Archive for మార్చి 10th, 2011

రెచ్చగొట్టబడిన జనం లక్ష్యం లేకుండా విడిచిన బాణం ఒకటే


రెచ్చగొట్టబడిన జనానికి ఇంగిత జ్ఞానం తక్కువ. అలాంటి వాళ్లు లక్ష్యం లేకుండా విడిచిన బాణాల్లాంటివాళ్లు. ఎదుటివాళ్లను చంపమంటూ రెచ్చిగొట్టినవాళ్లు కూడా వారి చేతుల్లో చచ్చే ప్రమాదం ఉంది. అంతటి ప్రమాదాన్ని రాష్ట్రంలో కాంగ్రెసు పెంచి పోషిస్తోంది. పాలకులుగా తమ తప్పిదాలు ప్రజలు గుర్తించకుండా వారిని దారి తప్పించటం కాంగ్రెసుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ మాటకొస్తే పాలకుల లక్షణాల్లో అదొకటనుకోండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కారణమయిన కాంగ్రెసు, అసలు కారణాలను ప్రజలు గుర్తించకుండా వాళ్లూ అందులో భాగస్వాములవుతున్నట్లు నటించటం కాంగ్రెసు నీతి – రీతి. మిలియన్‌ మార్చ్‌ పేరిట తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి గురువారం (10 మార్చి 2011) హైదరాబాదులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఇదే తీరు వెల్లడయింది. రెచ్చిపోయిన జనం తొలుత కాంగ్రెసు నాయకులకు ఘనంగా సన్మానించారు. తర్వాత సహజంగానే దారి తప్పి వ్యవహరించారు. కందుకూరి వీరేశలింగం, శ్రీశ్రీ, పింగళి వెంకయ్య, శ్రీకృష్ణదేవరాయలు, త్రిపురనేని రామస్వామి చౌదరి, మొల్ల, ఎర్రాప్రెగ్గడ, అన్నమయ్యలకు కూడా ప్రాంతీయం అంటగట్టి ట్యాంక్‌బండ్‌ మీదున్న వారి విగ్రహాల ధ్వంసానికి పూనుకున్నారు. అంతటితో పోనీయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి సంస్థల యాజమానులు కోస్తావాసులంటూ ఆ సంస్థలకు చెందిన ఓబీ వ్యాన్లను తగలబెట్టారు. విలేకరుల కెమెరాలను ధ్వంసం చేశారు. ఆంధ్రబ్యాంకు ఏటీఎంపై కూడా దాడి చేశారు. తర్వాత సహజంగానే పోలీసులతోనూ తలపడ్డారు. ఇదంతా అనుకోకుండా రెచ్చిపోయిన యువకుల కార్యకలాపాలు కావు. రోజుల తరబడీ రెచ్చగొట్టబడినవారి సహజమయిన చేష్టలు. విగ్రహాల ధ్వంస రచననూ, మీడియాపై దాడినీ వ్యతిరేకించేవారు చేయవలసింది ఆ పనులు చేసిన వారిని కాదు. ఆ పని చేయించేందుకు పురిగొల్పిన అంశాలు ఏమిటని ఎంచి చూడాలి. పురిగొల్పిన వారిని వెలికితీసి వారి రీతినీ, నీతినీ ప్రజల ముందుంచాలి. దీనికి మీడియానే ప్రధానంగా పూనుకోవాలి. ఈ వ్యవహారం ఒక్కసారితోనో, ఒకరోజులోనో పూర్తయ్యేది కాదు. సుదీర్ఘంగా సాగించవలసిన కార్యక్రమం.

పండ్లు, కూరగాయల్లో దండిగా పురుగు మందుల వ్యర్థాలు

ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించాల్సిన పండ్లు, కూరగాయలు ఇప్పుడు భిన్నమైన బహూమతుల్ని మనకు అందజేస్తున్నాయి. కూరగాయలు, పండ్లలో కాలేయాన్ని కాటేసే విషాలు ూన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. కేన్సర్‌, గుండె జబ్బులు కలిగించే విషపూరిత రసాయనాలు దండిగా ఉన్నట్లు వెల్లడయింది. దేశ రాజధాని ఢిల్లీలో అమ్ముడవుతోన్న కూరగాయల్లో ఎలుకల్ని చంపేందుకు వినియోగించే విషం సహా, నాలుగురకాల నిషేధిత విష వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో లాభాల కోసం ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే వ్యాపారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ విషపదార్థాల కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు తేల్చారు. తలనొప్పి, నలత, ఆహారం అరగని సమస్య, సంతాన లేమి తదితర రుగ్మతలు కూడా సోకుతున్నాయట. పొలాల్లో ఉండగా అటు రైతులూ, కోత అనంతరం వ్యాపారులు పంట త్వరగా రావడానికీ, ఫలదీకరణకూ, రంగు కోసం ఉపయోగించే క్రిమిసంహారకాలు, విషపూరిత రంగులు ఇలా మనుషుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి కూడా ఈ వ్యర్థాలు కారణమవుతున్నాయని కూడా గుర్తించారు. అదనపు సాలిసిటర్‌ జనరల్‌ ఎఎస్‌ చందోక్‌ నేతృత్వంలో ఆరుగురు న్యాయవాదులు, ఇద్దరు ఎన్‌జిఓ ప్రతినిధులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసిన కోర్టు రానున్న ఐదు వారాల్లో వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది. దేశంలో పండ్లు, కూరగాయల్లో యూరోపియన్‌ ప్రమాణాలకంటే 750 రెట్లు అధికంగా క్రిమిసంహారక మందులు, విషపూరిత రసాయనాలు ఉంటున్నాయని ఢిల్లీకి చెందిన ఎన్‌జిఓ సంస్థ ‘వినియోగదారుల గొంతుక’ గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన పరిశీలనలో వెల్లడయింది.

కెకె, యాష్కీలకు ప్రజా సన్మానం


తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 10 మార్చి 2011 తేదీన నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమానికి తగుదునమ్మా అంటూ హాజరయిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, లోక్‌సభ నిజామాబాద్‌ సభ్యుడు మధుయాష్కీకి యువకులు తగిన శాస్తి చేశారు. ఏనుగు అంబారీమీద ఊరేగే రాజు లెక్కన తన కారెక్కి చేతులూపుకుంటూ ట్యాంకు బండకు వస్తోన్న కెకెపై తెలంగాణవాదులు దాడి చేశారు. చెప్పులు, నీళ్ల సీసాలను విసిరి నిరసన తెలిపారు. వెనక్కు పోవాలంటూ నినదిస్తున్నా అంబారీ దిగపోగా, చేతులతో విన్యాసాలు చేయటం తట్టుకోలేనికొందరు యువకులు కెకె వాహనాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేశారు. అంతకంతకూ పెరుగుతోన్న నిరసనకారులనూ, వారి దాడికీ తట్టుకోలేక తొలుత చల్లగా వాహనం లోపలకు జారుకున్న కెకె అక్కడ నుంచి పలాయనం చిత్తగించాడు. బతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. తెలంగాణ మంటల్లో చలిగాచుకుంటున్న మధుయాష్కీకి కూడా తెలంగాణవాదులు తగిన బుద్ధి చెప్పారు. ఆయనను పిడిగుద్దులతో సత్కరించారు. కోపం పట్టలేక కొందరు మీదపడి బట్టలు చించివేశారు. వెంటబడి తరిమారు. ఆ సమయంలో పోలీసులు తమ రక్షక్‌ వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయారు. తెలంగాణ వెనకబాటుకు ప్రధాన కారణమయిన కాంగ్రెసు నేతలు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు వేసే నాటకాలను అందరూ కాకపోయినా కొందరయినా గుర్తించిన ఫలితమే కెకె, యాష్కీలకు జరిగిన శాస్తి. దీనికితోడు తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రెసే అయినా దానిని పక్కనబెట్టి తామూ పోరాడుతున్నట్లు నాటకమాడుతోన్న నేతలకు పిడిగుద్దుల సన్మానం పూర్తిగా సమర్థనీయమే. పదవులు సహా ప్రజల సొమ్ములతో అన్ని సౌకర్యాలనూ అనుభవిస్తో అవసరానికి ‘జై బోలో తెలంగాణ’ పాట పాడుతోన్న నేతలకు వాస్తవానికి ఆ మాత్రం సన్మానం బహూ చిన్నది. తెలంగాణను నిజంగా కాంక్షించే నేతలయితే, ఇవ్వాల్సిన తమ అధినేతల్ని నిలదీయాలి. వారు కాదని తిరస్కరిస్తే, ఆ పార్టీకీ, తమ పదవులకూ రాజీనామా చేసి పోరాడాలి. ఈ ప్రభుద్ధులు తమ పదవుల్ని వదులుకోరు, తెలంగాణ ఇస్తారా? ఛస్తారా? అని ఏనాడూ నిలదీసిన పాపానపోరు. పైగా తెలంగాణ రాకుండా సీమాంధ్రులు కుట్రపన్నుతున్నారంటూ తరచూ వాగటం మాత్రం ఆపరు. తాము తెలంగాణ కోరుకున్నట్టే ఎదుటి వాళ్లు సమైక్యత కోరుకోవచ్చన్న ఇంగిత జ్ఞానం స్వయం ప్రకటిత నేతలకు లేదు. ప్రజల మనోభావాలు అంటూ తరచూ వాగే ఈ నేతలకు పెరిగే ధరలతో ఆ ప్రజలు పడే ఈతి బాధలు మాత్రం ఏనాడూ గుర్తుకురావు. తామూ, తమ పరివారం అవినీతి కారణంగా ప్రజలకు కనీస సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందటం లేదని తెలిసి కూడా కించిత్తు బాధపడరు. తమ కారణంగానే బాధలనుభవిస్తోన్న జనాలను వాస్తవమేదో ఆలోచించకుండా తప్పుదోవ పట్టించి సొమ్ముచేసుకుంటున్నారీ నేతలు. కొత్త రాష్ట్రంలోనూ తమ పెత్తనాలను కొనసాగించేందుకు ఎత్తుగడలు వేస్తోన్న నేతలందరికి కూడా కెకె, యాష్కీలకు జరిపిన సన్మానాన్నే తగురీతిన త్వరలో జరగాలని తెలుగిల్లు హృదయపూర్వకంగా కాంక్షిస్తోంది.