Archive for జనవరి 11th, 2011

వినుడు వినుడు మంత్రి బొత్స లీలలు

మంత్రి తలచుకుంటే కబ్జాలకూ, రహదారుల నిర్మాణానికీ కొదవేముందని విజయనగరం జిల్లా గాజులరేగవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం పట్టణానికి ఆనుకుని ఉన్న గాజులరేగ పంచాయతీ పరిధిలో నిర్మిస్తోన్న సత్య ఇంజినీరింగు కళాశాల మీదుగా రూ.80 లక్షల వ్యయంతో తారు రోడ్డు పనులు రెండు రోజుల్లో శరవేగంగా పూర్తయ్యాయి. ఈ కళాశాల ఎదురుగా ఉన్న పొన్నావారి చెరువుకు (సర్వే నంబరు 35/4) సంబంధించిన 3.36 ఎకరాల స్థలాన్ని మంత్రి బొత్స గతేడాది ఆక్రమించిన విషయం విదితమే. బొత్స కబ్జాలను నిరసిస్తూ గత మే, జూన్‌ నెలల్లో సిపిఎం, సిపిఐ, టిడిపి ఆధ్వర్యాన ఆందోళనలు జరిగాయి. అప్పట్లో మండల, జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ చెరువు ప్రభుత్వానిదేనని తేల్చారు. తమ వద్ద పురాతన కాలంనాటి యాజమాన్య పత్రాలున్నాయని బొత్స కుటుంబీకులు అప్పట్లో బుకాయించారు. అయితే ఇప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం అధికారులకు ఇవ్వలేదు. తమకు ఏ పత్రాలూ అందలేదని ఆర్డీవో ఎస్‌ ఢిల్లీరావు కూడా ధృవీకరించారు.
రెండురోజుల్లోనే రోడ్డు పనులు


పదేళ్ల నుంచీ గాజులరేగవాసులు తమ గ్రామానికి రహదారిని నిర్మించాలని మండల, జిల్లా అధికారులకూ, అధినేతలనూ కలిసి పలు వినతిపత్రాలు సమర్పించారు. ఆ స్థలం కబ్జా చేసిన వెంటనే పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న బొత్స తన కళాశాల పక్క నుంచి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించుకున్నారని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఇంజినీరింగు కళాశాలను ఈ ఏడాది ప్రారంభించనున్న నేపథ్యంలో గాజులరేగ నుంచి జాతీయరహదారి మీదుగా రూ.80 లక్షలతో ఈ నెల 7-8 తేదీల్లో తారు రోడ్డును నిర్మించారు. అయితే గాజులరేగ నివాసుల కోరికమేరకే రూ.80 లక్షలతో రోడ్డు నిర్మిస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ ఇఇ రఘుబాబు వివరించటం విశేషం.

కంప్యూటర్‌ ముందు 4 గంటలకు మించి ఉంటే హృద్రోగ ప్రమాదం రెట్టింపు


కంప్యూటరు ముందుగానీ, టీవీ ముందుగానీ రోజులో నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం గడిపితే హృదయ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం రెట్టింపయ్యే అవకాశం ఉందని ఒక పరిశోధనలో వెల్లడయింది. దీనికితోడు ఆయుస్సు క్షీణించే ప్రమాదముందని కూడా పరిశోధకులు తేల్చారు. రోజులో నాలుగు గంటలకుపైగా కంప్యూటర్లు, టివిల ముందు గడిపే వారిపై లండను విశ్వవిద్యాలయంలో పరిశోధన నిర్వహించారు. ఆ పరిశోధనలో నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటరు, టివిల ముందు గడిపే వారిలో అత్యధికులు హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడయింది. రోజుకు రెండు గంటలు, అంతకంటే తక్కువగా కంప్యూటర్లు, టివిల ముందు గడిపే వాళ్లలో కంటే నాలుగు గంటల సమయం గడిపే వాళ్లే ఎక్కువ మంది హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. వ్యాయామం చేసినా నష్టాన్ని పూడ్చుకోలేమని పరిశోధకులు వెల్లడించారు. దీనివలన కళ్ల మంటలు, జీర్ణకోశ వ్యాధులు కూడా రావచ్చని తేలింది. హృద్రోగాలు రాకుండా కాపాడే జీవక్రియ ఎంజైమ్‌ లైపోప్రోటీన్‌ లైపేజ్‌ విడుదల 90 శాతం తగ్గిపోయినట్లు పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధనకు లండన్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఇమాన్యుయెల్‌ స్టమటకిస్‌ నేతృత్వం వహించారు. స్క్రీన్ల ముందు ఎవరైతే లెక్కలేనంత సమయం గడుపుతారో అలాంటి వాళ్లలో చాలామంది హృదయ సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశాలు ఎక్కువ” అని ఇమాన్యుయేల్‌ వివరించారు. కంప్యూటర్‌ ముందు ఎక్కువ సమయం పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకొకసారి విరామం తీసుకోవాలని సూచించారు. ఆ సందర్భంగానే కొంత నడిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు సోకటానికి కేవలం కొవ్వు పదార్థాలు అధికంగా తినటం, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, సిగరెట్లు తాగడం, వ్యాయామం చేయకపోవడమే కారణాలు కాదని వివరిస్తూ, టివి చూడడం కూడా ఒక ప్రధాన కారణమని ఇమాన్యుయేల్‌ వివరించారు.