Archive for అక్టోబర్ 19th, 2010

రోశయ్యాగారూ ! మీ పాలన ఎంత గౌరవమెంతగౌరవమోగదా!!


”విపక్షాల ఆందోళన రాష్ట్ర గౌరవాన్ని పెంచేదిగా లేదు” – రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.
సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలను వివరించేందుకుగాను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ 18 అక్టోబరు 2010 హైదరాబాదులో పర్యటన సందర్బంగా, అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, ప్రజారాజ్యం తదితర ఏడు పార్టీలు కోరగా రాష్ట్ర ప్రభుత్వం సలహాతో పిఎం పేషీ తిరస్కరించింది. దీంతో ఆ పార్టీలు ధర్నా జరిపి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ప్రతిపక్షపార్టీలు అగౌరవంగా వ్యవహరించాయని రోశయ్య మండిపడ్డారు.
రోశయ్య, ఆయన పరివారమూ నిర్వహిస్తోన్న ఘనత వహించిన కార్యక్రమాలు రాష్ట్రానికి తెచ్చిపెడుతోన్న గౌరవాన్ని మోయలేక తెలుగు ప్రజలు తబ్బిబ్బవుతున్నారు. వాటిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం!
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో? లేదో? అంటూ నిత్యం పలువర్గాల నుంచి విన్పించే విమర్శలు రాష్ట్ర గౌరవానికి అసలయిన ప్రతీక.
రాష్ట్ర మంత్రుల్లో పలువురు కోడాలున్నారని లోక్‌సభ గుంటూరు సభ్యుడు రాయపాటి సాంబశివారావు కితాబిచ్చాడు చూడండి, అది చాలదూ! ఎవడన్నా స్పందించటానికీ, నోబుల్‌ బహూమతి ఇప్పించి మన గౌరవాన్ని ఇతోధికంగా ఇనుమడింపజేయటానికీ.
వరద సాయాన్ని దోచుకుని దాచుకున్న కర్నూలు శాసనసభ్యుడు టిజి వెంకటేష్‌ మీ హయాంలోనే శాసనసభ్యుడిగా ఉండటం ఎంతటి గౌరవమో కదా!
మిమ్మల్ని దించి మీ గద్దెనెక్కాలని తహతహలాడుతోన్న జగన్మోహనరెడ్డి వున్న పళాన రూ. 84 కోట్ల ముందస్తు పన్నును చెల్లించటం సామాన్యమైన గౌరవమా? మీ యంత్రాంగంలో మంత్రాగం నడిపే ఆయన బంధువొకరి రోజు ఆదాయం రెండు కోట్ల రూపాయలట! హతవిధీ, పాపం శమించుగాక!!
గతేడాది ధాన్యాన్ని కొనేదిక్కులేక రైతన్న విలవిలలాడుతుంటే అది రాష్ట్రానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కదా? రోశయ్యగారూ!
ఉల్లి రైతును ముంచుతోన్న బ్రోకరుగాళ్లకూ, వినియోగదారుడి జేబులు కొడుతోన్న దగుల్బాజీ దళారులకు భజన చేస్తోన్న మీ ప్రభుత్వం వలన ఈ రాష్ట్రానికి ఎంత గౌరవమో కదా?
చెరుకు రైతులకు గతేడాది బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవటం కొణిజేటి సారూ, ఎంత మర్యాదో మరి!?
కొనేదిక్కులేక శనగల్ని శీతలగిడ్డంగుల్లో పెట్టుకుని, ఎవడు కొంటాడా? ఎప్పుడు కొంటాడా? అని రైతన్నలు ఎదురు చూడటం అబ్బో ఎంత మర్యాదకరమైన అంశమో?
ఎన్నాళ్లకెన్నాళ్లకో సరిపడేంత వర్షాలు పడ్డాయని ఆనందడోలికల్లో మునిగిన అనంతపురం రైతన్నలకు చచ్చు పుచ్చు వేరుశనగ విత్తనాలను అంటగట్టిన ఆ జిల్లాకే చెందిన కె రఘువీరారెడ్డి మీ కొలువులో వ్యవసాయశాఖ వెలగబెట్టటం ఎంతటి మహద్భాగ్యమో?
రైతుల కోసం రాయితీ ధరల్లో కేంద్రం కేటాయించిన ఎరువుల్ని మీ తమ్ముడు, కీర్తిశేషుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి ఘనత వహించిన బావమరిది రవీంద్రనాథ్‌రెడ్డి పరిశ్రమలకు తరలించటం ఎంతటి గౌరవనీయమైన కార్యక్రమమోగదా?
పొలాలకు సాగునీరు అందుతుందో లేదోగానీ, కోకోకోలాకు నీటి సరఫరా చేసేందుకు మీరు కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకం కాదూ?
ఇక సూక్ష్మ రుణ సంస్థలు పన్నిన విషపు వలల్లో చిక్కి విలవిలలాడుతూ రోజుకు ఒకరో ఇద్దరో బలవన్మరాణాలను ఆహ్వానిస్తుంటే, ఒకరో ఇద్దరో కిడ్మాపులకు గురవతుంటే, పదో, పదిహేను కుటుంబాలో పారిపోతుంటే మీకూ, మీ కాబోయే ప్రధానమంత్రి రాహూల్జీకీ, వాళ్లమ్మ సోనియాకూ, వెరసి ఆంధ్రప్రదేశ్‌కూ ఎంతటి కీర్తోకదా!
పావలా వడ్డీతో మహిళామతల్లులందరినీ లక్షాధికారుల్ని చేస్తామంటూ 2009 ఎన్నికల సందర్భంగా కాంగ్రెసుపార్టీ చేసిన వాగ్దానం వికటించి ఆడోళ్లంతా లక్షల అప్పులకు అధిపతులు కావటం మీకూ, మీ పరివారానికీ ఎంతటి గౌరవమో ఎలా కీర్తించాలి!
కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆస్తుల్ని పరిశోధన పేరిట కార్పొరేట్‌ దిగ్గజానికి కట్టబెట్టటం కూడా రాష్ట్రానికి ఎనలేని గౌరవమే. కాదన్నవాడి మూతి పగలగొట్టాలి మరి! ఆ పరిశోధనాశాల ఫలితాలతో ఆంధ్రులంతా రాబోయే రోజుల్లో సర్వేజన సుఖినోభవంతన్న రీతిన బతకబోతున్నారుగదా మరి!

