Archive for అక్టోబర్ 15th, 2010

ఇటు చూస్తే పేదల ఆకలి కేకలు … అటు చూస్తే ముక్కిపోతోన్న ధాన్యపు రాశులు

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.

ఐరాస ఆహార , వ్యవసాయ క సంస్థ (ఎఫ్‌ఎఓ) వ్యవస్థాపక దినమైన 1945 అక్టోబరు 16 వతేదీని ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దీనిని మొదటి సారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచీ క్రమం తప్ప కుండా ఏటా ఒక్కో సందేశాన్ని ఇది ముందుకు తెస్తుంది. తొలి ఆహార దినోత్సవం నాడు ఆహారానికి తొలి ప్రాధాన్యత అన్నది ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది అంటే 28వ అహార దినోత్సవం సందర్భంగా సంక్షోభ సమయంలో ఆహార భద్రత అన్న దానిని ప్రధాన అంశంగా తీసుకున్నారు. 2010 సంవత్సరానికి గాను ఆకలిపై సమిష్టి పోరు జరపాలని ఎఫ్‌ఎఓ పిలుపు నిచ్చింది. గత సంవత్సరం జరిగిన ప్రపంచ ఆహార భద్రతా సదస్సు ఆమోదించిన ఏక గ్రీవ తీర్మానంలో ఆకలిని భూమ్మీద నుంచి సాధ్యమైనంత త్వరగా తుడిచిపెట్టాలని పిలుపునిచ్చింది. ప్రపంచంలో డెబ్బయి శాతం మందికి జీవనాధార మైన వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్న విషయాన్ని ఈ సదస్సులో అన్ని దేశాలూ  అంగీకరించాయి. వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఆకలి, పేదరికం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించేందుకు ఈ రంగంలో పెట్టుబడులు పెంచాలని కోరింది.

ఆశయాలు, ఉద్ఘాటనలు  బ్రహ్మాండంగా ఉంటాయి. ఆచరణే అధ్వానం. భారత్‌ లాంటి దేశాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక వైపు వృథా అవుతున్న ఆహార ధాన్యాలు … మరో వైపు ఆకలి కేకలు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు . ఒకే దేశంలో పూర్తి భిన్నమైన రెండు దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎఫ్‌ఏఓ చేసిన ప్రకటనలు కానీ, అంతర్జాతీయ సదస్సుల్లో అంగీకరించిన తీర్మానాలు కానీ ఏవీ సరిగ్గా అమలు కావడం లేదు. ఆకలిని పారదోలుతామని అంతర్జాతీయ వేదికలపై గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చే  పాలకులు వాటిని ఆచరణలో పెట్టే విషయానికొచ్చేసరికి మౌనం వహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచుతామని అక్కడ చెబుతారు. ఇక్కడకు వచ్చేసరికి పూర్తి భిన్నంగా  వ్యవహరిస్తుంటారు. మన దేశంలో సంస్కరణలు అమలులోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులపై ఏటా కోత పడుతూనే వుంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆకలి, పేదరికం పెరుగుతున్నది. ‘కామన్వెల్త్‌ కామన్‌ హంగర్‌’ పేరుతో తాజాగా విడుదలైన నివేదికలో ప్రపంచ వ్యాపితంగా పౌష్టికాహార లోపం, సరైన తిండి లభించని కారణంగా బరువు తక్కువగా పుడుతున్న పిల్లల్లో అత్యధిక శాతం భారత్‌లోనే వున్నారని తేలింది. ప్రపంచంలో బరువు తక్కువతో పుట్టిన పిల్లల్లో 64 శాతం మంది 54 కామన్వెల్త్‌ (ఒకప్పటి బ్రిటిష్‌ వలసకింద వున్న దేశాలు)లో ఉండగా, అందులో భారత్‌ది అగ్ర తాంబూలం. దేశంలోని మొత్తం పిల్లల్లో 43 శాతం మంది బరువు తక్కువగా వున్నారని ఆ నివేదిక పేర్కొంది. వీరిలో అయిదేళ్లలోపు పిల్లలు 7 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాదపడుతున్నారని సేవ్‌ చిల్డ్రన్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది.  భారత దేశాన్ని నేడు పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పౌష్టికాహార లోపం ఒకటని ఈ నివేదికకు ముందు మాట రాసిన  వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్‌ స్మామినాథన్‌ చెప్పారు.

