Archive for డిసెంబర్, 2011

జర్నీ … చూసేవాటిలో మొదట ఎంచుకోదగిన మoచి చిత్రం


ప్రస్తుతాన్ని వెనక్కు నెట్టి ముందుకు సాగటం ప్రయాణం అయితే రెండు విభిన్నమైన ప్రయాణాలను హృద్యంగా పట్టిచూపిన అరవ అనువాద సినిమా జర్నీ.   ప్రయాణం పేరిట ఇటీవలే ఓ చిత్రం వచ్చినందునేమో, దీనికి జర్నీ అని ఆంగ్ల నామం తగిలించారు.
నేను ఆరేళ్ల హైదరాబాదువాసిగా ముచ్చటగా చూసిన మూడో చిత్రం కూడా నచ్చింది. మొదటి రెండు చిత్రాలలో ఒకటి లీడర్‌ కాగా రెండోది వేదం.
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులూ మిగతా హీరోలతో పోలిస్తే నిజ్జంగా మంచివాళ్లు కావటం ఈ కథకే కాదు, దారి తప్పుతోన్న యువతను కాసింత గాడిలో పెట్టేందుకు ఉపరిస్తుందేమో! అదే విధంగా ఇద్దరు కథానాయికలూ తమదైన శైలిలో కాసింత సొంత బుర్రకలిగినవాళ్లు కావటం మరో విశేషం. దీనికితోడు అమ్మాయిలు పొట్టి లాగూలు వేసుకుని సముద్రపు ఒడ్డున పరుగులు పెట్టరు. అంటే ఎక్కడా వికారం పుట్టించరు. అబ్బాయిలూ అంతే ప్రేమిస్తారు తప్ప అడ్డదిడ్డంగా పాటలు పాడే పని పెట్టుకోరు. దీన్లో ప్రేమ ఉంది… శృంగారాలూ, వికారాలూ లేవు. విరహం ఉంది… గడ్డాలు పెంచుకోవటం కన్పించదు. విషాద గీతాలు విన్పించవు.
ఈ చిత్రంలో రెండు ప్రయాణాలున్నాయని మొదట్లో అన్నాను కదూ, దానిలో ఒకటేమో బస్సు ప్రయాణం చేయకూడని పద్ధతిని చూపింది. రెండోది ఒక యువకుడు, ఒక యువతి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక సోదరి, ఆ మాటకొస్తే పౌరులందరి జీవన ప్రయాణం ఎలా ఉంటే బాగుంటుందో ఉన్నమేరకు ఆదర్శంగా చూపే ప్రయత్నం జరిగింది.
ప్రస్తుతం అన్నిచోట్లా పెద్ద సమస్యగా మారిన అపరిమిత వేగం తెచ్చిపెడుతోన్న అనర్థాలను వాస్తవానికి దగ్గరగా చూపిన దర్శకుడు అందరినీ ఆలోచింపజేస్తాడు.
ఇక రెండో ప్రయాణంలో చెప్పుకోదగిన పాత్ర మధుమతి. ముందుగా పాత్రలో నూరు శాతం వదిగిపోయిన పాత్రధారిణి అంజలికి అభినందనలు చెప్పాలి.
ఆరేళ్లు వెంటబడినా చెత్తగాడికి   లొ0గక పోవటం మధుమతి ప్రత్యేకత. దానికి భిన్నంగా ఆర్రోజుల్లోనే తొమ్మిది వేలు సంపాదిస్తూ ఒద్దికగా బతికే జై ప్రేమను అంగీకరించటం విశేషం. పైగా చాటుమాటుగా, గుడ్డిగా ప్రేమలో పడిపోవటం కాకుండా అతగాడిని పోలీసయిన తన తండ్రి దగ్గరకు పంపటం, తన వెంటబడిన వాడినీ కలవమనటం, హెచ్‌ఐవి పరీక్ష చేయించటం, అవయవదానానికి తాను సంతకం చేస్తూ, అతనినీ ఒప్పించటం… ఈ అన్ని వ్యవహారాలోనూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పటం, ఆమె వైద్యురాలని జై అనుకున్నప్పుడు బేషజాలకు పోకుండా నర్సును మాత్రమేనని నమ్రతగా తెలపటం, అవసరమైనచోట మానవత్వంతో వ్యవహరించిన మధుమతి ఈనాటి యువతకు, ప్రత్యేకించియువతులకు ఆదర్శపాత్రం. ఇష్టపడటం మొదలు పెట్టాక అదుపు తప్పని నడవడికతో ప్రియుడిని (చూసేవాళ్లు రెచ్చిపోయే సన్నివేశాలు లేవు సుమా) సున్నితంగా అలరించటం గొప్పగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు మానవత్వంతో సేవలు చేయటం మన మనసు పొరల్లో ఎక్కడో దాగి ఉన్న దుఖ:ం కట్టలు తెంచుకుని కన్నీటి రూపాన బయటపడిపోతుంది. నేనయితే కేవలం పక్కవాళ్ల కోసమే బిగ్గరగా ఏడవలేకపోయాను. రెప్పలు దాటిన దుఖ:జలాన్ని తుడవలేక చచ్చాననుకోండి. అనన్య పాత్ర కూడా అంతే. నగరవాసుల వెగటు వ్యవహారాలు నచ్చని పల్లెటూరి అమ్మాయిప్రతిదాన్నీ అనుమానించే లక్షణమున్న పాత్ర అది. జీవిత వాస్తవాలు నేర్పిన భయం తప్ప నిజాయితీకి, ఆలోచలనకూలోటు లేదు. అలా ఇద్దరు కథాయికలూ ఎలా వ్యవహరించాలో చూపి ఆడపిల్లలు ఇలా ప్రయాణించాలని నేర్పే ప్రయత్నం చేశారు. అలా అని ఎక్కడా ఆదర్శం పేరిట సాధ్యం కాని ఉపదేశాలు, ఉపన్యాసాలతో నేలవిడిచి సాము చేయలేదు. వారి ప్రవర్తనే వారిచ్చే సందేశం.
ఇక ఈ చిత్రంలో కన్పించే ఒకటి రెండు తప్పులు కూడా లేకుండా ఉంటే బాగుండేది. నాలుగు వరుసల రహదారిలో వాహనాలు ఎదురెదురుగా రావు. అందువలన ఈ చిత్రంలో చూపిన విధంగా విజయవాడ నుంచి హైదరాబాదు బస్సు, హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎదురెదురుగా ఢీకొనటం సాధారణంగా జరగదు. రెండు వరుసల రోడ్డులో మాత్రం అలా జరగవచ్చు. అయితే నాలుగు వరుసల రహదారిలో ఒకేవైపు వెళ్లే వాహనాలతోనే ప్రమాదం.
ఆరు వేల రూపాయలు ఖరీదయిన బట్టలు నాలుగు వందలకే వస్తాయని విజయవాడ వాసులు అప్పటికప్పుడు కోఠికి పోదామని అనుకోరు. అక్కడ బీసెంట్‌ రోడ్డు, వస్త్రలత ఉన్నాయిగా. అక్కడకు పోదామనుకుంటారు గదా! నాలుగు వరుసల రహదారిలో ఎదురెదురు వాహనాలు ఢీకొన్నట్లు చూపటం దర్శకుడి అనాలోచన కాగా, విజయవాడవాసులను కోఠికి పంపే ఆలోచన మాటల రచయిత తప్పిదం. వీలయినచోట తెలుగు ఫలకాలను చూపించటం – అంతలోనే వాతావరణం అరవంలోకి దూకటం వీక్షకులకు ఎంతో కొంత ఇబ్బందే. హైదరాబాదులో కనిపించని ప్రైవేటు సిటీ బస్సుల్ని చూడటం కూడా ఎబ్బెట్టుగా ఉంది.
ఈ సినిమా చూసిన తర్వాత నా కన్పించిందీ… ఎదిగే తోటి తెలుగువాడిని తోటివాళ్లు కాళ్లు పట్టుకుని ఎందుకు లాగుతారంటే అనర్హులు అలా ఎదగ కూడదని మాత్రమే. పక్కనున్న తమిళ తంబిలుజర్నీలా చక్కటి చిత్రాలు నిర్మిస్తుండగా మనోడికి ఆ తెలివి లేకపోయే మరి. కాళ్లు పట్టుకుని కాదు ప్రస్తుతం మన తెలుగు చిత్రసీమను ఏలుతున్నవాళ్లందరికీ మోకులు కట్టి మరీ సముద్రంలోకి లాగి పారేయాలి. అప్పుడు అరవ అన్నల్లా కాసింత తెలివి ప్రదర్శించి, వీక్షకులకు కాసింత తెలివి పంచిపెట్టేవాళ్లకు కాసింత చోటు దొరుకుతుందేమోనని నాబోట్లకు పెద్ద ఆశ.

