Archive for అక్టోబర్ 26th, 2010

ఇదిగిదిగిదిగో ఇది రెవెన్యూ మంత్రి (అ)ధర్మాన మాయధార

రాష్ట్ర మంత్రుల్లో పలువురు మధుకోడాలున్నారని లోక్‌సభ గుంటూరు సభ్యుడు రాయపాటి సాంబశివరావు గోలగోల చేస్తే అదంతా ప్రత్యర్థుల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరని కొట్టేశారు కొందరు. అయితే పలువురు మాటేమోగానీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మాలు శృతి మించి రాగాన పడుతున్నాయి. తన కొడుకు రామ మనోహర్‌నాయుడుకు శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ఆవృత కన్నెధార గ్రానైట్‌ గనుల్ని కట్టబెట్టటం సక్రమమేనని చెప్పేందుకు ప్రభుత్వాన్ని ఆయన తెలివిగా సిద్ధం చేస్తున్నారు.
అసలు ఏమి జరిగిందో?
శ్రీకాకుళం జిల్లా సీతంపేట పరిధిలోని కన్నెధార కొండల్లో మనోహరనాయుడికి 38 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టటం వివాదస్పదమయింది. వాస్తవానికి ఈ భూమిని ప్రభుత్వం 501 మంది గిరిజనులకు పట్టాలిచ్చింది. అయితే వారికి భూమిని మాత్రం ఇంతవరకూ చూపలేదు.
మంత్రి కుమారుడికి గనులు ఇవ్వటం నేరమా?
గిరిజనులకు పట్టాలిచ్చిన సర్వే నంబరు 289లోనే గతేడాది మనోహర్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. దాంట్లో గ్రానైటు రాళ్లను తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే చట్టం అమలు కాలేదు.
ఒకటి
తొలుత గ్రానైటు తవ్వకాలకు అనుమతి ఇచ్చేముందే స్ధానికుల నుంచి అభిప్రాయం సేకరించాలి – ఆ పని జరగలేదు. పైగా ఆ ప్రాంత గిరిజనులంతా తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు.
రెండు
పంచాయతీ పాలకవర్గ తీర్మానం ప్రకారం ఆచరణకు దిగాలి. – పంచాయతీ అసలే ఏ తీర్మానమూ చేయలేదు.
మూడు
గనుల మంజూరు బహిరంగంగా సాగాలి. ప్రముఖ పత్రికలలో ప్రకటనలు జారీ చేయాలి. అదే విధంగా ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తారో వారికే అనుమతి ఇవ్వాలి. – కన్నెధార కొండను ధారాదత్తం చేసే విషయంలో అంతా గుట్టుగా సాగింది.
దీనికితోడు ఆ భూమిని ముందే గిరిజనులకు పట్టాలిచ్చిన విషయాన్ని ఆర్డీఓగానీ, తహశీలుదారు జారీ చేసిన పత్రాల్లో పేర్కొనలేదు. ఈ వ్యవహారం రచ్చకెక్కిన సమయంలో ఈ అధికారులు నిర్వహించిన విలేకరుల సమావేశాల్లోనూ వెల్లడించలేదు. వివరించలేదు. పైగా ఆ వ్యవహారం తనకు తెలియనే తెలియదని తహశీలుదారు బంకటం వృత్తి ధర్మం మాటెలాగున్నా బాధ్యతా రాహిత్యాన్ని పట్టి చూపుతోంది. దీనికిగాను ఆ తహశీలుదారును వాస్తవానికి ఇంటికి పంపించాలి.
సహజ నటశేఖర ధర్మాన
ఇంత జరిగిన తర్వాత నటశేఖరుడు ధర్మాన నటించకుండా ఉంటాడా? ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించి తన నిజాయితీని లోకానికి వెళ్లడించాలంటూ ఆయన ముఖ్యమంత్రి రోశయ్యకు ఉత్తరం రాసిపారేశారు.
తందాన తాన రోశయ్య
ఇక ఘనత వహించిన రోశయ్య సారు ఊరుకుంటారా? ఓ దర్యాప్తు సంఘాన్ని వేసిపారేశారు. ఎవరితోనో తెలుసా? ధర్మాన ఏరికోరిన వారితోనేనండోయ్‌! ధర్మాన వారినే ఎందుకు కోరుకున్నారంటే వాళ్లంతా ఆయన చాటుమాటుగా వేసిన మేత మేసినవాళ్లు. ఈ వ్యవహారంలో తప్పులు మీద తప్పులు చేసినవాళ్లు. తప్పులు చేసి కూడా ఏ తప్పూ చేయలేదని తిమ్మిని బమ్మిని చేయబూనుకున్నవాళ్లు.
ఎవరెవరు?
ఇంకెవరు?!
సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యులతో విచారణ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 50 రోజుల్లో నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టరు ఎన్‌ శ్రీకాంత్‌ ఆ సంఘాన్ని ఆదేశించారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారితోపాటు ఆర్‌డిఒ, భూగర్భ గనులశాఖ ఎడి, డివిజనల్‌ అటవీశాఖాధికారి, భూసర్వే రికార్డుల ఎడి, దేవాదాయశాఖ ఎడి సభ్యులుగా ఉన్నారు. తహశీల్దారు ఇచ్చిన అక్రమ అనుమతులకు మద్దతు తెలిపిన ఆర్‌డిఒ, భూగర్భ గనులశాఖ ఎడి దర్యాప్తు బృందంలో ఉన్నారు. తప్పులన్నీ ఒప్పులేనని ఆ ఇద్దరు అధికారులూ మొదటే పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందనీ ఆర్‌డిఓ ప్రకటించారు. గనుల కేటాయింపు వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనీ, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ నిత్యసత్యాలు వల్లెవేశారు. అందువలనే నిరభ్యంతర పత్రం ఇచ్చామని ఆయన లిఖితపూర్వకంగా తెలిపారు. తహశీల్దారు ఇచ్చిన నివేదిక ఆధారంగానే గనుల కేటాయింపుకు అంగీకరించామని గనులు – భూగర్భశాఖ సహాయ సంచాలకుడు ప్రకటించారు.
ఏమి జరగబోతోంది?!
ఇంకేమి జరుగుతుంది. ఎప్పటి మాదిరే. గప్‌చుప్‌. హూష్‌ కాకి. ఇప్పటిదాకా వాగిన వాగుడుకే అధికారులు కట్టుబడి గనుల అనుమతి సక్రమమేనని నివేదికిస్తారనడంలో సందేహంలేదు. పైగా అధికారులు నివేదికను తయారు చేసినా కలెక్టరుకు అందజేయటంలో ఏదో ఆలస్యం జరుగుతోంది. ఆ మతలబు ఏమిటో ఆ..ధర్మాన మహాశయుడికే తెలియాలి. లోగుట్టు ప్రజలకెరుగనుకోండి.