పౌష్టికాహార లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుంది. తల్లులు కూడా దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహార లోపం అనేది జాతికే అవమానం అని ప్రధాని చెబుతారు. దీనిని రూపుమాపాల్సిందేనని ఎర్ర కోట బురుజుల నుంచి గంభీరమైన ప్రకటనలు చేస్తారు. కానీ, ఆచరణలో ప్రజల జీవితాల్లో వాస్తవంగా ఎలాంటి మార్పు వుండడం లేదు. అధికారిక లెక్కల ప్రకారమే కోటి 78 లక్షల టన్నుల తిండిగింజలు ముక్క బెట్టి పారబోయడానికైనా సిద్ధపడుతున్న ప్రభుత్వం, పేదల ఆకలి తీర్చేందుకు, వారిలో పౌష్ఠికాహార లోపాన్ని తొలగించేందుకు వీటిని ఉచితంగా పంచడానికి ససేమిరా అంటోంది. పేదలకు ఉచితంగా పంపిణీ చేయమని సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశిస్తే దీనివల్ల రైతులకు నష్టం వస్తుందని పసలేని వాదన చేస్తోంది. ప్రభుత్వం చెప్పింది నిజమేననుకునే వారు కూడా ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం చెప్పేది పచ్చి అబద్ధం. ఇప్పుడు గోదాముల్లో నిల్వలు పేరుకుపోయిన ఆహార ధాన్యాలు రెండేళ్ల క్రితమే రైతుల నుంచి సేకరించినవి. అంటే వాటికి ఎప్పుడో ధర చెల్లించారు. కాబట్టి ఇప్పుడు వాటిని పేదలకు ఉచితంగా ఇస్తే రైతులు నష్టపోతారనడం ఏ విధంగానూ సరికాదు.

ఇందుకు ప్రభుత్వం బాధ్య త వహించాలి. ఆకలి తో అలమటించేవారు అత్యధికంగా ఉన్న 88 దేశాలలో మనం 66వ స్థానంలో వున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నదంటే ఏమనుకోవాలి. ఆమ్‌ ఆద్మీ అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో ఇది చెప్పకనే చెబుతోంది. ప్రజలను మభ్య పుచ్చడానికి ఇప్పుడు ఆహార భద్రత చట్టం తెస్తానంటున్నది. ఆ చట్టం ముసాయిదా రూపు రేఖలు చూస్తే దీనిని ఆహార అభద్రతా చట్టం అనడమే సరైనదని అనిపిస్తుంది. తలసరి ఆహార వినియోగంలో ప్రపంచంలో భారత్‌ బాగా వెనుకబడి వున్నది. పంటలు బాగా పండినప్పుడు కూడా ఆహార అభద్రత కొనసాగుతూనే వున్నది. 2009 ఒక్క సంవత్సరంలోనే  దేశంలో కోటీ 36 లక్షల మంది పేదలుగా మారారు. అంతకంతకూ పెరుగుతున్న ఆకలి, పేదరికంపై సమిష్టి పోరాటం సాగించడమంటే దీనికంతటికీ మూలమైన ప్రభుత్వ విధానాలపై పోరాడటమే.

