Archive for మార్చి 25th, 2011

మళ్లీ నిరుద్యోగ లోకంలోకి….

అవును, నేను మరోమారు నిరుద్యోగ లోకంలోకి దూకాను. 2011 మార్చి 15న నేను పనిచేస్తోన్న సంస్థతో బంధుత్వం తెంచుకున్నాను. ఆ సంస్థలో 2010 సెప్టెంబరులో రెండోమారు చేరాను. మొదటిసారి 2001 ఫిబ్రవరిలో ఒంగోలు కేంద్రంలో చేరిన నేను దాదాపు ఎనిమిదన్నరేళ్లపాటు అందులో పనిచేశాను. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌లో సేవలమ్ముకున్నాను. ఆ సంస్థలో కొందరి సహచరుల పని విధానం నచ్చక బయటపడ్డాను. అనంతరం ఆంధ్రజ్యోతిలో సీనియర్‌ సబ్‌ఎడిటర్‌గా ఆరు నెలలపాటు పనిచేశాను. మా టీవీలో న్యూస్‌ కో-ఆర్డినేటర్‌గా అవకాశం వచ్చింది. ఓ ఏడాది గడిచిందో లేదో మళ్లీ నాకు బతుకు గండం ఏర్పడింది. మాటీవీ యాజమాన్య భాగస్వామి చిరంజీవి రాజకీయాల్లో చేరటంతో వార్తా విభాగానికి చావొచ్చిపడింది. అందులో భాగస్వాములయిన అక్కినేని నాగార్జున, మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌కు కాంగ్రెసుపార్టీతో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా చిరంజీవికి అనుకూల వార్తల్ని ప్రసారం చేయటం వారికి ఇబ్బందిగా మారింది. దీంతో వార్తల విభాగం గొంతు నొక్కేసి ఉద్యోగుల్ని వీధులపాలు చేశారు. అలా సరళీకృత విధానాలకు నేను కూడా బలయ్యాను. ప్రజారాజ్యం పాడుగానూ అంటూ ఆనాడు సిబ్బంది పెట్టిన శాపాలు రెండేళ్లకు ప్రాణం పోసుకున్నట్లుంది. చావు పేగు మెడలో వేసుకుని పుట్టిన ప్రజారాజ్యం తనకు తానే ఉరేసుకుని ఉసురు తీసుకుంది. తర్వాత కొంతకాలం యథావిథిగా నిరుద్యోగం. కొందరు మిత్రుల ప్రభావంతో రెండోమారు నా మాతృ సంస్థ అనదగిన ఆ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేరాను. వాస్తవానికి పూలమ్మిన చోటే కట్టెలమ్మేందుకు సిద్ధపడ్డాను. అది నా గొప్పతనమూ కాదు, చేతగాని తనం అంతకన్నా కాదు. మార్క్సిజం నాపై చూపించిన ప్రభావంరీత్యా మనస్సును అదుపులో పెట్టుకున్నాను. మా టీవీలో నేను తీసుకున్న జీతంలో మూడో వంతు తీసుకుంటూ పనిచేశాను. అదే సంస్థలో మొఫిసిల్‌ డెస్క్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన నేను అదే విభాగంలో సాధారణ ఉప సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. అయితే సంతృప్తిగా పనిచేయని మాట వాస్తవం. కారణాలు మాత్రం జీతమూ కాదు, బాధ్యతలూ కాదు. ఏ పనిచేసినా, ఎక్కడ చేసినా ప్రథమ స్థానంలో ఉండాలనేది నా విధానం. మేమిచ్చిన పనేదో చేసిపోతే చాలు అన్న రీతిన నా పనిపై ఆంక్షలు విధించిన ఫలితంగా ఏర్పడిన అసంతృప్తి అది. అక్కడ కేవలం ఇతరుల ఆదేశాలను పాటించటమే నా పని. ఆదేశాలు అంటే ఏదో నా కన్నా మెరుగ్గా పని చేయగలిగినవాళ్లో, బాధ్యతలరీత్యానన్నా ఉన్నతులో ఇస్తే అమలు చేసేవాడినేమోగానీ, దారినబోయే దానయ్యల పెత్తనాన్ని సహించలేకపోయాను. నా కన్నా సబ్‌ జూనియర్లు, పొట్టగోస్తే అక్షరం ముక్కరాని ఉప సంపాతకులు, అర్ధవంతంగా ఒక్క వాక్యాన్ని రాయలేని కలం వీరుల వికటాట్టహాసాలను చెవిలో వేసుకోవటం కనాకష్టమయింది. దీనికితోడు నన్ను పనిదొంగగా చిత్రించేందుకు ప్రయత్నం ప్రారంభమయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాయటం సాధ్యం కాదు. రాయటమూ అనవసరమే. అయితే నేను పనిచేసే విభాగం బాధ్యుడు నాతో మాట్లాడిన తీరును బ్లాగ్మిత్రులకు వివరించటం అవసరమని అనుకుంటున్నాను. దయచేససి ఇక్కడ మారుపేర్లు రాసేందుకు అనుమతివ్వండి.
రాజ్‌కుమార్‌ : నా సెలవు రోజయిన శుక్రవారం రాత్రి 9 గంటలకు ఫోను చేశారు.
నేను : చెప్పండి!
రాకు : ఫలానా జిల్లా నుంచి ఫలానా ఫలానా స్పెషల్‌ స్టోరీలు రెండు వచ్చాయటగదా?
నేను : ఒక్కటి మాత్రమే నాకు తెలుసు. అది అసమగ్రంగా ఉన్నందున వెనక్కి పంపాను. ఏమేమి అదనపు సమాచారం కావాలో వాళ్లకు వివరించాను సార్‌. రెండో స్టోరీ విషయం నాకు తెలియదు.
రాకు : మీరడిగిన సమాచారాన్ని అరగంటలోనే వాళ్లు పంపారట. దాన్ని జయారెడ్డి మీ ఫోల్డర్‌లో వేసి మీకు చెప్పారట కదా?
నేను : లేదండీ, ఇప్పటివరకూ నాకా విషయం తెలియదు.
రాకు : లేదండీ, మీకు చెప్పారట.
నేను : సార్‌, ఇద్దరే ఉన్నచోట వాళ్లు మాట్లాడుకున్నారో? లేదో? మాట్లాడుకున్నా ఏమి మాట్లాడుకున్నారో? సాక్ష్యం ఎక్కడ దొరుకుతుందండీ?
రాకు : లేదు, లేదండీ, సుబ్బారావుగారూ! ఆయన చెప్పకుండా, చెప్పానని చెప్పడండీ.
నేను : సరేనండీ, అతనిపట్ల మీకు అంత నమ్మకం ఉంటే, ఉండనీయండి. కానీ నేను ఈ సంస్థకు పనికొస్తానో? లేదో? తేల్చి చెబితే నాకు మంచిది.
రాకు : అంతెందుకు లెండి. రేపు సమావేశం వేసుకుని చర్చించుకుందాం.
ఇదీ మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ. నాకు అర్ధం అయినదాన్నిబట్టి పని ఉన్నా , నేను కావాలనే చేయకుండా తప్పుకు తిరుగుతున్నానని ఆయన ఆరోపిస్తున్నట్లు భావించాను. రెండోది సమావేశాలతో ఏదీ తేలదని నా పూర్వ అనుభవం. కాకపోతే అలాంటి సమావేశాల్లో చేయని తప్పును నాతో ఒప్పించే పని జరగవచ్చు. అందువలన అన్నింటికీ తలొంచి అక్కడ పనిచేయటమా? తలొంచికుని బయటకు నడవటమా? అన్న రెండు అవకాశాలే నాకు కన్పించాయి. తలొంచి బతకటం నేను నేర్చుకోని ఓ మంచి పని. ఇక మిగిలిన పని తలొంచుకుని బద్దెనను గుర్తుచేసుకోవటమే. అన్నట్లు సుమతీ శతకకారుడు బద్దెన, మిడిమేలపు కొలువుగొలిచేకన్నా మడి దున్నుకు బతకవచ్చు మహిలో సుమతి అన్నాడు కదా.
మడి దున్నగలనో? లేదోగానీ ముందు కొలువును వీడి రాజధానిలో వీధినపడ్డాను.