రాష్ట్రాన్ని విడదీయాలన్న తెరాసవైపుకు సమైక్యవాదులు ఒక వేలు చూపితే, నాలుగేళ్లు తమవైపే ఉన్నాయన్న విషయాన్ని మంగళవారం నుంచీ మరోమారు ఆందోళనలకు దిగిన సీమాంధ్రులు గమనించటం మంచిది. ఈ సూచన పలువురికి మంట మండుతుందని నాకు ఎరికే. అయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న బలమైన కోరికగా ఉన్నవాడిగా స్పందిస్తున్నాను. బలవంతంగా పెళ్లి చేయగలమేగానీ, కాపురం చేయించలేమన్న వాస్తవం మిత్రులకు తెలియంది కాదు. గుర్రాన్ని చెరువు దగ్గరకు తోలకెళ్లగలంగానీ, బలవంతంగా నీళ్లు తాగించలేము కదా! సమైక్యవాదులు సీమాంధ్రలో జరిపే ఆందోళనలతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలరేమోగానీ, మనుషుల్ని, వారి మనసుల్ని ఒక్కటిగా ఉంచలేరని చెప్పటానికి వెనుకాడటం లేదు. సమైక్యవాదులకు నిజంగా తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్న కోరిక ఉంటే తెలంగాణ ప్రాంతవాసుల మనస్సులు గెలుచుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయం లేనే లేదు.
ఎదుటివారి మనస్సులను గెలుచుకుని తమ ఆశలను సాకారం చేసుకోసుకోవటం ఒక అంశం అయితే, తమ ప్రాంతవాసుల మద్దతు కనీసం అరవై శాతమయినా పొందాలి. అయితే, మంగళవారం ప్రారంభమయిన కొన్ని కార్యక్రమాలను చూస్తే సమైక్యవాదులు కూడా తెలంగాణవాదుల వలే ప్రజలకు దూరమయ్యే ప్రమాదం కన్పిస్తోంది. తమ వాదాలను విన్పించుకునేందుకు నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు కల్పించాలా? ఏ ఇబ్బందులూ లేకుండానే అటు ప్రజల్నీ, ఇటు ప్రభుత్వ దృష్టినీ ఆకర్షించవచ్చుగదా! ఉదాహరణకు రాస్తారోకోకు బదులు మానవహారంగా ఏర్పడవచ్చు. వీధుల్లో గందరగోళంగా కేకలు వేయటంకన్నా కరపత్రాలు పంపిణీ చేయటం మేలు కదా? పిల్లలతో ఊరేగింపులు తీయటం మాని 20 ఏళ్లకు పైబడినవారే కార్యక్రమాలు నిర్వహిస్తే తల్లిదండ్రులు బాధపడరేమో! ఇంకా పేటలకు పోయి చిన్నచిన్న సభలు జరపొచ్చు. నాటికలు వేయవచ్చు. పాటలు పాడొచ్చు. మిత్రులారా! ఆలోచించండి. కాపురం చేసే కళ కాళ్లు తొక్కిన సమయంలోనే తెలిసిపోతుందన్నట్లుగా సమైక్యాంధ్రవాదుల పోకడలు ప్రారంభంలోనే రాస్తారోకోలతో, అదీ పిల్లలతో చేయించటం చూస్తుంటే భవిష్యత్తు పట్ల భయపట్టుకుంది. జాగ్రతహో! జాగ్రత్త!!
తెలంగాణవాదులు నిర్వహించిన సజస మూలంగా విద్యుత్తు, ఆర్టీసీ ధరల్ని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో తెలుగువారి గుoడెలు నాలుగు వందలసార్లు కొట్టుకుంటున్న తీరును సమైక్యవాదులూ వినండి. సమైక్యవాదులు కూడా తెలంగాణవాదుల మాదిరిగానే పోటీబడి ప్రజలకు చీదర పుట్టించకండి. పలు భారాలతో సతమతమవుతోన్న ప్రజలకు తోడుగా నిలవండి. వారి మనస్సులు గెలవండి. రైతుల, దళితుల, విద్యార్థుల సమస్యలు ఈగల్లా ముసురుకుంటున్నాయి. వాటి పట్ల దృష్టి సారించండి. ప్రజలు మీరు చెప్పే నీతుల్ని వింటారు. రోగుల ఆహాకారాలు వినండి, వారికి ఉచితంగా వైద్యం చేయించండి. మీతో కలిసి ప్రజలు నడవకపోతే అప్పుడు అడగండి.
18 అక్టో
Posted by తాడిగడప శ్యామలరావు on అక్టోబర్ 19, 2011 at 11:16 ఉద.
ఏకీభవిస్తున్నాను.
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో హింసకు దిగనక్కరలేదు.
ప్రజలను యిబ్బందులపాలు జేయనక్కరలేదు.
శాంతియంతంగా హుందాగాకూడా ప్రజాభిప్రాయాన్ని బలంగా వినిపించవచ్చును. సందేహంలేదు.
Posted by Praveen Sarma on అక్టోబర్ 19, 2011 at 12:25 సా.
https://plus.google.com/111113261980146074416/posts/X5rZJ4doPWv ఈ లింక్ చదవండి