Archive for నవంబర్ 9th, 2010

మిగిలింది ‘బూడిదే’! వికాసం లేని ప్రకాశం వార్త

  • కుళ్లిపోయిన కాయలు
  • నష్టాల్లో గుమ్మడి రైతు

గత సంవత్సరం వచ్చిన లాభాలను చూసి ఈ ఏడాది కూడా బూడిద గుమ్మడిని  సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం గుమ్మడి కాయలను కొనుగోలు చేసే నాథుడే  లేడు. దీనికితోడు నిల్వ చేసే అవకాశం లేకపోవటం వల్ల కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. లాభం కాదు కదా పెట్టుబడిలో ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల కాలంలో తమిళనాడులో ఉదయాన్నే దుకాణదారులు  బూడిద గుమ్మడి కాయతో దిష్టి తీయటం సంప్రదాయం. మన రాష్ట్రంలో శుభకార్యాలకు కొబ్బరికాయ కొట్టినట్లు అక్కడ ప్రతి కార్యక్రమాన్ని బూడిద గుమ్మడితో ప్రారంభిస్తారు. అంతేకాకుండా బూడిద గుమ్మడి కాయ జ్యూస్‌కు తమిళనాడులో  గిరాకీ ఉంది. చెన్నై మార్కెట్‌లో బూడిద గుమ్మడికి సాధారణంగా గిట్టుబాటు ధర పలుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో  తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లొ గుమ్మడిని సాగు చేస్తారు.

గత సంవత్సరం టన్ను గుమ్మడి కాయల ధర రూ. 12 వేల నుండి రూ. 15 వేల వరకు పలికింది. అంటే కిలో గుమ్మడికాయ 15 రూపాయల ధర పలి కింది.  గుమ్మడికాయ కిలో నుండి 10 కిలోల వరకు  ఉంటుంది. ఎకరాకు 15 టన్నుల గుమ్మడికాయల దిగుబడి వస్తుంది. గత సంవత్సరం మార్కెట్‌లో గుమ్మడికి మంచి గిరాకీ ఉండటం, టన్ను 15 వేల రూపాయలు పలకటంతో ఈ సంవత్సరం ప్రకాశం జిల్లా అద్దంకి  ప్రాంతంలో  రైతులు బూడిద గుమ్మడి సాగు చేశారు. అద్దంకి, బల్లికురవ, ముప్పవరం, మురికిపూడిలో   గుమ్మడిని సాగుచేశారు. బల్లికురవ మండలంలోని ఒక రైతు 150 ఎకరాల్లో  సాగు చేశారు. అయితే మంచి దిగుబడి వచ్చినా, మార్కెట్‌లో ధర లేకపోవటం, నిల్వ చేసే అవకాశం లేకపోవటం వల్ల  తీవ్రంగా నష్టపోతున్నారు. అద్దంకిలోని నర్రావారిపాలెంకు చెందిన మెరసాల లక్ష్మయ్య అనే రైతు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఈ బూడిద గుమ్మడి సాగు చేశాడు. ఎకరాకు  ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. దిగుబడి బాగానే వచ్చింది. అయితే మార్కెట్‌ బలహీనంగా ఉంది. కిలో మూడు రూపాయలు  మాత్రమే పలుకుతోంది. అదీ అడిగిన వాళ్లు లేరు. అప్పటికీ అమ్మటానికి చెన్నై, విశాఖపట్నం మార్కెట్‌లను విచారించినా అడిగే దిక్కేలేరని రైతు లక్ష్మయ్య చెప్పారు. చేసేది లేక కాయలను అద్దంకి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ఉంచారు. వారం రోజులు గడిచేసరికి అవి కాస్తా కుళ్లటం ప్రారంభించాయి. వ్యవసాయ అధికారుల సలహా మేరకు కుళ్లిపోకుండా  రసాయనం పిచికారీ చేసినా ఫలితం కనపడటం లేదు. ఇప్పటికి సగానికి పైగానే కాయలు కుళ్లిపోయాయని రైతు తెలిపారు. మిగతావి కూడా మిగులుతాయన్న ఆశ లేదన్నారు. మొదట వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు  విత్తనాలు నాటామని అవి సరిగా మొలకెత్తక పోవటంతో మళ్లీ విత్తనాలు కొని నాటామని చెప్పారు. 10 ఎకరాలకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినా ఒక్క పైసా కూడా తిరిగి వచ్చే పరిస్థితి కానరావటం లేదని రైతు లక్ష్మయ్య వాపోయాడు.

56వ వసంతంలోకి కమల్‌హాసన్‌

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆదివారం ఆయన చెన్నైలో తన పుట్టినరోజు జరుపుకున్నారు. ‘తమిళ చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలు నలుదిశలా వ్యాపించాయీ అంటే దానికి కారణం కమల్‌హాసన్‌. లెజండ్‌ ఆర్టిస్ట్‌కు మీరు నిజమైన ఉదాహరణ. ఉత్తమోత్తమ నటనకు మీరు ప్రామాణికం. నటుడిగా  మీరు మరిన్ని సినిమాలు చేయాలి’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తన సందేశంలో తెలిపారు. కమల్‌ తన పుట్టినరోజు సందర్భంగా పలువురికి ఆర్థిక సహాయం చేశారు. ఆటోరిక్షా డ్రైవర్లకు యూనిఫా0‌, ఆర్థికంగా వెనకబడిన మహిళలకు కుట్టుమిషన్లు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌టాపులు అందజేశారు.

కమల్‌హాసన్‌ చిత్ర పరిశ్రమకి వచ్చి 50 సంవత్సరాలపైనే అవుతోంది. అర్థ శతాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా కొన్ని నెలల క్రితం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా న్యూఢిల్లీలో ఆయన చిత్రాల ప్రదర్శన కూడా ఏర్పాటుచేసింది. 1982లో ‘మూంద్రామ్‌ పిరారు’ అనే తమిళ చిత్రంలోని కమల్‌ నటనకు మొదటిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఆ తర్వాత మరో మూడు చిత్రాలకు ఉత్తమ నటుడి అవార్డుకు దక్కించుకున్నారు. దేశంలోని వివిధ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో కమల్‌ నటించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మరుచిపోలేని ఆణిముత్యాల్లాంటి సినిమాలు చేశారు. పలు విభాగాల్లో ఆయన నైపుణ్యం ప్రదర్శించారు. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌  ప్రారంభించి, అనేక చిత్రాలు తీశారు. ప్రస్తుతం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన్మధన్‌ అంబు’లో నటిస్తున్నారు. సత్యమే శివం కమలహసన్ ఉత్తమ చిత్రాలలో అగ్రభాగాన నిలుస్తుంది.