Archive for ఆగస్ట్ 24th, 2012

రాయని భాస్కరుడు …. కాదు కాదు కలగాపులగం కామేశంగారూ

ఇక నోరు మూస్తారా?

రాయని భాస్కరులు అదేలెండి రాయలేని భాస్కరులు కాసిన్ని డబ్బులు పారేసి రాయించుకుని కింద తమ సంతకం గీకేసుకోవటం కద్దు. భాస్కర్రావులకు రాసిపెట్టే వాళ్లు బాగానే రాస్తారుగాబట్టి వాటిని నిలువుగానో, అడ్డంగానో అర్ధం చేసుకోవటం పెద్ద సమస్య కాబోదు. అయితే అసలు సమస్యల్లా కలగాపులగంగాళ్లతోనే.
ఆవేశం వీళ్లకు పెన్నుతో పెట్టిన విద్య. అందువలన వాళ్ల రాతలు అర్ధం కావటం కష్టం. పైగా వాస్తవాలను పట్టించుకోని, తర్కం తెలియని ఈ ప్రబుద్ధుల రాతలు కేవలం గందరగోళానికి పనికొస్తాయి తప్ప వాస్తవాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ఉపకరించవు.
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే … దూడ గడ్డికోసమన్నచందంగా చెబుతారు.
బుకాయింపులు – విరుచుకుపడటాలు సరేసరి.
నువ్వు చెడ్డోడివని అంటే చాలు – ”నువ్వే చెడ్డోడివి. ఆ మాటకొస్తే మీ తాత మహా చెడ్డోడు. మీ నాన్న సంగతి చెప్పనలవే కాదు” అంటూ ఎదురు దాడికి దిగుతారు. తిట్ల దండకం మొదలు పెడతారు. తప్ప తాను ఎందువలన చెడ్డవాడు కాదో చెప్పరు. తమను తిట్టినవాళ్లు, వారి ముందు తరాలవాళ్లు ఎలా తప్పుడు వాళ్లో వివరించరు. వివరించలేరు. ఒప్పించలేరు.
కాదంటారా?
24 ఆగస్టు 2012నాటి ఓ బ్లాగు భాగోతాన్ని చూడండి.
బ్లాగు పేరు :  ఇక నోరు మూస్తారా…అంతా పేరులోనే ఉందంటే ఇదేనేమో మరి!
అంశం : తెలకపల్లి రవిగారి అపసవ్య రాతలకి ప్రతిగా
విషయం ఇదీ :

కమ్యూనిష్టుల మీద ఆరోపణలు లేవా? అసలు భారత చరిత్రనే వక్రీకరించి రాశారన్న పెద్ద ఆరోపణలు ఎదుర్కుంటున్నది కమ్యూనిష్టు చరిత్రకారులే. మీ వక్రీకరణతో పోలిస్తే ఆరెస్సెస్ వక్రీకరణ ఎంత చెప్పండి. మీ ద్వంద్వనీతి ముందు వారిదెంత? వారికి కనీసం నిబద్ధత అయినా ఉంది. మీ కమ్యూనిష్టులకి అది కూడా లేదు. పెట్టుబడిదారులు ఆడవాళ్లతో కులుకుతారు అని కారల్ మార్క్సే రాసాడు. అటువంటి విషప్రచారాలు మీరు మొదలుపెట్టి అవతలివారి మీదకి నెట్టడం ఎంతవరకూ సబబు?
దీన్లో తెలకపల్లి ఏమి రాశాడో వివరం లేదు. దాడి మాత్రం బోలెడంత ఉంది. తెలకపల్లి రాతల్లో తప్పులుంటే కనీసం ముఖ్యమైన రెండు మూడు అంశాలనయినా తీసుకుని ఇది తప్పు – ఇలా తప్పు … అని వివరిస్తేగదా ఎవరికయనా అర్ధం అయేది. ఎవరయినా తప్పు తెలుసుకునేది. మరి ఈ బ్లాగరుకి అలాంటి తర్కం ఉన్నట్లు కన్పించటం లేదు. కసి మాత్రం బోలెడంత బుసుకొడుతోంది.
అందుకని కలగాపులగం భాస్కరరావుగారూ, కాదు కాదు కలగాపులగం కామేశంగారూ, అవేశం కాదు. ఆలోచనకు పనికొచ్చే సరకు ఏదన్నా ఉంటే చెప్పేందుకు ప్రయత్నించండి. మీరు గదమకుండానే మీకు నచ్చనివాళ్లు తప్పులు రాస్తే నోరు మూసేస్తారు. ఒక వేళ మూయకపోతే జనమే మూయిస్తారు. ఏమంటారు?????

