Archive for మే, 2011

‘గాలి’ ఇల్లంతా బంగారం

కర్నాటక గనుల వివాదంలో దేశ వ్యాపితంగా ప్రచారం పొందిన గాలి సోదరుల్లో ఒకరైన కర్నాటక పర్యాటక, మౌలిక సదుపాయాల మంత్రి గాలి జనార్ధనరెడ్డి కూర్చొనే కుర్చీ విలువ ఊహకే అందనిదిగా ఉంది. పూర్తిగా బంగారంతో చేసిన రూ.2.2 కోట్ల విలువైన కుర్చీలో గాలి ఆశీనులవుతారు. పూజకు ఉపయోగించే దేవతా విగ్రహాల విలువ రూ.2.58 కోట్లు. ఇక ఆయన ధరించే బెల్టు ఖరీదే రూ.13.15 లక్షలు. ఆయన ఇంటిలో ఏ వస్తువును ముట్టుకున్నా ధగ ధగ మెరిసే బంగారమే. గ్లాసులు, పళ్లాలు గిన్నెలు, స్పూన్లు, ఫోర్కులు తదితరాలన్నిటి విలువ రూ.20.87 లక్షలు. ఇతరులెవరో చెప్పిన మాటలు కావివి. కర్నాటక లోకాయుక్తకు 2010జూన్‌లో సమర్పించిన నివేదికలో గాలి జనార్థన్‌ రెడ్డి ఈ వివరాలను సమర్పించారు. మూడు పేజీలకు నిండిపోయిన వజ్రవైఢూర్యాల ఆభరణాల చిట్టా కోట్ల విలువ చేస్తుంది. బంగారు గాజులకు కొదవే లేదు. ఇక వజ్రాలు పొదిగిన నెక్లెస్‌లు, చెవిదుద్దులు, పురుషులు ధరించే ఆభరణాలు చేతి ఉంగరాలు, దేవతల విగ్రహాలు అన్నీ బంగారంతో చేసినవే. ఇక వెండి వస్తువుల సంగతి కొస్తే టేబులు మీద అమరికకు, పూజకు ఉపయోగించే వెండి వస్తువుల విలువ లక్షల్లో ఉంటుంది. గృహోపకరణాలు, ఫర్నిచర్‌ విలువ కూడా లక్షల్లో ఉంది. వ్యవసాయ భూమి, భవనాలు, పూర్వీకుల ఆస్తులు కాక జనార్ధనరెడ్ది పేరిట ఉన్న ఆస్తి విలువ రూ. 153.49 కోట్లు. వ్యాపారాల రూపంలో లభించే ఆదాయం రూ. 18.30 కోట్లు కాగా జీతభత్యాల రూపంలో రూ. 31.54కోట్లు లభిస్తున్నట్లు గాలి చూపారు.

కుంభకోణాల భారతం

2జి స్పెక్ట్రం(సెల్‌ఫోన్‌ తరంగాలు)కు సంబంధించి 1.76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం పార్లమెంట్‌ను స్తంభింపచేసింది. విచారణకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని మొత్తం పార్లమెంట్‌ శీతకాలపు సమావేశాలను పాలకపక్షం మినహా మిగతా పక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి స్తంభింపజేశాయి. తిరిగి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సంద ర్భంగా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయ డానికి అంగీకరించింది ప్రభుత్వం. సంస్క రణల అనంతరం భారతదేశంలో లక్షల కోట్ల రూపాయల్లో కుంభకోణాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల్లో కుంభకోణాలపై చర్చ జరుగుతున్నది. కుంభకోణాలు విచారణకు రాకుండా పాలకవర్గాలు వక్రమార్గం పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కామన్‌వెల్త్‌ ఆటల సందర్భంగానూ, కార్గిల్‌ మృతవీరుల కుటుం బాల కోసం చేపట్టిన ఆదర్శ్‌ విల్లాల నిర్మాణం లోనూ, ఎస్‌ బాండ్‌ (ధ్వని తరంగాల) వేెలం పాటల సందర్భంగా కుంభకోణాలు జరిగినట్లు దేశ వ్యాపితంగా చర్చ సాగుతున్నది. చివరకు ఐపిఎల్‌ క్రికెట్‌ పోటీల్లో కూడా కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. వామపక్ష పాలిత రాష్ట్రా ల్లో మినహా మిగిలిన రాష్ట్రాల్లో వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచుస్తున్నాయి. జార్ఖండ్‌ మంత్రి మధుకోడా గనుల కుంభకోణంలో ప్రస్తుతం జైల్లో ఉండి విచారణ ఎదుర్కొంటు న్నాడు. మధుకోడా లాంటి వారు ప్రతి రాష్ట్రం లో పాలకవర్గంలో కొనసాగుతున్నారు.

కుంభకోణాలు చోటుచేసుకోడానికిగల ఆర్థిక, రాజకీయ పరిస్థితులు పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమై ఉన్నాయి. అందులో సంస్కరణలు వచ్చిన తరువాత కుంభకోణాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం, ఆరోగ్యశ్రీ, ఇర్రిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు, రహదారుల నిర్మాణం, ఔటర్‌ రింగురోడ్డు నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మా ణం, భూసేకరణ సందర్భంగా కుంభకోణాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలలో ప్రముఖుల పాత్ర, సహకార బ్యాంకులలో వందలకోట్ల డిపాజిట్లు కాజేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిం చిన రాయితీ పథకాల్లో నగంగా సాగుతున్న కుంభకోణాలు…. వీటి బాధ్యుల్లో అత్యధిక శాతం పాలకపక్షంలోనే కొనసాగుతున్నారు. కుంభకోణాలతో వేలకోట్లు ఆర్జించి వ్యాపారాలు వెలగబెట్టడంతో బాటు రాజకీయ రంగంలో కూడా ఎన్నికవుతున్నారు. వీరిపై ఎలాంటి అనర్హతా పడడం లేదు.

మనదేశంలో కుంభకోణాల చరిత్ర ఈనాటిది కాదు. ఆంగ్లేయుల కాలంలో జరిగిన అవినీతి కార్యక్రమాలకు బ్రిటీష్‌ పార్లమెంటు చర్చించి బాధ్యులను శిక్షించిన ఘటనలు చరిత్రలో చూశాం. కాని 1947 స్వాతంత్య్రా నంతరం జరిగిన కుంభకోణాలు పాలక వర్గాల కనుసన్నలలో జరిగినవే. నేడు క్రోనీ క్యాపిటలిజం కొనసాగుతున్నది. అందువల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ నడకే ఒక పెద్ద కుంభకోణంగా మారి పోయింది.

చరిత్ర

1957లో ”ముంద్రా” కుంభకోణం నెహ్రూ హయాంలోనే బయట పడింది. ముంద్రా అన్న పెద్ద మనిషి విద్యుత్‌ పరికరాల వ్యాపారి. అతని ఆస్తి రూ 1 కోటీ 50 లక్షలు కాగా అప్పులు 5 కోట్ల 25 లక్షలు. అతను తన అప్పులు తీర్చు కోడానికి తన కంపెనీలో వాటా షేర్లను జీవిత భీమాసంస్థ కోనుగోలు చేసేట్లూ, ప్రతిగా తనకు కోటి రూపాయలు అప్పు ఇచ్చేట్లూ నాటి జీవిత భీమా సంస్థ ఛైర్మన్‌ జిఆర్‌ కామత్‌తోనూ, ఆర్థిక మంత్రి టి. కృష్టమాచార్యులుతోనూ కుమ్మకై కుంభకోణానికి పాల్పడ్డారు. ఫిరోజ్‌గాంధీ ఈ కుంభకోణాన్ని బయటకు లాగి పార్లమెంట్‌ను ఆశ్చర్యం – ఆందోళనలో ముంచెత్తారు. ఈ అవకతవకలను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్‌ వారికి విరాళం ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అప్పుడు ప్రారంభమైంది భారతదేశంలో కుంభ కోణాల పర్వం.

తరువాత 1971 మే 24 తేదీన నగర్వాల ఉదంతం (కుంభకోణం) పెద్ద సంచలనం రేపిం ది. ఇందిరా గాంధీ హయాంలో ఢిల్లీలో పార్ల మెంట్‌ వీధిలోని స్టేట్‌బ్యాంకు బ్రాంచీలో పని చేస్తున్న క్యాషియరు నగర్వాలాకు పరిచయమైన ప్రధాని ఇందిరాగాంధీ గొంతు లాగా రూ.60 లక్షలు కోరినట్లు ఫోన్‌ వచ్చింది. కొరియరు వచ్చి డబ్బు తీసుకొని, ప్రధాని ఇంటికి వెళ్ళి రశీదు తీసుకొమ్మన్నాడు. నగర్వాలా ప్రధాని ఇంటికి వెళితే ఆమె పార్లమెంట్‌కి వెళ్ళిందన్నారు. ప్రధాని కార్యదర్శి మేము ఫోన్‌ చేయలేదని రశీదు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నగర్వాలాను అరెస్టు చేశారు. రూ. 6 వేలు తప్ప మిగతా పైకం అంతా స్వాధీనం చేసుకు న్నారు. కేసు అంగీకరించిన నగర్వాలాకు నాలు గు సంవత్సరాల జైలు శిక్షపడింది. కేసు పునర్వి చారణ జరుగుతుండగా నగర్వాలా గుండె జబ్బుతో మరణించారు. ఒక క్యాషియర్‌ గతంలో ఎలాంటి సంబంధం లేకుండా ఇంత డబ్బు ఏలా ఇవ్వగలిగాడు అన్న విషయం పార్లమెంటు లో చర్చకు వచ్చింది. కాని తరువాత కేసు మూసివేయబడింది.

జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును తిరిగి విచారించడానికి జస్టిస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని నియమించారు. ఫోన్‌ కాల్‌ మీద 60 లక్షల సొమ్మును ఒక సామాన్య క్యాషియర్‌ ఇస్తారా? అలా ఇచ్చాడు అంటే గతంలో ఈ విధంగా ఎన్ని సార్లు ఇచ్చాడు. నగర్వాలా మరణం సహజమైనదా? ఈ విషయా లన్నీ పరిశీలన లేకుండానే కేసు ముగిసింది.

ఆ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి అబ్దుల్‌ రహమాన్‌ అంతూలే ‘ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్ఠాన్‌’ పేరుతో ట్రస్టు ఏర్పరచి కుంభకోణానికి పాల్పడ్డారు. 1980లో జపాన్‌కు చెందిన ”కువో” అయిల్‌ కంపెనీ భారత్‌కు పెట్రోల్‌, డిజీల్‌ టెండర్లపై రూ. 9 కోట్ల కుంభ కోణానికి పాల్పడింది.

వీటన్నింటినీ మించినది బోఫోర్స్‌ కుంభ కోణం. స్వీిడన్‌ నుండి ఒక్కొక్కటీ రూ. 1,700 కోట్ల వ్యయంతో నాలుగు వందల హౌవిట్జర్‌ శతఘ్నులు కొనుగోలు చేసిన సందర్భంగా కుంభకోణం జరిగింది. 1986 ఏప్రిల్‌ 16న స్వీడన్‌ రెేడియో ఈ ముడుపుల వార్తను ప్రకటిం చింది. ఇందులో రాజీవ్‌గాంధీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 2010 వరకు విచారణ సాగింది. ఇందులో బోఫోర్స్‌ మాజీ అధ్యక్షుడు, విన్‌ చద్దా, జెడి హిందూజాతో సహా 14 మందిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. కమిషన్‌ ఏజెంట్లకు రూ. 64 కోట్లు ముట్టే అవకాశం ఉన్నట్లు విచారణ అంశాలలో ఉంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఇటలీ ఆయుధ వ్యాపారి అట్టావో ఖత్రోకి పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అతనిని భారతదేశం తీసుకు రావడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం రు.250 కోట్లు వ్యయం చేసింది. కాని ఆ పని జరగలేదు. విసిగిపోయిన భారతీయ అధికారులు అతనిని భారత్‌ రప్పించడం కష్ట సాధ్యమని 2011 మార్చి 5న కేసును మూసి వేశారు. ఇటలీ బహుళజాతి సంస్థలు రాజీవ్‌ గాంధీ హయాంలో తమ అక్రమ వ్యాపారాలను విస్తరించుకొని లాభాలార్జిం చాయి. నేటికీ ఇటలీ వ్యాపార సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.

1992 మార్చిలో సెక్యురిటీ కూపన్‌ ధరలు పెరిగిన సందర్భంలో హర్షద్‌మెహత కుంభ కోణం బయటపడింది. రూ. 649 కోట్ల సెక్యురిటీలు బకాయి పడ్డారు. 1992 ఏప్రిల్‌ 13-24 మధ్య రూ. 620 కోట్లు బ్యాంకులకు చెల్లించారు. ఇంత మొత్తాన్ని ఒకేసారి ఎలా చెల్లించగలిగాడు అన్నది చర్చనీయాంశం అయిం ది. ఆ సందర్భంగా కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసిన అనేక మంది దివాలా తీశారు. రూ. 3,000 కోట్ల అవకతవకలకు సంబంధిం చిన పత్రాలతో నరోత్తం, హితేన్‌ దళాల్‌కు ప్రధాన పాత్ర ఉన్నట్లు సిబిఐ విచారణలో తెలింది. 1992 జూన్‌లో పార్లమెంట్‌ సభ్యులు రాం నివాస్‌ మీర్ధా నాయకత్వాన సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. కొందరికి చిన్న, చిన్న శిక్షలు పడ్డా వేలాది మంది వాటాలు కొని దివాళా తీసారు.

రైల్వే శాఖా మంత్రి జాఫర్‌ షరీప్‌ కాలం లో (1991) స్విట్జర్లాండ్‌ నుండి 6,000 హెచ్‌పి సామర్థ్యం గల 30 రైల్‌ ఇంజన్లు కొనుగోలు కుంభకోణం చోటు చేసుకుంది.

‘ఇస్కో’ను (ఇండియన్‌ ఐరన్‌ అండ్‌ స్టీిల్‌ కంపెనీ) ప్రైవేటీకరించేందుకు 1992 జూలై 11న కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రపంచ వ్యాపిత టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఎంపికలో కుంభకోణం జరిగింది.

సంస్కరణల పేర ప్రభుత్వ రంగ సంస్థలోని వాటాల విక్రయాలకుగాను కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఒక పెట్టుబడుల ఉపసంహరణ (డిస్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌) మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. ఈ వాటాల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పిఎసి), కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)లు తమ నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. రూ. 3,442 కోట్ల నష్టం జరిగినట్లు 1993 జూలై 18న పీపుల్స్‌ డెమోక్రసీ పత్రిక వెల్లడించింది. కొచ్చిన్‌ రిఫైనరీస్‌ లిమిటెడ్‌, అలహదాబాద్‌ బ్యాంకుతోపాటు మరో 8 సంస్థలు ఇందులో ఉన్నాయి. లాబాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అప్పనంగా, అతి తక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీల పరంచేశారు. నాల్‌కొ, బాల్‌కొ లాంటి అల్యూమినియం సంస్థలను కూడా ఇదే గతిపట్టించారు.

దేశంలో నవరత్నాలుగా పేరుపొందిన ప్రభుత్వ రంగ సంస్థలు:1) భారత్‌ హెవీ ఎల క్ట్రికల్స్‌ లి, 2) భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి, 3) గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లి, 4) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లి, 5) హిందూ స్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి, 6) మహా నగర్‌ టెలికం లి, 7) ఇండియన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి. (ఇందులో రియలన్స్‌ కంపెనీకి ఎక్కువ వాటాలు అమ్మారు.) 8) నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లి, 9) ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లి. విదేశ్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (సంస్థలలోని వాటాలను టాటా వారికి అతి తక్కువ రేట్లకు అమ్మకాలు చేశారు.)

వీటన్నింటినీ మించినది హవాలా కుంభ కోణం. విదేశీ మారకం కావల్సిన వారు చట్టబద్దంగా కాకుండా బ్లాక్‌ మార్కెట్లలో రూపాయలను విదేశీ ధనంలోకి మార్చడానికి సంబంధించిన హవాలా కుంభకోణంలో అనేక మంది కేంద్ర మంత్రులకు సంబంధం ఉన్నట్లు విచారణలో తెలింది.1991 మార్చి 25వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈకుంభకోణంలో జైన్‌ సోదరులు ప్రధాన పాత్ర వహించగా భారత మాజీ ప్రధాని పి.వి నరసింహారావు తోపాటు రాజీవ్‌గాంధీ, భజన్‌లాల్‌, ఎల్‌కె అద్వా నీ, మదన్‌లాల్‌ ఖురానా, ఆర్‌కె ధావన్‌ల తోపాటు మెజారిటీ కేంద్ర మంత్రులకు ఈ కుంభకోణంలో ముడుపులు ముట్టినట్లు వెల్లడైంది. ఈశాన్య భారతదేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో రూ. 63 వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్లు బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ సాక్ష్యాలతో సహా ప్రభు త్వం దృష్టికి తెచ్చాడు. ఆరుణాచల్‌ ప్రదేశ్‌లో రూ. 4 లక్షల కోట్లు విలువైన పేరులేని జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిచ్చి అక్కడి కాంగ్రెస్‌ నేతలు లబ్దిపొందారు.

ఆదర్శ్‌ కుంభకోణం: కార్గిల్‌ యుద్ధం తరు వాత 1999లో మహరాష్ట్రలో ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీని స్థాపించారు. దీనికింద ఇళ్ల నిర్మాణం ఒక కుంభకోణంగా మారింది. ఇందులో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఉన్నతా ధికారుల హస్తమున్నట్లు రుజువులు దొరికాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రులైన అశోక్‌ చావన్‌తో పాటు విలాస్‌రావు దేశ్‌ముఖ్‌, సుశీల్‌కుమార్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి నారాయణ రాణే భాగస్వాములుగా ఉన్నారు. కార్గిల్‌ యుద్ధంలో మరణించిన అమర వీరుల కుటుంబాల కోసం నిర్మాణం గావించిన 31 అంతస్థుల భవనంలో ఫ్లాట్ల కేటాయింపులలో ఈ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. రూ. 10 కోట్లు విలువగల విల్లాలను రూ. 60-70 లక్షలకు లోపు విలువ లకు అక్రమార్కులకు కట్టాబెట్టారు. ఆదర్శ్‌ సొసైటీ సభ్యులకు విక్రయించిన ఫ్లాట్లలో ఒకటి కూడా యుద్ధ వీరుల భార్యలకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ కేటాయించలేదు. విచారణ కొనసాగుతూనే ఉంది.

ఐపిఎల్‌ కుంభకోణం: క్రికెట్‌ ఆటలకోసం ఏర్పాటు చేసిన ఐపిఎల్‌ సంస్థలో కుంభకోణం చోటు చేసుకున్నది. దీనిపై వచ్చిన ఆరోపణలతో కేంద్ర మంత్రి శశి థరూర్‌ రాజీనామా చేశారు. ఆటల టీములను వేలానికి పెట్టారు. ఒక్కొక్క టీము 1,500 కోట్ల ధర పలికింది. ఈ వేలం లో చాలా మంది బినామీ పేర్లతో పాల్గొని వందల కోట్లు సంపాదించారు.

చక్కెెర కుంభకోణాలు: 1993లో భారత ఆహార సంస్థ కోర్కె మేరకు 6 లక్షల టన్నుల చక్కెర దిగుమతి కోసం రూ. 300 కోట్ల విలువ గల గ్లోబల్‌ టెండర్‌లను పిలిచాడు. నాటి ఆహార శాఖా మంత్రి కల్పనాథ్‌ రారు చక్కెర మిల్లు యజమానుల ప్రయోజనాలను కాపాడడానికి టెండర్లు పిలిచినా ఆహార శాఖ కార్యదర్శి అశోక్‌ చంద్రసేన్‌ను మందలించి దిగుమతులు జరుగకుండా అడ్డు పడ్డాడు. దిగుమతును అడ్డు కోవడం ద్వారా మంత్రి మిల్లు యజమానులతో కుమ్మక్కయ్యాడు. స్థానికంగా చక్కెర ధర కిలో రూ.1.75 పెంచడం వల్ల ప్రజలపై రూ. 230 కోట్ల భారం పడింది. తిరిగి 2010లో కేంద్ర వ్యవసాయశాఖా మాత్యులు శరద్‌పవార్‌ నేతృత్వంలో దేశీయ పంచదారను కిలో రూ. 14 చొప్పున ఎగుమతి చేసి రూ. 28ల చొప్పున దిగుమతులు చేసుకున్నారు. ప్రతి ఎగుమతి- దిగుమతి సందర్భంగా కుంభకోణాలు కొనసా గుతూనే ఉన్నాయి.

బిజెపి నేతృత్వంలో జరిగిన కుంభ కోణా లు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.

ఆమరావతి లేఅవుట్‌లో ముఖ్యమంత్రి కుమారులు, అల్లుళ్లకు రూ. 15 కోట్ల విలువైన భూమిని కేవలం కోటి రూపాయలకే కట్టాబెట్టారు. బాణశంకరిలో రూ.175 కోట్ల విలువైన భూమిని తన కుమారులు భాగస్వాములుగా ఉన్న సంస్థకు డినోటిఫై చేశారు. ఒక పారిశ్రామిక లే అవుట్‌లో తన కుమారులు, అల్లుళ్ళు డైరెక్టరుగా ఉన్న ఫ్లూయిడ్‌ పవర్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థకు, అది ఏర్పడిన కేవలం 15 రోజులకు 2 ఎకరాలు కేటాయించాడు. దాని విలువ రూ.8.5 కోట్లు. కాని వారు చెల్లించింది మాత్రం రూ. 84 లక్షలు. బెంగుళూరుకు 55 కిమీ దూరంలో ఒక బిపిఓ స్థాపించడానికి ఎడ్యూరప్ప తన కుమారైకు 2 ఎకరాలు కేటాయించారు. దానికి చెల్లించింది రూ.40 లక్షలు. కాని దాని విలువ రు. 2కోట్లు. ఆమెకే బెంగుళూరులో నిబంధనలకు విరుద్ధంగా ఒక నివాస స్థలాన్ని కూడా కేటాయించారు. ఆయన తన చెల్లెలికీ, మేనల్లునికీ రూ.5 కోట్ల విలువైన స్థలాలను కట్టబెట్డారు. మరొక వ్యవహారంలో రూ.181 కోట్ల విలువైన 11.25 ఎకరాల భూమిని డీనోటిఫై చేసి, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌కు నామమాత్రపు ధరకు విక్రయించారు. దానిలో రూ.39 కోట్ల విలువైన భూమిని ఆయన కుమారుడు నిర్వహిస్తున్న కంపెనీలో భాగస్వాములుగా ఉన్న వారికి కేవలం రూ. 3 కోట్లకు అమ్మారు. రూ.13 కోట్ల విలువైన 2.05 ఎకరాల మరొక ప్లాటును కేవలం రూ. 2.20 కోట్లకు విక్రయించారు.

ఇన్ని కుంభకోణాలు బయటపడ్డ తర్వాత సైతం కర్ణాటక ముఖ్యమంత్రిగా తనకు అధి ష్టానం ‘ఆశీస్సులు’ ఉన్నాయని గర్వంగా చెప్పు కుంటున్నారు ఎడ్యూరప్ప.

దేశ స్థాయిలో టెలికంలో 2జి స్పెక్ట్రం 1లక్షా 76 వేల కోట్ల కుంభకోణం, ఎస్‌.బాండ్‌ వేలంలో జరిగిన 2 లక్షల కోట్ల కుంభకోణాలు సర్వే సర్వత్రా తెలిసినవే.

రాష్ట్రంలో కుంభకోణాలు

1998 నుండి 2004 వరకూ మన రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలు:

1) నకీలీ స్టాంపుల కుంభకోణం రూ. 5 వేల కోట్లు. 2) అర్ధంతరంగా మూసివేసిన అర్బన్‌ బ్యాంకుల డిపాజిట్ల కుంభకోణం 2 వేల కోట్లు. 3) నీరు – మీరు పథకంలో 1,600 కోట్లు. 4) వాటర్‌ షెడ్‌ పథకంలో 2,000 కోట్లు. 5) పనికి ఆహారం పథకంలో 560 కోట్లు. 6) ప్రభుత్వ సంస్థల అమ్మకం 400 కోట్లు. 7) మద్యం అక్రమాలు 600 కోట్లు. 8) సోమశీల భూముల కుంభకోణం 112 కోట్లు. 9) స్కాలర్‌ షిప్‌ అవినీతి 100కోట్లు. 10) ముఖ్యమంత్రి సహయ నిధి 10 కోట్లు. 11) విజయవాడ సిమెంట్‌ ఫ్యాక్టరీ స్థలం 50 కోట్లు. 12) టూరిజం స్థలాలకు 350 కోట్లు. 13) మదా పూర్‌ రహెజా భూముల కుంభకోణం 50 కోట్లు. 14) ఏలేరు భూములు కుంబకోణం 100 కోట్లు. 15) టైమర్ల కుంభకోణం 30 కోట్లు. 16) సింహచలం భూములు 144 ఏకరాలు.

మొత్తం రూ.12,367 కోట్లు కుంబకోణాలు చోటు చేసుకున్నాయి.

నాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రిచెన్నా రెడ్డి ఏకంగా చందాలరెడ్డిగా ప్రసిద్ది కెక్కారు. మరో మాజీ ముఖ్యమంత్రి జనార్ధన్‌రెడ్డి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని లక్ష్మీ పురం గ్రామం రాజుపాలెంలో విలువైన గ్రానైట్‌ నిక్షేపాలు కలిగిన 60 ఎకరాల మిగులు భూమిని తమ కుమారుడు రాం కుమార్‌ రెడ్డికి చెందిన ఆక్రోఫోలాన్‌, రీటా ఇండిస్టియల్‌ కార్పోరేషన్‌, ఉపేంద్ర గ్రానైట్స్‌, పల్లరా గ్రానైట్స్‌ సంస్థలకు నామమాత్రపు కౌలుకు కట్టబెట్టారు. 1990 అక్టోబర్‌ 10న కడపజిల్లా మంగం పేట బైరైటీస్‌ గనుల తవ్వకానికి నెలకు 34,000 టన్నుల ముడి ముగ్గురాయి తవ్వకానికి ప్రయాక్స్‌ కంపెనీ ఇండియన్‌ బైరైటీస్‌ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ది సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుం బం కీలకంగా ఉంది. రాష్ట్రంలోని ఏ ముఖ్య మంత్రీ కుంభకోణాలకు దూరంగా లేరు.

2004 మేలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌ హయాంలో వేలాది కోట్ల కుంభకోణా లు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డెరెక్టర్‌ ధనుంజయ ‘రాజీవ్‌ ఉద్యోగ శ్రీ’ పేర ముడుపులు వసులు చేశారు. సత్యం కంపూటర్స్‌ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్ప డింది. అనంతపురంలో వేరుశనగల విత్తనాల పంపిణిలో కుంభకోణం, మిక్సింగ్‌ ప్లాంట్లకు సబ్సిడీ ఎరువులను సరఫరా సంఘటన, ఎంఆర్‌ ప్రాపర్టీస్‌ భూముల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఓబుళాపురం మైన్స్‌, బయ్యారం మైన్స్‌ (1.40 లక్షల ఎకరాలు) నుండి వేల కోట్ల రూపాయల ఖనిజ సంపద విదేశాలకు తరలిపోయింది. గాలి జనార్థన్‌ రెడ్డి సోదరులు (కర్ణాటక బిజెపి ప్రభుత్వంలో మంత్రులు) ముఖ్యమంత్రి బంధువు పేరుతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. ఇందిరమ్మ ఇళ్ళలోనూ, ఉపాధి హామీ పథకంలోనూ, ఆరోగ్యశ్రీ అమల్లోనూ పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంది. సహకార సంస్థల్లో వేల కోట్ల రూపాయలు పాలక వర్గాలు కాజే శాయి. చివరకు సర్వశిక్షా అభియాన్‌ (అందరికి విద్య)లో మాజీ ముఖ్యమంత్రిని నిరంతరం వెన్నంటి ఉండే వ్యక్తి కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాడు. మత్స్య శాఖలో ఇంజనీరు ఎలుగు బంటి సూర్యనారాయణ పాల్పడిన కుంభకోణం నేటికీ పరిష్కరించబడలేదు. నెల్లూరు జిల్లాలోని కిసాన్‌ సెజ్‌కు సంబంధించి 2,776 ఎకరాల భూముల సేకరణలో రైతుకు రూ. 40 వేలు ఇచ్చి ఎకరాకు రూ. 40 లక్షలు యాజమాన్యం కోరుతున్నది. వాస్తవానికి ఇప్పుడు ఎకరాకు రూ. 20 లక్షల ధర పలుకుతున్నది. 1993లో ఈ భూముల సేకరణ జరిగింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు, అల్లూరు, దగదర్తి మండలలో భూ సేకరణ జరిగింది.

ఎపిఐఐసి కొనుగోలు చేసిన భూములను నామమాత్రపు ధరలకు కంపెనీలకు కట్టబెట్ట టంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది.

అవినీతి-కుంభకోణాలపై విచారించి చర్యలు తీసుకోవడానికి సిబిఐ, స్పెషల్‌ బ్రాంచ్‌, అవినీతి నిరోధక శాఖ ఇంకా ప్రతీ ప్రభుత్వ శాఖల్లో విజిలెన్స్‌ వ్యవస్థలు ఉన్నప్పటికీ కుంభ కోణాలు జరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా సంస్కరణల అనంతరం భూకుంభ కోణాలు వేల కోట్లలో సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు పేదరైతులనుండి సేకరిస్తు న్నది. ఇందులో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. చివరికి ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణంలో కూడా ”గ్రీస్‌ ఆన్‌ వీల్స్‌” మరియు ”కిక్‌-బ్యాక్స్‌” పేర అవినీతిని పాలక వర్గాల్లోనే ప్రోత్సహిస్తున్నారు.

దేశంలో నేడు జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలపై జరుపుతున్న విచారణలన్నీ ఫలితాన్ని సాధిస్తాయని చెప్పలేం. ఎందుకంటే కుంభకోణాలు చేస్తున్నది పాలకవర్గాలే, అధికార పక్షమే గనుక. ప్రజలు చైతన్య వంతులై ఎదిరించ నంత కాలం అవినీతి – కుంభకోణాలు కొనసా గుతూనే ఉంటాయి. ఇందుకుగాను అవినీతికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించడమే మన కర్తవ్యం.