జనం ఛస్తే నాకేమి … బతికితే నాకేమి – మానవహక్కుల కమిషను ఛైర్మన్‌ తీరూతెన్ను


14 డిసెంబరు 2011. హైదరాబాదు.
ఉదయం 9.30 గంటల సమయం. బస్సులో రాంనగర్‌ నుంచి ఎస్సార్‌ నగర్‌ నందున్న మా కార్యాలయానికి వెళ్తుండగా ఖైరతాబాద్‌లోని ఓ ఇంటి గోడ మీద కన్పించిందా ఆంగ్ల ప్రకటన. మహిళల హక్కుల పరిరక్షణ సదస్సు బెంగళూరులో జరగబోతుందట. ఆ సదస్సులో మాజీ న్యాయమూర్తి వెంకటాచలయ్యతోపాటు రాష్ట్ర హక్కుల కమిషను ఛైర్మన్‌గా పనిచేసిన సుభాషణరెడ్డి ప్రసంగిస్తారు. అది చదవగానే నాకు గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది.
బహుశా రెండేళ్లవుతుందనుకుంటాను ఈ సంఘటన జరిగి. నా మిత్రడొకరిని కలుసుకుందామని జూబ్లీహిల్స్‌కు వెళ్లాను. అతని ఇల్లూ, కార్యాలయమూ పక్కపక్కనే ఉంటాయి. నేను కార్యాలయంలోనే నా మిత్రుడిని కలుసుకుంటుంటాను. ఆ రోజు కూడా కార్యాలయానికి వెళ్లగా అతను ఇంకా రాలేదనీ, ఇంట్లోనే ఉన్నాడనీ సిబ్బంది చెప్పారు. అందువలన మిత్రుడిని కలిసే వెళ్తామని ఆనాటి దినపత్రికలు చదువుతూ అక్కడే కూర్చున్నాను.
అరగంట తర్వాత నా మిత్రుడు వస్తూనే, ”అనుకోకుండా ఓ పెద్దమనిషి చెప్పా పెట్టకుండా వచ్చిందికాక నా సమయాన్నంతా తినేశాడు సుబ్బారావ్‌” అన్నాడు.
”ఎవరా పెద్దమనిషి” వాకబు చేశాను నేను.
”నువ్వు వింటే ఆశ్చర్యపోతావు!” అన్నాడు మిత్రుడు.
”ఇప్పుడు జరిగేవన్నీ విచిత్రాలే గదా! ఇంతకీ ఎవరా పెద్దమనిషి? పట్టు వదలకుండా మళ్లీ అడిగాను.
”నీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను, చెబితే వార్త రాసేస్తావని భయంగానూ ఉంది”
”నిన్ను ఇరుకున పడేయనులే. చెప్పు, నువ్వు రాయమంటేనే వార్త రాస్తాను. లేకపోతే లేదు. విషయం తెలుసుకోవాలిగా” అంటూ ఒత్తిడి చేశాను నేను.
”మానవ హక్కుల కమిషను ఛైర్మను లేడూ …. .. వచ్చింది ఆయనే. అదిగో అక్కడ కొండ కన్పిస్తున్నది చూడు. (సమీపంలోనే ఉంది) దాన్ని గవర్నమెంటు నుంచి ఆయన బంధువు కంకర రాయి కొట్టుకునేందుకుగాను లీజుకు తీసుకున్నాడు. గత వారం రోజుల నుంచీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి కొండను పేలుస్తున్నాడు. రాళ్లు వేగంగా ఎగిరొచ్చి ఈ చుట్టుపక్కల ఇళ్లమీదా, ఇళ్లల్లోనూ పడుతున్నాయి. కొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి. కాంట్రాక్టరుకు ఎంత చెప్పినా వినకపోవటంతో తట్టుకోలేక అందరూ కలిసి పోలీసు స్టేషనుకు వెళ్లారు. పైగా మా బంధువు ఫలానా న్యాయమూర్తి అంటూ అందరినీ బెదిరించాడు. కంకర కొట్టద్దని పోలీసులు చెప్పేశారు. ఇంకొకటేందంటే, హౌసింగ్‌ సొసైటీ నుంచి నేను కూడా కాంట్రాక్టరు మీద చర్య తీసుకోమని అర్జీ ఇచ్చాను. ఇక చూడు, ఈ పెద్ద మనిషి ఒకటే ఫోన్లు. నువ్వు చెబితే అందరూ వింటారు చెప్పమంటాడు. అదేందండీ మీరు మానవహక్కుల కమిషను జడ్జి అయి ఉండి ఇట్లా మాట్లాడటం ఏమీ బాగాలేదే! అన్నా వినడాయె. ఏదో దగ్గర బంధువు, ఏడుస్తున్నాడని చెప్పాల్సి వచ్చిందంటాడు. చూసీ చూడనట్లు ఉండండి సార్‌, మిగతాది నేను చూసుకుంటానుఅంటాడాయన. అప్పటికీ ”జనం బతుకు ముఖ్యమా? బంధువు ఆదాయం ముఖ్యమా??” అని ఘాటుగానే అడిగాను. అసలు విన్పించుకుంటే గదా! వినడు, ఆలోచించడు. తలబప్పి కట్టించాడంటే నమ్ము. జనందేముంది వెర్రోళ్లు, నీబోటి నోరున్నాడు పదిసార్లు ఏది చెబితే అదే నిజమని నమ్ముతారని నాకు నచ్చజెప్పబోతాడు తప్ప తను మాత్రం ఆలోచించడు అంటూ హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌ భాగోతాన్ని పూసగుచ్చాడు మిత్రుడు.
జనం కన్నా తన బంధువు కాంట్రాక్టు పనులే ముఖ్యమని బల్ల గుద్దినట్లు చెప్పాడట. హక్కుల దేముంది? సార్‌, ఎవడి కోసం ఎవరాగుతారు? అని బుట్టలో వేసుకునే ప్రయత్నాలను ఎలా చేశాడో? వివరించాడు.
అదండీ సంగతి… జనం కన్నా, జనం బతికే హక్కు కన్నా… జనం వాదన కన్నా, తన బంధువు ఆదాయమే ముఖ్యమని తాపత్రయ పడిన ఓ మానవ హక్కుల కమిషనరు తీరూతెన్నుకు ఓ చిన్న ఉదాహరణ ఇది

తానోడి నన్నోడెనా? – – సారంపల్లి మల్లారెడ్డి

కాంగ్రెస్‌ ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది.

పాండవులను వారి రాజ్యాన్ని ధర్మరాజు జూదంలో ఓడి పోయాడు. చివరికి శకుని సలహాతో ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడతాడు. గెలిస్తే తాను ఓడిపోయిన రాజ్యంతోపాటు తన తమ్ములు విముక్తులవుతారని అందుకు ద్రౌపదిని ఆటలో పందెంలో పెట్టమని షరతు విధిస్తారు. జూదం వ్యామోహం గల ధర్మరాజు ద్రౌపదిని పందెం కాసి ఓడిపోతాడు. కౌరవులు ద్రౌపదిని ధృతరాష్ట్ర సభకు తెచ్చి కౌరవులకు భానిసగా ఉండమంటారు. ఆ సభలో భీష్మునితో సహా ధర్మకోవిదులందరూ ఉండగానే ద్రౌపది ఒక ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ధర్మరాజు ‘తానోడి నన్నోడెనా.? లేక నన్నోడి తానోడెనా.?’ అని అడుగుతుంది. సభలో ఉన్నవారు తానోడిన తర్వాతనే నిన్ను ఓడాడని సెలవిస్తారు. సర్వం ఓడిపోయినవాడికి నన్ను పందెంలోకాసే అర్హత ఉందా.? అని ద్రౌపది ప్రశ్నిస్తుంది. నిండుసభలో ఎవరూ ఈ ధర్మ సందేహానికి సమాధానం చెప్పలేకపోయారు. అది ”అప్రస్తుతం” అంటూ దాటవేశారు.

అలాంటి పరిస్థితే నేడు ప్రజా రాజ్యం పార్టీ(ప్రరాపా)ని ఆవహించింది. పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తానని, కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతానని ధీరోదాత్త వచనాలు పలికి తిరుపతి బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావ సందర్భంగా తొడగొట్టి ప్రకటించారు. ఆ విధంగా కాంగ్రెస్‌ను, దాని విధానాలను విమర్శిస్తూ ఎన్నికల్లో పోటీచేసి 18 స్థానాలు గెలుపొందారు. అందులో నుండి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ ఎంఎల్‌ఏ పార్టీ ఫిరాయించారు. అతనిపై వేటు వేసే ధైర్యం ప్రరాపాకు లేకుండా పోయింది. అతను కాంగ్రెస్‌ సానుభూతిపరునిగా ఉంటున్నాడు. చివరకు ప్రజారాజ్యం నేత మూటాముల్లె సర్దుకొని మొత్తం తన దుకాణాన్ని మూసేసి కాంగ్రెస్‌ దుకాణంలో చేరాడు. పార్టీ ఏర్పర్చినపుడు కాంగ్రెస్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకించి నేడు ఆ విధానాలనే భుజాన వేసుకొని కాంగ్రెస్‌లో కలిశాడు. తాను రూపొందించిన కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసిన శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ పార్టీ తరపున స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కోరే సందర్భంగా ప్రరాపా ఉనికిలో ఉందా లేదా? అన్నది సంశయమే. అంతకు ముందే తెలంగాణా అంశంపై శాసనసభ సభ్యత్వాలకు టిడిపి, కాంగ్రెస్‌ వారు రాజీనామాలు ఇచ్చినా వారి రాజీనామాలను స్పీకర్‌ అంగీకరించలేదు. స్పీకరు తన విచక్షణాధికారాన్ని వినియోగించి వారి రాజీనామాల్ని తిరస్కరించడమో, లేదా ఆమోదించడమో చేయాలి. ఒకే ఫార్మేట్‌లో రాజీనామాలు సమర్పించిన వారిలో కొందరివి ఆమోదించారు, భావోద్వేగంతో రాజీనామాలు సమర్పించారనే సాకుతో మరికొందరివి తిరస్కరించారు. నేడు శాసనసభలో మూడింట ఒక వంతు శాసనసభ్యులు ఏ పార్టీలో ఉన్నారో అంతుచిక్కని అంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ విప్‌ను ధిక్కరించిన 16 మంది శాసనసభ్యులను ఏమి చేయాలన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపి క్రమశిక్షణా చర్యకు స్పీకర్‌ను కోరింది. స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ సభ్యత్వం రద్దు చేయమని కోరడం విచిత్రంగా ఉంది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది.

ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో ‘ పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు’ తెచ్చినపుడు కాంగ్రెస్‌వారు దీనిని అభ్యుదయ చర్యగా అభివర్ణించారు. కాని అప్పుడే వామపక్షాలు ఈ బిల్లులో ఉన్న లొసుగులను ఎత్తిచూపాయి. మూడింట ఒక వంతు శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడదని, పార్టీ బహిష్కరించినవారికి ఈ చట్టం వర్తించదని మెలికలు పెట్టారు. ఈ లొసుగులే కాక స్పీకర్‌కుగల విచక్షణాధికారాలను వినియోగించి పాలకపార్టీలకు రక్షణ కల్పించడం జరుగుతోంది. దీనిని అవకాశంగా తీసుకొని అనేక రాష్ట్రాలలో చివరికి పార్లమెంటు ఉభయసభల్లో కూడా ఈ ఫిరాయింపుల సమస్య నిరాఘాటంగా సాగిపోతోంది. కొందరు తెలివిగా మరొక పార్టీలో చేరకుండా పాలకపార్టీకీ ప్రమాదం ఏర్పడ్డపుడు సహాయం చేస్తూ వస్తున్నారు. విప్‌ను ధిక్కరించడం ఫిరాయింపుల బిల్లురీత్యా నేరం. ఈ నేరానికి పాల్పడిన వారిని వారి సభ్యత్వాన్ని రద్దుపర్చి తిరిగి అక్కడ ఎన్నికలు జరిపించాలి. కాని పాలకుల విచక్షణకు లోబడి ఈ చట్టం పనిచేస్తోంది. పాలకులు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొంటూ ప్రజలకు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని’ నమ్మబలుకుతున్నారు.

ఒక పార్టీ బ్యానర్‌తో గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని ‘ధృతరాష్ట్రకౌగిలి’ లోకి వెళ్లాడని అనడం రివాజు. ధృతరాష్ట్రుని కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది. పార్టీలో కలిసినాక కాంగ్రెస్‌ పార్టీ విప్‌కు లోబడి ఉండాలి తప్ప ఆ పార్టీ విప్‌ జారీ చేసే అర్హత న్యాయపరంగా ఉందా అన్నది పరిశీలించాలి. నేడు రాష్ట్రంలో పాలన అస్థిరమై, ప్రజా సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 104 ఉద్యోగుల సమ్మె, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఉపాధిహామీ పనుల అమలు చర్చకు రాకుండా పోయాయి. తమ పార్టీలో అతి ప్రజాస్వామ్యముందని చెప్పే కాంగ్రెస్‌, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. తన పాలనను నిలుపుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నది. దేశాన్ని బహుళజాతి సంస్థలకు తాకట్టు పెడుతున్నది. ప్రజాందోళనలపై నిర్బంధం ప్రయోగిస్తున్నది.

అవిశ్వాసంపై గట్టెక్కడానికి పార్లమెంటరీ నిబంధనలను తుంగలోతొక్కి సభ్యులపై సామ దాన భేద దండోపాయాలను ప్రభుత్వం ప్రయోగించింది.. కాంగ్రెస్‌ను పార్లమెంటులో గట్టెక్కించడానికి నాడు పివి నర్సింహారావు ఆనాడు అనుసరించిన ఓటుకు నోటు సంస్కృతినే రాష్ట్ర పాలకవర్గం పుణికిపుచ్చుకుంది. పార్లమెంటరీ విధానానికి తూట్లు పొడవడం కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే విప్‌ జారీ చేసినా తనకు లోబడినవారికి ఒకతీర్పు, వ్యతిరేకించినవారికి మరొక తీర్పు ఇచ్చి తన కుటిలరీతిని ప్రదర్శిస్తోంది.

‘దేగుడు” మా ప్రాంతపు ఆడవాళ్ల తిట్టు


ఈ తెనుగు పదం ఇంకెక్కడయినా విన్పిస్తుందో? లేదో? నాకు తెలియదు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మా ఈదుమూడి గ్రామంలో మాత్రం నేను చిన్నప్పటి నుంచీ విన్న, వింటున్న పదం ఇది. ఈ పదం ఆడవాళ్ల ప్రత్యేకం. వాస్తవానికి ఇది తిట్టు పదం. గ్రామ్యం. ఎవరయినా మగవాళ్లు కానిపనిచేసినా, నోరు జారినా ఆడవాళ్లు కసిగా, కోపంగా, తొలిగా ”దేగుడా” అంటూ తిడతారు. ఒక్కోసారి, కొందరు ”దొంగ నా దేగుడా” అని కూడా కలిపి మరీ తిడతారు.
మా ఊళ్లో ఏ ఏ తిట్లు తిడతారో ఇక్కడ చెప్పబోవటం లేదు సుమా. ఆడవారి తిట్ల భాషనో, మగవారు ఏ పదాలతో తిడతారో అసలే చెప్పబోవటం లేదు. కేవలం దేగుడు పదంపై నా అభిప్రాయాన్ని బ్లాగ్మిత్రులతో పంచుకుందామనే దీన్ని రాస్తున్నాను.
సరే, అసలు విషయానికొస్తే…. దేగుడు – ఈ పదం ”దేవుడు” పదానికి వికృతి. దైవం – దేవుడు అన్న సంస్కృత పదాల నుంచి పుట్టిన తెనుగు పదమే ఈ దేగుడు. ఇంత వరకూ పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదుగానీ, ఈ పద ప్రయోగమే కాస్త విచిత్రం. దేవుడు అంటే మంచివాడు అని కదా మరి దాన్నించి పుట్టిన దేగుడును తిట్టుగా ఎందుకు వినియోగిస్తున్నట్లు? తమ అనుభవాన్నుంచి ఈ పద ప్రయోగం ప్రారంభం అయి ఉండవచ్చు. అయితే ఈ పదం ఎప్పటి నుంచీ వినియోగంలో ఉందో తేలితేగానీ తిట్టుగా ఎలా మారిందన్న విషయాన్ని కచ్చితంగా తేల్చలేమని నా అభిప్రాయం. అయితే రెండు అంశాలు నేపథ్యంగా ఈ పదం వినియోగంలోకి వచ్చి ఉండవచ్చని నా అంచనా. అందులో ఒకటి – ఈ పదం గనుకు స్వాతంత్య్రోద్యమ కాలంలోనో, స్వాతంత్య్రం ఆగమించిన కాలం నుంచో గనుక ప్రారంభమయి ఉంటే మాత్రం అది త్రిపురనేని రామస్వామి చౌదరి నేతృత్వంలో మా ప్రాంతంలోనూ ప్రభావం చూపిన హేతువాద ఉద్యమ ఫలితం అయి ఉండాలి. ఎలాగంటే త్రిపురనేని, ఆయన శిష్యులు మా ప్రాంతంలో పురాణాల గుట్టును విప్పి చెప్పారు.రామాయణం – రాముడు – రావణాసురుడు, శంభూక వధ – సురులు – అసురులు ఇలా దేవుళ్ల బండారాన్ని ప్రచారం చేశారు. రచ్చబండలమీద చేరి రాక్షసుల గురించీ వివరించేవాళ్లు. దీనివలన కొంతమంది ఆలోచనాపరులు రాక్షసుల అభిమానులయ్యారు. సురాపానం చేసే సురులంటే అసహ్యం పెంచుకున్నారు. అంటే దేవుళ్లను తమ శత్రువులుగా గుర్తించారు. అలా దేవుడు అన్న పదాన్ని తప్పుడు పనిచేసిన వారికి, తమకు అన్యాయం చేసిన వారికి, తమపై నోరు పారేసుకున్న వారికీ ఆపాదించి ఛీదరించుకోవటం ప్రారంభం అయి ఉండాలి. కాలగమనంలో పలు పదాలు నోటికి తిరిగినట్లుగా మారిపోయినట్లుగానే దేవుడు పదం కూడా దేగుడుగా మారింది. అన్నట్లు మా ప్రాంతంలో ఈ పదాన్ని చేయిచేసుకునే భర్తలను తిట్టేందుకు కూడా స్త్రీలు విరివిగా వాడతారు.
ఈ పదం ఇంకా ప్రాచీనమయినదయితే మాత్రం దానికి మరో కోణం ఉంది. ఆర్యులు – ద్రావిడుల మధ్య చెలరేగిన తగాదాల్లోనే ఈ పదం పుట్టి ఉండాలి. ఆర్యులు సహజంగానే తమను ఇక్కడ ప్రతిష్టించుకునే పనిలో ఇంద్రుడు, రాముడు, కృష్ణుడిని దేవుళ్లను చేసి ద్రవిడులతో ఆటాడుకున్నారుగదా! అది గిట్టని ద్రవిడులు దేవుళ్లను తిట్టటం సహజం. రాక్షసులను (అసురులు) తమవాళ్లుగా భావించటమూ కద్దు. ఇక్కడ పాగా వేసేందుకు ఆర్యులు – తమ అస్థిత్వాన్ని కాపాడుకుని ఆర్యుల అరాచకాలను తిప్పికొట్టే పనిలో ద్రవిడులు మునిగిపోయిన క్రమంలో ఈ పదం పుట్టి ఉండాలి. తమ శత్రువులకు సంబంధించిన వాడయిన దేవుడుని, తాము చెడ్డవాడని భావించే వారికి ఆపాదించటం ప్రారంభమయి ఉండాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే దేవుడు అన్న ప్రకృతి మన గ్రామీణుల నోటపడి అది దేగుడుగా మారి ఉండాలి. ఏదేమయినా మా ప్రాంతంలో వినియోగించే తిట్టు పదం వెనుక  కొంత చరిత్ర – వాస్తవం – తమ శత్రువులను కచ్చితంగా గుర్తించిన వైనం – ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ పదం అంటే నాకెంతో ఇష్టం. అది మా గ్రామ్యం. అది మా వికృతి. అది మా అనుభవం నుంచి పుట్టిన పదం.

లోక్‌చెత్త … సంచిక – 3


జయప్రకాష్‌ నారాయణతో నా స్వీయానుభవాన్ని రాసి, ఇక లోక్‌చెత్తను చెరిగే పనికి తాత్కాలికంగా విరామమిచ్చేదానికి అనుమతి ఇవ్వండి.
ఈ సంఘటన ప్రకాశం జిల్లాకు జెపి కలెక్టరుగా పనిచేస్తున్న కాలంలో జరిగింది. నేను అప్పుడే మా గ్రామం ఈదుమూడి నుంచి ఒంగోలుకు చేరాను. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఒంగోలును జ్వరాలు చుట్టుముట్టాయి. ఇంటికి ఇద్దరు ముగ్గురికి తక్కువగాకుండా మంచాలెక్కారు. అదే సమయంలో పురపాలక సంఘాల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఎక్కడి చెత్త అక్కడే నిల్వ చేరటంతో పట్టణమంతా ఒకటే కంపు. అసలే రాష్ట్రం మొత్తం మీద ఒంగోలు నీఛ నికృష్ట అపరిశుభ్ర పట్టణం. కార్మికుల సమ్మె కారణంగా పూర్తిగా పాడయిపోయింది. మా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. కొన్ని ప్రాంతాల్లో ఊడ్చి, కాలువల్లో పూడికలు కూడా తీశాము. అయినా యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన కార్యక్రమాన్ని ఒక యువజన సంఘం నెత్తుకుని విజయవంతం చేయటం అంత తేలిక కాదు. అందుకని మేము పడుతున్న బాధల్ని ప్రభుత్వానికి నేరుగా చెబితేనన్నా స్పందించి చర్యలు తీసుకుంటారేమోనన్న భ్రమతో కుర్రాళ్లమంతా కలిసి కలెక్టరు జెపిని కలిసి వినతి పత్రం అందజేసి ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఆ వినతి పత్రాన్ని అలా అలా చదువుతూనే పిడుగులు కురిపించటం ప్రారంభించాడు. బుద్ధున్నవాడెవడూ ఇలా కాగితాలు తీసుకుని ఏదో చేయమంటూ రాడు. మీరు కలెక్టరు ఆఫీసుల చుట్టూ తిరిగే సమయాన్ని ప్రజల కోసం వినియోగిస్తే అసలు సమస్యలే రావు. మీరు మీ ఇళ్ల నుంచి తలా ఒక చీపురు, తట్టా తీసుకుని వీధులన్నీ ఊడవండి. అంతేగానీ ఇలా అది చేయండి ఇది చేయండి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవద్దు.” అంటూ ఇంకా ఏదేదో బడబడా ఉపన్యసించాడు. చివరలో తక్షణం మేము బయటకు వెళ్లక పోతే తానే నెట్టించాల్సి వస్తుందని బెదిరించాడు జెపి. అప్పుడప్పుడే లోకాన్ని అర్ధం చేసుకుంటున్న మేము జెపి తీరుతో హతాశులమయ్యాము. వాస్తవానికి బెదిరిపోయాము. సరే, ఆయనతో వాదించే శక్తిలేక, కాళ్లీడ్చుకుంటూ ఇళ్లకు చేరాము. తర్వాతెప్పుడూ ఆయన దగ్గరకు రాయబారం వెళ్లే సాహసం చేయలేదు. మా సంఘం తర్వాత కూడా ఎన్నెన్నో ఉచిత వైద్యశిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన విషయం వేరే సంగతనుకోండి.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే…. ప్రభుత్వం చేయవలసిన పనిని వ్యక్తులుగానీ, చిన్న సంస్థలుగానీ పరిపూర్ణంగా చేయగలవా? అదే వాస్తవయితే, జెపి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్లు? స్వచ్ఛంద సంస్థ లోక్‌సత్తాతోనే ఈ దేశంలోని సమస్త రోగాలనూ పారదోలవచ్చుగదా? అంతా ఒక్కసారి చేయలేకపోతే ఒక్క ఊరిలోనయినా చేసి నిరూపించి ప్రజలను నమ్మించి రాజకీయాలు, శాసనసభలు, పాలన లేకుండా స్వచ్ఛంద సంస్థలకే దేశాన్ని అప్పగించేందుకు కృషి సల్పవచ్చుగదూ?
అంటే జెపికి అంతా తెలుసు. ఏమి చేసినా ప్రభుత్వమే చేయాలి. కాకపోతే ఎప్పుడన్నా, ఎక్కడన్నా అత్యవసరమైతే వ్యక్తులు పూనుకుని తాత్కాలికంగా సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చు. ప్రభుత్వేతర సంస్థలు స్పందించి చేయూత ఇవ్వవవచ్చు. అంతేగానీ వ్యక్తులో, ఏదో ఒక సంస్థో అంతా చేసేస్తే ఇదంతా ఎందుకు దండగ. అది వీలుకానందునే ప్రపంచవ్యాపితంగా రాజకీయాలు, శాసనసభలు, ప్రభుత్వాలు ఉన్నాయి. చేసినా చేయకపోయినా ప్రభుత్వానికే సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే సత్తా ఉంటుంది.
అయితే తాను తీసుకోవలసిన చర్యలు తీసుకోని జెపి కసికసిగా కుర్రాళ్లమీద కన్నెర్ర జేశాడు. ప్రభుత్వానికి వాస్తవం చెప్పలేని, ప్రశ్నించలేని ఆయన కళ్లెదుట కనపడినవాళ్లతో యుద్ధానికి దిగాడు.
ఆయనకు ఆ దృక్పధం నుంచి బయట పడనందునే ఇప్పటికీ తాను ఎన్నెన్నో విషయాల మీద తెగతెగ పోరాడుతున్నానని తరచూ చెప్పుకుంటుంటాడు. ఎన్నెన్నో లాభాల్ని తెచ్చిపెట్టానని చెప్పుకుంటుంటాడు. ఎన్నో చట్టాలు తన పోరాటం వలనే వచ్చాయని చెబుతుంటాడు. అయనో విచిత్రం. అయనదో లోకం. ఏం చేద్దాం. కారణం ఏదయినాగానీ ప్రజల సంగతి పట్టాల్సిన వాళ్లు వారికి దూరమయ్యారు. ఆ జాగాలో జరబడిన జెపీలు, స్వాములోర్లు ప్రజల్ని ప్రభావితం చేసేందుకు తెగ చెమటోడ్చుతున్నారు. కానీండి ప్రజలు తెలుసుకునే దాకా… అందరి బొక్కల్నీ విరగదీసేదాకా …. కానీండి. కానీండి.

