Archive for జనవరి, 2012

ప్రపంచీకరణ నేపథ్యంలో అవినీతి ….. ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌

  • కార్పొరేట్లకు రూ.5 లక్షల కోట్ల రాయితీలు
  • మంత్రులతో నిండుతున్న జైళ్లు
  • ఇక కేబినెట్‌ మీటింగ్‌ జైల్లోనే

ప్రపంచీకరణ నేపథ్యంలోనే దేశంలో అవినీతి పెరిగిపోతోందని ప్రముఖ పాత్రికేయులు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు. ‘ప్రపంచీకరణ-అవినీతి’  అంశంపై ఖమ్మం  భక్త రామదాసు కళాక్షేత్రంలోబుధవారం  ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు.  విమానయాన మంత్రి  రవూఫ్‌ పటేల్‌ రోజువారీ ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్నట్లు పిఎంఓ ప్రకటించిందన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌లో పని చేస్తున్న 40 శాతం మంది ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులుగా ఉన్నారన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఏడాది వేతనం రూ.2 నుండి రూ.3 లక్షలు ఉందన్నారు. ఆ మాత్రం వేతనం ఇచ్చే స్థితిలో కూడా ఎయిర్‌లైన్స్‌ లేదని మంత్రి చెబుతున్నారన్నారు. పిఎంఓ ప్రకటించిన వివరాల ప్రకారం మంత్రిగా ఉన్న పటేల్‌ ఆస్తులు 2009 ఎన్నికల నుండి 28 నెలల్లో రూ.43 కోట్లకు పెరిగాయన్నారు. మంత్రిగా బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఆస్తులు ఈ విధంగా పెరగడం అవినీతి పెరగడానికి నిదర్శనం అన్నారు. అయితే ఇదే మంత్రి హయాంలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ పూర్తిగా నష్టాల్లోకి నెట్టివేయబడిన విషయం గమనించాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లకు కనీస వేతనాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మంత్రులే ప్రకటించారని అన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు ఏ విధంగా 5లక్షల కోట్లరాయితీలకు డబ్బు ఎక్కడని ప్రశ్నించారు. గంటకు రూ.10 కోట్లు సంపాదించిన మంత్రి కూడా ఉన్నారన్నారు. మహారాష్ట్రలో 15 ఏళ్ళలో 50 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆ రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. అత్యధికంగా 50వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విదర్భకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. అతను పెద్ద వడ్డీ వ్యాపారని అన్నారు. ఆ ఎమ్మెల్యే వేధింపుల గురించి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అరెస్టుకు యత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలు వెళ్ళాయన్నారు. అవినీతితో పాలకులకున్న బంధాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందన్నారు. పోలీసులు నాగపూర్‌ బెంచ్‌ను ఆశ్రయిస్తే కోర్టు ఎమ్మెల్యేకు రూ.25వేల జరిమానా విధించిందన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 10లక్షల రూపాయల జరిమానా విధించిందన్నారు. ఆ మంత్రికి అత్యంత కీలకమైన గ్రామీణ అభివృద్ధి శాఖ అప్పగించి ప్రధాని ప్రమోషన్‌ కల్పించారన్నారు. ఈ విధంగా అవినీతి మంత్రులకు ప్రధానమంత్రి అండదండలున్నాయన్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఉండదన్నారు. మంత్రులంతా అవినీతి ఆరోపణలతో జైలు పాలవుతున్నారనీ, ఇక కేబినెట్‌ సమావేశాలు జైళ్లలో నిర్వహించుకోవాల్సిందేనని అన్నారు. అవినీతికి మేము వ్యతిరేకం అని కొందరు చెబుతుండగా మరి కొందరు ఉద్యమాల పేరుతో వీధుల్లోకి వస్తున్నారన్నారు. ఈ అవినీతికి మూలం ఏమిటీ, ఎవరి విధానాలు కారణం అనేది మాత్రం చెప్పటం లేదన్నారు. ఇదే విషయం అంధ్రప్రదేశ్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో బయట పడిందన్నారు.

2010-11లో కార్పొరేట్లకు వాణిజ్య, కస్టమ్స్‌, పలు రాయితీల కింద 88వేల 263కోట్ల రాయితీ ఇచ్చిందన్నారు. కానీ రైతులకు 73వేల కోట్లు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఎక్సైజ్‌ పాలసీ కింద కార్పొరేట్‌ సంస్థలకు ఐదు లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందన్నారు. అవినీతికి బడ్జెట్‌లోనే చట్టబద్దతకల్పిస్తున్నారని అన్నారు. 2006 బడ్జెట్‌లో కార్పొరేట్‌ సంస్థలకు ఎంత రాయితీ ఇస్తున్నారో తెలపాలని వామపక్షాలు ప్రశ్నించాయనీ, ఆ ఫలితంగానే అవినీతి బయటకు వస్తోందని అన్నారు. ముంబాయి కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. గోద్రెజ్‌, టాటా ఉద్యోగాలు రోజురోజుకూ తగ్గిస్తున్నాయని అన్నారు. కెజిబేసిన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆస్తి అనీ, దీనిని అంబానీల్లో ఎవరికి ఇవ్వాలనే అంశంపై పార్లమెంట్‌ ఓ సెషన్‌లో చర్చించారన్నారు. వ్యవసాయరంగం సంక్షోభానికి పాలకులే కారణమన్నారు. 1990లో వి.పి.సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి 14శాతం నిధులు కేటాయిస్తే ప్రస్తుతం 3శాతం కూడా కేటాయించడం లేదన్నారు. ఎఫ్‌డిఐలు రిటైల్‌ మార్కెట్‌లోకి వస్తే ఉన్న ఉద్యోగాలుపోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

వ్యాపారాలు … పదవులు – ప్రపంచ తెలుగు మహోత్సవం


”ఏ పదాల వెనుక ఏమి దాగి ఉందో తెలుసుకోనంతవరకూ మనం మోసపోతూనేఉంటాం” అంటారు లెనిన్‌ మహాశయుడు.
ఈ నేపథ్యంలో జనవరి ఐదో తేదీ నుంచీ ఏడో తేదీవరకూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని పరిశీలిస్తే కొన్ని అసలు నిజాలు బయటపడతాయి.
ఒకనాడు శూద్రులే అయినా స్వాతంత్య్రాననంతరం ప్రభువులగా మారిన ఓ సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేసే ఒక చిన్న ఉద్దేశంతోనూ, చెత్త వ్యాపారాన్ని కైవశం చేసుకునేందుకూ, పనిలోపనిగా పదవుల్నీ దక్కించుకునే లక్ష్యంతోనూ ఈ మహోత్సవాలను రాంకీ సంస్థ నిర్వహించిందన్న విమర్శలు విన్పించాయి. ఈ రాంకీ సంస్థ ప్రస్తుత లోక్‌సభ నరసరావుపేట (గుంటూరు జిల్లా) సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి (తెలుగుదేశం) కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సంస్థ నిర్మాణ రంగంతోపాటు చెత్త నుంచి విద్యుదుత్పత్తి పరిశ్రమలనూ నిర్వహిస్తోంది. పనిలో పనిగా సేవ కోసమంటూ అదే పేరుతో ఓ ట్రస్టును కూడా ప్రారంభించింది.
రాష్ట్రంలోనే అత్యంత అపరిశుభ్ర పట్టణంగా నమోదయిన ఒంగోలు త్వరలో పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించనుంది. దాన్నలా ఉంచితే ఒంగోలులో ప్రస్తుతం అరకొరగా సేకరిస్తేనే 300 టన్నులకు పైగా చెత్త పోగుబడుతోంది. అదే చిత్తశుద్ధితో పనిచేస్తే వెయ్యి టన్నులకు పైగానే దొరుకుతుంది. దీనిపైనే రాంకీ దృష్టి సారించింది. ఇక్కడి చెత్తను సేకరించే పనిని కొట్టేసేందుకు పన్నాగం పన్నింది. చెత్తాచెదారంతో విద్యుదుత్పత్తి పరిశ్రమను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగానే ఒంగోలు వాసులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదే ప్రంచ తెలుగు మహోత్సవాల పేరిట తెర మీదకు వచ్చింది. ప్రకాశం జిల్లాకు ప్రత్యేకించి ఒంగోలుకు చెందిన అధికారులనూ, అనధికార ప్రముఖులనూ, పెద్దలనూ బుట్టలో వేసుకునేందుకుగాను భాషాభిమానాన్ని వాడుకుంది. నోరు జిల ఉన్నవాళ్లను వేదిక ఎక్కించి మైకు అందించింది. శాలువాల పిచ్చోళ్లకు సన్మానాలు చేసింది. మొత్తం మీద రాంకీ అనే సంస్థ ప్రజల కోసం, ప్రత్యేకించి తెలుగు ప్రజల కోసం, ప్రకాశం వికాసం కోసం, ఒంగోలు వాసుల వెలుగుకోసం పనిచేసేందుకే ఉద్భవించిందని అనిపించుకునేందుకుగాను నానా తంటాలూ పడింది. తాను ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియని ఓ గొంతుయ్య, తెలుగు యాంకరమ్మ సుభాషిణి వ్యాఖ్యాతలుగా మూడు రోజుల పాటు తిరునాళ్లు జరిపింది. తెలుగుకు తెగులు పట్టిందని ఈ మహోత్సవంలో పలువురు పాచి పాటను తెగపాడేశారు. తెగులును వదిలించేందుకు తాము ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు ఆంగ్లంలో వీరావేశంతో ప్రకటించారు. తెలుగువాళ్లంటే బట్టు పెట్టుకోవాల్సిందేనంటూ ప్రవాసాంధ్ర మహిళా మణులు తెగవాగేశారు. చీరలు కడితే చాలు తెలుగుకు వెలుగొస్తుందని తీర్మానించారు. తమ బిడ్డలకు వేద గణితం నేర్పుతూ తెలుగును బతికించేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషను చంపేసిన ఆంగ్ల భాషా మసాలను దట్టించిన ప్రసంగాలు నిజమైన తెలుగోడికి రోత పుట్టించాయంటే నమ్మాలి. ఈ కార్యక్రమంలో ప్రతి అడుగూ డబ్బు కంపు కొట్టింది. సదస్సులంటూ నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కొక్కరికి కేవలం అరగంట కేటాయించటమే ఆయా విషయాలను కరివేపాకు చందంగా వాడుకునేందున్న వాదనకు బలం చేకూరుతోంది. ఉదాహరణకు వ్యవసాయ, విద్య తదితర రంగాలు ప్రస్తుతం దివాళాదశకు చేరుకున్నాయి. అలాంటి వాటిని గురించి ఎంతటి మేథావయినా కేవలం అరగంటలో చెప్పేయటం ఏ విధంగా సాధ్యం? ఈ రంగాలకు పట్టింది చిన్నా చితకా వ్యాధులా? ఓ గొట్టాన్ని మింగిస్తే సరిపోవటానికి? సరిజేయటానికి??
ఇక సాంస్కృతిక కార్యక్రమాలు తెగ బలిసినవాళ్ల తైతక్కలే తప్ప తెలుగు వాసన, తెలుగు సంప్రదాయం చిటికెడు కానరాలేదు. పైగా విదేశీ కరాటే కంటే గొప్ప యుద్ధకళలు దేశంలో చాలా ఉన్నాయంటూ కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన ఏవేవో జిమ్మిక్కులకు వేదిక కల్పించారు. ఎవరితో ఎవరు యుద్ధం చేయాలో? ఎందుకు యుద్ధం చేయాలో? మాత్రం నిర్వాహకులు తేల్చి చెప్పలేదు. మొత్తం మీద తెలుగు సంస్కృతి అంటే ద్రవిడులను చంపేసిన అమ్మలు ఎర్రటి నాలుకల్ని వేలాడేసి పిచ్చెక్కినట్లు గిరగిరా తిరగటమేనన్న ప్రదర్శనలకూ బాగానే చోటు కల్పించారు. అక్కడ, ఇక్కడ, ఎక్కడైనా అన్నట్లుగా ఒంగోలు వీధుల్లో ప్రవహించే మురుగుకు తోడు భక్తిని కూడా యథావిథిగానే బాగా పారించేరు. అలా అలా తమ భవిష్యత్తు వ్యాపారాలకు ఎవ్వరూ అడ్డురాకుండా చూసుకునే పనిలో రాంకీ గట్టిగానే తెలుగువాడిని వాటేసుకుంది. చెత్త వ్యాపారాలకు సంబంధించి ఎవడన్నా నిజం చెప్పాలనుకునే పిచ్చోడుంటే వాడి నోరును గట్టిగా మూయించేందుకు తగినవారిని ఏర్చికూర్చి పెట్టేసుకుంది.
”తెలుగు మహోత్సవాలను రాంకీ ఒంగోలులో ఎందుకు జరపాలనుకుందో నాకు తెలియదుగానీ, రెండు మూడు రోజులలో వాళ్లే చెబుతారనుకుంటున్నాను” అంటూ రాష్ట్ర పురపాలకశాఖామాత్యుడు మానుగుంట మహీధరరెడ్డి చివరి రోజు నిర్వహించిన విజయోత్సవ సభలో విసిరిన విసురు యాదృచ్చికం కానేకాదు. వ్యాపారాలు – వాణిజ్యాల రక్షణ కోసం శాసన వేదికలు ఎంతగా ఉపయోగపడతాయో తెలిసిన రాంకీ తమ అధినేతను ఈ సారి ఒంగోలు నుంచి గెలుపించుకోవాలన్న కోరికతో ఉంది. గెలాక్సీ గ్రానైటు, ముడి ఇనుము, అపారమైన సముద్ర సంపద, 140 కిలోమీటర్ల తీర ప్రాంతం, మెగా ఓడరేవు నిర్మాణానికి అవకాశాలు ఇలా పలు ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న ఒంగోలును సొంతం చేసుకునేందుకు రాంకీ పావులు కదుపుతోంది. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో తమ అధినేతను ఒంగోలు నుంచి గెలుపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదీ ఇప్పుడు ఊరేగుతోన్న తెలుగుదేశం పల్లకీ కాదట. వేణుగోపాలరెడ్డి తానున్న తెలుగు తక్కెడ నుంచి త్వరలో దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి. కొడితే కుంభస్థలాన్ని కొట్టి కోట్లు వెనకేసుకోవాలన్న తపనతో వైఎస్‌ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెసు అభ్యర్ధిత్వం కోసం వేణుగానం చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఎవరో అల్లాయి, పుల్లాయి చెప్పింది కాదు. ఓ మంత్రివర్యుడు తెలుగు మహోత్సవ విజయోత్సవ సభ వేదిక సాక్షిగా వ్యక్తిగత సంభాషణల్లో వెల్లడించిన ఓ నిజం.
అదండీ సంగతి. రాంకీ తెలుగు తిరునాళ్ల వెనుక వ్యాపారాలు, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన పదవుల వ్యవహారం ఉందంటే మీరు ఏమంటారు ?

ఔరా! ఫాదరా!!


దేవుళ్లూ, దెయ్యాలు ఉన్నారా(యా)? లేరా(వా)? అన్నమీమాంసను పక్కకు పెట్టి చూస్తే మన పవిత్ర (?) భారత దేశంలో నేనే దేవుడిని, నేనే దేవతనంటూ వీధికొక్కడొక్కడయినా, ఒక్కతయినా తారసపడటం కద్దు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి పక్కా దొంగల సంగతి కాదు.
”ప్రియమైన నా తండ్రీ, ఈ రాత్రి సమయమున ఇక్కడ సమావేశమైన మా అందరినీ చల్లగా చూడుము నాయనా’ అంటూ నిత్యం అభ్యర్థించే కోట్లాది మంది నిరుపేదలకు హితబోధలు చేసే అపర తండ్రుల (ఫాదర్ల)లో ఓ నమూనా గురించి నన్ను చెప్పనీయండి.
హైదరాబాదులో పాత్రికేయ వృత్తిదారుడినయిన నేను మా ఊళ్లో జరుగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలను వీక్షిద్దామన్న కుతూహలంతో 2012 జనవరి నాలుగో తేదీ నుంచే ఒంగోలులో మకాం వేశాను. డబ్బు తెగులు పట్టిన రాంకీ అనే సంస్థ నిర్వహిస్తోన్న తెలుగు తిరనాళ్లను ఐదో తేదీ రాత్రి వేళ నా మిత్రులతో కలిసి వీక్షిస్తుండగా భోజనానికి వెంటనే రావాలంటూ వారికి మలి పిలుపు అందింది. ఓ ఫాదరు పుట్టిన రోజుసందర్భపు పార్టీ అది. వాళ్లు పోతూపోతూ వాళ్ల అతిథినైన నన్ను కూడా (వెనకటి ఎవడో వాళ్ల లాంటి పిచ్చోడెవరో పెళ్లికి పోతూ పిల్లిని చంకనేసుకు పోయాడట!) వెంటబెట్టుకు పోయారు.
అన్నట్లు ఎన్నెన్నో అనుభవాలరీత్యా ఏర్పడిన భయం నేపథ్యంలో ముందే ఒక్క విషయాన్ని మనవి చేసుకుంటాను… నేను ఏ మతాన్ని నమ్మేవారినీ కించపరచనుగాక పరచను. అయితే అది మతం కావచ్చు, మతోన్మాదం కావచ్చు…పాత్రికేయ వృత్తి ధర్మంగా ఉన్నదానిని ఉన్నట్లుగా రాయటం ధర్మమని నేను నమ్ముతానని, మీరు నమ్మి తీరాలి సుమా!
బాధితుల గృహం అని నామఫలకమున్న ఓ సుందర భవన రాజం ముందు మేము వాహనం దిగీదిగగానే ఓ యువకుడు స్వాగతం పలికాడు. చేతులు పట్టుకుని ఊపాడు. విడివిడిగా అందరి చెవుల్లోనూ ఏదో రహస్యం ఊదాడు. నా పరిచయం పూర్తయిన తర్వాత ” అందరికీ బీర్‌ ఏర్పాటు ఉంది సార్‌” అంటూ ఆ రాజకోట రహస్యాన్ని నా చెవిలోనూ ఊదాడా యువకుడు. వాస్తవానికి ఆ విషయాన్ని ముందుగానే నా మిత్రులు వాసన చూపించారు. అది … ఉంటే ఉండొచ్చు. దాని జోలికి వెళ్లం కాబట్టి మనం తినేసి వద్దాం అంటూ నా మిత్రుడు ముందే వివరించాడు. ఒకటో రెండో శాకాహార పదార్ధాలూ ఉంటాయి కాబట్టి నీకూ ఇబ్బంది ఉండదు అని కూడా చెప్పాడు.
సరే, మళ్లీ అసలు విషయానికొద్దాం…. మేము లోపలికి వెళ్లే సరికే సదరు ఫాదరు మరొక ‘తండ్రి’తో కలిసి భోజనం లాగించేస్తున్నాడు. ఇక్కడ నేనే చెప్పొచ్చేదేమంటే అతిథులు రాకముందే తన పని తాను సుష్టుగా చేసేస్తోన్న ఫాదరు వైఖరి నాకు ఏ మాత్రం నచ్చలేదు. దేశానికి రాజయిన సరే సంప్రదాయాలను పాటించాలిగదా? ఇక్కడ నాకు నచ్చిన విషయం గుర్తుచేస్తాను. తండ్రులు, వారి కుమారులు పాదరక్షలను వీడకుండానే అదీ ఇంట్లో భోజనం చేసేస్తున్నారు. ఇప్పుడు విందుల్లో హిందువులు కూడా అదే పాటిస్తున్నారనుకోండి. అయితే ఇలా చెప్పులతో ఇంట్లో తిరగటం సరైనదేనా అంటే… అన్ని వేళలా, చోట్లా అందులోనూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదీ మనదేశంలోయితే కాదనే అంటాను. అదే తీరున అన్ని చోట్లా, అన్నివేళలా దాన్ని విధిగా పాటించాల్సిన విధీ లేదంటాను. ఎక్కడికక్కడి పరిస్థితులను బట్టి చెప్పుల్ని వదిలేయటమో, వదిలేయకపోవటమో అనుసరించదగినదని భావిస్తాను. మాంసాహారం, పండ్లూ, కిల్‌డ్రింకులూ, హిమక్రీములతో షడ్రసోపేత భోజనం అవిరులు కక్కుతోందక్కడ. హోం థియేటర్‌ నుంచి పాశ్చాత్య సంగీతం ప్రవహిస్తోంది. సదరు ఫాదరు ఈ ఉదయమే ఘనాతి ఘనంగా జరుపుకున్న పుట్టినరోజు వేడుకల చిత్రాలు ఓ పదివేల రూపాయల విలువయిన విదేశీ డిజిటల్‌ ఫొటో ఫ్రేములో చలిస్తున్నాయి. సంప్రదాయం కాదుగానీ అలవాటు రీత్యా శాకాహారినైన నేను కొద్దిగా పెరుగన్నాన్ని మాత్రమే లోపలికి పంపగలిగాను. కోకోకోలా అనబడు ఓ డబ్బా కిల్‌డ్రింకునూ కొద్దిగా సేవించాను. కాకపోతే బాగా ఉండటంతో నాలుగంటే నాలుగు తీపితీపి కిళ్లీల్ని మాత్రం పరపరా నమిలేశాననుకోండి. అంతా అయిన తర్వాత ఆ భవనం సోయగాలను వీక్షిస్తూ, అంచనా వేస్తూ, కోట్ల మంది కనీసం అడుగు పెట్టలేని కోట ఒక్క ఫాదరుకే ఉండటాన్ని మనస్సులోనే ప్రశ్నించుకుంటూ బయటపడ్డాము. ”ఇదేముంది, ఫాదరుగారి రూము ఉందీ… అదిరిపోద్ది” నా మిత్రుడి వ్యాఖ్యానాన్ని గుర్తుచేస్తూ ఈ రచనను ముగిస్తాను.