసాలకు ప్రతిరూపమే బషీర్‌బాగ్‌ దురంతం.
ఫలితంగా అనంతరకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరపతనం.
కాంగ్రెసు పునరాగమనం.
తీరా గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెసు నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు దూర్చి పెద్ద పాలేరుగా వ్యవహారాలు.
ఖమ్మం జిల్లా ముదిగొండలో కాసింత నీడ అడిగిన పాపానికి ఏడుగురిని పొట్టనబెట్టుకున్న పెద్ద పాలేరు… ఇప్పుడు మరో పాలేరు. ప్రపంచబ్యాంకు మాత్రం ఆదేశాలు జారీచేస్తూనే ఉంది. చాపకింద నీరులా చేరుతూ మహా ప్రమాదాలకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాయి. ఇదీ నా సాక్ష్యం. బషీర్‌బాగ్‌ దురంతంలో అశువులుబాసిన యోధులకు నివాళి. ఆనాటి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి అనంతరం కోలుకున్న మిత్రులు కిరణ్‌చంద్ర (ఇంజినీరు), జగదీష్‌ (పాత్రికేయుడు) ప్రపంచబ్యాంకు వ్యతిరేక పోరాటంలో కొనసాగటం ప్రశంసనీయం. వారికి నా హృదయపూర్వక నెనరులు.

2 వ్యాఖ్యలు

  1. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే చంద్రబాబు…ఇల్లస్థలాలివ్వమంటే వై ఎస్ రాజశేఖరరెడ్డి కమ్యూనిస్టులను కాల్చిచంపాడు.

    స్పందించండి

  2. Rulers change, policies do not.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: