Archive for జూన్, 2011

ఇచ్చట లంచాల గడ్డి మేయబడును

ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు రిజిస్ట్రారు కార్యాలయంలో ఇదీ సంగతి

దేశంలో అవినీతి విశ్వరూపం దాల్చిందంటే కాబోలనుకున్నాను. పేరున్న పెద్దలు హస్తిన వేదికగా నిరసనలు తెలుపుతుంటే మంచిదే కదా అని నాలో నేనే అనుకున్నాను.
అయితే ఇటీవల నేను వారసత్వ స్థిరాస్తిని రిజిస్ట్రేషను చేయించేందుకుగాను ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు కార్యాలయానికి వెళ్లినప్పుడు అవినీతి విశ్వరూప సందర్శన జరిగింది.
మేము ఇద్దరం అన్నదమ్ములం. పదెకరాల మా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పంచుకోవాలనుకున్నాం. అయితే పూర్వంలా ఇప్పుడు ఊరకూరకే పంచేసుకుంటే లాభం లేదని కొందరు తెలిసినవాళ్లు చెవినేశారు. పంచుకున్న ఆస్తుల్ని ఎట్లా పంచుకున్నారో? ఎంతెంత పంచుకున్నారో? వాటికి నాలుగు దిక్కుల ఎవరెవరున్నారో? అలాంటి అలాంటి సమాచారాన్ని సమగ్రంగా రిజిస్ట్రారు కార్యాలయంలో రాసేసుకుంటనే ప్రభుత్వం గుర్తిస్తుందంట. రెవెన్యూశాఖ పాస్‌ పుస్తకాల్ని జారీ చేయాలన్నా, పంచాయతీవాళ్లు మా పేర్లమీద పన్ను రశీదులు ఇవ్వాలన్నా రిజిస్టరు చేసుకోవలసిందేనని నమ్మబలికారు. సరే, చేసేదేముంది. ప్రభుత్వానిదే పై చేయి కదా! వ్యక్తులు చట్టాలను అమలు చేయటం తప్ప మార్గం ఏముంది. బ్యాంకుల నిండా లచ్చుమ్మోరు మూలుగుతుంటే ఒప్పుల్ని తప్పులు చేసి, తప్పుల్ని ఒప్పులు చేసేయొచ్చనుకోండి. అది వేరే విషయం. సరేగదాని మా తమ్ముడితో సహా వెళ్లి అమ్మనబ్రోలు రిజిస్ట్రారును కలిసి ”నేను ఫలానా…., హైద్రావాద్‌లో పాత్రికేయుడిగా వెలగబెడుతున్నాను. గత ఇరవై ఏళ్లుగా మీడియాలో ఉన్నా అక్రమంగా పైసా సంపాదించలేదు. కాబట్టి మీకు కూడా అక్రమంగా పైసా కూడా ఇచ్చుకోలేను. దయచేసి నా పనిని చేసిపెట్టండి. అట్టని మీరు నా పనిలో దారి తప్పి చేయమని నేను అడగనే అడగను.” అని సదరు రిజిస్ట్రారు మౌలాలిని కలిసి విన్నవించుకున్నా. ఆయన ఏ కళనున్నాడోగానీ నా పని చేయమని సిబ్బందిని ఆదేశించాడు. అబ్బో నేను పాత్రికేయుడిని కాబట్టి … ఎందుకొచ్చిన గొడవలే అనుకుని రిజిస్ట్రారు నా పని చేయిస్తున్నాడనుకుని నేను తబ్బిబ్బయ్యాను చాలాసేపు. అందులోనూ మరి కొద్ది రోజుల్లోనే ఉద్యోగ విరమణ చేయనున్నందున రిజిస్ట్రారు దొరికినకాడ దొరికనట్లుగా తెగ మేసేస్తున్నాడని కార్యాలయం ముందు చేరిన గుంపులో చర్చ జరుగుతుండగా విని … ‘అబ్బో పెద్ద లంచగొండికి ఏ నజరానా ఇవ్వకుండా పనిచేయించుకుపోతున్నానన్నమాట” నన్ను నేనే పదేపదే అభినందించుకున్నాను కూడా. ఇదంతా జరుగుతుండగానే సిబ్బంది కాగితాలు మీద కాగితాలు రాసేశారు. వాటిని కంప్యూటరులో నిక్షిప్తం చేసేశారు. స్టాంపు డ్యూటీ అనీ, రిజిష్ట్రేషను ఫీజు అనీ పదహారు వేల రూపాయల దాకా కట్టించుకున్నారు. అదంతా చట్టం ప్రకారమే అయినా, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అవినీతి గోచరించింది నాకు. మా వ్యవహారంలో అమ్మిందీ లేదు, కొన్నది లేదు. కేవలం తండ్రి చనిపోయాడు గాబట్టి, ఉన్న కొద్దిపాటి స్థిరాస్తిని వారసులముగా చెరికాస్త తీసుకున్నాం. అంతే దీంట్లో మాకు ఏమి ఆదాయం ఉందని ప్రభుత్వం ఉట్టినే మానుంచి పదహారు వేల రూపాయల్ని లాగేసుకుంది? ప్రజాస్వామ్యం అని నమ్మిస్తూ ప్రభుత్వం ఆడే నిరంకుశ చర్య.
ఇక్కడే మరొక విషయం చెప్పాలి. స్టాంపులకూ, రిజిస్ట్రేషనుకూ కలిపి రూ. 17500 ఇవ్వమని ఒకరు ముందే తీసుకున్నారు. పని పూర్తయిన తర్వాత ఎటూ లెక్క చెబుతారని నేను అనుకున్నాను. అదే విధంగా పనంతా అయిపోయిన తర్వాత అధికారికంగా రూ. 16000 ఖర్చయిందనీ, మరొక రూ. 1500 మామూలు తీసుకున్నామనీ సదరు చిన్న మనిషి వివరించాడు. మామూలు అన్న పదం వినపడగానే నాకు వళ్లు మండిపోయింది. కోపం రగిలిపోయింది. అయినా తమాయించుకుని నేను ఫలానా… అని మళ్లీ విన్నవించుకున్నాను. ”నిజమేనండీ, మీరేమో పాత్రికేయుడిని అంటున్నారు. లంచం ఇవ్వనంటున్నారు. బాగానే ఉంది. కానీ మీ దగ్గర నుంచి రూ. 1500 మామూలు తీసుకున్నానని రిజిస్ట్రారుకు చెప్పాను కూడా. అయన ఏమీ అనలేదే?! అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు. ” ఆయన మరచిపోయి ఉంటాడేమో? మీరొకసారి వెళ్లి గుర్తుచేయండి. ఆయన ఇచ్చేయమంటే తిరిగిస్తాను. నాదేముంది సార్‌, చిరుద్యోగిని. పెద్దోళ్లు ఎట్ల చేయమంటే అట్లా చేస్తాను.” జేబురించిన ముఖంతో ఉచిత సలహా ఒకటి పారేసి ఆయన లోపలికి వెళ్లిపోయాడు. దాంతో నేను రిజిస్ట్రారు మౌలాలిని కలిసి నా పాత్రికేయ సంబంధిత పాత రికార్డును మరోమారు వల్లెవేశాను. మౌలాలి మహా మునిలా అంతా విన్నాడు. ”నిజమేనండీ, మీరు పాత్రికేయుడు కాబట్టి పని చేయించాను. అసలు నాకు ఆరోగ్యం బాగాలేదు. ఇంకొకరయితే రేపో, తర్వాతో రమ్మనమనేవాడిని” అంటూ ఏదో చిట్టాను విప్పి దానిని చదివే పనిలో నిమగ్మమయ్యాడు. నేను నచ్చచెబుదామనుకున్నా వినే ధోరణి కనపడలేదు. దాంతో కోపం నషాళానికి అంటింది. ప్రశాంతమయిన మనస్సులో కల్లోలం చెలరేగింది. కడుపు భగభగ మండటం ప్రారంభమయింది. ” మేత వేస్తే తప్ప పని చేయనని ముందే చెప్పి ఉండాల్సింది. నేను మీకు గడ్గి వేయాలనుకుంటే, వేయగలిగి ఉంటే మీతో పనిచేయించుకునేవాడిని. లేకుంటే వెళ్లిపోయేవాడిని గదా? అంత అనారోగ్యంగా ఉంటే నా తర్వాత వచ్చిన మరొక ఇద్దరి పనిని ఎట్లా చేయించారు? అంటే మీరు తినటానికి గడ్డి వేస్తే ఆరోగ్యం దానంతటదే వస్తుంది. గడ్డి లేకపోతే మీకు దానంతట అదే అనారోగ్యమూ కలుగుతుంది. అసలు నీలాంటి వాళ్లను మనుషుల మీదకు తోలిన ప్రభుత్వాన్ని అనాలిగానీ, నిన్నని ఏమి లాభం? రాజస్తాన్‌ థార్‌ ఎడారిలో ఎర్రటి ఎండలో ఇసుక ఎత్తే పని చేయించాల్సిన నీతో ఆస్తిపాస్తుల్ని లెక్కలుగట్టే పని చేయిస్తోన్న ప్రభుత్వానికి సిగ్గూ లజ్జా లేదు. ఛీ … నీతో మాట్లాడటం దండగ” అని సదరు లంచగొండిని చీదరించుకుని బయటకు వచ్చేశాను.
కొసమెరుపు : అవినీతిని అంతమొందించేకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ రాజధానిలో అన్నా హజారే నిరాహార దీక్ష సాగిస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరగటంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ అన్నా హజారే, ఆయన పరివారం, ప్రభుత్వం, వాళ్లు తెచ్చే చట్టాలు అవినీతిని నిజంగా అంతం చేస్తాయా? నమ్మొచ్చా?? నాకయితే నమ్మకం లేదు. మరి మీకో?!