సారంపల్లి మల్లారెడ్డి

విశ్వసనీయత కోల్పోతున్న యుపీఏ-2 (రెండేళ్ల పాలనపై పరిశీలన)

ఆర్ధిక, రాజకీయ రంగాల్లో పెరిగిపోతున్న సంక్షోభ భారాల నుండి ప్రజలకు ప్రత్యామ్నాయం ఏమిటి? దేశం ఎలా ముందుకు పోవాలి? ఈప్రశ్నలు నేడు అందరినీ వేధిస్తున్నాయి. దేశం సంక్షోభ సుడిగుండంలోకి లాగబడుతోంది. గత ఐదారేళ్లుగా వ్యవసాయం గడ్డుపరిస్థితి నెదుర్కొంటోంది. పారిశ్రామికోత్పత్తి కూడా ఈ ఏడాది తగ్గిపోయింది. గతంలో సర్వీసు రంగం వేగంగా పురోగమించి జిడీపీ పెరగడానికి ప్రధాన దోహదకారి అయింది. నేడు దాని వేగం కూడా మందగించింది.

కేంద్రంలోని యుపీఏ సర్కారు తన రెండో ఇన్నింగ్సులో రెండేళ్లు పూర్తి చేసుకుoది. రెండేళ్లుగా దేశం అధికధరలు, అవినీతితో అట్టుడికి పోతున్నది. ప్రజల్లో అసం తృప్తి పెరుగుతోంది. ఈ అసంతృప్తిని అదుపు చేయడానికి ప్రభుత్వం నిరంకుశచర్యలకు తెగ బడుతోంది. ”లక్ష్యం 2014” దిశలో తప్పటడు గులు వేసుకుంటూ నడుస్తోంది. ఇంటా బయటా సవాళ్లు ముప్పెరగొంటున్నాయి. ప్రధాని మన్మో హన్‌, ఆయన బృందం ఊపిరాడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో వామపక్షాల వల్ల తాము ముందడుగు వేయలేకపోతున్నామని వాపోయినవారే నేడు తమ కాళ్లకు తామే బంధనాలుగా మారారు. అదే కాంగ్రెసుకు పట్టిన అసలు దురవస్థ.

స్వీయ వైరుధ్యాల నడుమ ఇరుక్కున్న యుపీఏ

యుపిఎ1తో పోలిస్తే యుపిఎ-2 రెండు సంవత్సరాల పరిపాలనలో సంస్కరణలను మరింత వేగంగా అమలు జరిపింది. అధికారం లోకి వచ్చిన మొదటి రోజునుండే ఎటువంటి ఆటంకాలు, ప్రతిఘటన లేకుండా తన ఎజెం డాను నిరాటంకంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. 100 రోజుల పథకం పేరుతో విద్యా, వైద్య రంగాలను ప్రైవేటీకరించే దిశలో చాలా వేగంగా అడుగులేసింది. కీలకమైన రంగాలతో సహా అన్ని రంగాల్లోకీ విదేశీ పెట్టుబడులకు పెద్దఎత్తున అనుమతిస్తోంది. ఇన్సూరెన్స్‌ వంటి కీలకమైన వ్యవస్థను ప్రైవేటీ కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంత వేగంగా ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ కాలంలో సంస్కరణల వేగం సంతృప్తికరంగా లేదని కొంద రు ఆర్థికరంగ విశ్లేషకులు, సంస్థలు, పత్రికలు, మీడియా యుపిఎని విమర్శించడం మనం గమనించదగిన విషయం. ”వాల్‌స్టీట్‌ జర్నల్‌” ప్రత్యేకంగా భారత దేశ ఆర్థిక సంస్కరణల మీద కొన్ని విశ్లేషణలు చేసింది. కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లతో విజయం సాధించి, వామపక్షాల మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్ప టికీ సంస్కరణలవైపు వేగంగా అడుగులు వేయలేకపోతున్నదని పత్రిక పేర్కొంది. సంక్షేమ కార్యక్రమాలను వదిలించుకోలేకపోతున్నారని విమర్శించింది. యుపిఎ2 అధికారంలోకి రావ డానికి గ్రామీణ ఉపాధి హామీ, అటవీ హక్కుల రక్షణచట్టం, సమాచార హక్కు వంటి సంక్షేమ పథకాలే కారణమనీ, వాటిని వదిలిపెట్టినా, తగ్గించినా ప్రజాభిమానం కోల్పోయి రాజకీయం గా బలహీనపడతామన్న భయం ఈరోజు కాంగ్రెస్‌ వర్గాల్లో వుందనీ, అందువల్లనే వారు సంస్కరణలవైపు వేగంగా అడుగులు వేయలేక పోతున్నారనీ వాల్‌స్ట్రీట్‌ విశ్లేషించింది. అలాగే ”ఎకనమిక్‌ టైమ్స్‌” లాంటి దేశీయపత్రికలు కూడా సంస్కరణల వేగం తగ్గిందని విమర్శిస్తూ వ్యాసా లు ప్రచురిస్తున్నాయి.

అంటే మనకు దీనిలో స్పష్టంగా రెండు వైరుధ్యాలు కనిపిస్తాయి. ఒకటి ఈరోజు అంతర్జా తీయంగా వచ్చిన అవకాశాలను ఉపయోగించు కొని వేగంగా సంపద పోగుచేసుకోవాలనీ, ప్రపంచ మార్కెట్‌లో వేగంగా విస్తరించాలనీ ఉవ్విళ్లూరుతున్న బడా పెట్టుబడిదారీ వర్గమూ, వారి ప్రయోజనాలూ ఒకవైపు, సామాన్య ప్రజల సంక్షేమం, వాళ్ల సబ్సిడీలు, రాయితీలు, బతుకు తెరువు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదరికం, ఆకలి వంటి సమస్యల నుండి బయటపడటమనే అంశం రెండోవైపు. ఈ రెంటిమధ్య స్పష్టమైన ఘర్షణ కనిపిస్తోంది. ఈ ఘర్షణలో యుపిఎ2 బడాపెట్టుబడిదారీ వర్గంవైపు మొగ్గుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయం లో రాజకీయ అవసరాల రీత్యా రెండో అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అనుకుంటున్నారు. దీన్ని పరిష్కరించడం ఇప్పుడున్న పాలకవర్గాలకు అంత సులభం కాదు.

మసకబారుతున్న మన్మోహన్‌ వ్యక్తిత్వం

ఈ కాలంలో ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా ప్రధాని మన్మో హన్‌ సింగ్‌ను కేంద్రంగా చేసుకొని యుపిఎ ప్రతిష్టను పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్‌ వ్యూ హం దెబ్బతిన్నది. యుపిఎ1 పరిపాలనతో పోల్చుకుంటే మన్మోహన్‌ సింగ్‌ ప్రతిష్ట ఈ కాలంలో దారుణంగా పడిపోయింది. సంస్కరణ ల భాషలో చెప్పాలంటే మన్మోహన్‌ రేటింగ్‌ ‘బి’ గ్రేడుకు చేరింది. తదుపరి ర్యాంకుకు దిగితే దివాళానే. ముఖ్యంగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో మన్మోహన్‌ పాత్ర కూడా వున్నట్లు రుజువు కావడంతో ఆయన వ్యక్తిత్వం బాగా మసకబారి పోయింది. ఆయనను అడ్డంపెట్టుకొని బలపడా లన్న కాంగ్రెస్‌ వ్యూహం దెబ్బతిన్నది. దీంతో కాంగ్రెస్‌ ఆత్మరక్షణ స్థితిలో పడిపోయింది. ఈ స్థితిలో ప్రజలు, ప్రజా ఉద్యమాలపై నిర్భంధానికి తెగబడుతోంది. ప్రజాస్వామ్య హక్కులు హరించ బడుతున్నాయి. నిరంకుశత్వం దిశగా అడుగులే స్తోంది. పెరుగుతున్న రెండో వైరుధ్యం ఇది.

ఒత్తిడికి గురవుతున్న ప్రజాస్వామ్యం

ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురౌతోంది. అసంతృ ప్తిని అదుపు చేయాలంటే దానికి రెండు మార్గాలు. ఒకటి సమస్యలను పరిష్కరించాలి. లేదా సమస్యల మీద నోరెత్తకుండా అణిచివేయా లి. ప్రస్తుతం రెండో దానివైపే యుపిఎ అడుగులు వేస్తున్నది. ఇటీవల కొత్తగా వచ్చిన చాలా చట్టాలు, బిల్లులు పరిశీలిస్తే అన్యాయానికి గురైన వారు ఏవైనా ఆరోపణలు చేస్తే వాటిని పరిష్క రించడానికి బదులు ఆరోపణలు చేసినవారిపైనే ఎదురు కేసులు పెట్టి వేధించే ప్రక్రియ ఒకటి మనకు కనిపిస్తుంది. బయోటెక్నాలజీ బిల్లు, తాజా లోక్‌పాల్‌ బిల్లు, ఉపాధ్యాయుల నైతిక పరిరక్షణాబిల్లు వగైరాల్లో ఈ అంశం మనకు కనిపిస్తుంది. అలాగే ఉద్యమించే ప్రజలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతున్నది. జైతాపూర్‌ అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై కాల్పులు తాజా ఉదాహరణ. గతంలో ఆంధ్రప్రదేశ్‌ సహా ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌ మొదలైన రాష్ట్రాల్లో నిర్భంధానికి దిగింది. పోలీసు కాల్పులు సర్వసాధారణమయ్యాయి.

మొత్తంమ్మీద చూసినప్పుడు ఈ కాలంలో ఆరు అంశాల్లో యుపిఏ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 1 అవినీతి. 2 అధిక ధరలు. 3 వ్యవసాయ సంక్షోభం.4 విదేశాంగ విధానం. 5 సంస్కరణలపేరుతో ప్రజలపై భారాలు, సంప న్నులకు వరాలు. 6 ప్రజాస్వామ్య అపహరణ. ఒక్కొక్క అంశాన్ని మనం విడివిడిగా పరిశీలిద్దాం.

