దోష నివారణ దేవుడిగా పేరున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అవినీతి పడగ విప్పి నాట్యమాడుతోంది. ఈ ఆలయంలో నిత్యం సర్పదోష నివారణ పూజలు జరుగుతుంటాయి. తనను కష్టాల నుంచి కడతేర్చాలని గతవారం కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా స్వయంగా ఇక్కడకు వచ్చి దోష నివారణ పూజ చేయించారు. ఈ పూజల వ్యవహారంలో సంబంధిత ఉన్నతాధికారులు కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడుతున్నారు. దోష నివారణ పూజల్లో నాగపడగను వినియోగిస్తారు. ఈ నాగపడగల సరఫరాను వాస్తవంగా టెండర్ల ద్వారా ఖరారు చేయాలి. అయితే ఆలయ అధికారి ఈ విధానాన్ని 2009 నవంబరు నుంచీ పక్కనబెట్టి గుత్తేదారు కిషోరు నుంచి నామినేషను పద్ధతిన నాగపడగలను కొనుగోలు చేస్తున్నారు. ఆనాటి నుంచీ 2011 జనవరి వరకు ఈ వ్యవహారంలో రూ. 1.50 కోట్ల కుంభకోణం జరిగినట్టు లెక్కలు విన్పిస్తున్నాయి. దీనికితోడు తామరపూలు, నెయ్యిదీపాలు, తుమ్మెదపూలు, టెంకాయలు సరఫరాలోనూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి.
రాహూకేతు పూజలని కూడా పిలిచే సర్పదోష నివారణ పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో రోజుకు సగటున 2,500దాకా జరుగుతుంటాయి. ఆదివారం, సోమవారాల్లో మూడువేల మంది పైనే ఈ పూజల్ని చేయించుకుంటారు. ఈ పూజలకు దాని విధానాన్నిబట్టి రూ. 250, రూ. 600, రూ. 1000, రూ. 1500 చొప్పున వసూలు చేస్తారు. రూ. 1000, రూ. 1500 చెల్లించిన వారికి పది గ్రాముల వెండి నాగపడగలను ఉచితంగా అందజేస్తారు. రూ. 250, రూ. 600 విలువయిన పూజలు చేయించినవారికి ఐదు గ్రాముల వెండి పడగలను ఇస్తారు. ఈ లెక్కన నెలకు సరాసరిన 250 కిలోల వెండి అవసరం.
వెండి కొనుగోళ్లలో కమీషను
రోజుకు ఎనిమిది కిలోల చొప్పున ప్రస్తుత చెన్నయ్ బులియన్ మార్కెట్టు ధర ప్రకారం ఏడాదికి వెండి కోసం 13 కోట్ల రూపాయలను ఆలయం వెచ్చిస్తున్నది. కిలో వెండికి మూడువేల రూపాయల చొప్పున చెన్నయి వ్యాపారులు కమీషను కింద ముట్టజెప్పటం కద్దు. అంటే మూడు వేల కిలోలకు ఏడాదికి 90 లక్షల రూపాయలు కమీషను రూపంలో కొనుగోలుదారులకు అందుతుంది. ఈ కమీషను సొమ్ములో అత్యధికం గుత్తేదారు ద్వారా అధికారుల ఖాతాలకు చేరుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
తరుగులో లాభం
రోజుకు ఎనిమిది కిలోల వెండి కొనుగోలుకుగాను 200 గ్రాముల చొప్పున తరుగు కింద వ్యాపారులు తీసేస్తారు. ఈ లెక్కన రోజుకు రూ. 8,600 చొప్పున, ఏడాదికి రూ. 31 లక్షలు జమపడుతుంది. ఇలా ఏడాదికి కమీషను, తరుగు కలిపి రూ. 1.21 కోట్ల సొమ్ము గుత్తేదారుకు దక్కుతుంది. దీనిని బట్టి టెండర్లకు బదులు నామినేషను పద్ధతి పాటించటం ప్రారంభించిన గత 15 నెలల కాలంలో 1.50 కోట్ల రూపాయలను ూన్నతాధికారులు, గుత్తేదారు కలిసి అప్పన్నంగా భోంచేసినట్లే.
సొంత వెండి నిల్వలతోనే నాగపడగల తయారీకి అవకాశం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు అందజేసిన వెండి 17 వేల కిలోలదాకా నిల్వ ఉంది. ఇది ప్రస్తుత వినియోగం ప్రకారం చూస్తే ఆరేళ్లకు సరిపోతుంది. ఈ నిల్వలను వినియోగించి నాగ పడగలు తయారు చేయిస్తే భక్తులకు నాణ్యమయిన వెండిని సరసమయిన ధరలోనే అందించే వీలుంది. అయితే 2,500 కిలోల వెండిని మాత్రమే కరిగించేందుకు దేవాదాయశాఖ కమిషనరు అనుమతి ఇచ్చారు. వెండిని కరిగించే పనిని కూడా నాగపడగలు సరఫరా చేసే గుత్తేదారుకే అధికారులు అప్పగించారు. దీంతో ఈ వ్యవహారంలోనూ లక్షలాది రూపాయలు చేతులు మారే ప్రమాదం ఉందని భక్తుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది
26 జన
Posted by ramesh on జనవరి 27, 2011 at 4:57 సా.
Good information. Thank you for sharing.
All Hindu Temples must be freed-up from the stranglehold of corrupt Government.
It is a wonder, how the Secular Constitution of India allow the corrupt Government and its stooges (Bureaucrats) to control, manage and loot Hindu Temples?
When appointing Minister, officials to manage Hindu Temples, no Hindus (Hindu Community) were consulted by corrupt Governments.
Even the anti-Hindu CM like YSR was looted Hindu Temples openly. No protest voices were hear from Caste politicians (MPs, MLAs and Ministers), Hindu Leaders, or Hindu Community.
Posted by కృష్ణశ్రీ on జనవరి 30, 2011 at 5:36 సా.
భక్తులు కేవలం అందోళన చెందడంతో యేమి జరుగుతుంది?
వీళ్లు కూడా సంఘాలు పెట్టుకొని, కొన్నాళ్లు ఆ ఆలయాలని బహిష్కరిస్తే, అప్పుడు దిగొస్తారేమో–ఆ దేవుళ్లు!
ఆలోచించండి.
Posted by తెలుగిల్లు on జనవరి 31, 2011 at 6:07 ఉద.
క్రిష్ణశ్రీ గారూ,
మీ సూచన చాలా బాగుంది. భక్తులు సంఘాలు పెట్టుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది.