సావుల పేక్టరీని ఆపాల్సిందే

జనాలు చస్తున్నా పేక్టరీ ఆపరేమి? ఈ బూములు వాళ్లమ్మా బాబు గడించారా! మగాళ్లను జైల్లో పెట్టారు. మా పెసిడెంటుని అడ్రసు లేకుండా సేశారు. పోలీసులు రాక్షసుల్లా మారారు. వాళ్ల దెబ్బలకు, తూటాలకు మగాళ్లు హాస్పటల్లో కుళ్లిపోతున్నారు. కూడుపెట్టే వాళ్లు లేకుండా పిల్లలతో మేమెలా బతకాల. కలెక్టర్‌ని, ఎస్పీని సస్పెండు సేయాలి.’
-ఇది ఆకాశ లఖవరం మహిళల ఆక్రందన.

వాళ్ల బతుకేదో వాళ్లది. అత్యధికులు కటిక పేదలు. పైగా నిరక్షరాస్యులు. మంచయినా, చెడయినా అంతా తమ కర్మ అని సరిపెట్టుకునే తత్వం వారిది. అలాంటి వ్యవసాయ కార్మిక మహిళలు శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పోలీసు తూటాలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా, మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం ఆపేది లేదని ఎందుకు ప్రతిన బూనుతున్నారు? తెలుగిల్లు పరిశీలనలో పలు విస్మయకర అంశాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్‌కు చెందిన ఈస్టు కోస్టు ఎనర్జీ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ రూ.11,075 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం కాకరాపల్లిలో థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 660 మెగావాట్ల మొదటి యూనిట్‌ ఈ ఏడాది నవంబరుకూ, అంతే సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ 2012 మార్చినాటికీ పూర్తవుతుందని భావిస్తున్నారు. మూడో యూనిట్‌ను 2013 జూన్‌ నాటికీ, నాలుగో యూనిట్‌ను 2013 డిసెంబరుకు పూర్తి చేసేందుకూ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టు ప్రారంభానికి ముందే సాగిలపడిన సాగు
ప్రాజెక్టు ఏర్పాటుకుగాను ఎపిఐఐసి నుంచి 2,450 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. ఈ భూములను వాటి తీరును బట్టి తంపర, పర, చిత్తడి భూములని వర్గీకరించారు. ఈ భూముల్లో నిత్యం నీరు నిలువ ఉంటుంది. ఆ నీటిలో చేపలు పెరుగుతాయి. ఏపుగా బరుసు గడ్డి పెరుగుతుంది. ఈ గడ్డిని పూరిళ్ల కప్పుకు వినియోగిస్తారు. సాగుకు యోగ్యమైన భూముల్లో వరి తదితర పైర్లను రైతులు సాగుచేస్తున్నారు. ఇక్కడ నీటి ఎద్దడి లేకపోవటంతో వ్యవసాయం లాభసాటిగానే ఉంది. వంశధార నీరు ఇక్కడ నుంచే సముద్రంలోకి ప్రవేశిస్తుంది. గరీబులగెడ్డ, దేశగెడ్డ, సందమ్మగెడ్డ తదితర వాగుల నీరు ఈ భూముల మీదుగా ప్రవహిస్తూ సముద్రానికి చేరుతుంది. విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఈ చిత్తడి నేలల్లోనే నిర్మాణం అవుతున్నందున మట్టితో మెరక వేశారు. నీటి మళ్లింపునకు పిల్ల కాలువను తవ్వించారు. దీనివలన నీరు సముద్రంలోకి పోకుండా లోతట్టు పొలాల్లో నిల్వ చేరుతోంది. ఫలితంగా పరిసరాల్లోని 30 గ్రామాలకు చెందిన 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. గత డిసెంబరులో ఐదు సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఈ పొలాల్లో వారం రోజులపాటు నీరు నిలువ ఉండిపోయింది. అందువల్ల పొట్టబోసుకున్న ధాన్యం తడిసి రంగుమారింది. గడ్డి కుళ్లిపోవటంతో పశువులు కనీసం వాసన కూడా చూడటం లేదు. తడిసిన ధాన్యం బస్తాకు రూ.200 కూడా ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని వడ్డితాండ్ర, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులకు సంబంధించి యాజమాన్య నివేదిక విశేషాలు ఇవీ
విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వలన 23 గ్రామాలపై అధిక ప్రభావం ఉంటుందని యాజమాన్యం తన నివేదికలో పొందుపరిచింది. ఈ గ్రామాల్లో 31,434 మంది జనాభా ఉన్నారని పేర్కొంది. వారిలో 55.8 శాతం మందిని అక్షరాస్యులుగా పేర్కొన్నారు. వారి ప్రధాన వృత్తి వ్యవసాయమని నివేదించారు. వారంతా పుట్టుక రీత్యా మత్స్యకారులని కూడా పొందుపరిచారు.
విద్యుదుత్పత్తి ప్రారంభమైతే అంతా బూడిదే
పచ్చని వరి పొలాలు. పూతతో కళకళలాడుతున్న జీడిమామిడి తోటలు. వాటికి ఆనుకుని మొగలి పువ్వులు. ఇలా పచ్చదనానికీ, పర్యావరణానికీ చిరునామాలా కాకరాపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆకాశలఖవరం, సీరపువానిపేట తదితర ప్రాంతాలు కనిపించాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన జీరు నాగేశ్వరరావు (45), సీరపు ఎర్రయ్య (28) పోలీసు కాల్పులకు బలయ్యారు. ఆకాశ లఖవరం జనాభా రెండు వేలు కాగా, సీరపువానిపాలెం జనాభా 450. ఇక్కడ ఎవరిని కదిపినా ఇప్పటిదాకా తమకు ఇంత కూడు పెట్టిన పచ్చని ప్రాంతమంతా కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బూడిదే మిగులుతుందని ఆవేదన చెందారు.
విశాఖ థర్మల్‌ ప్రాంతాన్ని చూసిన కాకరాపల్లి ప్రాంత వాసులు
విశాఖలో ఎన్‌టిపిసికి చెందిన వెయ్యి మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉంది. అక్కడి గాలిలో, నీటిలో, నేల మీదా అంతా బూడిదే కనపడుతుంది. లక్షల సంవత్సరాలుగా భూమిలో నిక్షిప్తమైన బొగ్గును మండించినప్పుడు దాని నుంచి పాదరసం, కాడ్మియం, ఆర్సినిక్‌, యురేనియం, థోరియం తదితర రేడియో ధార్మిక రసాయనాలు వెలువడతాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్థారించిన సత్యం. ఈ రసాయనాలు గర్భిణులపై ప్రభావం చూపుతున్నాయని కూడా పరిశోధనల్లో రుజువైనట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కాకరాపల్లి ఐదు రెట్లు అధికం
కాకరాపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే బూడిద నిల్వ కోసం 520 ఎకరాలు కేటాయించారు. వెయ్యి మెగావాట్ల విశాఖ ప్రాజెక్టు వలనే భరించలేని కాలుష్యం ఏర్పడుతుండగా, దానికి ఐదు రెట్లు పెద్దదయిన కాకరాపల్లి ప్రాజెక్టు ఎంత ప్రమాదమో? ప్రజలకు ఎవరో చెప్పాల్సిన పనేముంది! పైగా విశాఖ ప్రాజెక్టు ఉన్న పరవాడ పరిసర ప్రాంతాలకు కూడా ఈ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వెళ్లి చూసి వచ్చారు. అక్కడి బోర్ల నీటిలో కూడా బూడిద కన్పించిందని పలువురు వివరించారు. పైగా పరవాడలో సాగుకు వీలులేకుండా పొలాలన్నీ నాశనమయ్యాయని కూడా తెలిపారు. అందువలనే తమ ప్రాంతం మరో పరవాడ కాకూడదని కాకరాపల్లి ప్రాంతవాసులు ప్రాణాలకు తెగించి మరీ తిరగబడుతున్నారు.
నోటికాడ కూడు నీటిపాలైంది
‘పేక్టరీ గట్టు ఎత్తుగా కట్టడం వల్ల సముద్రంలోకి నీరెళ్లక మా ఊళ్లో 1500 ఎకరాల వరి పొలం ముంపుబారిన పడింది. గడ్డంతా ముక్కిపోయింది. ఈ ధాన్యం చూడండి ఎంత నల్లగా ఉన్నాయో! గొడ్లు కూడా వాసన చూడని ఈ వడ్లను మనుషులెవరయినా తింటారా? గడ్డిలేక బక్కలు (పశువులు) అమ్మేశాం. పరవాడ వెళ్లి థర్మల్‌ పేక్టరీ చూసొచ్చాం. అక్కడంతా బూడిదే. నీళ్లు కూడా తాగడానికి పనికి రావడం లేదు. అందుకే మా కాడ పేక్టరీ వద్దనుకుంటున్నాం. వాళ్లకు అనుగుణంగా మాట్లాడేవారితో బూటంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పుడు మళ్లీ నిర్వహించాలి’ అని ఆకాశ లఖవరానికి చెందిన పరమట లక్ష్మణ తదితర పలువురు యువకులు ఘంటాపథంగా కోరారు.
తేరుకోని బాధిత కుటుంబాలు
పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను చూసిన వారికెవరకయినా కడుపు తరుక్కు పోవలసిందే. కాల్పుల్లో మృతి చెందిన ఆకాశలఖవరానికి చెందిన జీరు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రులు పార్థసారధి, బత్స సత్యనారాయణను మృతుడి పదేళ్ల కుమార్తె భవాని ఛీకొట్టింది. ‘నా తండ్రి పేనాలు తీసిన ప్లాంటును ఆపాలి. మీరు డబ్బులిస్తే మా నాన్న తిరిగొస్తాడా? మాకు దిక్కెవరు? ఆస్పత్రిలో ఉన్న వాళ్ల నాన్న చచ్చిపోతే వాళ్లకు దిక్కెవరు? అంటూ నిలదీసింది.
పట్టించుకోని ప్రభుత్వం
ఇక మహిళల పరిస్థితి మరింత దీనంగా ఉంది. ఆకాశ లఖవరానికి చెందిన ధనలక్ష్మి భర్త రాజు చావుబతుకుల మధ్య విశాఖలోని సెవెన్‌హిల్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను తెచ్చే కూలితోనే ఆ కుటుంబం నడిచేది. ధనలక్ష్మి తన మూడు నెలల చిన్నారితో భర్త మళ్లీ తిరిగొస్తాడో? రాడోనన్న ఆందోళనతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నని కూడా ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.
పోలీసు నిర్బంధంలో గ్రామాలు
వేలకొద్దీ పోలీసుల్ని దింపి గ్రామంలోకి సరుకుల్ని రాకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆకాశ లఖవరం, సీరపువానిపేట మహిళలు మండిపడుతున్నారు. ఆకాశలఖవరం గ్రామానికి కూరగాయలు, పాలు, పత్రికలు కూడా రాకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని తెలిపారు. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు వస్తున్న స్థానిక సంప్రదాయ వైద్యుడు బి.శ్రీనివాసరావును పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే చాలు మగవాళ్లను అరెస్టు చేస్తున్నారని తెలిపారు. దానివలన ఆదాయం కోల్పోయిన కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని చెప్పారు. ‘ఈళ్ల పేక్టరీ కోసం మేము సావాలా! అదేనా నాయం?’ అంటూ ఆకాశలఖవరం, సీరపువానిపేట తదితర ప్రాంతాల్లోని మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పేక్టరీ యాజమాన్యం అందరికీ నష్టపరిహారం చెల్లించిందన్న ప్రచారంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు పైసా కూడా ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు.
ఇంత చేసినా ఉద్యోగాలు వెయ్యే!
థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం వలన వచ్చే ఉద్యోగాలు 700 మాత్రమే. 2000 మంది నుంచి 2500 మందికి నిర్మాణ పనుల వలన తాత్కాలికంగా ూపాధి కలుగుతుంది. యాజమాన్యం నివేదికలో వివరించినట్లుగా భద్రత, ఉద్యాన వన అభివృద్ధి తదితర రంగాల్లో మరో 200 మంది నుంచి 300 మందికి ూపాధి లభించినా మొత్తం సంఖ్య 900 మంది నుంచి వెయ్యి మంది లోపే. అవి కూడా ఆయా రంగాల్లో అనుభవమూ, విద్యార్హతా ఉన్న వారికే లభిస్తాయి. అందులోనూ స్ధానికుల్లో అత్యధికులు నిరక్షరాస్యులే. అందువల్ల ఆ ఉద్యోగాలూ ఇతర ప్రాంతాల వారికే దక్కుతాయి. ఆ పాటి దానికి తమ భవితను బుగ్గిపాలుచేసుకునేందుకు ఎవ్వరయినా ఒప్పుకుంటారా? ఈ విషయాన్ని ప్రభుత్వమే తేల్చి చెప్పాలి. ఈ నేపథ్యమే ఆ ప్రాంత ప్రజలు తిరగబడేందుకు దోహదం చేస్తోంది.