నాటికీ నేటికీ తేడా

మొదటి అంశం, యుపిఎ1 ప్రభుత్వం వామపక్షాల మద్దతు మీద ఆధారపడింది కనుక కనీస ఉమ్మడి కార్యక్రమంలోని అంశాలను కొంతమేరకైనా అమలుచేయక తప్పింది కాదు. మన్మోహన్‌ బృందానికి ఇష్టం వున్నా లేకపోర ుునా ఆరోజు కొన్ని అంశాల్లోనైనా ప్రజానుకూ లంగా వ్యవహరించక తప్పలేదు. ఒకవైపు సంస్కరణల వేగం తగ్గించి మరోవైపు ప్రజా సంక్షేమానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సివచ్చింది. ఉపాధి హామీ పథకం, అటవీ రక్షణ చట్టం లాంటివి వచ్చాయంటే దానికి కారణం వామ పక్షాల ఒత్తిడే. అలాగే ఇన్స్యూరెన్సు, బ్యాంకింగ్‌ వంటి ఫైనాన్స్‌ రంగాల్లో తలుపులు బార్లా తెరవకుండా వాటిమీద నియంత్రణ కొనసాగిం ది. పెట్రోలు ధరల పెంపుదల, ఆహార సబ్సిడీల కొనసాగింపు మొదలైన విషయాల్లో అడుగడు గునా వామపక్షాలు జోక్యం చేసుకున్నాయి. ఈ పరిణామం నచ్చని బిజేపీ నాయకులు వామ పక్షాలు అభివృద్దికి బ్రేకులు వేస్తున్నాయని విమర్శించారు. మన్మోహన్‌కు పరోక్షంగా మద్దతు పలికారు. వామపక్షాలు అడ్డుకోవడం వల్ల యుపిఎ1 ప్రభుత్వం పరిమితంగానే ధరలు పెంచాల్సి వచ్చింది. వీటన్నిటి వల్ల ప్రజల మీద భారాలకు అడ్డుకట్ట పడింది. ఇవన్నీ కూడా వామపక్షాల ఒత్తిడి వల్లే జరిగినా కూడా, కాంగ్రెస్‌కు పరోక్షంగా రాజకీయ లబ్దిని చేకూర్చాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంత బలపడటానికి తోడ్పడ్డాయి. ఫలితంగా వామ పక్షాల మద్దతు అవసరం లేని యుపిఎ2 ప్రభు త్వం ఏర్పడింది.

ఇప్పుడు వామపక్షాల మద్దతు లేదు కాబట్టి ప్రభుత్వం రెండో ఇన్నింగ్స్‌లో సంస్కరణ లను పూర్తిస్థాయిలో అత్యంత వేగంగా అమలు జరపొచ్చనుకున్నది. అయితే అనుకోకుండా అంతర్జాతీయంగా చాలా పెద్ద ఆర్థిక సంక్షోభం రావడం, కుత్తిక లోతు సంక్షోభంలో అమెరికా కూరుకుపోవడం, దాని ప్రభావం అన్ని దేశాల మీద పడటం జరిగింది. కొద్ది మోతాదులోనైనా భారత్‌, చైనాల మీద దీని ప్రభావం పడింది. సంక్షోభ ప్రభావం మనదేశం మీద తక్కువగా వుండటానికి ప్రధాన కారణం ఫైనాన్స్‌ రంగాన్ని పూర్తిగా సరళీకరించకపోవడం. కీలకమైన ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలు ప్రధానంగా ప్రభుత్వరంగంలో వుండటం వల్ల ఇది సాధ్యం అయింది. మన్మోహన్‌సింగ్‌ కోరుకున్నట్లు మొద టనే ఫైనాన్స్‌ రంగాన్ని సరళీకరించి ఉంటే అమె రికా కంటే భారతదేశం ఈ సంక్షోభాన్ని ఎక్కు వగా ఎదుర్కొని ఉండేది.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోడానికి భారతదేశం బడా కార్పొరేట్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచంలో అమె రికా ఆధిపత్యం తగ్గడం, బహుళజాతి కంపెనీ లనేకం దివాళా తీయడం, విదేశాల్లో వారి పెట్టుబడుల పురోగమనం మందగించడం తది తర అంశాలను భారత పెట్టుబడిదారీ వర్గం తమకనుకూలంగా మలుచుకున్నది. భారతీయ కార్పొరేట్‌లు ఆఫ్రికా, ఆసియా ఆఖరుకి అనేక యూరప్‌ దేశాల్లో కూడా కంపెనీలు పెట్టి, గ్లోబల్‌ కంపెనీలుగా తయారయ్యాయి. దీనికి బదులుగా మన ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులు స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనుమతినిచ్చారు. ఉదాహరణకు, అమెరికా, అస్ట్రేలియా లాంటి దేశాల్లో ఊరూపేరూ లేని విశ్వవిద్యాలయాల (ట్రైవ్యాలీ లాంటి బోగస్‌ వర్శిటీలు) బ్రాంచీలను మన దేశంలో ఏర్పాటు చేయడానికి అనుమతు లివ్వజూస్తున్నారు. ఇది హాస్యాస్పదమైన నిర్ణయ మని నోబెల్‌ బహుమతి గ్రహీత వెంకటేశన్‌ రామకృష్ణన్‌ విమర్శించారు. ఇప్పటికే ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదవర్గాలు దీనితో మరింతగా వేరుపడిపోతారు.

ఇక పదేళ్ళ క్రితం ప్రపంచంలోని శతకోటీ శ్వరుల జాబితాలో తొమ్మిది మంది భారతీయు లుండగా ఇప్పుడు వారి సంఖ్య 52కి పెరిగింది. దేశ సంపదలో 40 శాతం ఈ శతకోటీశ్వరుల చేతిలో కేంద్రీకృతమై వుంది. మరో వైపు దేశంలో నూటికి 80 మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. వీరి చేతిలో సంపద 4 శాతానికి మించి లేదు. ఇలా అసమానతలు పెరిగిపోవడం అనేది ఈ కాలంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యుపిఎ1 కన్నా యుపిఎ2 కాలంలో ప్రజల మీద భారాలు బాగా పెరిగాయి. సంక్షోభం ముదిరింది. సమస్యలు పెరిగాయి. దాంతోపాటు అసంతృప్తి కూడా పెరిగింది.

అంతులేని అవినీతి

ఈ కాలంలో గతంలో ఎన్నడూలేని విధం గా ఒకదానివెంట మరొకటి అవినీతి కుంభకో ణాలు వెలుగులోకి వచ్చాయి. 2జి కుంభకోణం, కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆదర్శ్‌ కుంభకోణం, కర్నాటక కుంభకోణం, ఎస్‌బ్యాండ్‌ కుంభకోణం, సివిసి నియామకం ఇలా ఏకకాలంలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు వెలుగు చూశాయి. ఆఖ రికి ఉన్నత స్థానాల్లో ఉండే న్యాయమూర్తులు కూడా అవినీతికి మినహాయింపు కాదని రుజువైంది. వికీలీక్స్‌ సహాయంతో హిందూ పత్రిక బయటపెట్టిన కుంభకోణాలు సంచలనం రేపాయి. గత పార్లమెంటులో యంపీలను కొను గోలు చేయడానికి కోట్లు కుమ్మరించిన వైనాన్ని స్వయంగా చూసిన అమెరికా కన్సోలేట్‌ నివేదిక కళ్లు తెరిపిస్తుంది. వీటిపై తమకేమీ సంబంధం లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మన్మోహన్‌ సింగ్‌ చెబుతూ వచ్చారు. కానీ రోజులు గడిచే కొద్దీ, కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చేకొద్దీ వీటన్నిటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, ఆయన ప్రభుత్వం పాత్ర వున్నట్లు ఆధారాలతో సహా బయట పడ్డాయి. దాంతో సంకీర్ణధర్మం వల్లనే తాను ఉదాసీనంగా వ్యవహరించాల్సి వచ్చిందని సర్దిచెప్పుకునే ధోరణిలో పడ్డారు. ప్రధాని స్థానంలో ఉండి దేశసందపను దొంగలు కొట్టుకు పోతుంటే చూస్తూ ఊరుకోవడం పెద్దనేరం.

రోజుకో కుంభకోణం బయటపడుతూ ఉంటే అవినీతిని నియంత్రించడానికి బదులుగా పాలకుల మనసంతా దాన్ని చట్టబద్దం చేయడం మీదనే కేంద్రీకరించబడింది. కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా వున్న కౌషిక్‌బసు ఇటీవల ఆర్ధికశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం పెట్టారు. దాని ప్రకారం అవినీతిని చట్టబద్ధం చేస్తే సరిపోతుంది. ఎవరి కౖనా డబ్బులిచ్చి చాటుమాటుగా పని చేయించు కోవడానికి బదులుగా నేరుగా చట్టబద్దంగా ఇచ్చేస్తే ఏ రిస్కూ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే అవినీతిని చట్టబద్ధం చేసి తద్వారా అవినీతిని లేని దేశం కింద కీర్తి తెచ్చు కోవాలనే తాపత్రయంలో పాలకులున్నారన్న మాట.

అవినీతిద్వారా సంపాదించిన డబ్బు విదేశీ బ్యాంకుల్లో 20 లక్షల కోట్ల మేర మూలు గుతోందని ఐయంఎఫ్‌ అంచనా వేసింది. ఈ డబ్బే గనుక భారతదేశానికి తిరిగి తీసుకువస్తే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. కానీ ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూప డం లేదు. జర్మనీ ప్రభుత్వం మన ప్రభుత్వానికి నల్లడబ్బు ఆసాములు పేర్లు పంపినా, నల్లడబ్బు పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం చలించడం లేదంటే బ్లాక్‌ మనీదార్ల పట్ల కేంద్ర ప్రభుత్వానికెంత ప్రేమ వుందో అర్థమౌతోంది. విదేశాల్లో మూలుగు తున్న డబ్బంతా పార్టిస్పేటరీ నోట్స్‌ పేరుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన షేర్‌ మార్కెట్లోకి వచ్చి తెల్లడబ్బుగా మారిపోతు న్నది. ఈ షేర్లు ఎవరివి, ఎవరి పేరు మీద కొంటున్నారనేది తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ బ్లాక్‌మనీ షేర్‌మార్కెట్‌లో అదృశ్య శక్తిగా పనిచేస్తోంది. దాంతో షేర్‌మార్కెట్‌ అనేక కుదుపులకు గురవుతున్నది. మధ్యతరగతి మదుపుదార్లు ఈ షేర్‌ మార్కెట్లో వచ్చే కుదుపు లకు బలైపోతున్నారు.

ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వానికి ఆవగిం జంత ఆందోళన లేకపోగా కార్పోరేట్‌ సంస్థలకు మరిన్ని వరాలు కురిపిస్తూనే ఉన్నది. గత ఏడాది కార్పొరేట్‌ కంపెనీలకు కేవలం పన్ను రాయితీల రూపంలో 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు బడ్జెట్‌ పత్రంలోనే పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌ లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 88,000 కోట్ల రాయితీలిచ్చారు. మరోవైపు సబ్సిడీల మీద రూ. 70,000 కోట్లు కోత పెట్టారు. ఇలా ఆదాయ పంపిణీలో కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధానం అవలంభించింది. ఈ మధ్య కాలంలో హసన్‌ అలీ అనే ఒక హవాలా బ్రోకర్‌ ను అరెస్టు చేశారు. కొంతకాలంగా ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌) అదుపులో ఉన్నాడు. ఆయనను విచారించగా అనేకమంది అధికార, ప్రతిపక్షాలకు చెందిన బడా నాయకుల పేర్లు బయటకొచ్చినట్లు మీడియా లో వార్తలొస్తున్నాయి. అంటే విదేశాల్లో డబ్బుల్ని రహస్యంగా దాచుకునేవాళ్లు ఈ హవాలా వ్యాపారి ద్వారా పనులు చక్కబెట్టుకుంటుంటారు. వాళ్ల రహస్యాలన్నీ తెలుసుకాబట్టే ఇప్పుడు ఇతని నోరు నొక్కేసే ప్రయత్నం జరుగుతోంది.

పేదలపై భారాలు తగ్గించడానికి నిరాకరిం చిన ఈ ప్రభుత్వమే పార్లమెంట్‌ సభ్యుల జీతభత్యా లను మాత్రం ఆఘమేఘాలపై పెంచేసింది. యుపిఏ -1 హయాంతో పోలిస్తే యుపిఎ2 హయాంలో పార్లమెంటు సభ్యుల జీతాలు 300 శాతం పెరిగాయి.

ధరల పెరుగుదల

2010 జనవరి, 2011 జనవరి మధ్య ఆహార సరుకుల ధరలు 15 నుండి 20 శాతం వరకు పెరిగాయి. పెట్రోలు. ఆహారోత్పత్తులు, కూరగాయలు, సామన్యులు వాడే నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగాయి. ఇదే కాలంలో ధనికులు వాడే కార్ల ధరలు బాగా తగ్గాయి. పేద ప్రజలు ఎక్కువగా తినడం వల్ల ధరలు పెరుగుతున్నాయన్నది ప్రపంచ బ్యాంకు వాదన. గతంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఇదే వాదన చేశారు. మన మంత్రుల శరద్‌ పావర్‌ వంటివారు కూడా నేడు ఇదే వాదన నెత్తికెత్తు కున్నారు. ఇది పూర్తి అజ్ఞానంతో, అహంకారం తో చేసే అవాస్తవిక ఆరోపణ తప్ప ఇందులో ఇసుమంత కూడా వాస్తవం లేదు. ఎందుకంటే గత రెండు సంవత్సరాల కాలంలోనే దేశంలో తలసరి ఆహార ధాన్యాల వినియోగం 176 కేజీల నుండి 171 కేజీలకు అంటే సగటున మనిషికి 5 కేజీలు తగ్గింది. కనుక ఎక్కువ తినడం వల్ల ధరలు పెరిగాయనడానికి ఆధారం లేదు. పోనీ నిల్వలు లేవు, డిమాండ్‌ ఎక్కువున్నది సప్లయి తగ్గి ధరలు పెరిగాయంటే, నిల్వలు రెట్టింపయ్యాయి. గతంలో 2.5 కోట్ల టన్నులు నిల్వలుండగా ప్రస్తుతం 4.8 కోట్ల టన్నుల నిల్వ లున్నాయి. వీటిని పేదలకు తక్కువ ధరకూ ఇవ్వరూ, ఓపెన్‌ మార్కెట్‌లోకి విడుదలా చేయరూ. అక్కడ ఎలుకలు వాటిని తినేస్తుంటే పేదల కడుపులు మాడుస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు.

ప్రజలంతా అవినీతి సొమ్ము గురించి ఆందోళన పడుతూ వుంటే మన ప్రధానమంత్రి మాత్రం సబ్సిడీలు వృధా అయిపోతున్నాయని ఎక్కువ ఆందోళన పడిపోతున్నారు. సబ్సిడీల్లో జరుగుతున్న అవినీతి ఆయనకు కనపడుతోంది తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి విదేశాలకు పెద్దయెత్తున వెళుతున్న కోట్లాది రూపాయల అవినీతి కనపడడం లేదు. అందుకనే సబ్సిడీల తొలగింపు కోసం ప్రత్యేకించి ఒక కమిటీని కూడా వేశారు. ఇన్ఫోసిప్‌ మాజీఅధినేత నందన్‌ నీలకని ఆధ్వర్యంలో ఆ కమిటీ గత కొద్దిరోజు లుగా పనిచేస్తున్నది. ఇప్పటికే బియ్యం, ఎరువులు, పెట్రోల్‌ తదితర నిత్యావసరాలపై ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేసి ఆ స్థానంలో ”నగదు బదిలీ పథకం” ప్రవేశపెట్టాలనేది కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు. దానికను గుణంగానే నిలకని సిఫార్సులు చేస్తారు. భవిష్య త్‌లో సబ్సిడీ బదులు క్యాష్‌ ఇస్తారు. సబ్సిడీలు రద్దయిపోతాయి. ఉదాహరణకు రెండు రూపా యల కిలో బియ్యం పథకం తీసుకుందాం. రేషన్‌ షాపులో రెండు రూపాయలకిచ్చే బియ్యం మార్కెట్‌లో 25 రూపాయలు ఉందనుకోండి, మిగతా 23 రూపాయలు ప్రస్తుతానికి క్యాష్‌ రూపంలో పేదలకు బదిలీచేస్తారు. అదికూడా బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం పేదవారందరికీ కాదు. తర్వాత ఏదో ఒకరోజు 25 రూపాయల బియ్యం 40 రూపా యలు అయిందనుకోండి అయినా క్యాష్‌ బదిలీ 23 రూపాయలే ఉంటుంది. మిగతా 17 రూపాయలు వినియోగదారుడే భరించాలి. ఒక ఉదుటున ఏడాదిలో సబ్సిడీ బియ్యం రేటు రెండు రూపాయల నుండి 17 రూపాయలకు పెరిగి పోతుందన్నమాట. అంటే తెలియకుండానే 15 రూపాయల సబ్సిడీ కరిగిపోతుంది. దాన్ని పేదలే భరించాలి. ఇక అప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్‌షాపులు)తో పనే లేదు. నేరుగా ఓపెన్‌ మార్కెట్‌లో కొనుక్కోవాలి. అలాగే రైతులకు కూడా. ప్రస్తుతం ఎరువులపై సబ్సిడీ ప్రతిరైతుకీ వస్తుంది. ఇక నుండి మార్కెట్‌ రేటుకి కొనుక్కోవాలి. బియ్యం లాగానే సబ్సిడీ తేడాను రైతులకు డబ్బు రూపంలో ఇస్తారు. అది ఎలా ఇస్తారో ఇంతవరకు స్పష్టం కాలేదు. ఉదాహ రణకు కౌల్దార్లు లక్షల సంఖ్యలో వున్నారు. వీరికి స్వంత భూమి లేదు. సహజంగానే భూ రికార్డు వున్నటువంటి వారికే క్యాష్‌ బదిలీ పథకం వస్తుంది. కౌల్దార్లు పూర్తిగా మార్కెట్‌ రేటుమీదే ఎరువులు కొనుక్కోవాల్సి వుంటుంది. ఈరోజు రైతులందరీకీ కూడా సబ్సిడీ రేటు మీదే ఎరువులు దొరుకుతున్నాయి. రేపట్నుంచి దీన్ని కొద్దిమందికే పరిమితం చేస్తారు. నిజంగా సన్నచిన్నకారు రైతులు వీథిన పడతారు. ధనవం తులు, పలుకుబడి ఉన్న కామందులే క్యాష్‌ను జేబులో వేసుకుంటారు. ఇప్పుడు సబ్సిడీ రేటుకి ఎరువులు దొరుకుతున్నాయి కాబట్టి వ్యవసాయ ఖర్చు అదుపులో వుంది. ఆహారధాన్యాలను ప్రభుత్వమే మిల్లర్లనుండి సేకరించి చౌకగా పేదలకందిస్తోంది. ఈ విధానంలో ఉన్న లోపా లను సరిదిద్దే బదులు ఎలుకలున్నాయని ఇంటినే తగలబెట్టుకున్న మూర్ఖుని కథమాదిరి కేంద్రం వ్యవహరిస్తోంది.

యుపిఎ 2 హయాంలోనే పెట్రోల్‌, డీజిల్‌ మీద పూర్తిస్థాయిలో నియంత్రణ ఎత్తేశారు. కిరోసిన్‌, గ్యాస్‌పై ఇప్పటివరకూ సబ్సిడీ వుంది. క్యాష్‌ బదిలీ పథకం వచ్చిన తర్వాత వాటిమీద కూడా సబ్సిడీ ఎత్తేస్తారు. ఇప్పుడు అన్ని కుటుం బాలకు సబ్సిడీపై గ్యాస్‌ లభిస్తోంది. ఇక నుండి దీన్ని కొద్దిమందికే పరిమితం చేస్తారు. ముఖ్యం గా మధ్యతరగతి ఈ భారాన్ని బాగా మోయాల్సి వస్తుంది. ఈవిధంగా ప్రత్యామ్నాయంగా ప్రవేశ పెడుతున్న నగదుబదిలీ పథకం అనేది పేద, మధ్యతరగతి పాలిట శాపంగా మారనుంది. ప్రభుత్వ ఖజానా మీద భారం తగ్గించుకో వడానికే ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నది. ఈ విధంగా మిగిలిన సొమ్మునంతా పెట్టుబడిదారు లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది.

వ్యవసాయ సంక్షోభం

గత సంవత్సరం వర్షాలు బాగుండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. ఇదంతా తమ ఘనతగా యుపిఎ చెప్పుకుంటోంది. గత సంవత్సరం ఉత్పత్తి రెండేళ్ళ క్రితం వున్న పరిస్థి తిని చేరుకోవడం తప్ప అదనంగా పెరిగింది మాత్రం కాదు. గత 5-6 సంవత్సరాలుగా వ్యవసాయ ఉత్పత్తులు పడిపోతున్నాయి. సగటు అభివృధ్దిరేటు 2.4శాతం మాత్రమే. ఈ సంవత్సరం మాత్రమే అది 5.4 శాతానికి చేరింది. స్థూలజాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 2.5 శాతం మాత్రమే. రైతాంగ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనితో కేంద్ర సర్కారుకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయినా దీన్ని తమ ఘనతగా యుపిఎ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇటీవల ప్లానింగ్‌కమిషన్‌ మనరాష్ట్రానికొచ్చి విద్యుత్‌ సబ్సిడీ, ఉచిత విద్యుత్‌పథకాలను ఎత్తేయ్యాలని ఆదేశించిపోయింది. ఈ పూర్వరంగంలోనే రాష్ట్రం మళ్లీ విద్యుత్‌ ఛార్జీలను పెంచింది. ఒక వైపు వ్యవసాయోత్పత్తి పడిపోతున్నా మరోవైపు రైతాంగం నడ్డివిరుస్తోంది. కనీసం గిట్టుబాటు ధరల కల్పనలో పూర్తిగా విఫలమైంది. ఈ సంవత్సరం ధాన్యం కొనేనాధుడే కన్పించడం లేదు. ఈ సంక్షోభం నుండి బయటపడేయటానికి బదులుగా స్వేచ్ఛగా విదేశాల నుండి వ్యవసా యోత్పత్తుల్ని దిగుమతి చేసుకోడానికి పలుదేశా లతో ఒప్పందాలు చేసుకుంటోంది. వ్యాపార పంటల ధరలు దీనితో దారుణంగా ఒడిదుడు కులకు గురవుతున్నాయి.

విదేశాంగ విధానం

యుపిఎ2 హయాంలో విదేశాంగ విధానం లో పూర్తి తిరోగమనం కనిపిస్తున్నది. ఏ దేశ విదేశాంగ విధానమైనా ఆ దేశ ప్రయోజనాల కనుగుణంగా ఉండటం సహజం. కానీ మన పాలకవర్గాలు ఇరాన్‌ విషయంలోకానీ, ఇప్పుడు లిబియాపై దాడి విషయంలోకానీ గతంలో ఐక్యరాజ్యసమితిలో వచ్చిన అనేక సమస్యల విషయంలోగానీ అమెరికా ఎటు చేయి ఎత్తమం టే అటు చేయి ఎత్తుతున్నాయి. అమెరికా ఆధిప త్యానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ స్థాయి లో బ్రిక్స్‌ ఏర్పడింది. అందులో భారత్‌ కూడా భాగస్వామిగా వుంది. అయినా ఆ విషయంలో బ్రిక్స్‌ని బలవత్తరం చేయడంలో, దాన్ని ఒక స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దడంలో భారతదేశం చొరవ చూపలేకపోతోంది. నేను కూడా ఉన్నాను అనిపించుకోవడానికి మీటింగులకు హాజరవు తున్నది తప్ప చైనా, రష్యాతో చేతులు కలిపి మన దేశ ప్రతిష్టనూ, స్వతంత్ర ప్రతిపత్తిని కాపా డడం కోసం మాత్రం చిత్తశుద్దితో ప్రయత్నం చేయడం లేదు. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఇది అత్యంత విషాదకర పరిణామం.

దేశ భవిష్యత్తు ఎటు?

ఆర్ధిక, రాజకీయ రంగాల్లో పెరిగిపోతున్న సంక్షోభ భారాల నుండి ప్రజలకు ప్రత్యామ్నా యం ఏమిటి? దేశం ఎలా ముందుకు పోవాలి? ఈప్రశ్నలు నేడు అందరినీ వేధిస్తున్నాయి. దేశం సంక్షోభ సుడిగుండంలోకి లాగబడుతోంది. గత ఐదారేండ్లుగా వ్యవసాయం గడ్డుపరిస్థితినెదుర్కొం టోంది. జీడీపీలో దాని వాటా 26 నుండి 21 శాతానికి తగ్గిపోయింది. దానిపై ఆధారపడే జనం సంఖ్య (62శాతం) తగ్గడం లేదు. తగ్గిపో తున్న ఆదాయాన్నే ఈ అధికజనాభా ప్రజలు పంచుకోవాలి. తద్వారా నిజ ఆదాయాలు పడి పోతున్నాయి. ఫలితంగా కొనుగోలు శక్తి తగ్గిపో తోంది. పారిశ్రామికోత్పత్తి కూడా ఈ ఏడాది తగ్గిపోయింది. గతంలో సర్వీసు రంగం వేగంగా పురోగమించి జిడీపీ పెరగడానికి ప్రధాన దోహ దకారి అయింది. దాని వేగం కూడా మందగిం చింది. ఈ స్థితిలో పారిశ్రామికవర్గాలు విదేశీ మార్కెట్‌లపై దృష్టిసారించాయి. ఆఫ్రికా, యూరోప్‌ మొదలైన ఖండాలకు మన కార్పొరేట్‌కంపెనీలు వ్యాపిస్తున్నాయి. పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. మన పెట్టుబడులు ప్రపంచ వ్యాపితమవుతున్నం దుకు గర్వపడాలని సామాన్యులకు చెపుతున్నారు.

కాంగ్రెసు, బిజేపీలు రెంటిదీ అదే బాట

ఇక రాజకీయ రంగంలో కూడా ఈ రెండేళ్లలోచాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ 2009లో అధికారంలోకి వచ్చినపుడు అత్యంత ఉత్సాహంగా వుంది. ఆ విజయాన్ని ఆసరా చేసుకొని ప్రాజెక్టు 2014 పేరుతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యం, ఏక పార్టీ పరిపాలన ఏర్పాటు చేయాలనేదే ఈ లక్ష్యం. సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మిత్రుల మీద ఆధారపడకుండా వుండే ప్రభుత్వం తీసుకురా వాలని కాంగ్రెసు అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే 2014 నాటికి రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ కాంగ్రెస్‌ ఆశలు అడియాసలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తు న్నది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ చాలాచోట్ల ఓడిపోయింది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది బీహార్‌ ఎన్నికలు. బీహార్‌లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వస్తామని ఆశించినప్ప టికీ కూడా కాంగ్రెస్‌ అడుగులు ముందుకు పడలేదు. గతంలోఉన్న సీట్లు కూడా పడిపోయి నాలుగు సీట్లతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ఒక రాజకీయశక్తిగా తన ఉనికిని కోల్పోతున్న పరిస్థితి అనేక రాష్ట్రాలలో ఈరోజు వుంది. అలాగే అధికారంలోవున్న చోట కూడా అది అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతు న్నది. దానికి మన ఆంధ్ర ప్రదేశ్‌ చక్కటి ఉదాహరణ. మరోవైపు బిజేపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కర్నాటక బిజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇటీవల కార్మికవ్యతిరేక పెన్షన్‌బిల్లు పార్లమెంటు లో పెట్టినప్పుడు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించగా బిజేపీ దాన్ని ఒడ్డెక్కించింది. ఇలా ఆపత్కాలంగా రెండు పార్టీలు ప్రజలకు వ్యతిరే కంగా ఒక్కటవుతున్నాయి.

సంకీర్ణ రాజకీయాలు:

వామపక్షాల స్వతంత్ర పాత్ర

ప్రాంతీయపార్టీలు గతంలో ఏదో ఒక ప్రత్యేకతను కలిగి వుండేవి. కానీ ఈరోజు ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయస్థాయి బడా వ్యాపారపార్టీల బాటనే పడుతున్నాయి. ఆర్థిక సంస్కరణల విషయంతో వాళ్ళ కెలాంటి బేధాభిప్రాయం లేకపోవడంతో అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపిలకు భిన్నంగా వాటి పాత్రను కోల్పోతున్నాయి. వాటికి ఒక విధానం లేదు. తమ తక్షణ అవసరాలకు ఏది ఉపయోగం అనుకుంటే ఆ పార్టీ వెంట సూత్రరహితంగా పోతున్నాయి. అవి ప్రత్యామ్నాయ శక్తిని కోల్పో తున్నాయి. ఈ బలహీనతను ఆసరా చేసుకొని బలహీనపడుతున్న ప్రజారాజ్యం వంటి ప్రాంతీ య పార్టీలను తమలో విలీనం చేసుకునే ప్రక్రియను కాంగ్రెసు అనుసరిస్తోంది. ప్రజల మద్దతును కోల్పోయేకొద్దీ ఇలాంటి అడ్డదారులు తొక్కడం రివాజవుతుంది. దాంతో ఈరోజు ప్రత్యామ్నాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల విజ యవాడలో జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ విస్త ృత సమావేశం ఈ విషయంలో తీవ్రంగా శోధిం చింది. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యామ్నా యం మీద తీర్మానం చేసింది. అందులో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ఒకటి సిపి ఎం తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం, వామపక్షాలతో కలిసి స్వతంత్ర కార్యాచరణ చేయడం, తద్వారా ప్రజలకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని, వేదికని చూపెట్టడం. ”స్వతంత్ర కార్యాచరణ” అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కింద విజయవాడ సమావేశం తీర్మానిం చింది. అదే సమయంలో ఈరోజు దేశంలో రాజకీయ బలాబలాల దృష్ట్యా వామపక్షాలు మాత్రమే తక్షణ రాజకీయ లక్ష్యాన్ని సాధించ లేవు. అందులో ప్రత్యేకించి బిజెపి, కాంగ్రెస్‌ రెండూ అధికారం కోసం కొట్లాడుతున్న సమయం లో ఇతర ప్రాంతీయ బూర్జువా పార్టీలకు ఏదో ఒక వేదిక లేకుండా, అటో ఇటో చేరిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే మూడో ప్రత్యా మ్నాయానికి తగిన పరిస్థితుల్ని కల్పించాల్సిన అవసరాన్ని కూడా సమావేశం గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరలో వచ్చే ఏ ఎన్నికల్లో నైనా ఆ ఎన్నికల నాడున్న పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉండే లౌకిక ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించింది. అలాగే పార్లమెంటు వెలుపలా, బయట కూడా ఈ పార్టీలతో సహకరించి ప్రజా సమస్యల మీద ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. తద్వారా ఒకవైపు సమస్యలపై విశాల వేదికలమీద పోరాటాలూ, మరోవైపు రాజకీయంగా సిపిఎం ఇతర వామపక్ష పార్టీల స్వతంత్రత పెంచుకోవడం- ఈ ద్విముఖ ఎత్తుగడలతో ముందుకు పోవాలని సిపిఎం విజయవాడ సమావేశంలో నిర్ణయించుకొంది. దానికోసం ఈరోజు పార్టీ కృషి సాగిస్తూ వుంది. ఈ పూర్వరంగంలో అవినీతి పాలకుల్ని ప్రజలు వదిలించుకోవాలి. దానికోసం ప్రజల్ని సంసిద్దం చేయాలి. ప్రత్యామ్నాయ విధానాల అమలు కోసం దీర్ఘకాలిక పోరాటానికి రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి సిద్ధం కావాలి.