విప్లవకారుల విషాదం

‘పశ్చిమ బెంగాల్‌కి ముఖ్యమంత్రిగా చేయదగిన అత్యుత్తమ వ్యక్తి మమత బెనర్జీ’ అని ‘ఆనంద్‌ బజార్‌’ పత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో ఇటీవల మరణించిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ అన్నారు.

మమత అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్‌లో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లోనే కిషన్‌జీని బలితీసుకున్నారు. ‘ఉగ్రవాదులందరి కంటే నక్సలైట్లే ప్రమాదకారులు’ అని కూడా మమత వాకృచ్చారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన నాలుగో రోజు (గత నెల27న) మౌనం వీడిన మమత ‘జంగల్‌ మహల్‌ని బలగాలు చుట్టుముట్టి తుపాకులు అప్పగించి లొంగిపోవాలంటూ కిషన్‌జీకి, ఇతర నేతలకూ మూడు రోజులు గడువిచ్చినా వారు వెనక్కు తగ్గలేదు. వెయ్యికిపైగా రౌండ్లు కాల్పులు జరిపి, ఎన్‌కౌంటర్‌ తప్ప మరే ప్రత్యామ్నాయం లేకుండా చేశార’ని తనదైన శైలిలో నెపమంతా మావోయిస్టులపైనే నెట్టారు. అంతేకాదు, ‘కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ వల్ల వేలాది ఆదివాసీలు రక్షించబడ్డారు’ అని కూడా ఆమె చెప్పారు. నవంబరు 23న మిడ్నాపూర్‌ జిల్లాలోని గోసాయిబంద్‌ గ్రామంలో కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారని ఫొటోలతో సహా మావోయిస్టులు, హక్కుల సంఘాలు ఆరోపిస్తుంటే, ఇది నూరు శాతం నిజమైన ఎన్‌కౌంటర్‌ అని మమతాబెనర్జీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రకటిస్తున్నారు. దశాబ్దాల తరబడి అధికారం కోసం కాచుక్కూర్కున్న మమతకి, వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపర్చటమే ఏకైక కార్యక్రమంగా మలుచుకున్న మావోయిస్టు పార్టీ, దాని నాయకుడు కిషన్‌జీలు అయాచిత వరంగా లభించారు. ఒకరకంగా వామపక్ష ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం పట్ల చాలా ఉదారంగానే వ్యవహరించిందని చెప్పాలి. నక్సల్బరీ ఉద్యమం ఏర్పడ్డ ప్రారంభదినాల్లో సాగించిన నిర్బంధ దుష్ఫలితాల పట్ల చివరి రోజువరకు భయపడుతూనే వుంది. పరిస్థితిని అవకాశంగా తీసుకొని మావోయిస్టులు దేశంలో బెంగాల్‌ని ‘షెల్టర్‌ జోన్‌’గా మార్చుకున్నారనేది వాస్తవం. తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కున్న అవివేకిలా మావోయిస్టు పార్టీ ప్రవర్తించింది. ప్రజలు ప్రయత్నిస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలుని పడగొట్టేలాంటి నీచమైన పనులకు సైతం పాల్పడి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచటం ద్వారా మమత విజయానికి సర్వశక్తులూ ఒడ్డింది. సర్వ పాపాలు చేసింది. ఈ నీచకృత్యాలన్నీ చూసింది కనుకనే దీదీకి వీళ్లు ప్రమాదకారులుగా కనిపించారు.

చుట్టుముట్టిన బలగాల నుండి తప్పించుకున్నాడని పథకం ప్రకారం ప్రచారం చేశారు. కొన్ని బలగాల్ని వెనక్కి పంపించారు. ప్రజల్ని, మావోయిస్టుల్ని నమ్మించారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో మావోయిస్టులు రాణించలేకపోయినా పోలీసులు విజయం సాధించారు. ఆదమరచి ఉన్న కిషన్‌జీని, మరి కొంతమందిని బురిపాల్‌ గ్రామంలో అదుపులో తీసుకొని ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు. ఈయనతో వున్న సుచిత్ర మహతో తప్పించుకుందో లేక పోలీస్‌ కస్టడీలో వుందో తెలియదు. తమ నాయకుల ఆచూకీ తమకే తెలియని దురవస్థ మావోయి స్టులది. ఇంత పేలవమైన నిర్మాణమూ, నాయకత్వమూ వున్న నెట్‌వర్కు ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకీ ఉన్నట్లు లేదు.

ఎన్‌కౌంటర్‌గా చెప్పబడే ప్రతి సంఘటనా నకిలీదే. నాయకులందర్నీ పట్టుకొని కాల్చి చంపినదే. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే 90 శాతం సందర్భాలలో నాయకులు ‘విద్రోహం’ కారణంగా పట్టుబడ్డ వారే కావడం. చాల మంది భ్రమ పడుతున్నట్లు వెంగళరావు ‘సమర్థత’ వలనో, కొంతమంది పోలీసుల ‘కఠినత్వం’ వలనో గాక మావోయిస్టు పార్టీలో విచ్చలవిడిగా సాగిన ‘కోవర్టు ఆపరేషన్లే’ ఈ ఘటనలన్నిటికీ కారణం. ప్రారంభ దినాల్లో పై స్థాయి నాయకత్వంలో తక్కువ స్థాయి జ్ఞానం వున్నవారు కింద స్థాయిలో ఎక్కువ సిద్ధాంత పరిజ్ఞానం కలిగినవారు పార్టీలో ఉన్నారు. కాలక్రమంలో దానికి పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడింది. చారు మజుందార్‌ నాయకత్వంలోని సిపిఐ(యంయల్‌) తర్వాత పీపుల్స్‌్‌వార్‌ పార్టీగా, మావోయిస్టు పార్టీగా రూపం మార్చుకునే క్రమంలో మార్క్స్‌, ఎంగెల్స్‌పేరు కూడా వినని వాళ్లను దళాల్లోకి ‘రిక్రూట్‌’ చేసుకోవడం, మార్క్స్‌ ఫొటో,గద్దరు ఫొటో చూపిస్తే ఎవరో చెప్పలేని దళ సభ్యులున్న దళాల్తో నిండిన ఘోరస్థితి మావోయిస్టు పార్టీలో నెలకొంది. భర్తపై అలిగివెళ్లిన భార్యలు, ఇంట్లో పెద్దలు కొడితే ఇల్లు వదిలివెళ్లిన పిల్లలు, జన నాట్యమండలి పాటలు విని ఉత్సాహపడ్డవారు, అడవుల సమీప గ్రామాల్లో వివిధ సమస్యల బారినుండి ‘అన్న’ల సహాయం కోరి వెళ్లిన వాళ్లతో దళాలు నిండిపోయాయి. దీంతో సిద్ధాంత పరిజ్ఞానం కింది స్థాయిలో పూర్తిగా లోపించింది. ప్రజాసంఘాల ద్వారా గాక సరాసరి ‘రిక్రూట్‌మెంట్లు’ పెరగడం, అసలే లోపభూయిష్ట వ్యూహాలున్న పార్టీకి కనీస జ్ఞానం కొరవడిన కార్యకర్తలు తోడవ్వడంతో దేశవ్యాప్తంగా పోలీసుల పని చాలా సులువైంది. నల్లా ఆదిరెడ్డి, సంతోష్‌ రెడ్డి, నరేష్‌లను బెంగుళూరులో పట్టుకుని హెలికాప్టర్‌లో ఇక్కడికి తీసుకొచ్చి ఎన్‌కౌంటర్‌ కథలల్లటం అటుంచితే వాళ్లని పట్టించిన కోవర్టు గోవిందరెడ్డి, అతని కుటుంబం ఎక్కడుందో? అసలుందో లేదో కూడా తెలియదు. 1993లో అర్ధరాత్రి సొంత దళంపై కాల్పులు జరిపిన దళ నాయకుడు కొడిమంజు ఎల్లయ్య అలియాస్‌ భూపతిని చంపిన కత్తుల సమ్మయ్య కథ గుర్తుందా? 1996లో సొంత కృష్ణపట్టి దళ సభ్యుల్ని కాల్చి చంపిన సోమ్లా నాయక్‌ గుర్తున్నాడా? కరీంనగర్‌ జిల్లాలో జిల్లా కార్యదర్శి విజరుని కాల్చి చంపిన జడల నాగరాజు అనే మావో కోవర్టు గుర్తున్నాడా? ఇంకా నయీం, అతి దారుణమైన మానాల ఎన్‌కౌంటర్‌, 2006లో ప్రకాశం జిల్లాలో రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌, అప్పారావు, పులి అంజయ్య, అనంతపురం జిల్లాలో సుదర్శన్‌, వరంగల్‌ జిల్లాలో టెక్‌ రమణ, పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ఎన్‌కౌంటర్‌ కథ విన్నా దాని వెనుక వున్నది కోవర్టే. వ్యక్తులు చేసిన కోవర్టు ఆపరేషన్లు పక్కన పెడితే చాలా ఎన్‌కౌంటర్‌లకు పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణం కావడం మరో విషాదం.