ఆహార భద్రత అంటూ ప్రబ్యా సుద్దులు…ఆచరణలో కాబూలీవాలాలకు పెద్ద పొద్దులు

ఒకవైపు ఆహార భద్రత గురించి సుద్దులు చెప్పే ప్రపంచబ్యాంకు {ప్రబ్యా} మరోవైపు వ్యవసాయం, నీరు, వరదల నివారణ, పారిశుధ్య రంగాలకు ఇచ్చే రుణాలలో కోత పెట్టింది.  ఆర్థిక సంస్థలు, ప్రైవేటు రంగ అభివృద్ధికి పెద్ద పీట వేసింది. 15 అక్టోబరు 2010న  బ్యాంకు విడుదల చేసిన 2010 వార్షిక నివేదిక  ఈ ధోరణిని పట్టిచూపింది. భారత విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా  930 కోట్ల డాలర్ల రుణం ఇచ్చినట్లు నివేదిక వెల్లడించింది. ఏ దేశానికీ  ఇంత పెద్ద మొత్తం ఒకే సంవత్సరంలో రుణమివ్వలేదు.  దేశంలో గత ఐదు (2005-2010) సంవత్సరాలలో వివిధ రంగాలకు బ్యాంకు ఇచ్చిన రుణాలు 2,230.7 కోట్ల డాలర్ల నుంచి 5,874.7 కోట్ల డాలర్లకు పెరిగాయి. దీనిలో వ్యవ సాయం, అడవులు, మత్స్య రంగానికి 193.36 కోట్ల నుంచి 261.83 కోట్ల డాలర్లకు రుణం పెరిగింది. గతేడాది 340 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. ఇదే సమయంలో ద్రవ్యవ్యాపారం చేసే ఆర్థికసంస్థలకు, ప్రైవేటు రంగ అభివృద్ధికి 386.2 కోట్ల నుంచి 1,772.6 కోట్ల డాలర్లకు పెంచింది. కేవలం ద్రవ్య సంస్థలకు 167.51 కోట్ల నుంచి 913.66 కోట్లకు పెంచింది. ఈ ధోరణికి అను గుణంగానే రుణాలు తీసుకొనే దేశాలు తమ విధానాలను అమలు జరపాలనే షరతులు ఉంటాయని తెలిసిందే. నీరు,వరదల నివారణకు  218 కోట్ల డాలర్ల నుంచి గతేడాది 436 కోట్ల డాలర్లకు పెరగ్గా ఈ ఏడాది 410 కోట్లడాలర్లకు తగ్గించారు.
ప్రపంచంలో అత్యధికంగా 100 కోట్ల మంది జనం రోజుకు రెండుడాలర్ల (రు.93) కంటే తక్కువ ఆదాయంతో  బతుకీడుస్తున్నారని నివేదిక పేర్కొంది.  విద్యుత్తు‌ అందుబాటులో లేకపోవటం ఒక తీవ్ర సమస్యగా ఉందంటూ భారత్‌లో 44 శాతం కుటుంబాలకు విద్యుత్తు సౌకర్యము‌ లేదని పేర్కొంది. భారత్‌లో అమలు జరుగుతున్న సర్వశిక్ష అభియాన్‌కు 105 కోట్ల డాలర్ల సాయం అందించినట్లు తెలుపుతూ ప్రపంచంలోనే ఈ పధకం పెద్దది, అత్యంత జయప్రదమైనదని వర్ణించటాన్నిబట్టి చూస్తే ప్రపంచ  బ్యాంకు మోసకారి నాటకాలు  ఆడుతోందని అర్ధమవుతుంది.

వైఎస్‌ పత్తిత్తుకాదు – పెనువేప విత్తు … పతిత పావనుడు కాదు – గురివింద గింజ

యువ వైఎస్‌ మరకలపై రాసేందుకు అనుమతించండి… లోక్‌సభ కడప సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి పావన నవజీవన బృందావన నిర్మాత అన్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తుండటంతో, అందులోనూ తెలుగిల్లు బ్లాగులో బలంగా బూతులతో బల్ల గుద్దినందునే వాదనకు దిగాల్సి వచ్చింది. జగన్‌ను ఆవరించి ఉన్న మరకలు  రిన్‌తో ఉతికితే పోతాయా? ఏ సబ్బు వాడితే ఆ గబ్బు వదులుతుంది?
జగన్‌ను గద్దె నెక్కిస్తేచాలు జనం బాధలన్నీ అమృతాంజనంతో తలనొప్పి తుడిచిపెట్టుకుపోయినట్లుగా పోతాయని ఎవరయినా అంటే, వారు అమాయకులయినా అయివుండాలి (అంత తెలియనివారయితే నోరు మూసుకుని ఉంటే మేలు కదా!) కాకుంటే ఏదో మతలబయినా (సొంత లబ్ధే) దాగి ఉండాలి. జనం మతిమరుపు మీద అపారమయిన నమ్మకమేమోగానీ, తనకుగానీ తన తండ్రికిగానీ మరకలేమీ లేనట్లు జగన్మోహనరెడ్డి నిత్యం డప్పు కొట్టుకోవటం సొంత లాభం కోసమే. అంతేగానీ సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడటానికి కాదు. అదుంటే రైతులకు అందాల్సిన రాయితీ ధరల ఎరువుల్ని నొక్కేసి బొక్కేసిన తన బావ రవీంద్రనాథ్‌రెడ్డిని వెనకేసుకొస్తాడా? లోతుపాతులకు వెళ్లాల్సిన పనిలేకుండానే, అందరికీ తెలిసిన సంఘటనల నుంచే జగన్మోహనరెడ్డికి అంటిన కొన్ని మరకల్ని పరిశీలిద్దాం.


