Archive for సెప్టెంబర్ 27th, 2010

ఎగసాయం … తెలుగు పల్లెల జీవన ధారావాహిక – 2

చెరువు మొగదల నుంచే గుయ్యిమని హారను కొట్టుకుంటూ ఇంకొల్లు నుంచి బస్సొచ్చింది. ఈదుమూడి రైతులంతా సంచుల్నీ, గోతాముల్నీ చేతబట్టుకుని లోపలికి జొరబడ్డారు. వాళ్లతోబాటే సాంబయ్య కూడా ఎక్కాడు. సామ్రాజ్యం చెప్పటంతో సాంబయ్య కక్కాయి వీరయ్య అతన్ని క్షణం క్షణం గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ ఒకే సీట్లో కూర్చున్నారు. బస్సు వేగం పుంజుకుంది. వీరయ్య మనసు గతంలోకి పరుగు తీసింది.
సాంబయ్య చిన్నప్పుడే తండ్రి వెంకటరత్నం చనిపోయాడు. జానెడు జానెడు చుట్టలేకుండా వెంకటరత్నాన్ని ఎవ్వరూ చూసినోళ్లు ఆ వూళ్లోనే కాదు, ఆయన ఇంట్లో కూడా లేరు. నోటికి రాచపుండు పుట్టి సాంబయ్యకు రెండేళ్ల వయస్సప్పుడు ఆయన పోయాడు. రాచపుండుకు చుట్టతాగుడే కారణమని మదరాసు క్యాన్సరు ఆసుపత్రి పెద్ద డాక్టరు చెప్పాడు. రోగం ముదిరిపోయినాక వచ్చినందున చేసేదేమీ లేదని వెంకటరత్నాన్ని ఆసుపత్రికి తీసుకుపోయిన వీరాంజనేయులుకి రహస్యంగా చెప్పాడాయన. మూడు నెలలకన్నా ఎక్కువ బతక్కపోవచ్చని జాగ్రత్తలు చెప్పాడు. ఆయన చెప్పినట్లే రెండు రోజులు ముందే వెంకటరత్నం చనిపోయాడు. వదిన తప్ప దిక్కులేని ఆ కుటుంబాన్నీ ఓ కంట కనిపెట్టుకుని నెట్టుకొచ్చాడు వీరయ్య. వీరయ్యతోనే సాంబయ్యకు తండ్రి తాలూకు ప్రేమ అంతో ఇంతో దక్కింది. సాంబయ్యను తన బిడ్డలతోపాటే వీరయ్య చదివించాలనుకున్నా, ఊళ్లో పదో తరగతి అయిన తర్వాత ఇక పోనని మొండికేశాడు. ఆ విషయం తెలిసి ఇంటికల్లా వచ్చి మరీ,
”చదువు మానేస్తే చంకనాకిపోతావురో” హెచ్చరించాడు ఆ ఊరివాళ్లంతా ఆప్యాయంగా మల్లారప్పంతులని పిలుచుకునే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొనుగుబాటి వెంకటసుబ్బారావు. చదువుకుంటే ఏమి లాభమో కథలుకథలుగా చెప్పిచూశాడు పంతులుగారు. ఆయనకు ఎదురు చెప్పలేక మౌనం పాటించాడు సాంబయ్య.
”మానేయాలనే అనుకుంటే నాకు చెప్పకుండా నిర్ణయం తీసుకోకురా సాంబయ్యా.” అంటూ రెండు గంటల తర్వాత వెళ్లిపోయాడాయన.
అయినా సాంబయ్య ఆలోచనలో మార్పు రాలేదు.
సాంబయ్యకు తల్లిని ఒంటరిగా వదిలి చదువుకునేందుకు అటు ఒంగోలో, ఇటు చీరాలో పోవాలనిపించలేదు. ఆసలా ఆలోచననే తట్టుకోలేకపోయాడు. వీరయ్య ఓ రోజు ఇంటికొచ్చి, కాలేజిలో చేరేందుకు చీరాల బయలుదేరమంటే ఏడుపుకు లంకించుకున్నాడు. అన్నం కూడా తినకుండా పోనంటే పోనని మొండికేశాడు. బలవంతంగా కాలేజీలో చేరిస్తే ఏమవుద్దోనని తల్లి భయపడింది.
”పెడద్రపోడు. ఎంతజెప్పినా ఇంటంలేదుగా, పోనియ్యి. వాడి కరమ. ఎవులు కరమకి ఎవులు బాద్దులబ్బాయి” చేసేది లేక బాధతోనే సాంబయ్య తల్లి కొడుకుని సమర్ధించింది.
”అట్టా అంటే ఎట్టొదినా? పిల్లలకి తెలియకపోతే పెద్దోళ్లమి చెప్పాలిగానీ.” ఇంకా నచ్చచెప్పబోయాడు వీరయ్య.
”కాదులేబ్బాయి. ఆడది ఎదురు సెబుతుందని అనుకోబాక. సిన్నప్పటినుంచీ సూడ్డంలా. వాడు అడ్డం తిరిగితే ఏ పనన్నా సేయించగలిగామా ఏనాడయినా”
”ఏదో సిన్నా, సితకా పన్లు ఏరు వదినా, ఇది జీవితానికి సంబందించింది. అట్టా సూడగూడదు.”
తల్లితోపాటు వ్యవసాయంలో పడ్డాడు ఆనాటి నుంచీ.
ఉండూరయితే తానున్నా లేకున్నా, కొడుక్కి అండగా ఉంటారని సాంబయ్యకు 22 ఏళ్లు రాగానే తూర్పుబజారు ఉప్పల రాఘవయ్య కూతురు సామ్రాజ్యంతో పెళ్లి చేసింది. వీరయ్య దంపతులే పెళ్లి పీటలమీద కూర్చుని ఆ శుభకార్యాన్ని పూర్తిచేశారు. ఉప్పుగుండూరు మలుపుల్లో వాహనాలు ఎదురు రాకుండా డ్రైవరు హారను కొట్టటంతో వీరయ్య ఆలోచనలకి బ్రేకు పడింది. స్టాండులో ఆగింది బస్సు.
”జీడిపప్పు మిఠాయి … జీడిపప్పు మిఠాయి”
”వాటర్‌ ప్యాకెట్‌ … వాటర్‌… వాటర్‌ ప్యాకెట్‌”
”కాలక్షేపానికి బఠానీలు, కాలక్షేపానికి బఠానీలు”
ఒకేసారి కుర్రాళ్లంతా బస్సును చుట్టుముట్టి కేకలు వేస్తుండటంతో అక్కడంతా గలభాగలభాగా ఉంది.
వీరయ్య బయటకు పారజూశాడు. ఎదురుగా అరుగుమీద బాచింపట్ల వేసుకుని కూర్చున్న నాషా భక్తరాజు కన్పించాడు. మహానుభావుడు ఆ ఊరికి నలభై ఏళ్లపాటు సర్పంచిగా చేశాడు. ఆయనకు పోటీ ఉండేదే కాదు. వయస్సు మళ్లినందున ఎవరినన్నా మంచి కుర్రవాడ్ని పెట్టాలని ఆయన బతిమలాడితేగానీ ఆ ఊళ్లో మొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, లావు బాలగంగాధరరావుకు కొరియర్‌గా పనిచేసిన మహానుభావుడిగా ఆ ప్రాంత గ్రామాలన్నింటా గౌరవ మర్యాదలు అందుకుంటూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడాయన. భక్తరాజు బస్సుకేసి చూస్తుండటంతో వీరయ్య కిటికీ నుంచి చెయ్యి బయటపెట్టి ఆయనకు నమస్కారం పెట్టాడు. ప్రతిగా భక్తరాజు నవ్వుతూ చేయెత్తి ఊపాడు. బస్సు బయలుదేరింది.

