Archive for నవంబర్ 6th, 2010

బరాక్‌ ఇక చాలు వెనక్కు పోవోయ్‌! పో!! పో!!!

నేను మీ కంట్లో వేలు పెడతాను… మీరు నా నోట్లో వేలు పెట్టండి … ఇది అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటన అంతరంగం.

అందుకే కదా ఇలాంటివారిని గురించి మన తెలుగు పెద్దలు … మా ఇంటికొస్తూ ఏమి తెస్తావు? … మీ ఇంటికొస్తే ఏమిస్తావు? అంటారని ఎగతాళి చేశారు.

మా మూలుగుల్ని జుర్రుకోవటానికి వేంచేసిన బరాక్‌ ఇక చాలు వెనక్కు పో.

యథా రాజా తథా ప్రజ


ఏ అంశం చర్చకు వచ్చినా, యథా రాజా తథా ప్రజ అనేవాడు నా మిత్రుడొకడు. అదేందో అర్ధంకాక ఎవడన్నా దేభ్యపు మొహం పెట్టాడో! ఆ మాత్రం తెలీదా? అని ప్రశ్నిస్తూనే, వెధవ రాజుంటే ప్రజలు కూడా వెధవలే అవుతారు అంటూ మా మిత్రుడొకడు అర్ధం చెబుతుండేవాడు తమాషాగా. రాజును బట్టి ప్రజలా? ప్రజలను బట్టి రాజా? వాస్తవానికిదో పెద్ద చర్చనీయాంశమే. అమాయ ప్రజలు రాజును అనుసరిస్తూ ఉంటారంటారు కొందరు. రాచరికం మాటేమోగానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యస్ధాయిని బట్టి రాజు ఎంపికవుతాడు. కాబట్టి ఆ రాజు కూడా అదే స్థాయిలో ఉంటాడని విశ్లేషిస్తారు మరికొందరు.
ఈ చర్చోపచర్చల మాటేమోగానీ, మన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డీజీపీ అరవిందరావు ఆదేశాలను రాష్ట్ర రాజధాని ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. పాలకులకూ, ప్రజలకూ ఉన్న అంతరం ఎంతుందో ఈ వ్యవహారం మరోమారు పట్టి చూపింది. అధికారులకూ, ప్రజలకూ ఉన్న శతృవైఖరి ఏ తీరునుందో ఈ వ్యవహారం మరోమారు అద్దం పట్టింది. అసలు విషయానికొస్తే… ఈ వ్యవహారం దీపావళికి సంబంధించింది. మామూలుగా చూస్తే చిన్న విషయమూ, తరచి చూస్తే బోలెడంత పెద్ద విషయమూను.
రాత్రి 10 గంటల లోపే బాణాసంచా కాల్చటం పూర్తిచేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశాడు. దీనికి తోడు ఆసుపత్రులకు 100 అడుగుల లోపు మతాబుల్ని కాల్చకూడదని కూడా ఆదేశించాడు. ఆయన ఆదేశాలను తెలుగు వార్తా చానళ్లన్నీ పెద్ద పెట్టున ఠీవిగా ప్రచారం చేశాయి పాపం.
అయితే… డీజీపీ అయితే మాకేంటి, వాడెమ్మ మొగుడయితే మాకేంటి అన్నట్లు వ్యవహరించారు భాగ్యనగర వాసులు.
రాత్రి పది గంటలు ఎటో పోయింది. అర్ధరాత్రి 12 గంటలూ కరిగిపోయింది. ఒంటిగంట సమయాన్నీ గమనించలేదు. రెండు గంటల తర్వాత కూడా ఠమా, ఠమా అంటూ లక్ష్మీ బాంబులు, వంకాయ బాంబులు ఇంకా ఏమేమి బాంబులున్నాయో నాకు తెలియదుగానీ మోగుతూనే ఉన్నాయి నగరంలో దీపావళి రోజున. ప్రధాన వీధుల్లోనూ అదే పరిస్థితి. పోలీసు స్టేషన్ల ముందు, వెనుకా, పక్కనా, కూతవేటు దూరంలోనూ డీజీపీ ఆదేశాలు బేఖాతురు. ఆసుపత్రుల ఎదుటా, వెనుకా, పక్కనా అదే దుస్ధితి. డీజీపీ ఆదేశాల మాట దేవుడెరుగు కనీసం వాతావరణ కాలుష్యం, శబ్దకాలుష్యం ఘోష ఎవ్వరకీ పట్టలేదు. ఎవ్వరికీ కనీసం గుర్తున్న దాఖలాలు కూడా లేవు.
ఇక విఎస్‌టీ (వజీర్‌ సుల్తాన్‌ టుబాకోస్‌, అదేనండీ ఛార్మినార్‌ సిగిరెట్‌ తయారీ సంస్థ) సమీపంలోని రాంనగర్లో పరిస్ధితిని చూద్దాం.
రాంనగర్‌ చౌరాస్తాలోని ఓ మతాబుల దుకాణం కూడా రాత్రి రెండు గంటల వరకూ తెరిచే ఉంది. అప్పటిదాకా జోరుగా కాకపోయినా అడపాదడపా అమ్ముతూనే ఉన్నారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో, అప్పటికయ్యది అన్నట్లుగా ఇది వాస్తవానికి వస్త్ర దుకాణం. అయితే వినాయక చవితికి గణేశ విగ్రహాలు అమ్మారు. దీపావళికి బాణాసంచా అమ్మకాలకు పెట్టారు. బట్టలన్నింటీని పెట్టెల్లో సర్దేసి వీటిని అమ్మకానికి పెడుతున్నారు లెండి.
నిషేధాన్ని ఆవలబెట్టి రాంనగర్‌ గుండులోని ఆసుపత్రుల చుట్టూ కూడా మతాబుల్ని రాత్రంతా పేలుస్తూనే ఉన్నారు.
అక్కడే ఉన్న నల్లకుంట పోలీసుస్టేషను చుట్టూకూడా ఏ మాత్రం లెక్కాడొక్కా లేకుండా మతాబులు పేలాయి.  దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఉందేమో!
రాత్రి 11 గంటల వేళ. ఓ వృద్ధుడు పార్సీగుట్టరోడ్డులోకి మలుపు తిరిగాడు.  ఓ దుకాణదారుడు కాల్చిన బాంబు అతడికి సమీపంలోనే  పేలింది. ఆ వృద్ధుడు భయపడిపోయాడు. పక్కకు పరుగుదీశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ దుకాణం వాడిని నాలుగు తిట్టి వెళ్లిపోయాడు. ఇద్దరు యువతులూ అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. బాంబు పేలగానే చెవులు మూసుకుని పరుగులు తీశారు. భయం వారి మొఖాల్లో స్పష్టంగా కన్పించింది.
ఇదండీ రాంనగర్‌ పరిస్థితి. డీజీపీ ఆదేశాలు అమలు కానేలేదు పోలీసుల సాక్షిగా.
కాలుష్యం కాటు ప్రమాదకరమయిన స్ధితికి చేరుకున్నా ఎవ్వరికీ పట్టటం లేదు. డీజీపీ నామకా ప్రకటించిన ఆదేశాలు పాక్షిక నిషేధం ఒక్కశాతం కూడా అమలు కాలేదు.
చట్టాలు చేసి లాభమేమి? బహూశా వరకట్నం చిత్రంలో అనుకుంటాను ఎన్టీఆర్‌ సమాజాన్ని ప్రశ్నిస్తాడు. చట్టాల్ని ఆమోదించే పెద్దమనుషులే వాటిని అనుసరించని నేపథ్యంలో, చట్టాల్ని రూపొందించే అధికారులే  అవంటే లేకుండా వ్యవహరిస్తున్ననేపథ్యంలో, చట్టాలు అమలు కాకపోతే మొట్టికాయవేయాల్సిన న్యాయవ్యవస్థే గాడి తప్పిన దేశంలో దీర్ఘకాలిక నష్టాలపట్ల ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరికి శిక్షవేయాలి? ఈ తప్పులతో సంబంధమే లేని వారూ దానికి బలవటం ఎప్పటికి ఆగిపోతుందో?

