Archive for అక్టోబర్ 22nd, 2010

కాలేజి కాలేజి భలె భలె బతికిన కాలేజి


అక్కినేని నాగేశ్వరరావు-సావిత్రి నటించిన ఆరాధన (1962) చిత్రంలో గిరిజతో కలిసి రేలంగి వెంకటరామయ్య ఈ పాడారనుకుంటాను. జంతు ప్రదర్శనశాలను చూస్తూ పాడుకుంటారు ఈ పాటను.
అన్నట్లు, బతికిన కాలేజి అంటే?!
నాకు ఈ పాట వింటే  మా నాయనమ్మ సీతమ్మ ఓ పెళ్లికి మొదట తిరుపతికీ, అటునుంచి అటే వాళ్లతోపాటు మదరాసు పర్యటనకూ వెళ్లిన నాటి సంగతులు గుర్తుకొస్తాయి.
చచ్చిన కాలోజి, బతికిన కాలోజి, పద్దనాబంగాడిని చూసొచ్చామని అడిగినోళ్లకూ, అడిగినోళ్లకూ తెగ చెప్పేది మా నాయనమ్మ.
అది విన్నవాళ్లంతా తెగబడి నవ్వేవాళ్లు. బాగా చిన్నవాడినే అయినా ఆ మాటలు నాకూ తెగ నవ్వు తెప్పించేవి. ఎన్నిసార్లు విన్నా విచిత్రంగా ఉండేవి ఆ సంగతులు.
బతికిన కాలేజి అంటే జంతు ప్రదర్శనశాల.
చచ్చిన కాలేజి అంటే మదరాసు వైద్య కళాశాల.
జంతు ప్రదర్శనశాలో అన్నీ బతికిన జంతువులు ూంటాయి కాబట్టి ఆరోజుల్లో దానిని అలా పిలిచేవాళ్లు. ఇప్పటిలా ఏడాదికి ఒకసారి ప్రదర్శన పెట్టటం కాకుండా ఆ రోజుల్లో మదరాసు వైద్యకళాశాలలో ఏరోజయినా ప్రదర్శన చూడొచ్చు. ఆ ప్రదర్శనలో అన్నీ చచ్చిన జంతువులు ఉండేవి. సీసాల్లో ఫార్మలిన్‌ ద్రవాన్ని పోసి అందులో చనిపోయిన జంతువులు, కీటకాలతోపాటు మానవ శరీరాల్నీ భద్రపరచి చూపించేవారు. పెద్ద శరీరాలయితే తొట్లలో పడుకోబెట్టి ఉండేవట. అదే పిల్లల్ని పెద్ద పెద్ద సీసాల్లోనే ప్రదర్శనకు పెట్టారు. పాములు, కప్పలు, సముద్ర జంతువులు, కీటకాలు ఇతర విచిత్రమయిన జీవుల్నీ ఈ ప్రదర్శనలో చూసే అవకాశం ఉండేది. పదిపదిహేను అడుగుల పొడవయిన చేప ఎముకల గూడు కూడా అక్కడ ఓ గది కప్పుకు వేలాడదీసి ఉందని మా నాయనమ్మ చెప్పినట్లు గుర్తు. దాంట్లో నుంచి బస్సు ప్రయాణించవచ్చని మా నాయనమ్మ తనే కనుక్కున్నంత ఆనందంగా అందిరికీ వివరించటం ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఇప్పుడు మదరాసు వైద్య కళాశాల ఉంది, ప్రదర్శనశాలా ఉంది. అయితే దాన్ని పర్యాటకుల కోసం రోజూ తెరవటం మాత్రం లేదు. ఎప్పుడో ఏడాదికి ఒకసారి మాత్రం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అనుమతిస్తున్నారట.
అదండీ చచ్చిన కాలేజి, బతికిన కాలేజి సంగతులు.
ఇక పద్దనాబం అనే తెలుగు సినీనటుడు పద్మనాభం సంగతి మా నాయనమ్మ మాటల్లోనే చదవండి మరి.
”బస్సు దిగి అందరిమీ బిలబిల లోపలికి వెళ్లామా! అక్కడ పేద్ద కుర్చీలో ఎద్దంత మనిషి పడుకుని ఉన్నాడబ్బాయి. ఆయనే పద్దనాబం అంట. ఒకొక్క కాలు నా లావునుంది మరి. బలే నవ్విచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. అన్నం తిన్నారా? అని కూడా అడిగాడు.” అంటూ ముగించేది మా నాయనమ్మ. తన మదరాసు పర్యటన విశేషాలతో పది పదిహేను రోజులపాటు సందడి చేసినట్లు గుర్తు.