కాంగ్రెస్‌పై కోపంతో ఎన్‌టియార్‌కి ఓట్లేయిస్తే 5వేల మందితో గ్రేహౌండ్స్‌ దళాన్ని ఏర్పాటు చేసి అనేక మందిని కాల్చి చంపడానికి ఆ ప్రభుత్వం కారణమైంది. ఆ కోపంతో చెన్నారెడ్డికి మద్దతిస్తే ఆయనా అదే పని చేశారు. బెంగుళూరు నాయకుల ఎన్‌కౌంటర్‌కి బాధ్యుడని చంద్రబాబుని దించటానికి కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ‘శాంతి చర్చల’ నెపంతో అడవుల్లోని అనుపానులన్నీ ఆకళింపు చేసుకొని తర్వాత ఆంధ్రలో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవటానికి కృషి చేశారు. ఇన్ని సంఘటనల నుండి కొంచెం కూడా గుణపాఠం నేర్చుకోకుండా అదే తప్పు ఇంకా చెప్పాలంటే అంతకంటే పెద్ద తప్పు బెంగాల్‌లో చేశారు. తత్ఫలితమే కిషన్‌జీలాంటి సమర్థుడైన నాయకుణ్ణి కోల్పోవడం. ఈ విషయాలన్నీ సింహావలోకనం చేసుకుంటే అవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలా? నక్సలైట్లు వారే చేసుకున్న ఆత్మహత్యలా అనిపిస్తుంది.

ఇక్కడ మావోయిస్టులు ఆత్మ పరిశీలన కోసం మరో విషయం కూడా చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎన్‌కౌంటర్‌ జరిగిందంటే ప్రజల్లో స్పందన రకరకాల రూపంలో తీవ్రంగా వుండేది. డా.చాగంటి భాస్కరరావుని శ్రీకాకుళం జిల్లాలో కాల్చి చంపితే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని వేల ఇళ్లలో పొయ్యిల్లో పిల్లులు లేవలేదు. చివరగా ఆదిరెడ్డి, సంతోష్‌ రెడ్డి ఎన్‌కౌంటర్‌ తరువాత రాష్ట్రమంతా గగ్గోలు పెట్టింది. అజాద్‌, కిషన్‌జీలాంటి అగ్ర నేతలు చంపబడ్డా చాలా యథాలాపంగా వార్తలు చదువుతున్నారు. చూస్తున్నారు. ఒక సాధారణ రోడ్డు ప్రమాద వార్త చూస్తున్నంత సామాన్యంగా ఈ వార్తను కూడా చూసి వేరే చానల్‌లోకి మారిపోతున్నారు.మావోయిస్టులు ఇచ్చే 2 రోజుల బంద్‌ పిలుపులు ఎవరూ ఖాతరు చేయడం లేదు. ప్రజల నుండి మావోయిస్టులు వేరుపడ్డమే దీనికి కారణం. కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులు గాని వారికి ఉండివుంటే -ప్రజా సంఘాలు కానీ ఒక్క ప్రజా సమస్యపై పనిచేసిన దాఖలాలు లేవు. హక్కుల సంఘాలు మొక్కుబడిగా మారాయి. సాహితీ సాంస్కృతిక రంగాల్లో సైతం కొత్తగా కనిపించే స్పందనలు లేవు. ఉత్తేజపరిచే స్థితిలో ఉద్యమాలు లేవు. ఉత్తేజపరిచే నాయకులు లేరు. ఈ కాలక్రమంలో పోలీసుల నుంచే కాదు ప్రజల నుండి కూడా తప్పించుకు తిరిగే పరిస్థితుల్లో విప్లవకారులు ఉండటం ఒక మహా విషాదం.

-చెరుకూరి సత్యనారాయణ

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

పంజాబ్‌లో మూడో ఫ్రంట్‌

పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు దగ్గర బంధువు, ఆ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌ పాలక శిరోమణి అకాలీదళ్‌ నుంచి విడిపోయి పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) ని ఏర్పాటు చేశారు.   తాను అకాలీదళ్‌, కాంగ్రెస్‌ పార్టీలకు భిన్నమైన విధానాలను అనుసరిస్తానని మన్‌ప్రీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పంజాబ్‌ రాజకీయాలు బాదల్‌ నేతృత్వంలోని అకాలీదళ్‌, కాంగ్రెస్‌ చుట్టూ తిరుగుతూన్నాయి. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా  వామపక్షాలను కలుపుకుని రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ను నిర్మించేందుకు పిపిపి కృషి చేస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకావముంది. పంజాబ్‌లో రాజకీయాలు, ప్రత్యామ్నాయ కూటమి ఆవశ్యకత గురించి ది వీక్‌ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మన్‌ప్రీత్‌ సింగ్‌ విపులంగా విశ్లేషించారు. ఆ విశేషాలు….

పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) ఏర్పాటుకు మిమ్మల్ని పురిగొల్పిన అంశమేమిటి?

గత నలబై ఏళ్లలో పంజాబ్‌ అన్నింటా తిరోగమనంలో ఉండడం నన్ను తీవ్రంగా కలచివేస్తున్నది. విద్య, ఉపాధి, గడచిన 15-20 ఏళ్లలో పేదరిక నిర్మూలన తీరుతెన్నులను ఒక్కసారి పరికించినట్లైతే మీకే తెలుస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 64 ఏళ్లు గడచినా భారత్‌ కానీ, పంజాబ్‌ కానీ ఆశించిన స్థితికి చేరుకోలేకపోయాయి. భారత దేశానికే తలమానికంగా ఉండాల్సిన పంజాబ్‌ నేడు ఈ స్థితికి దిగజారడానికి కారణమెవరు? 500 ఏళ్ల చరిత్ర మాపై ఉంచిన బాధ్యతల బరువును మోయడానికి ఎన్నడూ వెనుకాడను, సవాల్‌ను చూసి బెదిరిపోయి కాడిని కింద పడేయడం మా తరానికి అసలు నచ్చదు.

ర్యాలీల్లో ప్రజలకు మీరెటువంటి సందేశాన్ని ఇవ్వదలచుకున్నారు?

పంజాబ్‌ అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలి…అవసరమైతే ఉప్పు కారంతో సంగం రొట్టెతోనే గడపాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. సంపాదించడానికి మరింత కష్టపడాలి. అప్పుడు పేద – ధనికుల మధ్య అంతరాలను చెరిపేయాలి. ఈ విషయాల్నే పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ ప్రజలకు తెలియజెప్తుంది. వారు చెప్పాలనుకునేది వినడం కాదు, మేము చెప్పేదేమిటో వారు వినాలి.

పిపిపి రాజకీయ వ్యూహం ఏమిటి?

గల్లిపోలి పోరాటంలో ముస్తఫా కమల్‌ టర్కిష్‌ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే ధ్యేయంగా ముందుకుసాగాడు. విజయం సాధించాడు. అతని వ్యూహాన్నే నేను అనుసరిస్తున్నాను. ప్రపంచమంతటా రాణిస్తున్న పంజాబీలు ఇక్కడే ఎందుకు రాణించలేకపోతున్నారు? మన పాఠశాల విద్య కుప్పకూలిపోయింది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడడానికి నా దృష్టిలో 12 -15 ఏళ్లు పట్టవచ్చు. పేదరిక తాకిడి 7శాతందాకా ఉన్నది. పంజాబీల్లో చాలా మందిది తుదిదాక పోరాడేతత్వం. వారిలో నిద్రాణంగా ఉన్న ఆత్మస్థయిర్యాన్ని రగుల్కొల్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను.

మీరు ఎదుర్కొంటున్న సవాల్‌ ఏమిటి?

ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని మనం పారదోలాల్సిన అవసరముంది. ఏ సమాజానికైనా న్యాయం చట్టం కలిగివుండడమనేది అత్యంతావశ్యకం. పంజాబ్‌లో నేడు అదే కొరవడింది. పోలీస్‌ సంస్కరణలు పిపిపి ఎజెండాలో మొట్టమొదటి అంశంగా ఉంటుంది. అధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా పంజాబ్‌ ఉన్నా పారిశ్రామి కీకరణకు నోచుకోలేదు. వీటితోబాటు అవినీతిని అరికట్టడంపైన , విద్యపైన దృష్టి పెడతాము. ఇవే పిపిపి ఎన్నికల ఎజెండాల్లో ముఖ్యమైన మైలురాళ్లుగా ఉంటాయి. వీటిని సాధించడం కష్టంతో కూడుకున్న పనే కావచ్చు. కానీ, అసాధ్యమేమీ కాదు. మాకు జనంలో స్పందన కూడా బాగుంది. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అరబ్‌ ప్రజల్లో చైతన్యం ప్రభావం మన ఉపఖండం మీద కూడా ఉంటుంది. ఇది నా గురించి చెబుతున్నది కాదు. సూత్రబద్ధమైన విధానాలు, అభివృద్ధి, సౌభాగ్యం కోసం ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్ష నుంచి ఇది వస్తున్నది. పంజాబ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు.

మీరు కూడా బాదల్‌యే కదా. అలాంటప్పుడు పిపిపిని అకాలీ దళ్‌ చీలిక గ్రూపుగా భావించవచ్చా?/font>

మాది చీలిక గ్రూపు కాదు. అకాలీదళ్‌, దాని ధోరణులు మా ప్రణాళికలో మచ్చుకు కూడా కానరావు. ఏడు మాసాల యవ్వనం గల పిపిపి లౌకికవాద జాతీయపార్టీ. సిపిఐ(ఎం), సిపిఐతో కలిసి సమాజ్‌ మోర్చాను ఏర్పాటుచేశాం. మా కనీస ఉమ్మడి కార్యక్రమ ఆవిష్కరణకు ప్రకాశ్‌కరత్‌, ఎబి బర్దన్‌ వస్తున్నారు. అదే సమయంలో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మ్యానిఫెస్టోలను కలిగివుంటాయి.

మీ పార్టీ సభ్యులు ఏయే తరగతులనుంచి ఎక్కువగా వస్తున్నారు?

పిపిపి సభ్యుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి, తరగతుల నుంచి వచ్చినవారు ఉన్నారు. పార్టీకి యువత వెన్నెముకలా నిలుస్తున్నది. మా పార్టీకి 40 శాతం మద్దతు వీరినుంచే వస్తున్నది. అభ్యర్థుల ఎంపికలో మేము ఉన్నత ప్రమాణాలను పాటిస్తాము. చాలా వరకు కొత్త ముఖాలే ఉంటాయి. మా విధానం, ఎజెండాతో అంగీకరించినవారే ఇందులో చేరతారు. యువతకు రాజకీయంలో రాటుదేలిన అనుభం లేకపోవచ్చు కానీ, వారు మంచి పౌర ప్రతినిధులు. నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడి మనుమడు, ఆక్స్‌ఫర్డ్‌లో పిహెచ్‌డి చేసిన వ్యక్తి లండన్‌ నుంచి తిరిగి వచ్చి పార్టీ కోసం పూర్తి కాలం పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అతనికి మేము టికెట్‌ ఇచ్చాము. ఇటువంటి ప్రతిభ ఉన్నవారిని, వారి మద్దతును పొందేందుకు మేము ప్రయత్నిస్తున్నాము.

వామపక్షాలతో మీ సీట్లసర్దుబాటు ఎలా ఉండబోతుంది?

మొత్తం సీట్లలో 15శాతం సీట్లలో వామపక్షాలు పోటీ చేస్తాయి. మిగతా స్థానాల్లో పిపిపి తన అభ్యర్థులను బరిలోకి దింపుతుంది.

ఈ ఎన్నికల నుంచి మీరెటువంటి ఫలితాన్ని ఆశిస్తున్నారు?

ఫలితాలు ఎలా ఉండబోతున్నదీ నాకు తెలియదు. ప్రజలు ఈ రెండు పార్టీలు (అకాలీదళ్‌, కాంగ్రెస్‌ ) నుంచి మార్పు కోరుకుంటున్నారనే భావం నాకు కలుగుతోంది.

లోక్‌చెత్త – సంచిక … 2


లొక్ సత్తా కాదు లొక్ చెత్త శీర్షికతో తొమ్మిదో తేదీన రాసిన అంశాన్నిసమయాభావం – విస్తృతి అవుతుందన్న జ్ఞానంతోపాటు ఆవలింతలు – కునికిపాట్లు మధ్య చెత్తన0తా ఎత్తి పారబోయలేకపోయాను. అందుకని ఈ రెండో సంచికను సమర్పించాల్సి వస్తోంది. కాసింత పెద్ద మనసు చేసుకుని అంగీకరించండేం!
గతం గత: అనుకున్నా లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ ఇటీవల చేసేసిన తీర్మానాలు ఆయన వ్యక్తిగత నిజాయితీ పట్ల కూడా అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.
అందులో ముఖ్యమైనది విదేశీ ప్రతక్ష్యపెట్టుబడులకు జెపి అనుకూలంగా గొంతెత్తటం. ఏ విషయంలోనయినా ఆయన తన సొంత గొంతుకను విన్పించే హక్కు ఉంది. కొందరు అపోహపడుతున్నట్లుగా సొంత అభిప్రాయం కలిగి ఉండే హక్కు విషయంలోనూ, అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించే హక్కు విషయంలోనూ నేను అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు సుమా! నా వ్యతిరేకతల్లా కేవలం ఆయన సూత్రీకరణలతోనే అని విజ్ఞులు గమనిస్తారని ఆశిస్తాను. సరే, అసలు విషయానికి వద్దాం. అయనంటారూ, (పదాలు ఆయనవి కాదు, విషయం మాత్రమే) ”దుకాణం ఎవడు తెరిస్తే నాకెందుకండీ! నా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది కాబట్టి నేను వాల్‌మార్ట్‌కు స్వాగతం పలుకుతాను.”
సరే, ఎఫ్‌డిఐ రాకతో ఐదు కోట్ల మంది చిన్నాచితక దుకాణదారులు వీధుల పాలయ్యే ప్రమాదాన్ని పక్కనబెట్టి రైతుల సంగతే చూద్దాం. (నేనూ రెండెకరాల రైతునే నండోయ్‌!) ఆయన చెప్పినట్లుగా ఎక్కడయినా వాల్‌మార్ట్‌గానీ, అలాంటి బహుళజాతి కిరాణా గొలుసు దుకాణంగానీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ తరహా దగుల్బాజీ కొడుకులు తమ లాభాలను వదులుకుని రైతుకు ఏ దేశంలో సాయపడ్డారో జేపీ కాసింత చెబుతారా? చూపిస్తారా? వాల్‌మార్ట్‌గానీ, ఇంకోకడుగానీ ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు వచ్చే సరుకుల్ని కాకుండా మన రైతన్నకు ఎక్కువ ధర ఇచ్చి కొంటాడా? ఎందుకు కొంటాడో జేపీ చెప్పగలరా? వాళ్లంతా తెలివితక్కువ కొడుకులా? అమాయకులా? లేదా మన రైతుల పట్ల వారికి అపారమైన ప్రేమ ఏమయినా కారిపోతుందా?? వాళ్లనూ, వాళ్లకు తాన తందాన పాడే మీ లాంటి వాళ్లనూ మేము నమ్మితే పుట్టి మునగటం ఖాయం. అమెరికాకే చెందిన వాల్‌మార్ట్‌కు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల భావాలను సమీకరిస్తున్న వేడ్‌ రాధ్కె ఏమంటున్నారో చూడండి – ”చవకగా దొరికే సరుకుల్ని చైనాలో కొని భారతదేశానికి తరలించే అవకాశం ఉంది. అ పనిలోనే చైనాలో వాల్‌మార్ట్‌ ఇప్పటికే 1200 కోట్ల డాలర్ల విలువయిన సరుకుల్ని సేకరించింది. అదే భారతదేశంలో కేవలం 200 కోట్ల డాలర్ల విలువయిన సరుకుల్ని మాత్రమే కొనుగోలు చేసింది.” ఇప్పుడయినా నమ్ముతారా? వాల్‌మార్ట్‌ వచ్చినా వాడెమ్మ విదేశీ మొగుడు ఎవడొచ్చినా మన బొచ్చెలో పడేది విదేశీ సరుకేనని. అంతెందుకు – వాల్‌మార్ట్‌గాడు ఏమి చేస్తున్నాడంటే అమెరికాలో తగినంత సరుకు రాసులు పోసి ఉన్నా ఫిలిప్సీన్స్‌లో తక్కువ ధరకు దొరుకుతున్నాయని యాపిల్‌ పండ్లనూ, మెక్సికో నుంచి బత్తాయిలనూ తీసుకువచ్చి అక్కడి రైతులను నట్టేట ముంచుతుంది. పాశ్యాత్య దేశాల పాలకులు ఓట్ల కోసం ధనిక రైతులకు నూరు శాతం రాయితీలు కూడా కల్పిస్తోన్న నేపథ్యంలో ఆయా దేశాల కన్నా మన ధరలు అధికంగా ఉండటం సహజం. అసలే అరకొర రాయితీలు అవీ సక్రమంగా అందని సమస్య ఉన్న మన దేశంలో ధరల వ్యత్యాసం కారణంగా మన రైతుల నుంచి ఏ ఒక్కటీ కొనేందుకు వాల్‌మార్ట్‌ ఒప్పుకోదుకాక ఒప్పుకోదు.
ఇక చిన్న దుకాణదారుల పరిస్థితి కూడా దారుణం అవుతుంది. కిరాణా వ్యాపారంలో విదేశీ ప్రతక్ష పెట్టుబడుల కారణంగా థాయ్‌ల్యాండ్‌లో 60 వేల చిన్న దుకాణదారులు దివాలా తీశారని ఆ దేశ ప్రభుత్వం స్వయంగా ప్రకటించటం పరిశీలనార్హం. దానికి భిన్నంగా భారతదేశంలో బడుగులకు వాల్‌మార్ట్‌  స్నేహ హస్తం అందజేస్తుందంటూ మనల్ని కూడా నమ్మమంటున్నారు జెపి.

లోక్‌సత్తా కాదు … లోక్‌చెత్త

కప్పల కోసం నిలబడతానంటూ మాటలు
పాముల కోసం జేపి అను జయప్రకాష్‌ నారాయణ చేతలు


నిజం నిలకడ మీదగానీ తెలియదంటారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ లోపలి మనిషి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. తమ రాజకీయ దళం ప్రజల సత్తాను వెలికితీస్తుందని జేపి చెప్పుకోవటం ఇక ఎంత మాత్రమూ సాగదు. తన లోపలి మనిషి నమ్మే చెత్తాచెదారాన్నంతా ప్రజల మీద రుద్దే ప్రయత్నాల  గుట్టును విప్పి చెప్పకపోతే ముందు ముందు ఈ జేపీ కాంగ్రెసుకన్నా, బిజేపికన్నా, తెలుగుదేశంకన్నా, టిఆర్‌ఎస్‌కన్నా ప్రమాద స్థాయికి చేరతాడన్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. అందుకనే కొంత ఆలస్యం అయినా తెలుగిల్లు చెత్తాచెదారాన్ని చెరిగిపారేసే పనిని నెత్తికెత్తుకుంది.
అనగనగా ఓ పాము – కప్ప కథ
అనగనగనగా తెనుగుపురం గ్రామం. ఆ గ్రామంలో ఉందో వూరచెరువు. ఆ చెరువు ఒడ్డున పొదల్లో ఓ పాము ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. చెరువులో ఓ కప్ప ఉంటోంది. ఓ రోజు కప్ప ఏమరపాటుగా ఉండగా అదును చూసి పాము దానిని నోట కరచుకుంది. ఇంకేముంది రెండింటి మధ్యా పోరాటం ప్రారంభమయింది. దాంతో ఒక్కొక్కరుగా ఆ దృశ్యాన్ని చూసేందుకుగాను గ్రామ ప్రజలంతా అక్కడ చేరిపోయారు. కొంత సమయం గడిచేసరికి గ్రామస్తుల్లో మూడు చీలికలు ఏర్పడ్డాయి. వాళ్లలో కొందరు కప్పపట్ల సానుభూతి ప్రకటించారు. సాధు జంతువు కప్పను పాము మింగాలనుకోవటం నేరమని నిరసన తెలిపారు. మరి కొందరు పాముకు మద్దతు పలికారు. పాము కప్పను తినటం ప్రకృతి సహజమని వివరించబూనుకున్నారు. తన కన్నా  బలవంతుడిని తినటం సాధ్యం కాదు గనుక కప్పను తినటం పాము సహజ లక్షణమని ప్రకటించారు. ఇంకా మిగిలిన కొందరు తాము కప్ప వైపూ కాదనీ, పాముకీ మద్దతు పలకబోమంటూ తలలు ఎగరేస్తూ చెప్పుకున్నారు. ఈ మూడు ముఠాల మధ్యా వాగ్వివాదం ముదిరి తగాదాకు దారితీసింది. కొందరు కోపం పట్టలేక ప్రత్యర్థులను చావబాదేందుకని కర్రలు కూడా తీశారు. అదే సమయంలో అటు వెళ్తూ పరిస్థితిని గమనించిన ఆ ఊరి సర్పంచి ఎటు వారిని అటు నెట్టివేసి కొట్లాట జరక్కుండా నివారించాడు. ఉద్రిక్తత సద్దుమణిగాక అసలు ఏమి జరిగిందో చెప్పమంటూ వాకబు చేశాడు. ఓ నోటిగలాయన అంతా పూసగుచ్చినట్లు వివరించాడు. అంతా విన్న సర్పంచి తన తీర్పు చెప్పాడు. ఎక్కువ మంది గ్రామస్తులు పామును సమర్ధిస్తున్నందున వారు చెప్పిందే వేదమని ప్రకటించాడు. దీంతో కప్పను సమర్థిస్తోన్న వర్గానికి చెందిన నాయకులు కొందరు ముందుకు వచ్చి ”అదెలా? ఇద్దరం సమానంగానే ఉన్నాం. కావాలంటే వరుసల్లో నిలబెట్టి లెక్క వేయండి” అంటూ సవాలు విసిరారు. అయితే వారి వాదనను సర్పంచి తిరస్కరించాడు. ”పిచ్చోళ్లారా! మూడో వర్గాన్ని పక్కనబెడితే మీరిద్దరూ సమాన సంఖ్యలోనే ఉన్నారు. కానీ వాళ్లను కూడా పాములోళ్లతో కలుపుకుంటే ఎక్కువకదా? అంటూ ఎగాదిగా చూశాడు సర్పంచి. అదెలా అటూ, ఇటూ, ఎటూ లేమన్నవాళ్లను పాముకి మద్దతుదారులతో ఎలా కలుపుతారు! మళ్లీ పలు కంఠాలు ప్రశ్నించాయి.
అప్పుడిక వివరంగా చెప్పక తప్పదనిపించింది సర్పంచికి.
”ఇక్కడ ఏమి జరుగుతుంటే మీరంతా మూడు ముఠాలుగా విడిపోయారు?” సర్పంచి ప్రశ్నించాడు.
”పాము కప్పను మింగుతుంటే చూసి” జవాబిచ్చారు జనం.
”అట్ల చెప్పండి. ఇప్పుడు దారికొచ్చారు. మీలో కొందరు పాము అఘాయిత్యాన్ని చూడలేక కప్పకు మద్దతు పలికారు. మరి కొందరు ప్రకృతి ధర్మమంటూ పామును సమర్ధించారు. మీ ఇద్దరితో సమస్య లేదు. ఎవరు ఎటు ఉన్నారో తేలిగ్గానే అందరికీ అర్ధం అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి మూడో వర్గం ఏమని చెప్పింది?
”అటూగాదు ఇటూకాదు అని”
”కదా అంటే వాళ్లు కప్పను సమర్ధించటం లేదు, అవునా?
”అవును,  అవును” జనం నుంచి కేకలు
”మరి వాళ్లు పాముకు మద్దతు పలికారా?” సర్పంచి మరో ప్రశ్న.
”లేదు … లేదు” కొందరి అరుపులు.
”అదేనర్రా, మిమ్మల్ని అందరూ అమాయకులు అనేది అందుకే. మరి వాళ్లు కప్పను పాము తినటాన్ని వ్యతిరేకించారా? లేదే. అంటే వాళ్లు చెప్పింది ఏమయినా, గోడ మీద పిల్లి మాదిరిగా వ్యవహరించినందున వాళ్లు వాస్తవంలో పాముకి మద్దతు పలికినట్లే కదా! అందుకనే నేను అటూ ఇటూ ఎటూ కాదన్నవాళ్లను కూడా పాముకు మద్దతుదారులుగానే లెక్క వేశాను. ఏమంటారు?”
ఎవ్వరూ ఏమీ పలక్క పోవటంతో సర్పంచి లేచి వెళ్లిపోయాడు. సర్పంచి తీర్పు తనకు అనుకూలంగా రావటంతో పాము గబగబా మహా సంతోషంతో కప్పను మింగేసింది. బ్రేవ్‌ మంటూ తేపి తన పొదల్లోకి జారుకుంది. పొట్ట నిండటంతో నిద్ర తన్నుకొచ్చింది. అంతే హాయిగా పాము నిద్రలోకి జారిపోయింది.
అదండీ సంగతి! జేపీదీ పైకి చూసేందుకు మూడో వర్గమేగానీ, వాస్తవంగా పరిశీలించి చూస్తే మాత్రం పాముల్లాంటి కాంగ్రెసు వైపేనని తేలిపోలేదూ!
పైగా ఓటు వేయనివాళ్లంతా దేశ ద్రోహులని రోజూ శాపనార్థాలు పెట్టే జెపి తనదాకా వచ్చేసరికి ఓటును ఎందుకు మురగేసినట్లు? అదేమంటే తనది నిరసన ఓటని వివరించకోవటం ఒట్టి బూటకం కాదూ! ఓటేయటానికి ఇష్టం లేని వారిలో అత్యధికులు చెప్పేది అదేగదా. ఏ దొంగ వెధవకూ ఓటేయటం ఇష్టం లేక ఇంట్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేశామనేకదూ! వాళ్లు చెప్పేది. మరి ఓటర్లుకు లేని ప్రత్యేకత జేపీకి ఎక్కడ నుంచి వచ్చినట్లో?
అంతేనా! కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకుగాను తీవ్రంగా కృషి సల్పుతున్నాడని కూడా జెపి సిగ్గూ ఎగ్గూ లేకుండా కితాబులు కూడా మెడలో వేసేశాడు. కృషి సల్పుతున్నాడా? వీలులేని పరిస్థితుల్లో అలా నటిస్తున్నాడా? జవాబు చెప్పాల్సింది జెపీయే.
మాటల కోటలెక్కి
లెక్కల మూటలు దొర్లించే జెపీజీ
దోవ మళ్లించి జవాబివ్వటం మీకు వెన్నతో పెట్టిన విద్య
బాగా మాగిన బంగినపల్లిని జుర్రుకున్నంత!
మరి, మీరేమంటారు ?????!!!!!

నిజమైన ప్రపంచం మీడియాకు వెలుపల ఉంది – వి.శ్రీనివాసరావు

ప్రజలు, ప్రజా ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిబింబించే సరికొత్త ప్రజాస్వామిక మీడియా తలెత్తుతోంది. రానున్న కాలంలో అదే ప్రజలకు చిరునామా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టెక్నాలజీ దోపిడీదార్లకు లాభాలు సంపాదించిపెట్టే సాధనమయితే ప్రజలకు అదొక పోరాట సాధనంగా కూడా పనికొస్తుంది. అర చేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేనట్లే అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజల కళ్లుకప్పలేమని కార్పొరేట్‌ మీడియా గుర్తించాలి. మీడియా పరిధిని దాటి ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. వారి చైతన్యం కట్టలు తెంచుకుని పాలకులకు ఉరితాళ్లుగా మారతాయి. క్రీస్తు అన్నట్లుగా ”నువ్వు సత్యాన్ని తెలుసుకో. సత్యమే నీకు స్వేఛ్చనిస్తుంది.”

ప్రపంచీకరణ తర్వాత సమాచార విప్లవం ప్రజ్వరిల్లింది. ప్రతి క్షణం ఏం జరుగుతుందో బ్రేకింగ్‌ న్యూస్‌- ఆర్థ్దిక, రాజకీయ, సామాజిక పరిణామాలపై విశ్లేషణలు- ఇలా చూసుకుంటే రెండు దశాబ్దాల క్రితం నాటి కన్నా నేడు మనిషి సత్యానికి చాలా దగ్గరగా ఉండాలి. కాని వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. జరుగుతున్నదొకటి- మీడియా చూపేది, రాసేది, విశ్లేషించేదీ- మరొకటి. పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా లేక స్వంత రాజకీయ ఎజెండాలకు సాధనాలా? అన్న సందేహం సామాన్య పాఠకులకు కలుగకమానదు. ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంగా గాక తమ ఆలోచనలను ప్రజలపై రుద్దే సాధనంగా మీడియా మారింది. ప్రజల కోసం మీడియా అన్న భావం పోయి, లాభం కోసం మీడియా అన్న రోజులొచ్చాయి. దీనికి ప్రాతినిధ్యం వహించేదే కార్పోరేట్‌ మీడియా. రాజకీయ నాయకులు మీడియాను తమ రాజకీయపరమపదసోపాన పటంలో నిచ్చెనమెట్లుగా భావిస్తున్నారు. ప్రజల్ని వదిలేసి మీడియాలో కనిపిస్తే చాలు పదవులు పరిగెత్తుకుంటూ వస్తాయని భ్రమిస్తూ మీడియా మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యమకారులు సైతం కొన్ని సందర్భాల్లో మీడియా భ్రమల్లో పడి మౌఖిక ప్రచారం ఆవశ్యకతను విస్మరిస్తుంటారు.

రాష్ట్రానికి వెలుపల ఉన్న తెలుగువారికి మీడియానే గుండె చప్పుడు. మీడియా ద్వారా తాము రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్నట్లు భావిస్తారు. ఆ రకంగా రాష్ట్రం ముఖాన్ని అద్దంలో చూస్తుంటారు. కాని ఇటీవల అది తలకిందులుగా కనిపిస్తోంది. ఏరోజు పత్రికలు తిరగేసినా బ్యానర్‌ స్టోరీలు తమ ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసేవే. సాక్షిలో అవినీతి ఎంత జరిగిందో ఒకరు రాస్తే, ఈనాడు ఎన్ని కుంభకోణాలకు పాల్పడిందో మరొకరు రాస్తారు. మధ్యలో ప్రజల స్థానమెక్కడీ అవినీతిపై యుద్ధమా? అవినీతిని కప్పెట్టుకునే మార్గమా? మీడియా తీరు చూస్తుంటే అంతుబట్టదు. రాజకీయ నాయకులను మించి సవాళ్లు, ప్రతిసవాళ్లు అడ్డగోలుగా విసురుకుంటున్నాయి. తాము నిర్దోషులమని ప్రజల ముందు నిరూపించుకోవాల్సిన వారే అవతల వారు తమ కన్నా పెద్ద అవినీతిపరులని చెప్పడం ద్వారా తమ అవినీతి కనపడకుండా చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఎవరికి వారే తాము ప్రజల పక్షం, అవతలివారు శత్రుపక్షం అన్నట్లుగా తమ రచనాకౌశల్యం ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గీతను చిన్నది చేయాలంటే దానికి ముందు పెద్దగీత గీయాలన్న (”సాపేక్ష సిద్దాంతాన్ని”) తిమ్మరుసు మంత్రాన్ని వీరు చక్కగా అర్థం చేసుకున్నారు. వామపక్ష పత్రికలను మినహాయిస్తే దాదాపు మొత్తం మీడియా అటో ఇటో చీలిపోయినట్లు కనిపిస్తున్నది. ఒక పార్టీ నాయకుడు తన అవినీతిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోతే తప్పు అని తీవ్రంగా ఖండించేవారే మరో పార్టీ నాయకుడు కూడా ఇదే చేస్తే శభాష్‌ అంటుంది. మీడియా వృత్తిధర్మం ఇదేనా? దొంగలు దొంగలు తిట్టుకుంటే ఊర్లో పెద్దమనుషుల పేర్లన్నీ బయటకు వచ్చినట్లే ఈ చెడులో కూడా ఒక మంచి జరుగుతోంది. ”పెద్దమనుషుల” అవతారాలను జనం అర్థ్దం చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో కరువు కాటకాలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగుల ఆక్రందనలు, ఉద్యోగులు, కార్మికుల వీధి పోరాటాలు మీడియా కెమెరాలకు చిక్కవు. పత్రికల్లో ఏదో ఒక మూల అదీ జిల్లా టాబ్లాయిడ్‌లో స్లిప్‌ పేజీలో ఒక మూలన వేస్తాయి. ప్రత్యేక కథనాల పేరిట స్పెక్యులేటివ్‌ న్యూస్‌కు పెద్దపీట వేసి పాఠకులను జూదంలోకి దింపుతాయి.