మరక 1 :
సాక్షి పత్రికను ప్రారంభించిన తొలినాళ్లల్లో దాని ఖరీదు రెండు రూపాయలు ఆదివారం తక్క. ‘ఆ రెండు’ పత్రికల్నీ దెబ్బతీయాలని కదా సాక్షి అవతరించింది. అందుకనే తక్కువ ఖరీదు – ఎక్కువ పేజీలు, పైగా అన్నీ రంగుల పేజీలతో ప్రారంభించారు. అయితే పత్రిక అమ్మకాలయితే వాళ్లు ఆశించిందేదో దక్కిందిగానీ, ఆ రెండు పత్రికలు మాత్రం అంతం కాలేదు. దీంతో సాక్షి యాజమాన్యం ఓ ప్రచార యుద్ధానికి తెరలేపింది. దినపత్రికను రెండు రూపాయలకే ఇవ్వాలన్న శీర్షికతో రోజుకొక పాఠకు(రాలు)డి ఫొటోసహా అభిప్రాయాలను ప్రచురించారు. అయితే అదెంతో కాలం సాగలేదు. సాక్షి ధరను ఏడాది తిరక్కముందే మరో అర్ధ రూపాయి పెంచేసి రెండు రూపాయలకే దినపత్రిక అన్న ప్లకార్డును  దించేశారు. ఇలా సాక్షి లక్ష్యం, పుట్టుకతోపాటు, రోజూవారి నడవడికలోనూ మాట తప్పటాలు, హామీలు తప్పటాలు, మోసాలు దాని వెన్నంటే ఉన్నాయి. ఈ మరకను ఏ రిన్‌ ఒదలగొడుతుందో మరి?


మరక … 2
12 అక్టోబరు 2010 నుంచీ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడి సమీప బంధువులకు చెందిన స్డూడియో – ఎన్‌పై సాక్షి ఒకటే దుమ్ము చల్లుతోంది. స్డూడియో – ఎన్‌ ఇటీవలే 70 మంది ఉద్యోగులను చెప్పాపెట్టకుండా బజారుపాలు చేసేయటమే దీనికి కారణం. ఇలా యాజమాన్యాలు వాళ్లిష్టమొచ్చినట్లు ఉద్యోగుల్ని పీకేయటం నేరం, ఘోరం. ఈ విషయంలో చంద్రబాబయినా, ఆయన బాబయినా, జగన్మోహనరెడ్డి అయినా, ఆయన బాబయినా ఒకటే. అయితే సాక్షి టీవీ చెప్పకనే ఏమి చెబుతోందంటే, సాక్షి చేస్తే అది అవసరం. అదే చంద్రబాబో, స్డూడియో – ఎన్‌ చేస్తేనో ఆ వ్యవహారం ముమ్మాటికీ తప్పు, మురికి.
ఏడాదిన్నర క్రితం జగన్మోహనరెడ్డికి అత్యంత ఆప్త మిత్రులు మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున ఆధ్వర్యంలోని మా టీవీ వార్తా విభాగాన్ని మూసివేసి ఐదు వందల కుటుంబాల్ని వీధులపాలు చేసిననాడు సాక్షికి న్యాయం, ధర్మం గుర్తుకురాకపోవటంలో విచిత్రం ఏముంది! ఆనాడు మా టీవీలో స్టేట్‌ న్యూస్‌ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తోన్న నాకు ఈ వ్యవహారంలో జగన్మోహన రహస్యాలు తెలుసు. దాన్నలా ఉంచుదాం… సాక్షి నుంచి పలువురు సబ్‌ఎడిటర్లను ఓ రోజు అర్ధరాత్రి వేళ రేపటి నుంచీ మీ సేవలు మాకు అవసరం లేదంటూ ఏడాది క్రితం సాగనంపిననాడు మీకు ఈ న్యాయం, ఈ ధర్మం గుర్తుకు రాలేదా?


