స్థలం కొనేదిక్కులేదు – వడ్డీ చెల్లింపుకు దారిలేదు
దళారులు విలవిల – ప్రకాశంలో కానరాని వికాసం
ఒంగోలు స్థిరాస్తిరంగ దళారులు వడ్డీల చక్రబంధంలో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. ఆకాశాన్నంటిన ధరలతో కొనుగోలు చేసిన స్థలాలు తిరిగి అమ్ముడుపోకపోవటంతో ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా మట్టి రూపాన ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నిరుటి వరకూ మే నెల రాకముందే ఒంగోలులో స్థిరాస్తి రంగ దళారుల హడావుడి కన్పించేది. ఇప్పుడు ఏ దళారి ముఖం చూసినా నేలనే చూస్తోంది. ఇబ్బడిముబ్బడిగా జేబులు నిండుతుండటంతో అప్పు చేసి మరీ స్థలాలు కొన్న దళారులకు ఇప్పుడు దిక్కుతోచని దుస్థితి ఏర్పడింది. దాదాపు రెండు వేల మంది దళారులు ఇప్పుడు రుణదాతలకు ముఖం చాటేసి తిరుగుతున్నట్లు చెబుతున్నారు. స్థలాలకుతోడు నగరం వెలుపల ప్రాంతాలలో నిర్మించిన అపార్టుమెంట్ల అమ్మకాలు కూడా కునారిల్లుతున్నాయి.
దళారుల అత్యాశ కారణంగా ఒంగోలు నగరంలో స్థలాల ధరలు పదేళ్లకు సరిపడా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభాన్ని చూడాలని పేరు రాయటానికి ఇష్టపడని స్థిరాస్తి రంగ విశ్లేషకులు ఒకరు రియల్ అడ్వైజరు ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. వందలాదిఆ మంది నూనుగు మీసాల కుర్రోళ్లు బృందాలుగా ఏర్పడి స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి ముందుచూపు, లెక్కలేకుండా వ్యవహారాలు నడిపారని గుర్తుచేశారు.
ఫైనాన్స్ కంపెనీల నుంచీ పల్లెటూరి భూస్వాముల నుంచీ మూడు రూపాయలు మొదలు పది రూపాయలదాకా వడ్డీకి అప్పులు తెచ్చి భూముల్ని దళారులు కొనుగోలు చేశారు. ఇలాంటివారు ప్రస్తుతం నగరంలో రెండు వేల మందిదాకా ఉన్నట్లు లెక్కలు విన్పిస్తున్నాయి. వారిలో ఒక్కొక్క బృందం కనీసం రూ. 20 లక్షల మొదలు ఏడు కోట్ల రూపాయలదాకా పెట్టుబడులు పెట్టారు. ఒంగోలు నగరానికి సమీపంలోని మంగమూరు గ్రామానికి చెందిన 17.50 ఎకరాల భూమిని కొందరు యువకులు కలిసి ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే దానికి సమీపంలో శ్మశాన స్థలం ఉండటంతో రోడ్డు నిర్మాణం సమస్యల్లో పడింది. దీంతో మౌలిక వసతుల నిర్మాణం వీలుకాలేదు. ఫలితంగా ఏడాది నుంచీ ఈ స్థలాన్ని తిరిగి విక్రయించుకోలేక పెట్టుబడి మొత్తం స్తంభించిపోయింది.
నగరం వెలుపల ప్రధాన కూడళ్లలో గది (సెంటుకు ఆరు గదులు) ఒక్కొంటికి లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలాలు ఇప్పుడు ఎందుకూ కాకుండా పడిఉన్నాయి. 40 లక్షల రూపాయలు పెట్టి కొన్న 40 గదుల భూమిని ఇప్పుడు రూ. 30 లక్షలకు అమ్ముదామన్నా కొనేదిక్కు లేదని ఓ దళారి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇదంతా వడ్డీకి తెచ్చిన డబ్బుతోనే కొనుగోలు చేశానని తెలిపాడు. అసలు కాదుగదా, ఇప్పుడు వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితిలో పడిపోయానని చేయెత్తి నమస్కరించాడు. వడ్డీ ఎంత అని అడిగితే, ”ఆ … ఒక్కటీ అడక్కండి.” అంటూ ముఖం తిప్పుకుని చకచకా వెళ్లిపోయాడు.
అపార్టుమెంట్లదీ అదే దారి
అద్దంకి బస్సుస్డాండు, కర్నూలురోడ్డు, అంజయ్యరోడ్డు పరిసర ప్రాంతాలలో స్థలాల ధరలు మిన్నంటి ఉన్నా నగరం లోపల అయినందున ఒకింత చేతులు మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గది స్థలం రూ 15 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా పలుకుతోంది.
సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినందున రాష్ట్రప్రభుత్వం ఇసుక తవ్వకాలు నిలిపివేసిన తదుపరి గత నెల, నెలన్నర రోజుల నుంచీ ఒంగోలు, దాని పరిసరాల్లో నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. అయినా నగరం వెలుపల నిర్మించిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్ల్లు కూడా కునారిల్లుతూనే ఉన్నాయి. నిషేధానికి ముందు ట్ట్రారు ఇసుక మూడు వేల రూపాయలు ఉండగా, ఇప్పుడది రూ. 15 వేలు వెచ్చించినా దొరకటం లేదు. దీంతో నిర్మాణ రంగ పరిస్థితి దారుణంగా తయారయింది. ఈ స్థితిలోనూ నగరం వెలుపల అదీ దగ్గరంగా నిర్మించిన అపార్టుమెంట్లలో రెండు పడక గదులున్న 1070 చదరపు అడుగుల ఫ్లాట్లు రూ. 20 లక్షల మొదలు రూ. 22 లక్షల దాకా పలుకుతున్నాయి. అదే రెండు, మూడు కిలోమీటర్ల దూరం మధ్య నిర్మించిన ఆపార్టుమెంట్లలో కేవలం రూ. 14 లక్షలకే లభిస్తుండటం విశేషం. నగరం వెలుపల దాదాపు 500కు పైగా ఫ్లాట్లు ప్రస్తుతం అమ్మకం కోసం సిద్ధంగా ఉన్నట్లు లెక్కలు విదితం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదు మాదిరిగానే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోనూ అపార్టుమెంట్ ఫ్లాట్ల ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇదే తరుణం కదూ!
31 మే
Posted by Praveen Sarma on మే 31, 2012 at 2:28 సా.
మా జిల్లాకి ఒరిస్సా నుంచి ఇసుక వస్తోంది కనుక ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినలేదు.