కోనసీమ క్రాప్‌ హాలిడేలో కాలిపోతున్న బతుకులెవరివి?

వ్యవసాయ కూలీగా కౌలు చేస్తున్నవారు కూలిపై వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పేదరైతుగా కౌలుచేస్తున్న వారు సొంత భూమి పై వచ్చిన ఆదాయంలో వచ్చిన కొంత భాగాన్ని కూడా కౌలుసాగు నష్టంలో కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రాప్‌ హాలీడే ప్రకటించిన 3 మాసాల్లోనే అటు వ్యవసాయం లేకపోవడంతో కొత్తగా అప్పులిచ్చేవాళ్ళు లేక పాత అప్పులు వత్తిడితో దిక్కుతోచక కోనసీమలో 10 మంది కౌలురైతుల ఆత్మహత్యతో వారి బతుకులు కాలిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమగా పిలువబడే అమలాపురం ప్రాంతంలో 8 మండలాల్లో పూర్తిగాను 5 మండలాల్లో పాక్షికంగాను సుమారు 80 వేల ఎకరాల్లో భూస్వాములు, పెద్దరైతులు క్రాప్‌ హాలీడే (పంట విరామం) ప్రకటించారు. పేదరైతులు, కౌలురైతులు చేసేదిలేక అయిష్టంగానే ఫాలో అయినారు. దీనికి కారణాలను, పరిష్కారాలను సూచించేందుకు రిటైర్డు చీఫ్‌ సెక్రటరీ మోహన్‌కందా కన్వీనర్‌గా క్రాప్‌ హాలీడే పరిశీలనా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఒకరోజు మాత్రమే ఆ ప్రాంతంలో పర్యటించింది. వ్యవసాయ కార్మికులు, పేదరైతులు, కౌలురైతులను కలుసుకోకుండానే పాక్షిక పరిష్కారాలతో రిపోర్టును రాష్ట్రప్రభుత్వానికి సమర్పించింది. ఈ పరిస్థితుల్లో క్రాప్‌ హాలీడేకు ముందు తర్వాత పచ్చని పంట మంటల్లో కాలిపోతున్న బ్రతుకులెవరివన్నది మౌలిక ప్రశ్న. అప్పుడే ప్రభుత్వాలు, సమాజం ఆదుకోవాల్సిందెవరిని అనేది తేలుతుంది.

ప్రత్యేకించి కోససీమ ప్రాంతంలో సాగవుతున్న భూమిలో 80 శాతం పైగా కౌలురైతులే సాగుచేస్తున్నారు. సామాజికంగా చూస్తే వీరిలో అత్యధికులు దళితులు, బిసిలు. వర్గరీత్యా వ్యవసాయ కార్మికులు, పేదరైతులు. రెండు పంటలకు కౌలు సుమారు 24 బస్తాలుగా ఉంది. ప్రభుత్వ బ్యాంకులు పావలా వడ్డీ రుణాలు వ్యవసాయం చేయని భూ యజమానులకే ఇస్తున్నందున కౌలురైతులు వ్యవసాయ పెట్టుబడికి 48శాతం వడ్డీ రేటుకు కమీషన్‌, వడ్డీ, ఫెర్టిలైజర్‌ వ్యాపారుల(వీరే కౌలుకిస్తున్న భూ యజమానులుగా కూడా ఉంటున్నారు.) వద్ద అప్పుగా తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నామకా తెరిచి నాణ్యతా ప్రమాణాల పేరుతో నామమాత్రంగా కొంటున్నారు. అవి పలుకుబడి కల్గిన పెద్దరైతుల వద్ద, మిల్లర్ల వద్ద మాత్రమే. దీంతో మొదటి పంట భూయజమానులకు కౌలుగా చెల్లించగా రెండవ పంటను అయినకాడికి పంట కల్లాల్లోనే మద్దతు ధర కన్నా 100 నుండి 200 రూపాయలు తక్కువకు పెట్టుబడి పెట్టిన షావుకారులకే కౌలు రైతులు, పేదరైతులు అమ్ముకోవలసి వస్తున్నది. ప్రకృతి వైపరీత్యాలు తరుచూ రావడంతో పంట దెబ్బతిని నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయ కూలీగా కౌలు చేస్తున్నవారు కూలిపై వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పేదరైతుగా కౌలుచేస్తున్న వారు సొంత భూమి పై వచ్చిన ఆదాయంలో వచ్చిన కొంత భాగాన్ని కూడా కౌలుసాగు నష్టంలో కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రాప్‌ హాలీడే ప్రకటించిన 3 మాసాల్లోనే అటు వ్యవసాయం లేకపోవడంతో కొత్తగా అప్పులిచ్చేవాళ్ళు లేక పాత అప్పులు వత్తిడితో దిక్కుతోచక కోనసీమలో 10 మంది కౌలురైతుల ఆత్మహత్యతో వారి బతుకులు కాలిపోయాయి.

కోనసీమలో వ్యవసాయం గిట్టుబాటు కానిదెవరికి?

తమ భూములను కౌలుకిస్తూ ఏ ఖర్చు పెట్టకుండా, ఒకరోజూ శ్రమ చేయకుండా ఎకరానికి 24 బస్తాలు రెండుపంటలకు కౌలుగా భూ యజమానులు తీసుకుంటున్నారు. సుమారు 18 వేల రూపాయల ఆదాయం పొందుతున్న వీరికి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం ఏమిటి ? వ్యవసాయం చేయకపోయినా వేలు, లక్షల్లో బ్యాంకుల నుండి పావలా వడ్డీపై సబ్సిడీ పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట వేయకపోయినా, నష్టం జరక్కపోయినా పంట నష్టపరిహారాలు, పంటభీమా పరిహారాలు వ్యవసాయం చేయనందుకు బోనస్‌ అన్నట్టుగా వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెతగా ప్రభుత్వం భూయజమానులకు కట్టబెడుతోంది. అయినా మాకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, అందుకే క్రాప్‌హాలీడే చేస్తున్నామని వీరు గొంతెత్తి అరవడం ”తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా” లేదూ! వీరికే వడ్డీ వ్యాపారాలు, కమీషన్‌ వ్యాపారాలు, ఫెర్టిలైజర్స్‌ షాపులు, ట్రాక్టర్లు , పట్టణాల్లో వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎకరానికి 25 వేల రూపాయల నికరాదాయం వచ్చే ఎకరాల కొద్దీ కొబ్బరి తోటలూ వీరికి ఉన్నాయి. క్రాప్‌హాలీడే పేరుతో కౌలు రైతులకు రుణార్హత కార్డులివ్వని ప్రభుత్వం సాగు చేయకపోయినా భూ యజమానులకు మాత్రం పావలా వడ్డీ రుణాలు ఇచ్చి తన వర్గ నైజాన్ని చాటుకున్నది. భూ యజమానులే షావుకార్లుగా కూడా ఉండి కౌలురైతుల, పేదరైతులకు పెట్టుబడిపెట్టిన పేరుతో వారి దగ్గర తెగ్గోసి ధాన్యం కొని నిల్వచేసి హెచ్చురేటుకు అమ్ముకుంటారు. 2009, 2010 సంవత్సరాల్లో గతంలో లాగా నిల్వచేసిన ధాన్యానికి హెచ్చురేటు రాలేదన్నదే వీరి దుగ్ధ. అందుకే వీరు సహజంగానే క్రాప్‌ హాలీడేకి నాయకత్వం వహించారు. వాస్తవంగా కనీస మద్దతు ధరలు అందని, లేటుగా కాలువలు వదలడం వలన పంట నష్టపోతున్న కౌలురైతుల, పేద రైతుల్లో అసంతృప్తిని వాడుకున్నారు. వీరి తరపున బికెఎస్‌, రైతాంగ సమాఖ్య లాంటి కార్పొరేట్‌ వ్యవసాయ అనుకూల సంఘాలు క్రాప్‌హాలీడేకు మద్దతు పలుకుతూ నష్టపోతున్న కౌలురైతులను, పేదరైతులను వదిలేసి భూ యజమానులకే ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం వ్యవసాయం చేయని భూయజమానులకు కోరడం న్యాయమా? వారి వర్గ నైజమా? తెలుగుదేశం, బిజేపి, లోక్‌సత్తా పార్టీలు గల్లీ నుండి ఢిల్లీ పార్లమెంటు దాకా ఇదే డిమాండ్‌ చేయడం తగునా? లోపాయికారిగా అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు దీన్నే కోరుకుంటున్నారు. ఈ తంతే రాష్ట్రంలో అక్కడక్కడా ఇతర జిల్లాల్లోను జరుగుతోంది.

అణగదొక్కబడుతున్న పేద, కౌలు రైతుల, కూలీల గొంతు

అమలాపురం ప్రాంతంలో భూకేంద్రీకరణలు ఎక్కువ. వ్యవసాయ కార్మికులూ ఎక్కువే. దళితులు, బిసీలు ఎక్కువ మంది కూలీలుగా ఉన్నారు. క్రాప్‌ హాలీడేతో 3 మాసాలుగా వ్యవసాయ పనులు లేవు. ఉపాధి హామీ పనులు నామమాత్రం. పెరిగిన ధరలతో కుటుంబాన్ని పోషించుకోవడానికి వలసలు పోతున్నారు. అప్పులు చేసుకుంటున్నారు. అర్ధాకలితో, పచ్చడి మెతుకులతో బతుకీడుస్తున్నారు. కౌలురైతుల పరిస్థితి వ్యవసాయం లేక పనులు దొరక్క, అప్పులు దొరక్క పాత ప్రయివేటు అప్పుల వత్తిడితో జీవన్మరణ సమస్యగా తయారైంది. ప్రభుత్వం ప్రకటించిన కౌలురైతుల రుణార్హత కార్డులు వీరికి రాలేదు. ఎకరా రెండెకరాలున్న పేదరైతులు తమ సొంత భూములే సాగుచేసుకోలేక, పనులు లేక అప్పులతో సహజీవనం చేస్తున్నారు. వీరి బాధలు, కన్నీరు, కష్టాలు ఓట్లేయించుకున్న కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి పట్టడం లేదు. వీరు ఓట్లేయించుకొని ప్రధాన ప్రతిపక్షంలో ఉండి అధికారానికి వస్తే ఒరగబెడతామంటున్న తెలుగుదేశం పార్టీకి పట్టడం లేదు. పైగా వీరి కోర్కెల గొంతునొక్కి, వీరి కష్టాల పునాదులపై భూస్వాముల తరపున గొంతెత్తి అరుస్తున్నారు. మోహన్‌కందా కమిటీకి కూడా ప్రభుత్వానికి సమర్పించిన తమ రిపోర్టులో వీరి కష్టాలు, పరిష్కారాలు వ్రాయడానికి ”సిరా” చాలలేదు.

రైతుకూలీలంతా ఏకం కావాలి

వ్యవసాయం సాగుచేసేవాడే రైతు. రైతులంటే సాగుచేస్తున్న పేద రైతులు, కౌలురైతులే అసలైన రైతులు. పెరిగిన వ్యవసాయ ఖర్చులతో, అధిక కౌలు చెల్లింపుతో వ్యవసాయం గిట్టుబాటు కానిది వీరికే. కూలి పనులకు వెళుతూ , పాడి పై ఆధారపడుతూ కూడా అప్పులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. వీరితో పాటు రెక్కల కష్టంపై ఆధారపడి పంటలు పండిస్తున్న వారు వ్యవసాయ కూలీలు. కోనసీమలో స్త్రీకి 100 రూపాయలు పురుషునికి 200 రూపాయలు మాత్రమే కూలీ ఉన్నది. ఉపాధిహామీ పనులు ఈ ప్రాంతంలో చాలా తక్కువ. కానీ భూస్వామ్య శక్తులు కూలీరేట్లు రూ. 200, 300 లకుపైగా ఉన్నాయని, ఉపాధిహామీ వల్ల కూలీలు దొరకడం లేదని మాట్లాడడం అన్యాయం. అవాస్తవం.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి ఉపాధికోల్పోయిన పేద, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి.

కోర్కెలు:

1. స్వామినాథన్‌ కమీషన్‌ సిఫారసు చేసినట్టు ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం అదనంగా ఉండేట్లు ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించాలి. ఈలోపుగా రాష్ట్రప్రభుత్వం క్వింటాలు వరికి 200 రూపాయలు బోనస్‌ ఇవ్వాలి.

2. జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలందరికి ఉపాధి కల్పించాలి. నగదు, వస్తురూపేణా వెంటనే సహాయం చేయాలి.

3.రబీ సీజన్‌కు వర్తించేలా కౌలురైతులకు రుణార్హత కార్డులిచ్చి పంట రుణాలు ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇవ్వాలి.

4.ప్రభుత్వం న్యాయమైన కౌలురేటును నిర్ణయించాలి.

5. మే 15 కల్లా ఖరీఫ్‌కు పంట కాలువలు వదలాలి. ఇరిగేషన్‌, డ్రైనేజి కాలువల ఆదునీకరణ పనులు సత్వరమే పూర్తిచేయాలి.

ఈ కోర్కెల సాధనకు రైతు కూలీలంతా పేదలంతా ఏకం కావాలి. గొంతెత్తి నినదించాలి.పోరాడాలి.

 

-వంగల సుబ్బారావు
(కౌలురైతుసంఘం ప్రధాన కార్యదర్శి)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: