కావూరుబాయి

బియ్యం ధర యాభయ్యి
టమోట కిలో నలభయ్యి
కొనలేక – తినలేక చావకు
ప్రభువెక్కిన పల్లకిని పడదొయ్యి

మా ఊరి చిత్రాలు

ఇవి మా ఊరి చిత్రాలు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఈ చిత్రాలను నేను సెల్ తో తీశాను.

10123456789

పనోడేసిన పందిరిని పిచ్చుక కూల్చినట్లు

ధనిక దేశం – దరిద్ర ప్రజలు
ధనిక నాయకులు   – దరిద్ర భావాలు
పనోడేసిన పందిరిని పిచ్చుక కూల్చినట్లు
గాంధి తెచ్చిన స్వా(హా)తంత్ర్యాన్ని అమెరికాకు అమ్ముకుంటున్నాడు సింగు
తాగుబోతు సంసారం పుటుక్కు
గుటకా తింటే ప్రాణమే గుటుక్కు
క్విడ్ ప్రో కో
ఇస్తినమ్మ వాయినం – పుచ్చుకుంటినమ్మ వాయినం
వెలుగున్న తెలుగు
తెగులు సోకి వెళ్లిపోయింది వెలుగు
పంట సాగు చేస్తే వ్యవసాయం
పరులను బాగు చేస్తే ఎగసాయం
భాగ్యనగరం బస్సెక్కాను
నరకం ఎరుకయ్యింది
ఎప్పటి మాదిరే చీకటి ఆవరించింది
తెల్లవారుతుంది కదా అని ఎదురుగాచాను
సూర్యుడయితే వేంచేశాడు
నీలమో – గాలమో తుపాను మబ్బులు అడ్డుపడ్డాయి
వెలుగు కోసం వెతుక్కుంటున్నాను మరి
చరిత్రకు మసి – నిజాలపై కసి
మానవత్వం మన్ను – ధనాధిపత్యం మిన్ను
అక్కడ మాటలు కోటలు కడతాయి
అక్కడ కోటలు కూటమి కడతాయి
అక్కడ వాణిజ్యం వర్ధిల్లుతోంది
అక్కడ వ్యాపారం సాగుతుంది
అక్కడ వ్యవహారాలూ నడుస్తాయి
అది వ్యవస్ధకు ఠీవి … అది టెలివిజన్ అను టీవీ
యేమిటీ విన్యాసాలు …. ఒకటే రొద
యేమిటీ విథ్యంసం …. మౌన ఫలితం
విద్యుత్తు కోత – గ్యాసుకు కోత – సంక్షేమానికే కోత
నిత్యావసరాల ధరలేమో మోత – విదేశీ చిల్లర కొట్లకు ఖాతా
పంటల గిట్టుబాటుకు వాత – నేతల జాతా
జనం జీతాలు, జీవితాలు రోత రోత

మరో టీవీ – 420 (?!?!?!)


ఈ దేశం ఎటు పోతోందో ? !
భవితన్నది ఏమవుతుందో ? ? ! !
చూడబోతే ప్రస్తుతం టీవీ ఛానళ్ల పేరిట కొందరు దోపిడి ా దగాలకు తెర లేపుతున్నట్లు కన్పిస్తోంది. మైనారిటీ ఆర్థిక సహాయ సంస్థ సొమ్మును దోచుకుని ఏబీసీ పేరిట టీవీ నెలకొల్పే ప్రయత్నంలో పట్టుబడిన నీచ నికృష్టుల వ్యవహారం తెరమరుగు కాకముందే మరి కొందరు కొంచెం అటూ ఇటుగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆచూకీలు కనపడుతున్నాయి.
దినపత్రికల క్లాసిఫైడ్స్‌లో యాంకర్లు కావాలంటూ కనీసం రోజుకొక టీవీ ప్రకటనన్నా కన్పిస్తున్నది చూడండి. కనీసం సంస్థ పేరు కూడా అందులో ఉండదు. కేవలం సెల్‌ నంబరు ఇచ్చి సంప్రదించమంటున్నారు. న్యూస్‌ చానలు పెట్టాలంటే తక్కువలో తక్కువ రూ. 20 కోట్లయినా ఉండాలి. అంటే రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన మగోడికి కనీసం ఒక డొక్కు కారయినా ఉండి తీరుతుంది. సొంత భవనం లేకపోతే పోనీ, అద్దెదయినా కార్పొరేట్‌ స్టెయిలు ఉండి తీరుతుంది. కాసింత మట్టూ మర్యాద తెలిసి, రాయటం, తీయటం తెలిసిన కొందరు సహచరుల్ని ముందే ఎంపిక చేసుకునిగానీ ఎవడయినా మిగతా సిబ్బంది కోసం ప్రకటన చేస్తాడు. అదీ రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ప్రకటన ఉంటుంది.
అయితే ప్రస్తుతం హైదరాబాదులో ప్రకటనల స్థాయిలో ఉన్న కొన్ని టీవీ ఛానళ్ల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అందుకనే అనుమానం కలుగుతోంది. టీవీ – 420 అన్నది కూడా అందుకే. ఈ టీవీల కార్యాలయాలు నేడో రేపో కూలిపోతాయన్నట్లుగా గోచరిస్తోన్న భవనాల్లో ఉండటం పరిశీలనార్హం. అందులోనూ మరుగుదొడ్డి, స్నానాల గదుల మాదిరి గదుల్లో ఓ మేజా బల్ల, నాలుగు కుర్చీలు, కంప్యూటరు, ఓ సహాయకుడు అంతే. రంగుల జెరాక్స్‌లో తీయించిన ఒకటి రెండు పోస్టర్లు కూడా దర్శనమివ్వటం కద్దు.
ఇక ఇరుకిరుకు మేజా బల్ల వెనుక ఓ నక్కో, తోడేలో ఎవరొస్తారా? ఎప్పుడొస్తారా? నంజుకు తిందామన్నట్లుగా కాచుకుని ఉంటుంది. ఖర్మగాలి ఏ దినపత్రికలోనో ఉద్యోగం కోసం వెదుకుతూ వెదుకుతూ యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి ఉబలాటపడ్డ ఆడపిల్లలు కమ్మటి కలలు కంటూ వీళ్ల పాలిట పడుతున్నారు. గట్టి పిండాలయితే సరేగానీ, బలహీనతలున్న వారయితే అంతే చెల్లు. టీవీ ఎమ్డీలమంటూ ఫలకాలు కట్టుకున్న నక్కలకూ, తోడేళ్లకూ బలవ్వాల్సిందే.
నిజమైన కథ
అనగనగా కాదు … ప్రస్తుతమే. అదీ 29 నవంబరు 2012. ఉదయం నా మిత్రుడొకరు ఈనాడులో క్లాసిఫైడ్స్‌ చూశారా? అంటూ ఫోను చేశాడు. ”లేదు ా నేను.
న్యూస్‌ ఎడిటర్లు కావలంటూ రెండు టీవీ ఛానళ్ల ప్రకటనలు వచ్చాయి చూడండి అన్నాడు.
ఆ… నిజంగా ప్రారంభమయ్యే టీవీలయితే క్లాసిఫైడ్‌లో ప్రకటనలు ఇస్తాయా? అనుమానం వ్యక్తం చేశాను.
ఏ పుట్టలో ఏ పాము ఉందో? ఎవరు చూశారు గురువుగారూ! ఒక్కసారి ప్రయత్నించండి. అసలే ఖాళీగా ఉంటున్నారు. మిత్రుడి సలహా.
సరే, చూస్తాను అంటూ హామీ ఇవ్వటంతో మిత్రుడు సంతోషించాడు.
ఈనాడు క్లాసిఫైడ్స్‌ను పరికించి రెండు ప్రకటనల్నీ పట్టుకున్నాను. టపటపా ఫోన్లు కొట్టాను. మనకు దూరమయిన తెలుగు విస్లవ రచయిత పేరులో ఒక అక్షరాన్ని పెట్టుకున్న ఓ సంస్థ నుంచి ఓ ఆడ గొంతుక బదులు పలికి కొన్ని ప్రశ్నలు వేసిన తదుపరి, రెజ్యూమ్‌ పంపమంటూ మెయిల్‌ చిరునామా అందజేశారు. కొంతలో కొంత నయం.
ఇక రెండో ఛానలు వాడు. నేరుగా యజమానే బదులు పలికాడు. వెంటనే బయలుదేరి రమ్మంటూ చిరునామా పంపాడు.
సరేకదా పోయేదేముందని సదరు చిరునామాకు పోయాను.
బేగంపేట స్టాపర్స్‌స్టాప్‌ దగ్గరే ఉందది. శిథలావస్తకు చేరుతోన్న ఓ భవనం. కార్యాలయం జాడ చెబుతూనే పెద్ద మనిషి ఒకాయన నవ్వుకుంటుంటేనే నాకు అనుమానం వచ్చింది. పోయి చూద్దును కదా… ముస్తాబు చేసుకున్నా ముసలి వాసన కొడుతోన్న మూడు గదులు. అప్పటికే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఎదురు చూస్తున్నా, నాకే ముందు పిలుపు వచ్చింది. మేజా బల్ల ముందు నక్క … అహహ తోడేలు కూడా కావచ్చని అన్పించింది. మరో మాట పలుకు లేకుండానే ఓ క్లిప్పుంగుకి స్క్రిప్టు రాయమంటూ పురమాయించాడు. ఇరవై ఏళ్ల అనుభవజ్ఞుడికి పరీక్ష. కాదనలేక పాతబడిన కంప్యూటరు ముందు కూర్చోగానే ఆఫీసు సహాయకుడు వచ్చి, దాన్ని తెరిచాడు. ఏదో స్ధానిక నాయకులు పాల్గన్న శంకుస్థాపన కార్యక్రమం. గుసగుసల ఆడియో. అదీ ఉరుదు. నాకు పొట్ట కోస్తే ఒక్క ఉరుదూ పదమయినా అర్ధం కాదు కాబట్టి కదలికలను బట్టి చూస్తే అటుపో – ఇటు రా – జరగండి – జరగండి – పక్కకు తప్పుకోండి అని అనుకున్నాను. దీంతో దానికి స్క్రిప్టు ఎలా రాయాలో తెలియక అమాయకంగా పెట్టిన నా ముఖం చూసి నా పెన్ను తెగ నవ్వుకుందనుకోండి.
అక్కడ నుంచి లేచొచ్చి నక్క ముందు కూర్చుని చేతులేత్తేశాను. నాకు ఉరుదూ రాదని గొణిగాను.
ఉరుదూనా ఉరుదూ ఎక్కడుంది. మీరు మేఠావి అయితే కావచ్చుగానీ అలా మాట్లాడకండి. అంటూ ఉరిమాడు.
నేను మేథావిని కాదు. అందులోనూ ఉరుదో గిరుదో నాకు తెలియదు. అలాంటి ముక్కూ ముఖం, మొదలు చివర, గుర్తింపు లేని వాళ్లకు సంబంధించిన క్లిప్పింగుకు వార్త రాయగలిగిన సత్తా నాకు లేదు మహా ప్రభో అంటూ దండం పెట్టాను.
తోడేలుకు కోపం వచ్చింది. ఏదేదో వాగటం ప్రారంభించాడు.
నాకూ కోపం వచ్చింది…. అహా ఆపెహా, బోడి టీవీ ఒకటి పెడతావో? లేదో?గానీ తెగ నీలుగుతున్నావు. నువ్విచ్చిన క్లిప్పింగుకి వార్త రాయటం బుర్ర లేనోడు సంగతేమోగానీ, తలకాయ ఉన్నోడెవడూ చేయలేడు. నీ వ్యవహారం చూస్తుంటే ఏదో దొంగ పనుల కోసం కాచుకుకూర్చున్నట్లుంది. నిజంగా టీవీ ప్రారంభించేవాడెవడూ ఈ తీరున ఉండడు. ఈ చీకట్లి కొట్లో టీవీ పెడితే చూసేవాళ్లకు అసలు కళ్లు ఉంటాయా? ఊడతాయా? అంటూ అరిచేశాను. వాడు తెల్లబోయి చూస్తుండగా బయటకు వచ్చేశాను. బాయ్‌ లోపలికి పోయాడు. తోడేలు తెగ మొరగటం విన్నాను బూట్లు తొడుక్కుంటూ. అన్నట్లు దాని పేరు రెండును రెండుసార్లు విరిస్తే వస్తుంది.
మిత్రులారా! జాగ్రత్తహో… జాగ్రత్త.

నరుడు కాదు సింహుడే

నాకొక మిత్రుడు(?) ఉండేవాడు. అతగాడి పేరులో నరుడూ, సింహమూ కలిసుంది. ఆ! పేరులో ఏముంది … వాడు మనిషేననుకున్నాను. వాడి మాటలు నమ్మి మానవత్వం పుష్కలంగా ఉందనుకున్నాను. అయినదానికీ కానిదానికీ వాడికి అండదండలు ఇచ్చాను. వెంట నడిచాను. మద్దతిచ్చాను. జైకొట్టాను. ఇదంతా ఒక కోణం. మరో కోణం మరోలా ఉండటం వలనే ఈ రాతకు పూనిక అయింది మరి. నాకు ఓ పనిబడింది. పెద్దోళ్ల మాట సాయం అవసరం వచ్చింది. సరే, మిత్రుడు గుర్తుకొచ్చాడు. మాట సాయం చేయమని విన్నవించాను. అదెంత పని అన్నాడు. అంటే అతగాడు మాట సాయం చేస్తాడని గట్టిగా నమ్మాను. మానవుడి సహజ లక్షణమయిన మాట మాట్లాడుతాడనుకున్నాను. తీరా తన పేరులోని రెండో సగానికి అతగాడు పనిబెట్టాడు. సింహం వలె గాండ్రించాడు. గర్జించాడు. నాతో ఏమీ చెప్పకుండానే ఏదో చేయమని చెప్పినట్లు ఓ పెద్ద అబద్ధం చెప్పి ఎంచక్కా తప్పుకున్నాడు. వాస్తవానికి అర్హుడనే అయినా నా పని కాలేదు. సొంత శక్తినే నమ్ముకుని ఉంటే ఎలా? ఉండేదో!
ఔరా! సింహమా … బుద్ధి చూపించుకున్నావులే! నీ తప్పు ఏముంది? నా లాంటి వాళ్లంతా విడివిడిగా ఉన్నంత కాలం నీలాంటి వాళ్లకు తిరుగే ఉండదని మేము ఎప్పుడు గ్రహిస్తామో?కదా!

రోత రోత

 

విద్యుత్తు కోత – గ్యాసుకు కోత – సంక్షేమానికే కోత
నిత్యావసరాల ధరలేమో మోత – విదేశీ చిల్లర కొట్లకు ఖాతా
పంటల గిట్టుబాటుకు వాత – నేతల జాతా
జనం జీతాలు, జీవితాలు రోత రోత

తెలుగుదేశంలో ఆంగ్లం

ఆంగ్ల మాథ్యమంలో ఏడో తరగతి చదివే బంధువుల అమ్మాయి దీపావళి సెలవు సందర్భంగా మా ఇంటికి వచ్చింది. ఆమె రాసిన తెలుగు పదాల పట్టికను ఒక్కసారి పరికించండి. తెలుగుదేశంలో ఆంగ్లం జొరబడిన తీరును ఈ పట్టిక పట్టి చూపుతోంది. అంతే కాదు ఆంగ్ల పదాలను తెలుగులో రాసి అదే అమ్మ నుడి అని పలువురు భావిస్తున్నారు ఇప్పుడు. అదే ఇక్కడ కన్పించింది చూడండి. గుణింతంలో తప్పులు సరేసరి. (గోడల లోపల రా
సినవి సరైన అక్షరాలుగా గుర్తించగలరు)
కాకి – కన్ను – కమల్‌ – కమలిని – కమలం – కిటకి – కన్నీరు – క(కా)జా – కమ్యు(మ్యూ)నిటి – క్లాస్‌
మహి(హీ)ద(ధ)ర్‌ – మంజుల – మంచా(చ)ం – మామ(య్య)లు – మొ(మో)సాలు – మొ(మో)కాలు – మామ(య)బజార్‌ – మాంమ్‌(-)సాహారం – మజ్జిగా (గ)
టామ్‌ అండ్‌ జెర్రి – టమాట – టప(పా)కాయలు – టెంకాయ – టైట(టి)ల్‌ – టీచర్‌ – టాపిక్‌ – ట్రాఫిక్‌ – టి(టీ) మెంమ్‌(-)బర్స్‌ – టైమింగ్స్‌ – టికెట్‌ – టానిక్‌ – టిఫిన్‌ – టైటానిక్‌
ఇందుజ – ఇంద్రుడు – ఇంటిళ్లి(ల్లి)పాది – ఇల్లాలు – ఈజ్పెట్‌ (???) – ఈగలు – ఇనుము – ఇటి(టు)కలు – ఈనాడు – ఈరోజు – ఈలలు
పిరమిడ్‌ – పక్షలు – పంతులు – పరులు – పనిమనిషి – పిరికి – ప్రజలు – పొరిగిళ్లు – పజిల్‌ – పనులు – పిల్లులు

దీపావళి కల్లా బంగారం ధర రూ.32వేలు

దీపావళి కల్లా 10 గ్రాముల బంగారం ధర రూ.32,000కు చేరుకునే అవకాశాలున్నాయని బాంబే బులియన్‌ అసోసియేషన్‌ (బిబిఎ) తెలిపింది. దక్షిణాసియాలో నెలకొన్న డిమాండ్‌, పెట్టుబడులకు బంగారం ఉత్తమ మార్గం కావడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఇరాన్‌లో బంగారం ధర పెద్ద ఎత్తున పెరుగుతుందని, భారత్‌, చైనాలు కూడా అదే మార్గంలో ఉన్నాయని బిబిఎ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పృత్వీరాజ్‌ కొథారి అన్నారు. సెప్టెంబర్‌లో జరిగే ద్రవ్యసమీక్ష్లలో ఆర్‌బిఐ ఆర్థిక పునఃర్జీవానికి చర్యలు తీసుకుంటుందని, దీంతో దీపావళి కల్లా బంగారం ధర పెరుగుతుందని పేర్కొన్నారు

పాల కల్తీ.. నియంత్రణ

పసిపిల్లల నుండి ముసలివాళ్ల వరకూ పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా భావిస్తున్నాం. కానీ, భారత ఆహారభద్రత, ప్రమాణాల అథారిటీ 2011లో జరిపిన సర్వేలో దాదాపు 70 శాతం పాల నమూనాల్లో కల్తీ జరిగిందని గుర్తించింది. ఏడు రాష్ట్రాల్లో నూరు శాతం, మరో తొమ్మిది రాష్ట్రాల్లో 80 శాతం పైగా నమూనాల్లో కల్తీ జరిగింది. మన రాష్ట్రంలో ఇది 6.7 శాతం మాత్రమే. ఒక్క గోవా, పాండిచ్ఛేరిల నమూనాల్లో కల్తీ గుర్తించబడలేదు. ఇంత పెద్దమొత్తంలో జరుగుతున్న పాల కల్తీ ఆందోళన కలిగిస్తోంది. కల్తీకి వాడే కొన్నిపదార్థాలు ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఇదీ ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా కల్తీ నివారణకోసం ఏర్పర్చిన వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది.

మన దేశంలో ఆహారభద్రత ప్రమాణాలను 2006లో ఏర్పర్చిన ‘భారత ఆహారభద్రత, ప్రమాణాల చట్టం’ నిర్దేశిస్తుంది. ఈ చట్టం ద్వారా భారత ఆహారభద్రత, ప్రమాణాల అథారిటీ ఢిల్లీలో ఏర్పాటైంది. మనదేశ ఆహార ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా పెంచడం దీని లక్ష్యం.

పాలల్లో అత్యధికంగా (46.8 శాతం నమూనాలు) నీటితో కల్తీ అవుతున్నాయి. దీనివల్ల పాల పోషకవిలువలు తగ్గిపోతాయి. ఇలాంటి కల్తీలో పరిశుభ్రమైన నీటిని వాడకపోతే సూక్ష్మజీవులు, ఇతర కాలుష్యాలు చేరే అవకాశం ఉంది. ఇవి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మరో 44.7 శాతం మేర వెన్నతీసిన పాలపొడిని (స్కిమ్‌ పాలపొడి) కలిపినట్లు గుర్తించబడింది. అంటే, కల్తీ పాలల్లో 91 శాతం పైగా నీరు, స్కిం పాలపొడి కలపడం ద్వారా అవుతుందన్న మాట!