కేంద్ర హోంమంత్రి చిదంబరం పేరిట రూ. 10 కోట్లకి కుచ్చుటోపి


డాయించిన పాధ్యాయుడు
జాగ్రత్తహో జగ్రత్త
కేంద్ర హోంమంత్రి పి చిదంబరంతో సన్నిహిత సంబంధాలున్న తన మిత్రుడు షరీఫ్‌ ముంబయి షేర్‌ మార్కెట్టులో ఉన్నాడని నమ్మబలికి రూ. 10.29 కోట్లు వసూలు చేసుకుని ఉపాధ్యాయుడు పరారయిన సంఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చలువాది రామకృష్ణ ఏడేళ్ల క్రితం మధిర పట్టణంలో ఓ ప్రయివేటు పాఠశాలను స్థాపించాడు. చదవకుండానే బిఎడ్‌ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తానని అక్కడ పలువురి నుంచి సొమ్ము వసూలు చేశాడు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు వెంటపడగా అక్కడ నుంచి మకాం ఎత్తేశాడు. అనంతరం తన నివాసాన్ని ఖమ్మం పట్టణానికి మార్చాడు. అక్కడ మళ్లీ మరో అవతారం ఎత్తాడు. తన స్నేహితుడు షరీఫ్‌ ఉన్నత హోదాలో ఉన్నాడంటూ ప్రచారం చేసుకున్నాడు. కేంద్ర గృహమంత్రి చిదంబరం పక్కనే కూర్చొన్న వ్యక్తి షరీఫేనంటూ వీడియోలనూ, ఫొటోలను చూపించి నమ్మబలికాడు. షరీఫ్‌కు లక్ష రూపాయలు చెల్లిస్తే పది లక్షల విలువయిన షేర్లనూ, కోటి రూపాయలు చెల్లిస్తే పది కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు వస్తాయని చెప్పి వసూళ్లకు దిగాడు. బోనకల్‌ మండలం రావినూతల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి వద్ద 80 లక్షలు, ఖమ్మం పట్టణానికి చెందిన కొంతమంది వ్యాపారుల వద్ద ఐదు కోట్ల రూపాయలు, చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామానికి ఓ వ్యాపారి, ఆయన బంధువుల నుంచి రూ. 2.50 కోట్లు ఖమ్మం పట్టణానికి చెందిన ఓ కానిస్టేబులు, అతని బంధువులు నుంచి రూ. 49 లక్షలు వసూలు చేశాడు. మధిర పట్టణానికి చెందిన ఓ బంగారపు దుకాణం యజమాని వద్ద కూడ 1.50 కోట్లు వసూలు చేశాడు. కేవలం ఏడాదిన్నర కాలంలో ఈ ఉపాధ్యాయుడు జిల్లా వ్యాప్తంగా 10.29 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు లెక్కలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది రోజుల క్రితం డబ్బులు చెల్లించిన వారంతా షేర్లు ఏవంటూ ఒత్తిడి చేశారు. దీంతో అందరి డబ్బులూ వచ్చాయనీ, మరుసటి రోజు చెల్లిస్తానని నమ్మబలికాడు. అయితే అదే రోజు రాత్రివేళ పరారయ్యాడు. మరుసటి రోజు బాధితులంతా ఖమ్మం చర్చి కాంపౌండ్‌లోని అతని ఇంటికి వచ్చారు. తాళం వేసి ఉండడంతో చేసేది లేక వెనుదిరిగారు. మోసగాడు రామకృష్ణ ఖమ్మం గ్రామీణ మండలం తల్లంపాడు ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాలేదు. అతను రాకపోవడం వల్ల విద్యార్థులంతా వెనుకబడిపోతున్నారని మూడు నెలల క్రితం విద్యాశాఖాధికారులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ డిఈఓ స్వయంగా రెండు నెలల క్రితం పాఠశాలకు కూడా వచ్చి వాస్తవాలు తెలుసుకున్నారు. అయినా విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయుడిపై చర్చలేమీ తీసుకోలేదుగానీ, కోట్ల రూపాయలతో పరారయ్యేందుకు మాత్రం వీలు కల్పించారు. ఈ తరహా మోసాలు జరగని రోజు లేదు. జరగని ప్రాంతం లేదు. అతి ఆశే దీనికి ప్రధాన కారణం. దీనికితోడు మన పాలకులు పెద్ద పెద్ద కుంభకోణాలకు పాల్పడి సిగ్గూ ఎగ్గూ లేకుండా తిరుగుతోన్న నేపథ్యంలో కోటి, పది కోట్ల కుంభకోణాలకు పాల్పడిన చిన్న దొంగలను ఎవరేమి చేయగలరులెండి. అయినా మనం మోసం పోకూడదు కదా. మనకు మనం నిత్యం జాగ్రత్తగా ఉందాం. దొంగలంజా కొడుకులు అడుగడుగునా మసలే లోకం ఇది.