అయోడిన్‌ లోపం ఉంటే మరుగుజ్జులు

అక్టోబర్‌ 21ని ప్రపంచ అయోడిన్ ‌లోప వ్యాధుల దినంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రక్షణలో అయోడిన్‌ పాత్ర గురించి తెలుసుకుందాం…

అయోడిన్‌ ఒక మూలకం. ఉప్పు, కొన్ని కూరగాయలు, సముద్రం నుండి లభించే కొన్ని ఆహార పదార్థాలలో అయోడిన్‌ ఉంటుంది.

మన దేశంలో ప్రతి ఐదుగురులో ఒకరు ఏదో ఒక స్థాయి అయోడిన్‌ లోపంతో బాధపడుతున్నారు.

మనం గొంతుపై బంతి లాంటి గడ్డ ఉన్నవారిని చూస్తుంటాం. దీన్ని గాయిటర్‌ అంటారు. ఈ గడ్డకు కారణం అయోడిన్‌ లోపమే.

మనం సర్కస్‌ కంపెనీలలో మరుగుజ్జులను చూస్తుంటాం. తల్లికి గర్భధారణ సమయంలో అయోడిన్‌ లోపం ఉంటే మరుగుజ్జులు పుట్టవచ్చు.

గర్భవతులలో అయోడిన్‌ లోపం ఉంటే – పిల్లలు తెలివి తక్కువతో, చెవుడు, మూగ, మెల్లకన్ను సమస్యలతో పుట్టొచ్చు.

అయోడిన్‌ లోపముండే గర్భవతులలో గర్భస్రావాలు కూడా ఎక్కువ.

మన శారీరక, మానసిక ఎదుగుదల అయోడిన్‌పై ఆధారపడి ఉంటుంది.

మనకు రోజూ కావాల్సిన అయోడిన్‌ 150 మైక్రోగ్రాములు. అంటే గుండు సూది తలపై పెట్టేంత మాత్రమే. ఈ లెక్కన జీవితాంతం ఒక స్పూను అయితే సరిపోతుంది.

కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలలో అయోడిన్‌ లోపం ఎక్కువ.

ఇప్పుడు అయోడిన్‌ కలిపిన ఉప్పు ప్రతి చోటా లభిస్తోంది.

అయోడిన్‌ కలిపిన ఉప్పునే వాడండి. భావితరాలు చురుకుగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడండి.

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌

సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్

సామాజిక సేవతో పునీతుడవుతోన్న  ఓ వైద్య మిత్రుడు రాసిన ఈ రచనపై వైద్య మిత్రులు స్పందిస్తే ఉపయోగం.
1. కల్లు ఉప్పులో అయోడిన్ సహజంగా ఉంటుందా/
2. కల్లు ఉప్పు ఉపయోగం?
3. టేబుల్; సాల్ట్ పేరి పేరిత లభ్యమవుతోన్న ఉప్పు ఉపయోగము ఎంత? నస్టాలు ఉన్నాయా?
4. హిమాలయేతర ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పు వాడాల్సిన పని లేదా?
అందరూ స్పందించండీ
అయోడిన్ టేబుల్; సాల్ట్ లాభాల మూట