మరక … 3
భారతీ సిమెంట్సు కోసం పొలాలు ఇచ్చిన రైతులకు తొలి రోజుల్లో జగన్మోహనరెడ్డి లక్షరూపాయలు ఇచ్చాడు. అయితే ఆ సంస్థలో కొంత భాగాన్ని ఉత్పత్తి కూడా ప్రారంభించకుండానే జగన్మోహనరెడ్డి అమ్మేశాడు. దాని ద్వారా వచ్చిన మూడువేల కోట్ల పై చిలుకు రూపాయల నుంచి రైతులకు మరొక మూడు లక్షల రూపాయలు ఇచ్చారట.
ఎన్టీఆర్‌ తరహాలో చెప్పాలంటే…
భారతికి నువ్వు నీరు పోశావా? నారు పోశావా?
ఎవడబ్బ సొమ్మనీ కులికేవు వైఎస్‌ జగన్మోహనరెడ్డీ?!?!
భారతీ సిమెంట్సు నిర్మించిన భూమిని అంతకు ముందెన్నడయినా కనీసం చూశావా?
తరతరాలుగా ఆ భూమిని చేతబట్టుకుని పండినా… ఎండినా … కక్షలూ, కార్పణ్యాలతో మండినా … ఆ మట్టినే పిసుక్కుని బతికిన అమాయక రైతన్నలకు నువ్వు దక్కించుకున్న లక్ష కోట్ల రూపాయల నుంచి సముద్రంలో కాకిరెట్టంత తీసి ముష్టిగా విసిరేశావు. అంతేగానీ… ఇది మీ భూమి, దీన్ని తిరిగి మీకే అప్పగిస్తున్నాను తీసుకోండి అనో, ఇదిగో ఈ కోట్లాది రూపాయలు మీరిచ్చిన భూమి కారణంగా నా వళ్లో వచ్చిపడ్డాయి. అందుకని వాటిని మీరే మీ పొలం ప్రకారం పంచేసుకోండి అన్నావా?
ఎన్నడయినా? ఎప్పుడయినా? ఎవరితోనయినా?
అనలేదు. అనలేవు. చివరకు భావోద్వేగంతోనూ అనవు.
అందువలన ఇది మురికే. ఈ మురికిని రిన్‌ కాదుగదా, జగన్మోహనరెడ్డి నమ్ముతున్నట్లుగా స్వర్గలోకంలో ఉంటోన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి అక్కడ నుంచి సెలవులు గడిపేందుకు భూలోకానికి వస్తూ, వస్తూ సురులను అడిగి సబ్బేదయినా తెచ్చి ఉతికినా ఎన్నటికీ పోని, పోలేని మరక.


మరక …4
ఈనాటి రచనలో ఇది చివరి మరక. మరెన్నెన్నో మరకలున్నా స్థలాన్నీ, కాలాన్నీ లెక్కేసుకోవాలిగదా!
ప్రతినిధిగా ఇరగదీయమని గత ఎన్నికల్లో ఆయన జగన్మోహనరెడ్డికి ఓట్లేశారు. అయితే ఆయన చేస్తున్నదేమిటి?  కడప ముఖం చూసి ఎన్నాళ్లయింది? సెప్టెంబరు మూడో తేదీన ప్రకాశం జిల్లా గిద్దలూరుకు కడప నుంచి వచ్చిన ఆయన ప్రస్తుతం అంటే అక్టోబరు 15న నెల్లూరును ఓదారుస్తున్నాడు. ఈ ఓదార్పు నిర్వాహకుల ప్రకారం ఆయన ఈ నెలాఖరున కూడా నెల్లూరులోనే ఉంటారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారమయితే ఇంకా ఒకటిన్నర సంవత్సరంపాటు ఓదార్పు పర్వం కొనసాగుతుంది. మరి కడప ప్రజలను ఎవరు ఓదార్చాల? పార్లమెంటు సభ్యుడిగా గెలిచే ముందు కడప ఓటర్లకు ఆయన చేసిన వాగ్దానం ఇదేనా? గెలిచిన తర్వాత లోక్‌సభలో ఆయన చేసిన ప్రమాణం ఇదేనా?????