

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబరు అయిదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ మన దేశంలో పర్యటించనున్నారు. ఒబామా కనీసం రూ. 60 వేల కోట్ల విలువయిన మిలిటరీ, ఇతర పరికరాలను విక్రయించేందుకు వస్తున్నారు. మన దేశం ఇంకా పూర్తిగా తలుపులు తెరవని విద్యుత్తు, సాంకేతిక, చిల్లర వర్తకం, ఆరోగ్యం, బ్యాంకింగు, బీమా రంగాల్లో ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలని, రోడ్ల నిర్మాణాలకు భూసేకరణ సులభంగా జరిగేట్లు చూడాలని కూడా ఒబామా ఈ సందర్భంగా ఒత్తిడి చేయబోతున్నారు. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ రానున్న కొద్ది సంవత్సరాల్లో మన దేశానికి కనీసం రూ. 1. 50 లక్షల కోట్ల విలువగల విమానాలు, ఆయుధాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఒబామా పర్యటన సందర్భంగా సి-17 రకం మిలిటరీ రవాణా విమానాలను పదింటినైనా మనకు కట్టబెట్టాలని చూస్తోంది. బోయింగ్ మిలిటరీ విమానాలతో పాటు జనరల్ ఎలక్ట్రిక్ మిలిటరీ జెట్ విమాన ఇంజన్లు, గూఢచార, నిఘా విమానాలను కూడా అంటగట్టేందుకు చూస్తోంది. ఇప్పటి వరకూ పూర్వపు సోవియట్ తయారీ ఆయుధాలు, విడి భాగాలు మన మిలిటరీలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వాటి స్థానంలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని మన దేశం-అమెరికా మధ్య కుదిరిన రక్షణ, అణు ఒప్పందాలలో ఒక ముఖ్య అంశం. ఈ ఏడాది మన రక్షణ బడ్జెట్టు 1. 47 లక్షల కోట్ల రూపాయలు. ఈ మొత్తం ఏటా పది శాతం పెరగవచ్చని పరిశీలకుల అంచనా . దాంతో అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో ఆయుధాలను తయారు చేసే సంస్థలు ఎలాగైనా తమ ఉత్పత్తులను మనకు కట్టబెట్టాలని చూస్తున్నాయి. బోయింగ్ కంపెనీ తయారు చేసే గ్లోబ్మాస్టర్-3 విమానాలను భారత్కు విక్రయించవచ్చని అమెరికా పార్లమెంటు అనుమతించినట్లు ఆ దేశ రక్షణ సహకార సంస్థ ఏప్రిల్ 26న మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయానికి తెలిపింది. పది విమానాల విలువ 580 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ నిబంధనలకు భిన్నంగా ఉండే దేశాలకు తాము అణు సరఫరాలను చేయలేమని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల మన పార్లమెంటు ఆమోదించిన అణు ప్రమాద పరిహార బిల్లునుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని వేరే చెప్పనవసరం లేదు. ఈ చట్టాన్ని తిరగదోడాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఒబామా కూడా ఈ ప్రస్తావన చేయవచ్చని చెబుతున్నారు. అమెరికా సంస్థల
అవకాశాలను దెబ్బతీసే విధంగా ఫ్రాన్స్, జర్మనీ, రష్యన్ లాబీలు ప్రయత్నిస్తున్నాయని, భారత సర్కారుపై వాటి ప్రభావం పడకుండా చూడాలని ఒబామాకు ఇటీవల జియి కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జెఫ్ లిమెల్ట్ ఫిర్యాదు చేశారు. ఒకేసారి 126 జెట్ విమానాలను కొనుగోలు చేయాలని మన రక్షణశాఖ ప్రతిపాదించింది. అదే జరిగితే అంతర్జాతీయంగా గత పదిహేను సంవత్సరాల్లో ఇంత భారీ కొనుగోళ్లు జరిపిన దేశం మరొకటి ఉండదు.
యుఎస్కు రైల్వే ఔట్ సోర్సింగ్
మమత నిర్వాకం
రైల్వే పనులను అమెరికాకు ఔట్సోర్సింగ్ ఇచ్చేందుకు కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ సిద్ధపడ్డట్లు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన నేపథ్యంలో 20 వేల కోట్ల రూపాయల విలువైన ఔట్సోర్సింగ్ పనులను అప్పగిం చాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు అమెరికా పౌరులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకుఅనుగుణంగా ఆ దేశంలోని భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీల కాంట్రాక్టులను రద్దు చేయాలని ఒబామా నిర్ణయించిన నేపథ్యంలో మమత చేసిన ఈ నిర్ణయం వివాదాస్పదమౌతోంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. ఔట్సోర్సింగ్ ఒప్పందం చేసుకోవడమంటే లక్షలాది భారతీయుల ఉద్యోగావకాశాలను అమెరికాకు బలి చేయడమే అవుతుంది