పాలకుల బంటుగా కార్పోరేట్‌ మీడియా:

జాతీయ, అంతర్జాతీయ మీడియా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇటీవల కేంద్రం రిటైల్‌ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ”అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న” అన్నట్లుగా పాలకులను మించి మీడియా దాన్ని ప్రతిభావంతంగా సమర్థిస్తోంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు- పాలక పార్టీలలోని కొంత మంది సహా – ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, నాలుగు కోట్ల మంది రిటైల్‌ వ్యాపారులు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు- వ్యతిరేకిస్తున్నా వారి మాటకు పూచికపుల్ల విలువివ్వడంలేదు మీడియా. పార్టీల వ్యతిరేకతను రాజకీయమంటూ కొట్టిపారేస్తున్నది. వ్యాపారుల వ్యతిరేకతను భ్రమ కింద జమ కడుతోంది. ఇదే మీడియా రిటైల్‌పై అమెరికా రాయబారి బహిరంగ జోక్యాన్ని మాటమాత్రంగా కూడా ఖండించడం లేదు. భారత ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా పాలకులు, కార్పొరేట్‌ కంపెనీలు ఎందుకు ఆనందంగా ఉన్నాయో గుర్తించడం లేదు.ప్రజల ఆందోళన ఒకవైపు, కంపెనీల ఆనందం మరోవైపు. మీడియా ఎవరి పక్షం? పైగా వారు మన ఉద్ధరణ కోసమే వస్తున్నట్లు చూపుతోంది. ఢిల్లీ వీధుల్లో ఈ మధ్యనే దాదాపు లక్షమంది కార్మికులు, ఉద్యోగులు పింఛను బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తే అసలు పట్టించుకోలేదు. పెన్షన్‌ ఫండ్‌ ప్రైవేటీకరణను కార్పొరేట్‌ మీడియా బలపరుస్తోంది. ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వపక్షం వహించి ప్రజాఉద్యమాల తీవ్రతను తగ్గించాలని చూస్తోంది. స్వాతంత్య్రోద్యమంలో, ఎమర్జన్సీకి వ్యతిరేకంగా, ఎన్టీయార్‌ ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చినపుడు నిర్వహించిన పాత్రకు భిన్నంగా నేడు మీడియా వ్యవహరిస్తోంది.

అసత్యం కన్నా అర్థసత్యం అత్యంత ప్రమాదకరమైంది:

మీడియా కళలో అతి ముఖ్యమైన సాధనం అర్ధ సత్యం. అబద్ధాలు, అసత్యాలు రాస్తే ప్రజలు సులభంగా గ్రహిస్తారు. కానీ, ఒక నిజం చెప్పి దాని మాటున పది అబద్ధాలు చలామణి చేసే కళలో కార్పొరేట్‌ మీడియా ఆరితేరింది. దేశీయ మీడియాలోకి కూడా విదేశీ పెట్టుబడులు దొడ్డిదారిన ప్రవేశిస్తున్నాయి. పరోక్షంగా అంతర్జాతీయ మీడియాతో జాతీయ మీడియా కుమ్మక్కవుతోంది. వీరి కాలమ్స్‌, వ్యాసాలు ప్రత్యేక పేజీలతో వస్తున్నాయి. ఇండియా ఎడిషన్లు విదేశాల నుండి నడుపుతున్నారు. ఆ విధంగా మీడియా కంపెనీల ప్రయోజనాలు, పాలకవర్గాల ప్రయోజనాలతో మిళితమైపోతున్నాయి. యాడ్స్‌, వార్తలు కలగలసిపోతున్నాయి. ప్రజాస్వామ్యానికి రానున్న ప్రమాదానికి ఇవి సూచికలు.

మీడియాలో వచ్చిందే వార్త. అదే సత్యం అనుకోమంటున్నారు. కానీ, మీడియాతో సంబంధం లేకుండానే అనేక సంఘటనలు జరిగిపోతున్నాయి. మీడియా కళ్లుతెరిచేసరికి పరిణామాలు మారిపోతున్నాయి. ఇలాంటి ఘటనల్లో అనివార్యంగా తమ విధానాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవడానికి అంతర్జాతీయ మీడియా తంటాలు పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలను పరిశీలిద్దాం.

‘వాల్‌స్ట్రీట్‌ ముట్టడి’ ఇప్పుడు ప్రఖ్యాతిగాంచింది. అమెరికా వర్తమాన చరిత్రలో ఇదో పెద్ద ఉద్యమం. కానీ, మీడియా దాన్ని గుర్తించి ప్రపంచానికి తెలిపింది అది ఆరంభమైన పదిహేను రోజులకు. అంతవరకు అది నిద్రపోతున్నదా? లేక నిద్రపోతున్నట్లు నటించిందా? రెండోదే కరెక్టు. ఈ ఉద్యమానికి ”మీడియా” మద్దతు లేదు. వారసలు ఈ ఉద్యమ సన్నాహాలకు తోడ్పడనే లేదు. అయినా ‘మీడియా’తో నిమిత్తం లేకుండానే అది అమెరికా సరిహద్దులు కూడా దాటి ప్రపంచాన్ని ఆవహించింది. ‘మీడియా’ సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశమిది. జులైలో ‘వాల్‌స్ట్రీట్‌ ముట్టడి’కి నిర్ణాయక ప్రకటన వెలువడింది. ఈ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌, బ్లాగులు, ఫోన్లద్వారా ఇది విస్తరించింది. ఇవన్నీ సంప్రదాయ మీడియా అన్న అర్దంలో దాని కిందికిరావు. నోటి మాటద్వారా ప్రచారం అన్న పురాతన కాలం నాటి ప్రక్రియకు ఆధునిక రూపం. ”వర్డు టు మౌత్‌” పేరుతో నేడిది ప్రసిద్ధి చెందింది. తమ ఉద్యమ సన్నాహాల గురించి ఏ కార్పొరేట్‌ మీడియా ప్రచారం ఇవ్వకపోయినా ఆందోళనకారులు పట్టించుకోలేదు. తమ సొంత ప్రచార సాధనాలపైనే వారు ఆధారపడ్డారు. దీనికి ఖర్చు తక్కువ. ప్రచారం ఎక్కువ. ప్రజల హృదయాల్లో చెలరేగుతున్న ఆందోళన, అసహనాన్ని గొప్పలు చెప్పుకునే అమెరికా మీడియా గుర్తించలేకపోయింది. ముట్టడి చేపట్టిన ఉద్యమకారులే సొంతంగా వీడియోలు తీసి ‘నెట్‌’ ద్వారా ప్రపంచానికి ఏరోజుకారోజు అందించగలిగారు. యుస్ట్రీమ్‌ వంటి సాధనాల ద్వారా ‘లైవ్‌ కవరేజ్‌’ ఇచ్చారు. ఆలస్యంగా మేల్కొన్న ‘మీడియా’ కొద్ది రోజులకే స్వరం మార్చి ఆ ఉద్యమానికి ‘కమ్యూనిస్టు’, ‘ వామపక్ష”, ఉగ్రవాద’ ముద్రలు వేసి అణచడానికి పాలకులకు పరోక్షంగా ఆయుధాలు, సాక్ష్యాలు సమకూర్చే ‘పవిత్ర’ కర్తవ్యాన్ని చేపట్టింది.

ఈ కాలంలో జరిగిన మరో ముఖ్యమైన ఘటన అరబ్‌ దేశాలలో వెల్లివిరిసిన ప్రజాస్వామ్య సంరంభం. ట్యునీషియాతో ఆరంభమై ఈజిప్టును కుదిపేసిన ఘటనలపై మీడియా ఏం చేసింది? తహ్రీర్‌ మైదానంలో లక్షలాది మంది గుమికూడిన తరువాతనే మీడియాకు స్పృహ వచ్చింది. అంతకు ముందు అంత తీవ్రమైన అశాంతి ఈజిప్టు ప్రజల్లో ఉన్నట్లు కనీసం చూచాయగానైనా మీడియా గుర్తించిందా? ఎందుకు విఫలమైంది? ఈ ఘటనలకు పదినెలల ముందే ‘ఆల్‌ అశ్వని’ అనే ప్రఖ్యాత రచయిత కొద్ది రోజుల్లో ఈజిప్టును కుదిపేసే ఘటనలు జరగబోతున్నాయని రాశారు. తరువాత ఆ ఉద్యమంలో ఆయన కూడా ముఖ్యపాత్ర వహించారు. ఈ ఉద్యమానికి ముందు అనేక సమ్మెలు జరిగాయి. స్థానికంగా జరిగిన అనేక ఆందోళనలను ముబారక్‌ ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేసింది. ఇక ప్రజా ఉద్యమాలు కోలుకోలేవన్న అంచనాకు మీడియా వచ్చింది. కానీ, అంతిమంగా ప్రజాస్వామ్యం పైచేయి సాధించింది. ఇప్పుడు దాన్ని హైజాక్‌ చేసేందుకు మిలిటరీని అడ్డం పెట్టుకుని అమెరికా నాటకాలాడుతోంది. ఈ నాటకాన్ని మన కళ్లకు కనిపించకుండా చేయడానికి ‘మీడియా’ నానా తంటాలు పడుతోంది. వాల్‌స్ట్రీట్‌ ముట్టడికి ముందు కూడా అమెరికాలో విన్‌స్కాన్సిన్‌ వంటి చోట్ల ఫ్యాక్టరీల ముట్టడి జరిగింది. ఉపాధి కోసం ఉద్యమాలు నడిచాయి. ఇప్పుడు యూరపులో సమ్మెల వెల్లువ. పార్లమెంటు ముట్టడి. కాల్పులు- ఇంగ్లండ్‌లో సమ్మెలు, ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఆఖరికి జర్మనీలో సైతం అస్థిరత చోటు చేసుకుంది. దీనినుండి బయటపడేందుకు ‘ఉపాయాలు’ చెప్పే పనిలో మీడియా నిమగమైంది తప్ప ప్రజల హృదయ ఘోషను వినిపించడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి బాధ్యతను స్వీకరించిన వామపక్ష, అభ్యుదయ మీడియాను ఎగతాళి చేయడానికి స్థలం, సమయం వెచ్చిస్తోంది.వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘వికీ లీక్స్‌’ వంటి సరికొత్త ప్రజాస్వామ్య సాధనాలు మీడియాకు ప్రతినిధిగా నిలబడుతున్నాయి. దాని అధినేత అసాంజేను కుట్ర చేసి కేసులు పెట్టి దెబ్బతీయడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు.

కార్పోరేట్‌ మీడియా వర్సెస్‌ ప్రజాస్వామిక మీడియా

తాజా ప్రపంచ పరిణామాలు ఉదయిస్తున్న సూర్యుని పోలి ఉన్నాయి. చీకట్లు పారదోలుకొని వెలుగు కోసం ప్రయత్నిస్తున్న ప్రపంచానికి ఈ సరికొత్త మీడియానే ద్వారాలు తెరుస్తోంది. కార్పొరేట్‌ మీడియా కళ్లు తెరుస్తుందో లేక లాభాల వేటలో శాశ్వతంగా కళ్లు పోగొట్టుకుంటుందో చూద్దాం. ప్రజలు, ప్రజా ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిబింబించే సరికొత్త ప్రజాస్వామిక మీడియా తలెత్తుతోంది. రానున్న కాలంలో అదే ప్రజలకు చిరునామా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టెక్నాలజీ దోపిడీదార్లకు లాభాలు సంపాదించిపెట్టే సాధనమయితే ప్రజలకు అదొక పోరాట సాధనంగా కూడా పనికొస్తుంది. అర చేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేనట్లే అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజల కళ్లుకప్పలేమని కార్పొరేట్‌ మీడియా గుర్తించాలి. మీడియా పరిధిని దాటి ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. వారి చైతన్యం కట్టలు తెంచుకుని పాలకులకు ఉరితాళ్లుగా మారతాయి. క్రీస్తు అన్నట్లుగా ”నువ్వు సత్యాన్ని తెలుసుకో. సత్యమే నీకు స్వేఛ్చనిస్తుంది.’