‘అనంత’లో అమ్మకానికి పల్లెలు

 

 
  • గ్రామాలనే కొనేస్తున్న ‘నయా భూస్వాములు’
  • కరువు ప్రాంతంలో ‘కార్పొరేట్‌ సేద్యం’
 

నిత్య కరువుకు నిలయమైన అనంతపురం జిల్లా నుంచి వలసలు వెల్లువెత్తుతుండటంతో.. ఖాళీ అవుతున్న ఊళ్లపై పెద్దల కన్ను పడుతోంది. వ్యవసాయం భారమై.. పూటగడవడమే కష్టమైన పరిస్థితుల్లో సన్న, చిన్నకారు రైతులు ఊరొదిలి పోతుండటం పరాన్నభుక్కులకు వరంగా మారింది. వలసలతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతుండటంతో వ్యాపారులు, కొంతమంది రాజకీయ నాయకులు ఎగబడి పేదల భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా కరువు ప్రాంతమైన ఈ జిల్లాలో కార్పొరేట్‌ వ్యవసాయానికి బీజాలు పడుతోంది.

ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెండ్రాయునిపల్లి గ్రామాన్ని ఓ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు కొనేశారు. ఒకప్పుడు ఈ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివాసముండేవి. అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించేవారు. వరుస కరువులతోపాటు, ఫ్లోరైడ్‌ సమస్య ఉండటంతో ఒక్కొక్కరు గ్రామం వదిలి ముదిగుబ్బ, కదిరి, అనంతపురం పట్టణాలకు వలస వెళ్లారు. దీంతో గ్రామం మొత్తం ఖాళీ అయింది. మొండిగోడలే మిగిలాయి. వలసలతో ఖాళీ అయిన ఈ గ్రామం మొత్తాన్ని ఓ నాయకుడు కొన్నారు. భూమినిబట్టి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ రైతులకిచ్చి గ్రామ పరిధిలోని 500 ఎకరాలను కొనుగోలు చేశారు. పొలాలన్నింటినీ చదును చేసి 15 చోట్ల బోర్లు వేసి సూక్ష్మ బిందు సేద్యం ద్వారా సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు ఎకరాల్లో వంకాయ, పది ఎకరాల్లో టొమాటో, 15 ఎకరాల్లో ఖర్బూజా సాగు చేశారు. పొలం అంతటికీ ‘డ్రిప్‌’ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం చూసి చిన్న, సన్నకారు రైతులు నోరెళ్లబెడుతున్నారు.

బత్తలపల్లి మండలం వసంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆగ్రహారం గ్రామాన్ని ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. సుమారు 350 ఎకరాలు ఒక్కడే కొనేసి చుట్టూ కంచె వేశాడు. నంబుల పూలకుంట, చెరువువాండ్లపల్లి గ్రామాలనూ ఇలాగే కొనుగోలు చేశారు. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల మండలాల్లో ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు వచ్చి భూములు కొంటున్నారు. సోమందేపల్లి మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని రెండు వేల ఎకరాలను ఒక ఉత్తరాది వ్యాపారి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు 500 నుంచి రెండు వేల ఎకరాల వరకూ కొనేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల నుంచి 20 వేల ఎకరాల వరకూ ఇప్పటికే కొనుగోలు చేసినట్టు అంచనా. వంద ఎకరాల్లోపు కొనుగోలు చేస్తున్న వారు లెక్కలో లేదు. వీరందరూ ‘అగ్రి ఫామ్‌’ పేరుతో రిజిస్టరు చేయించుకుని ఎగుమతికి అవసరమైన పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.

కరువు ప్రాంతంలో కార్పొరేట్‌ వ్యవసాయ బీజాలు

దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం అనంతపురం జిల్లా. సగటున 552 మిల్లిమీటర్లు వర్షపాతం ఈ జిల్లాలో నమోదవుతుంది. రెండేళ్లుగా 400 మిలిమీటర్లకు మించి సగటు వర్షపాతం దాటడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి రైతులు వ్యవసాయం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి బీడు పడింది. జిల్లాలో 25 లక్షల ఎకరాలకుపైగా సాగుభూమి ఉన్నా పదిశాతానికి కూడా సాగునీటి వసతిలేని ప్రాంతమిది. ఇలాంటి జిల్లాలో పెద్ద వ్యాపారులు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతానికొచ్చి వేల ఎకరాల భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తామని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. కరువు ప్రాంతంలో కార్పొరేట్‌ వ్యవసాయానికి బీజాలు ప్రారంభమవడం చర్చనీయాంశంగా మారింది.