3 వ్యాఖ్యలు

  1. ఏమని వాఖ్యానించాలి. మన కళ్ళముందరే జరుగుతున్న ఈ ఘోర కలిని ఏమని వాఖ్యానించాలి. మానవత్వం విలువలు అవిరై డబ్బుమదమెక్కిన బాబులు చేసే వికృత పాపాన్ని ఏమని వాఖ్యానించాలి. మావోలెందుకు పుట్టుకొస్తారో పచ్చిగా ఉదహరించే ఈ సంఘటనపై ఏమని వాఖ్యానించాలి. ఇలా జరగటం వెనుక మన పాత్ర ఏంటో గ్రహించే తెలివిని ప్రసాదించమని వేడుకోవడం తప్ప ఏమని వాఖ్యానించాలి. తెలంగాణ కోసం 20 కోట్ల ఖర్చుతో శ్రీకృష్ణ కమిటీలను వేసిన అప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను పరిశీలించడానికి 40 కోట్లతొ కమిటీలు వేయమనా… ఏమని వాఖ్యానించాలి.

    ప్రవక్తలెందరొచ్చినా లోకం తీరు మారలేదు – మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు. నిజమే పలికితివి ఓ శ్రేయోభిలాశి అందెశ్రీ.

    స్పందించండి

  2. వ్యాఖ్యానించకపోతే మూసుకుని కూర్చోండి, మిమ్మల్ని ఎవడు వ్యాఖ్యానించమని బ్రతిమాలాడు?

    స్పందించండి

  3. మంచి వివరాలు అందించారు.ధన్యవాదాలు.
    ప్రజల పక్షాన నిలబడి రాసే పోస్ట్స్ విషయం లోనైనా వ్యాఖ్యలు అనుమతించడం పట్ల శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను…
    లేకపోతే విషయం పలచనై పక్క దోవలు పడుతుంది.

    స్పందించండి

Leave a reply to మహిశ్రీ స్పందనను రద్దుచేయి