28 సెప్టెంబరు 2010న ఎగసాయం … 3

ఎగసాయం ……. తెలుగు పల్లెల జీవన ధారావాహిక -1

‘ఎగసాయం’ శీర్షికన తెలుగు గ్రామీణ జనుల జీవన వైవిధ్యాన్ని చూపుతో నేను రాస్తోన్న ధారావాహిక నేటి నుంచీ తెలుగిల్లు బ్లాగు యవనికపై ప్రారంభమవుతోంది. బహూశా ఇది మిగతా భాషల మాటేమోగానీ తెలుగు బ్లాగ్లోకంలో మాత్రం తొలి ప్రయోగమని భావిస్తున్నాను. ఈ ప్రయోగం అనుకున్నది అనుకున్నట్లు ఫలవంతం అయితే అప్పుడు నమ్రతగా గర్విస్తాను. ఎప్పటికప్పుడు మీ సలహాలు, సూచనలు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఒప్పుల్ని పట్టించుకోకపోయినా సరే, కానీ తప్పుల్ని మాత్రం వెంటనే విమరనాత్మకంగా తెలియజేస్తారని భావించటంలో స్వార్థం కన్నా, మరింత ఒళ్లొంచి పనిచేసేందుకు పనికొస్తుందన్న కోరికే అధికంగా ఉందంటే మీరు నమ్మాలి మరి.

”ఏవయ్యోయ్‌!” బయటనుంచి సాంబయ్యని కేకేస్తూనే ఇంట్లోకి వచ్చింది ఆయన భార్య సామ్రాజ్యం.
మంచం మీద దిగాలుగా కూర్చున్న సాంబయ్య, ఏందన్నట్లుగా భార్య వంక చూశాడు మౌనంగా.
”దిగులుబెట్టుకుని కూసుంటే పనులవుతయ్యంటయ్యా? కట్టాలు కలకాలం ఉండవంటారు. అందరూ ఒంగోలుకు పోతన్నారు ఇత్తనాల కోసం. లేచి, కాసింత సద్దిబువ్వదిని నువ్వూబోయిరా, లే.” సామ్రాజ్యం భర్తను సముదాయించింది.
సాంబయ్యలో చలనం కన్పించలేదు. కాసేపు ఆ పనీ, ఈ పనీ అన్నట్లుగా అటూ ఇటూ తిరుగుతూ గడిపిన సామ్రాజ్యం మళ్లీ భర్త దగ్గరకు వచ్చింది.
”లేవయ్యా! ఎవరన్నా ఇంటే నవ్విపోతారు. కట్టాలు మానవులుకి కాక మానులకొత్తాయంటయ్యా?, లే. కట్టాలొచ్చినప్పుడే మనుసు రాయిజేసుకోవాలయ్యా”. సామ్రాజ్యం భర్త భుజం పట్టుకుని లేవదీసింది. గాబు దగ్గరకు తీసుకుపోయి నీళ్ల చెంబు సాంబయ్య చేతిలో పెట్టి వంటింట్లోకి పోయింది.
ఇక తప్పేదన్నట్లుగా  సాంబయ్య కాళ్లూ, చేతులూ కడుక్కొని వంటగదిలోకి పోయి పీట మీద కూర్చున్నాడు. అతడి ముఖంలో దిగులు ఛాయలు ఏ మాత్రం తగ్గలేదు.
”తొందరగా కానియ్యి, ఒంగోలు బస్సొచ్చే ఏలయింది. అందరితోబాటు పోతే కాయితికాలయ్యీ పూరితి జెయ్యటం ఇబ్బంది లేకుండా పోయిద్ది.” పళ్లెంలో అన్నమూ, గోంగూర వడ్డించి భర్త ముందు పెట్టి చెప్పింది సామ్రాజ్యం. దోసకాయ చెంబుతో మంచినీరు పెట్టింది.
”రాత్తిరేపిన ఊరమిరపకాయలుండయి, పెట్టమంటా? అడిగింది సామ్రాజ్యం.
”ఊ” అన్యమనస్కంగానే జవాబిచ్చాడు సాంబయ్య.
ఊర మిరపకాయల గిన్నెను భర్త ముందు పెట్టిందామె. మామూలుగానయితే కడుక్కున్న కాళ్లారకముందే అన్నం తినటం పూర్తిచేసేవాడు సాంబయ్య. ఇప్పుడు మాత్రం ముద్ద మింగుడు పడటం లేదు. నాలుగు మెతుకులు కలిపి నోట్లో పెట్టుకున్నా గొంతు దిగటం లేదు. కష్టంగా మింగుతూ భోజనం పూర్తయిందనిపించి లేచాడు.
సాంబయ్య బాధ చూసి విత్తనాల కోసం తానుపోవాలని ఆలోచించింది సామ్రాజ్యం. అయితే ఇంటిదగ్గర సాంబయ్య ఒక్కడినీ వదిలేసి పోతే అసలే దిగుల్లో ఉన్న భర్త కానిదేదన్నా చేసుకుంటాడని భయపడింది. పది మందితోపాటు విత్తనాలకోసం ఒంగోలు వెళ్తొస్తేనన్నా కొంత బాధ తగ్గుతుందని భావించిందామె. ఆ ఆలోచనతోనే సాంబయ్య దిగాలుగా ఉన్నా పదే పదే వెంటబడి తొందరపెడుతోంది.
”ఇదిగో ఇత్తనాలకి డబ్బు లోపల జేబిలో పెట్టుకో. ఇయ్యేమో చారిజీలకీ, కరుసులకీ సరిపోతయి. నా పేరనుండ పాసుపుత్తకమూ, నీపేరుతో ఉండిన పాసు పుత్తకమూ ఈ సంచిలో పెట్టినా. అట్ట బోయి బట్టాండుకాడ కూసో. సుబ్బయ్య బావ, ఎంకటరావన్నాయి, మీ కక్కాయి అందరూ అక్కడే ఉండారు. జాగ్రత్తలు చెబుతూ భర్త సాంబయ్యని సాగనంపింది సామ్రాజ్యం.

మీ ఆశీర్వచనాలు కోరుతున్నాను
రేపే ధారావాహిక …2