అమ్మో !… కీర !!

  • ఐరోపాలో ‘ఇ.కొలి’ బాక్టీరియా

మా ఆహార, వస్తు ప్రమాణాలే వేరు అంటూ వర్ధమాన దేశాల ఉత్పత్తులను తక్కువ చేసి చూసే ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు తమ దేశాల్లో పండిన కీర(దోసకాయలు), టమాటాలు, కాబేజిని చూస్తే అల్లంత దూరం ఉండమని తమ పౌరులకు చెబుతున్నాయి. మోన్‌శాంటో, బేయర్‌ వంటి బహుళజాతి గుత్త సంస్థలు తమ లాభాలకోసం జన్యుమార్పిడితో తయారు చేస్తున్న విత్తనాలు, మొక్కల కారణంగా ఇప్పటివరకు జీవరాశులకు ఎలాంటి హాని చేయని బాక్టీరియా కూడా ప్రాణాలు తీసే శక్తిని సంతరి0చుకుంటున్నది. కారణాలేమిటో ఇంకా వెల్లడి కాలేదుగాని ఇప్పుడు ఐరోపా, అమెరికా, జపాన్‌లను వణికిస్తున్న ‘ఇ.కొలి’ బాక్టీరియా అటువంటి ప్రభావాన్నే చూపుతోంది.

మానవ, జంతువుల జీర్ణవ్యవస్థలలో హాని కలిగించని అనేక బాక్టీరియాలలో ‘ఇ.కొలి’ ఒకటిగా ఇప్పటివరకు పరిగణిస్తున్నారు. అయితే వీటిలో షెర్చియా కొలి అనే రకం షిగా టాక్సిన్‌ అనే విషపదార్ధాన్ని విడుదల చేస్తుంది. ఇది  అతిసార  కలిగిస్తుంది. మరీ ఎక్కువైతే జీర్ణవ్యవస్థలోని ఎర్ర రక్తకణాలను దెబ్బతీసి చివరకు కిడ్నీ వైఫల్యానికి కారణం అవుతుంది. నరాల వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘హెచ్‌యుఎస్‌’ అంటారు. ఇది ప్రపంచ వ్యాపితంగా ఉంది.  అయితే జర్మనీలో తీవ్రంగా ఉందని గతంలో ఎప్పుడూ వెల్లడికాలేదని స్వీడన్‌లోని వ్యాధినిరోధక, అదుపు కేంద్రం పేర్కొన్నది.

ఇది అంటు వ్యాధి కాదు. అయితే ఒకసారి ఈ వ్యాధి సోకినవారు చేసిన వంటను ఇతరులు తింటే వారికి కూడా సోకే అవకాశం ఉంది. ఇది సాధారణంగా చేతులు సరిగ్గా కడుక్కోని పిల్లల్లో మాత్రమే ప్రభావం చూపుతుందని ఇప్పటివరకూ తెలుసు. కానీ, ఇప్పుడు పెద్దవారిలో, అందులోనూ మూడింట రెండువంతుల మంది మహిళ్లో కనిపించటం, మరణాలకు దారితీయటం శాస్త్రవేత్తలకు అంతుబట్టటం లేదు. ఇది ఇంతకు ముందు కనిపించని కొత్త తరహా ప్రమాదకరమైన విష బాక్టీరియా అని చైనా, జర్మన్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

జర్మనీలో ఈ ఏడాదిలో ఇది రెండో వైపరీత్యం. జనవరిలో గుడ్లు, కోళ్లు, పందిమాంసం విషపూరితం అయి జనాన్ని భయపెట్టింది. ఇది తమ దేశంలోకూడా వ్యాపించే అవకాశం ఉందని అమెరికా భీతిల్లుతోంది. ఎందుకుంటే ఇక్కడ కూడా ఆహార పదార్ధాల్లో కల్తీ, ప్రమాణాలను గాలికి వదలటం వంటి ఉదంతాలున్నాయి.  ముందు జాగ్రత్తగా ఐరోపా నుంచి దిగుమతి అయిన ఆహార పదార్ధాలను అమెరికాలో పరీక్ష చేస్తున్నారు. అమెరికాలో 1993లో ఇ.కొలి 0157:హెచ్‌7 అనే బాక్టీరియా ఒక బడా సంస్థ దుకాణాల్లో అమ్మిన కల్తీ మాంసం కారణంగా వ్యాధులను కలిగించింది. తరువాత 2006లో పాలకూరతో ఈ సమస్య తలెత్తింది.

ఇప్పుడు ఐరోపాను బెంబేలెత్తిస్తున్న బాక్టీరియా ఇంతవరకు 1,600 మందికి వ్యాధిని కలిగించగా 18 మంది మరణించారు. వ్యాధిగ్రస్తులలో ఐదువందల మందికి కిడ్నీ సమస్య తలెత్తింది. అమెరికాలో కొన్ని రకాల ఇ.కొలీస్‌ బ్యాక్టీరియా ఏడాదికి లక్షా పన్నెండువేల మందిలో స్వల్ప వ్యాధులను కలిగిస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు జరపకుండానే స్పెయిన్‌ నుంచి వచ్చిన కీర దోసకాయలతో వ్యాధి వచ్చిందని ముందు ప్రకటించారు. తీరా వ్యాధికి అవికారణం కాదని జర్మన్‌ శాస్త్రవేత్తలు ప్రకటించటంతో తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని స్పెయిన్‌ డిమాండ్‌ చేసింది. స్పెయిన్‌ నుంచి కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి. తమ రైతులు కూడా నష్టపోయారని హంగరీ, నెదర్లాండ్స్‌, గ్రీస్‌,ఐర్లండ్‌ ప్రతినిధులు ఐరోపా యూనియన్‌ సమావేశంలో ఫిర్యాదు చేశారు. నష్ట పరిహారం చెల్లించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, జపాన్‌,ఆస్ట్రియా, స్పెయిన్‌, స్విట్జర్‌లాండ్‌, అమెరికాలో ఈ వ్యాధి బయట పడింది. వ్యాధిగ్రస్తులలో ఎక్కువ మంది జర్మనీకి వచ్చి వెళ్లిన వారు లేదా జర్మనీ నుంచి వెళ్లిన వారి ద్వారా సంక్రమించినట్లు చెబుతున్నారు. బాక్టీరియాను గుర్తించేందుకు వారం రోజుల పాటు జరిపే కల్చర్‌ పరీక్షను రెండు రోజులకు కుదించేందుకు రోమ్‌ కృషి చేస్తోంది. కొన్నిదేశాలు కీరా, టమాటా, క్యాబేజీ అమ్మకాలను నిషేధించాయి. ఇదొక అసాధారణ బాక్టీరియా,  గతంలో రోగులనుంచి దీనిని వేరు చేసి చూడలేదని ప్రపంచ ఆహార సంస్థ ఆహార భద్రత నిపుణుడు హైల్డ్‌ క్రుస్‌ వ్యాఖ్యానించారు. అనేక లక్షణాలు కలిగి ఉన్న కారణంగానే  విషపదార్దాలను విడుదల చేస్తున్నదన్నారు.

అయితే అమెరికా ఆహార సంబంధ వ్యాధుల నిపుణుడు రాబర్ట్‌ టాక్సీ 1990 దశకంలో ఇలాంటి బ్యాక్టీరియా దక్షిణకొరియాలో బయటపడిందంటున్నారు.

ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అయితే ఇందరు దేవుళ్లు, దేవతలు ఎందుకు ఉన్నారు?

ఈప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అయితే ఇందరు దేవుళ్లు, దేవతలు ఎందుకు ఉన్నారు? ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? మనం ఎవరినైనా ఈ ప్రశ్నలడిగితే సాధారణంగా వచ్చే సమాధానం ఒకటే. ”దారులు వేరైనా గమ్యం ఒక్కటే, దేవుడిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటారు. ఒక్కో పద్ధతిలో ఆరాధిస్తారు. అందుకు వేరువేరు మతాలు, వేరువేరు దేవుళ్లు, దేవతలు. నిజానికి దేవుడొక్కడే.” ఇటువంటి సమాధానాలు పైకి చాలా బాగుంటాయి. కాని ఇవి అసలు ప్రశ్నకు సమాధానం ఎంతమాత్రమూ కావు. ఒక సూర్యుడు అందరికీ ఒకేలా కనపడ తాడు. ఒక మాట అందరికీ ఒకేలా వినపడు తుంది. మరి ఒక్క దేవుడు మాత్రం అందిరికీ ఒకేలా ఎందుకుండడు? ఎందుకుఉండడంటే దేవుడు అనేది వాస్తవం కాదు. కేవలం మన ఊహ. వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగితే అందరికీ ఒకేలా అర్థమవుతుంది.వాస్తవం కానిది ఊహించు కోవలిసి వస్తే ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్ధమవు తుంది.

మనుషులకు కష్టాలొచ్చినపుడూ, సమస్యలు ఎదురై వాటిని అధిగమించలేకపోతున్నపుడూ దేవుడు గుర్తుకొస్తాడు. అంతే తప్ప మామూలుగా గుర్తుకు రాడు. భక్తి ఉద్యమంపై వ్యాసంలో (గత నెల వ్యాసంలో) ఈ అంశాన్ని ప్రస్తావిం చాను. భౌతిక వాదులు సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనపుడు వాటికి గల కారణా లను అన్వేషించి పరిష్కరం కోసం, వాటిని అధిగమించడం కోసం ప్రయత్నిస్తారు. అదే భావవాదులైతే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు లేని పరిస్థితి రావాలని కోరు కుంటారు. కష్టాలు ఎందుకు వచ్చాయో వాటి మూల కార ణం ఏమిటో పరిష్కారం ఏమిటో భావ వాదులకు అక్కరలేదు. పరిష్కరం అయిపోతే చాలు. పరిష్కా రం సంగతి చూసుకోవలసినది దేవుడే. ఆ దేవుడిని ప్రార్థించడం, పూజించడం మినహా వేరు పనేమి చేయనవసరం లేదు.

భౌతికవాదులు వాస్తవపరిస్థితిని తమ ఆలోచనల్లోకి ఎక్కించుకోవడానికి ప్రయత్ని స్తారు. భావవాదులు తమ ఊహల్ని వాస్తవ ప్రపంచంపై రుద్దుతారు. ఈ ఊహలకే నమ్మకం, విశ్వాసం అన్నపేర్లు పెడతారు. ఈ ఊహల ప్రాతిపదిక పైనే మత వ్యవస్థ రూపొందుతుంది. దేవుడిని ఆరోధించే పద్ధతులూ, ఆచారాలూ దాని ఆధారంగా రూపొందుతాయి. అయితే ఊహాలు వాస్తవ ప్రపంచాన్ని మర్చలేవుగదా! కొంతకాలం పాటు ఊహల ప్రపంచంలో ఊరట పొందినప్పటికీ తాననుభవించే కష్టాలు అలానే కొనసాగుతూ వుంటే సగటు మనిషికి మళ్లీ సందేహం వస్తుంది. గజేంద్రమోక్షం (భాగ వతం) పద్యాలలో ”కలడు కలండనెడివాడు కలడో లేడో|| అన్న సందేహం ”ఉన్నావా? అసలున్నావా? ఊరికే కళ్లుముసుకు న్నావా? ఈ లోకం కుళ్లు చూడకున్నావా?” అన్న భక్త తుకారాం సందేహం ఇలాంటివే. సందేహం వచ్చిందంటే విశ్వాసం సడులుతుంది. విశ్వా సమే పునాదిగా ఉన్న మతవ్యవస్థ బలహీన పడుతుంది. అప్పుడు ఆ మతవ్యవస్థను తిరిగి బలంగా నిల బెట్టడానికి ప్రయత్నం అవసరమౌ తుంది. ఒక్కో సారి ఉన్న మతంలో సంస్కరణల ద్వారా, మరొక ప్పుడు ఏకంగా కొత్త మతాన్నే ముందుకుతేవడం ద్వారా పరిష్కారం దొరుకు తుంది. అందుకే ఇన్ని మతాలూ, ఇందరు దేవుళ్లూ మనకు కనపడుతారు. ఒకపైపు అజ్ఞానం, ఇంకోవైపు నిస్సహాయత, నిస్పృహ చుట్టముట్టగా నడిమిలో ఇరుక్కుపోయిన ప్రజలకు ఎందరు దేవుళ్లయినా చాలరు. ఎన్నిరాళ్లకు మొక్కినా సరిపోదు.

నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన సామా న్య ప్రజానీకానికి చేరువగా దేవుడిని తేడంలో భక్తి ఉద్యమం విజయం సాధించింది. వివిధ రూపాల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి అభ్యుదయ పాత్ర పోషించింది. అయితే భక్తివల్ల ప్రజల కష్టాలు తీరవుకదా! కొత్త సమస్యలూ, కొత్త కష్టా లూ కొన్నిచోట్ల కొత్త మతానికి ఆస్కారం కల్పి స్తాయి. అలా వచ్చినదే సిక్కుమతం.

ఇది భక్తి ఉద్యమం కొనసాగింపుగా మొదలై ఒక ప్రత్యేక మతంగా రూపొందింది. 15వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఈ మతం మొదలైంది. క్రీ.శ 1469లో తల్వాండ్‌ లో (ఇది లాహౌర్‌కి 80 కిలో మీటర్ల దూరంలో ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉంది) జన్మించి 1539 వరకూ జీవించిన నానక్‌ దీనికి ఆద్యుడు. నానక్‌ కాలం నాటికి భక్తి ఉద్యమం భారత ఉప ఖండంలో అనేక రూపాలలో విస్తరించింది. దేవుడి పవిత్ర నామ జపంతోనే మోక్షం లభిస్తుం దని ప్రచారం చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా రామకోటి రాసే వారిని చూస్తున్నాం. ‘రామనామ తారకం భక్తిముక్తి దాయకం’ అంటే అర్థం రాముడి పేరును పదే పదే ఉచ్ఛరిస్తే మోక్షం వస్తుంది అని. తులసీదాసు, కబీరు వంటివారు దీనిని బాగా ప్రచారం చేశారు. కబీరు ప్రచారం చేసిన సాంప్రదాయాన్నే అంది పుచ్చుకుని నానక్‌ తన మతాన్ని రూపొందిం చాడు. ఇస్లాం మతం నుండి భక్తి ప్రధానమైన సూఫీ మతం కూడా ఈ కాలం నాటికి ఉత్తర భారత దేశంలో ప్రచారంలో ఉంది. ఒక మంత్రాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే అనుకున్నది సాధించగలమని విశ్వసించే తాంత్రిక యోగం ప్రభావం కూడా నానక్‌పై ఉన్నట్టు కనపడుతుంది.

నానక్‌ చెప్పిన ప్రకారం దేవుడు రూపం లేనివాడు (నిరంకార్‌), శాశ్వతమైన వాడు (అకల్‌), అనిర్వచనీయమైన వాడు (అలఖ్‌), సర్వవ్యాపి (సరచ్‌ వియాపక్‌). ఇంటువంటి లక్షణాలుగల భగవతుండిని తెలుసు కోవడానికీ, చేరుకోవడానికీ మానవులకు ఎంతో దయతో పలు అవకాశాలను భగవంతుడే కల్పించాడు. అయితే మానవుడు స్వభావరీత్యా భగవంతుడిని తెలుసుకోడానికి నిరాకరిస్తాడు. మానవులు తమ చుట్టూ ఉన్న దేవుడిని చూడలేని గుడ్డివాళ్లు. హిందువులు దేవాలయాల్లో చేసే పూజలుగానీ, ముస్లింలు మసీదుల్లో చేసే నమాజ్‌లు గానీ దేవుడిని చేరుకో డానికి తొడ్పడతాయని వారు నమ్ముతారు. ఇలాం టివి ఎందుకూ పనికిరావు. నిజానికి ఈ పూజలూ, నమాజ్‌లూ మానవులను చావు పుట్టుకల చక్రభ్రమణంలోనే మగ్గిపోయేలా చేస్తాయి తప్ప దానిని దాటి దేవుడిని చేరుకోడా నికి దోహద పడవు.

మానవులు తనను చేరుకోడానికి వీలుగా భగవంతుడు శబ్దరూపంలో తననుతాను తెలియ పరుచుకున్నాడు. ఈ శబ్దం గురువు ద్వారా మానవు లకు తెలియపరుస్తాడు. గురువు హృదయంలో ఈ శబ్దం దేవుని మహాత్మ్యం వలన ప్రతిధ్వనిస్తుంది. దానిని గురువు శిష్యు లకు తెలియజేస్తాడు. గురువు ద్వారా దేవుడిని తెలుసుకోగలిగిన శిష్యుడు దేవుని ఆదేశాన్ని గ్రహించగలుగుతాడు. దాన్ని గ్రహించ గలిగిన నాడు సామరస్యం ఏర్పడుతుంది. దీనికొక క్రమ శిక్షణ కావాలి. ఒక పద్ధతి ప్రకారం దైవ నామస్మరణ చేయాలి. దానికే కీర్తనం అన్నారు.

సిఖ్‌ అంటే అర్థం శిష్యుడు, సిక్కుమతం అని వాడుకలో మనం అంటున్నాం. కాని ఈ మతం అసలు పేరు గురు మతం. గురుద్వారా అంటే అందరూ ఒక దగ్గర కూడి సంకీర్తనం చేసేస్థితి. అమృతసర్‌లోని స్వర్ణదేవాలయం గురుద్వారాలన్నిటి లో ప్రముఖమైనది. సిక్కుల నాల్గవ గురువు అర్జున్‌దేవ్‌ (1563-1606) హరిమందిర్‌ పేరిట దీనిని తొలుత నిర్మించాడు. రాజా రంజిత్‌సింగ్‌ 19వ శతాబ్దంలో దీనిని స్వర్ణదేవాలయంగా అభివృద్ధిచేశాడు. నానక్‌ విగ్రహారాధననూ, కులవ్య వస్థనూ తీవ్రంగా వ్యతిరేకించాడు. గురుద్వారాలలో ఎక్కడా దేవుని విగ్రహాలుండవు. అన్ని కులాల, మతాల వారికీ, స్త్రీ పురుషులకూ తన మతంలో ప్రవేశం కల్పిం చాడు. అందరూ కలిసి ఒకే చోట భోజనం చేసే పద్ద్ధతి ఈ నాటికీ గరుద్వారాలన్ని టిలోనూ పాటిస్తారు.

హిందూ, ముస్లిం, బౌద్ధమతాలకు చెందిన వివిధ రకాల మతాచారాలు ఆనాడు పంజాబ్‌ ప్రాంతంలో ఉండేవి. తాంత్రిక యోగుల రహస్య దీక్షలూ, రకరకాల పూజలూ, పేదప్రజ లను ముఖ్యంగా మహిళలను చిన్న చూపు చూసే ఆచారాలూ అమలులో ఉండేవి. యోగుల దీక్షలకు ప్రధాన ఆటంకం స్త్రీలేనని ప్రచారంచేసే వారు. పాపాలకు మూలం స్త్రీ అని వారనేవారు. కొన్ని తరగతుల హిందువులలో, ముస్లింలలో పరదా పద్ధతి అమలులో ఉండేది. సతీసహ గమనం పెద్ద ఎత్తున అమలు జరిగిన కాలం అది. నానక్‌ స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రభో దించాడు. తన మతంలో వారికి సమాన స్థానం కల్పించాడు. పాపానికీ, అపరిశుభ్రతకీ, మోహానికీ, చంచల త్వానికీ, మోసానికీ, విచక్షణరాహిత్వానికీ ప్రతీ కగా స్త్రీని అభివర్ణించాడాన్నీ, లక్షణాలన్నీ స్త్రీల సహజ స్వభావంగా పేర్కొనడాన్నీ నానక్‌ తీవ్రంగా ఖండిచాడు. పుట్టుకలోనే ఆడపిల్లల్ని చంపేయడం, బాల్యవివాహాలూ, బహుభార్యత్వం, వ్యభిచారం, అత్యాచారాలు వంటి దురాచారాలను గట్టిగా ఎదిరించాడు. సిక్కు మతంలో వాటికి స్థానం లేదని చెప్పాడు. గురువు ద్వారా నామ సంకీర్తనం చేసే పద్ధతి సిక్కులలో నానక్‌ నుండి వరుసగా పాటిస్తూ వచ్చారు. నాలుగో గురువు అర్జున్‌ సింగ్‌ కాలంలో ఈ సంకీర్తనలను గ్రంథస్తం చేశారు. సంకీర్తనం జరిగే అన్ని ప్రదేశాలలోనూ గురువు ప్రత్యక్షంగా ఉండడం సాధ్యం కాదు గనుక ఈ గ్రంథాన్ని గరువుగా పరిగణించసాగారు. దాన్ని ఆది గ్రంథ్‌ అని గురు గ్రంథ్‌ సాహెబ్‌ అని అంటారు.

సిక్కుల కూటమిని ఖల్సా అంటారు. మతంలో చేరదలచిన ప్రతివారూ దీక్ష తీసుకో వాల్సి వుంటుంది. తొలుత ఎక్కువగా పట్టణ ప్రాంత వ్యాపారులు (ఖత్రీ) ఈ మతంలో చేరారు. క్రమంగా ఈ మతం ప్రజలలో ఆదరణపొందింది. రైతాంగానికి చెందిన జాట్‌లు, కొన్ని తక్కువ కులాల వారు సైతం ఖల్సాలో చేరసాగారు. ఇది ముస్లిం పాలకులకు కన్నెర్ర అయింది. ఇంకోవైపు ఆప్ఘన్‌ ప్రాంతంనుండి ముస్లిం రాజుల దండయా త్రలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. దీర్ఘకాలం ఈ తాకిడులను తట్టుకోవలిసి వచ్చిన క్రమంలో వీరంతా శివాలిక్‌ పర్వతాల నడుమకు వలసపో వాల్సి వచ్చింది. అక్కడ అప్పటికే ఉన్న తెగులను కుడా కలుపుకున్నారు. జాట్‌లూ, శివాలిక్‌ ప్రాత తెగల ప్రజలూ ఆయుధాల వాడకంలో అంతేరిన వారు. వారు జీవించిన భౌతిక పరిస్థితులు అటువవంటివి. సిక్కుల 9వ గురువు తేజ్‌ బహ దూర్‌ను ఔరంగజేబు హత్యగావించాడు. ఏడవ గురువైన గోవింద సింగ్‌ కుమారులను నలుగురినీ చంపించాడు. ఈ పరిస్థితుల్లో సిక్కుల్లో ఒక యుద్ధ సంస్కృతిని గురు గోవిందసింగ్‌ ప్రవేశపెట్టారు.

పంచ్‌ కకారాలు సిక్కుమతం ఆచారల్లో అత్యంత ప్రముఖమైనవి. క్రీ.శ (జత్తు కత్తిరించు కోరాదు), కరా (చేతకి ఉక్కుకంకణం), కంగా (దువ్వెన), కబ్బా (గోబీ), కిర్వాణ్‌ (కత్తి).. ఇవి ప్రతి సిక్కువద్దా ఉండాలి.

ఖల్సా (సిక్కుసంఘం) అత్యున్నతమైనది. ఖల్సా కోసం ఏమైనా ప్రాణాలతో సహా అర్పిం చగలిగి వుండాలి. ”ఖల్సా నా ఊపిరి, ఖల్సానా ఆత్మ, ఖల్సా నా ప్రతిష్ట, ఖల్సా యే నేను, ఖల్సా నా జాతి, నా కర్మ ఖల్సా నా ఆంతరాత్మ, ఖల్సా నా ఆదర్శగురువు, ఖల్సా నాకు ధైర్యానిచ్చే మిత్రుడు, ఖల్సా నాకు తెలివినీ, విజ్ఞతనూ ఇస్తుం ది, ఖల్సా నా ధ్యానానికి లక్ష్యం- గురుగో విందసింగ్‌.”

ఏడవ గురువు గురు గోవిందసింగ్‌ తర్వాత సిక్కు గరువుల పరంపర ఆగిపోయింది. గురువు స్థానాన్ని గురు గ్రంథ స్రాహిబ్‌ తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకున్నా గురు గ్రంథ సాహిబ్‌ సమక్షం లో తీసుకోవాలి. పలు గురుద్వారాలు ఏర్పడ్డాక వాటి ప్రతినిధులతో కూడిన అకల్‌ తక్త్‌ సర్వాధి కారులు కలిగిన వేదికగా రూపొందింది.

ఇవన్నీ కలిసి 17, 18 శతాబ్దాలలో సిక్కులను ఒక సంఘటిత శక్తిగా నిలిపాయి. వ్యకి ప్రాధాన్యత కన్నా సమిష్టి తత్వానికి ప్రాధ్యానత కలిగిన విశిష్టమైన మతంగా సిక్కు మతం ఉంది. దేవుడిని చేరుకోవడం ఎలా అన్న దగ్గర మొదలైన సిక్కు మతం ఆఫ్ఘన్‌, ముస్లిం పాలకుల తాకిడిని తట్టుకుని మనుగడ కొనసాగించడమెలా అన్న లక్ష్యంతో ముందుకు నడిచింది. ఇది మంచి ప్రయోజనాలను కలిగించినప్పటికీ, కాలక్రమంలో కొన్ని దుష్పరిణామాలకూ కారణమయ్యింది.

ఖల్సాకు అత్యున్నత వేదిక అయిన అకల్‌ తక్త్‌ను 20వ శతాబ్దంలో అకాలీ దళ్‌ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోనారంభించింది. లౌకిక ప్రజాస్వామ్యంలో ఇటువంటి ధోరణులు ఎప్పుడూ దుష్పలితాలనే ఇచ్చాయి, ఇస్తాయి. ఆరెస్సెస్‌, విశ్వహిందూ పరిషత్‌ వంటి హిందూ మతోన్మాద సంస్థలు గానీ, ఇస్లామిక్‌ మతోన్మాద సంస్థలుగానీ, దేశంలో ఏవిధంగా మత విద్వేషానికి కారకాలయ్యాయో అదేవిధంగా మతాన్నీ, రాజకీయాలనూ కలగలిపిన పర్యవసానంగా ఖలిస్తాన్‌ ఉద్యమం తలెత్తి దేశానికి అపార నష్టం తెచ్చింది.

సిక్కు మతం పుట్టుక, పరిణామాన్ని అధ్యయనం చేసినపుడు సాపేక్షంగా ఒక స్వల్ప కాలవ్యవధిలో (15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు) పలు విధాలా ఆ మతం మార్పు లకు లోనవడం మనకు కనబడుతుంది. మోక్ష సాధన లక్ష్యంగా మొదలై భౌతిక, వాస్తవ సమస్యలను పరిష్కరించడానికీ, ఉనికిని నిలబెట్టు కోడానికీ ప్రాధాన్యతనిచ్చి ఆ క్రమంలో ఒక మిలిటెంట్‌ స్వభాన్ని సంతరించకోవడం, ఆ తర్వాత ఆధునిక రాజకీయాలలో ఒక సాధనంగా మారిపోవడం మనం చూస్తాం. ఒకప్పుడు హిందూ మత దురాచారాలను తెగనాడి సంస్కరణోద్య మంగా మొదలైన సిక్కు మతం నేడు హిందూ మతోన్మాద రాజకీయాల కూటమితో సన్నిహితంగా దిగబడిపోవడం మనం చూస్తున్నాం.

భక్తి ఉద్యమంగానీ, సిక్కుమతంగానీ ఒకనొక దశలో అభ్యుదయకరమైన పాత్రను పోషించిన ప్పటికీ అదితాత్కాలికమే నన్నది మనకు స్పష్టంగా కనపడుతుంది. భావవాద పునాదుల్లోంచి తలెల్తిన మతం, అది ఎంత ఉధాత్తమైన భావాలతో రూపొందినప్పటికీ ఆచరణలో అంతిమంగా అది అభివృద్ధి నిరోధకులకే తోడ్పడుతుంది.

ఎం.వి.ఎస్‌. శర్మ

విమాన ఇంధన ధరలు తగ్గింపు

సామాన్యులు ఉపయోగించే వంట గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారం వేస్తోన్న ప్రభుత్వం, సంపన్నుల కోసం ఉపయోగపడే విమాన ఇంధన ధరలను మాత్రం తగ్గించింది. తీవ్ర నష్టాల్లో ఉన్నామంటూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఒకవైపు పెట్రోల్‌ ధరలను పెంచుతున్నాయి. ముడి చమురు అంతర్జాతీయ ధరలు తగ్గిన కారణంగా విమాన ఇంధన ధరలను నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు అవే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గించిన ధరలను మంగళవారం ప్రకటించాయి. ఢిల్లీలో కిలో లీటరు విమాన ఇంధనం ధర రూ.56,466.11 ఉండగా,  3.95 శాతం అంటే రూ.2,327.89  తగ్గించారు. ఇప్పటివరకు రూ. 56.46 వున్న లీటరు విమాన ఇంధనం ధర రూ. 54.14కి తగ్గింది. యుపిఎ-2 సర్కారు తీరిదీ!