వి. శ్రీనివాసరావు

తెలుగిల్లు తెర లేచింది


గత కొంతకాలంగా తెలుగిల్లు తాళం వేసి ఉండటంతో కొందరు ”అయ్యో! ఏమయింది” అంటూ జాలిగా ప్రశ్నించారు. వందలాది మంది ఆందోళనతో సెల్‌ఫోన్లో పరామర్శించారు. కొద్దిమందే అయినా ముఖాముఖీ బాధపడ్డారు. ఒకరిద్దరు ఎదురు పడీ ముఖం తిప్పుకున్నారు. అందులో ఒకడితో నేనే బలవంతంగా మాట్లాడే ప్రయత్నం చేయగా, నిలబడి నోరు విప్పితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్లుగా పారిపోయాడు. మరికొంతమంది తెగ సంతోషపడిపోయారు. పీడ వదిలిందని మెయిళ్లు పంపారు. కొందరు నాలుగడుగులు ముందుకేసి తిట్టిపోశారు. అసలు పేరుతో రాశాడో? లేదోగానీ, నన్ను ఆ…. కార్యాలయానికే రావద్దని ఆంక్షలు పెట్టాడొకడు. మొత్తం మీద మిత్రులు కొందరు శత్రువుల్లా వ్యవహరించారు. అంతా బాగానే ఉందిగానీ, బ్లాగులో రాయటమే బాగలేదని కొందరు తీర్మానించారు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడిందన్నట్లుగా ఉద్యోగానికి నా రాజీనామా వ్యవహారం నడిచింది. కొందరిలా నటించటం చేతగాని నేను కడుపు చించుకోకుండా ఉండలేకపోయాను మరి. కాళ్ల మీద పడకుండా ఆపకుండా ఉండలేకపోయాను. అయితే, గియితే వీటిన్నంటికీ అతీతంగా నేను, నా రోజుల్ని గడుపుతున్నానని మాత్రం చెప్పగలను. మిత్రుల మౌనం ఒక్కటే కొద్దిగా బాధిస్తోంది. కాలమే ఆ బాధను మాపుతుందని ఆశిస్తున్నాను.
అన్నట్లు ఆ … కార్యాలయంలో జరిగే ఓ సాహితీ సంస్థ సమావేశానికి ఇటీవల ఆహ్వానం వచ్చింది. ఆహ్వానితులకు ఇదేమీ తెలియదు పాపం. అందుకనే వివరించి చెప్పి, పెద్దల సలహా తీసుకున్న తర్వాత ఆహ్వానం పంపితే నేను అక్కడకు వచ్చి ముఖం చూపించగలనో? లేదో? ఆలోచిస్తానని వారికి చెప్పాను. అంతే మళ్లీ పిలుపు రాలేదు. ఏమయిందో? తెలియదు. నాలాంటి వాడిని భరించే శక్తి ఆ కార్యాలయానికి, దాని నిర్వాహకులకూ లేకపోవటాన్ని నేను ఏ మాత్రం తప్పుపట్టటం లేదు. కాకపోతే నా బాధల్లా … వాళ్లకు జనం దూరం అవుతున్నారో? జనానికే వాళ్లు దూరం అవుతున్నారో? నేను తేల్చి చెప్పలేనుగానీ, అది నన్ను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది.
అయినా మంచికి శాశ్వత చావు ఉండదని నా నమ్మకం.!
మంచి అంటే మార్జ్కిజం తప్ప వేరొకటి లేదు.
ఇక చివరిగా…. ఆ కార్యాలయం నుంచి నన్ను తిట్టిపోసిన కొద్దిమందికీ, మద్దతు తెలిపిన ఎంతో మందికి, మౌనం వహించిన పెద్దలకూ, ”ఈ గొడవతో మాకు పనే లేదు, అలా చేయకపోతే నువ్వు నువ్వే కాదు గదా” అన్నట్లుగా స్నేహాన్ని కొనసాగిస్తున్న మిత్రులందరికీ, ప్రత్యేకించి నా ఒంగోలు స్నేహితులందరికీ నా కృతజ్ఞతలు. నా ధన్యవాదాలు.
అన్నట్లు ఇంకో సంగతి…. నాకు మద్దతు తెలిపిన చైతన్య ఎవరో? సాక్షి ఎవరో? వాళ్లెవరు? వీళ్లెవరూ? అంటూ కొంతమంది వాకబులు మీద వాకబులు చేశారు పాపం. మీ వక్రబుద్ధి నశించుగాక!
వాళ్లెవరూ? వీళ్లెవరూ? అని తెలుసుకునేకన్నా…. వాళ్లేమన్నారు, వీళ్లేమన్నారు అని చూస్తే మేలు. దాంట్లో నిజముంటే సమీక్ష చేసుకోండి. తప్పులున్నాయని భావిస్తే సరిదిద్దుకోండి. లేదూ కక్షగట్టి సంస్థను నాశనం చేయాలనుకుంటున్నారని తేలితే నిర్భయంగా వాళ్లని తప్పుపట్టండి. అట్లాంటివారిని (నేనయినా సరే!) దూరంగా ఉంచండి. అవసరమయితే వేటేయండి. అంతేగానీ అన్ని వేళలా మౌనం మంచిది కాదు. శస్త్రచికిత్స అవసరమని వైద్యుడు చెప్పినా మౌనం వహిస్తే అది మధుమేహి కాలిపుండులా దేహం మొత్తాన్నీ కుళ్లిస్తుంది.
లేదూ, గోటితో పోయేదానికి గొడ్డలి పెడితే మనిషే పోతాడని గ్రహించండి. అదే ఇప్పుడు జరుగుతుందేమోనని నా అనుమానం.
ఆలస్యమయితేనేం మే 14నో, 15నో స్పందించిన ఆమనిగారికి కృతజ్ఞతలు చెప్పనీయండి. బహుశా ఆయన సాహితీ మిత్రుడు కావచ్చు . నాకు అంతర్గత పోరాటం గురించి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఆ … కార్యాలయంలో నేను రెండోమారు అడుగు పెట్టక ముందు ఓ తీర్మానం చేసుకున్నాను. మా మిత్రుడొకడు ఎప్పుడూ వల్లించే ”గుళ్లో గుగ్గిలం వేయకపోతేమానే, పిత్తి కంపు కంపు చేయకు” అన్న సామెతలాగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నందున అంతర్గత పోరాటానికి దిగలేదు. అంతేకాదనుకోండి…. రాజకీయ పార్టీ సభ్యత్యం తీసుకునే వయస్సు రాక మునుపే ఆ అర్హత సాధించాను. నిన్న , మొన్నటి వరకూ మా పెద్దవాళ్ల సొమ్ము తింటూ నమ్మకంగా పనిచేశానని నమ్ముతున్నాను. కరపత్రాలు పంచాను. గోడ పత్రికలు అంటించాను. తెల్లగోడల్ని ఎర్రబరిచాను. పోలీసులు తలపగలగొడితే ఎర్రోడిని కదా అని వెర్రిగా గర్వపడ్డాను. ఇంట్లో వాళ్ల తిట్లను మౌనంగా భరించాను. అవినీతిపరుల దాడులు ఎదుర్కొన్నాను. వీడింతే మారడు అని వేనోళ్ల అన్పించుకున్నాను. ఇప్పటికీ ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాననుకుంటున్నాను. అయితే గియితే ఆమని గారూ! పోరాటాలంటారా? జెండా పట్టి ఒంగోలు వీధుల్లో గొంతు చించుకున్న అలనాటి రోజులు మళ్లీ రాకపోవచ్చునేమోగానీ, పశ్చిమబెంగాలులో మమత గెలుపు ముందు సిపిఎంకూ, ఆ వంటనే భారతదేశానికే నష్టమని స్పష్టంగా నమ్ముతున్నవాడిని. అందువలన నన్ను నేను సరిగ్గానే ఉంచుకుంటున్నాననుకుంటున్నాను. ఏమంటారు?
నిరుద్యోగినయ్యానని తెలిసి ఓదార్చిన, మంచి భవిష్యత్తు ఉంటుందని దీవించిన దేశ, విదేశ మిత్రులందరికీ మరోమారు నా ధన్యవాదాలు తెలియజేయనీయండి.
మీరు దీవించినట్లుగానే నాకు గతదఫా కన్నా రెట్టింపు జీతంతో ఓ ఉద్యోగం వచ్చింది. ఆ కార్యాలయం…. నాకు ఇవ్వాల్సిన 15 రోజుల వేతనాన్ని మరచిపోయిందిగానీ, నా పనితనానికి మెచ్చుకుని నేను ప్రస్తుతం కార్యనిర్వాహక సంపాదకుడిగా పనిచేస్తోన్న ‘రియల్‌ అడ్వైజర్‌’ మాస పత్రిక యాజమాన్యం కేవలం 12 రోజులకే నెల జీతాన్ని అందించింది. తదుపరి రెండో నెల జీతాన్ని కూడా అందుకున్నాను. అంటే నేను సంతోషంగా ఉన్నట్లే గదా ! రియల్‌ అడ్వైజర్‌ పత్రికను ఉచితంగా అందుకోదలచినవాళ్లు 9393641593కి ఫోను చేయండేం.
ఇంటి కంప్యూటరు వైరస్‌బారిన పడటంతో తెలుగింటికి తాత్కాలికంగా తాళం వేయక తప్పలేదు. వైరస్‌ను పారదోలలేదుగానీ, ఇప్పుడు నా కార్యాలయ కార్యక్రమానికి అలవాటు పడినందున వెసులుబాటు వచ్చింది.
దాని ఫలితమే ఇప్పుడు పచ్చపచ్చని తెలుగిల్లు తాళం తెరుచుకుని మళ్లీ కళకళలాడేందుకు సిద్ధమయింది. ఇక మిత్రులందరి సాయంతో రోజూ వండి వార్చాలనుకుంటున్నాను. తినేందుకు అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికింతే. రేపటికి ఆహ్వానం.

మీ మిత్రుడు
వెంకట సుబ్బారావు కావూరి