నీరు కలిపినప్పుడు పాలు పలుచగా కనిపించకుండా గ్లూకోజ్‌ లేక యూరియా లేక పిండిపదార్థాలు (స్టార్చ్‌) ను కలుపుతున్నారు.

డిటర్జెంట్‌ పౌడర్‌తో కల్తీ 8.4 శాతం పాల నమూనాల్లో గుర్తించబడింది. పాల సేకరణలో వినియోగించిన పాత్రలు శుభ్రంగా కడగకపోవడం లేక కృత్రిమ పాలను అసలుపాలల్లో కలిపినందువల్ల ఈ కల్తీ కనిపిస్తుంది.

నాణ్యతా లోపం అవకాశాలు..

సామాన్యంగా చిన్న ఉత్పత్తిదారుల స్థాయిలో కల్తీ జరగదు. ఒకవేళ జరిగినా వీరు నీటినీ కలుపుతారు. దీనిని తేలికగా లాక్టోమీటరుతో గుర్తిస్తారు. ఇలాంటి కల్తీ ఆరోగ్యానికి అంతగా హానికరం కాదు.

ఉత్పత్తిదారుని స్థాయిలో పాలు తీసేప్పుడు, తీసిన తర్వాత పశువుల పొదుగు సరిగ్గా కడగకపోయినా, దాని చర్మ ఆరోగ్యం బాగోకపోయినా, పాలుతీసే పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, పాలు తీసి నిల్వ వుంచే పాత్రలు శుభ్రంగా ఉంచకపోయినా, పాలు తీసేవారు వ్యక్తిగతంగా శుభ్రంగా లేకపోయినా, దాణా నాణ్యత, క్రిమి కీటకాదులు పాలను కలుషితం చేస్తాయి. పాల సేకరణ కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత, పాలను సేకరించే పరికరాల పరిశుభ్రత, పాలు పితకడం, సేకరణ కేంద్రానికి సరఫరాచేసే మధ్య కాలం, పరీక్షించేటప్పుడు, ఇతర పదార్థాలు వున్నప్పుడు, రోగకారక పశువుల నుండి పాలను సేకరించినప్పుడు, కృత్రిమ పాలను సేకరించినప్పుడు, ఉదయం, సాయంత్రం పాలను వేర్వేరుగా ఉంచలేనప్పుడు పాల నాణ్యత లోపిస్తుంది. కలుషితమవుతాయి.

పాల రవాణా సమయంలో వాహనం ట్యాంకు శుభ్రంగా లేకున్నా, ఉష్ణోగ్రత ఎక్కువగా వున్నా, పాలశుద్ధి పరిశ్రమ నిల్వ చేసే ట్యాంకు (సైలోలోకి) ల్లోకి సేకరించి తెచ్చిన పాలను పోసేటప్పుడు జాగ్రత్తలు పాటించకున్నా వీటి నాణ్యత లోపిస్తుంది.

నియంత్రణ..

వ్యవస్థీకరించిన పాల సరఫరాలో నాణ్యతా నియంత్రణకు పటిష్టమైన ఏర్పాట్లు ఉంటాయి. ఉదా: ‘విజయ’ సహకార పాల సరఫరా వ్యవస్థలో రోజుకు 4.65 లక్ష లీటర్లను సేకరించి, హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. వీటిలో కేవలం హైదరాబాద్‌-సికింద్రాబాద్‌లలో రోజుకు 3.8 లక్షల లీటర్లను అమ్ముతున్నారు. అయితే, మండల స్థాయిలో సేకరించిన పాలను నిల్వ వుంచి, రవాణా చేయడానికి 203 ‘బల్క్‌ కూలింగ్‌’ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇలాంటి ప్రతి కేంద్రానికి 25 గ్రామాలను అనుసంధానం చేశారు. ఇటువంటి అన్ని కేంద్రాల్లో ఆటోమాటిక్‌ ‘పాల పరీక్షా యంత్రం’ ఏర్పాటు చేశారు. వీటితో పాల నాణ్యతను అక్కడికక్కడే పరీక్షిస్తారు. గ్రామ పాలసేకరణ కేంద్రాల్లో కూడా ఇలాంటి యంత్రాలనే ఏర్పాటు చేశారు. వాటితో కూడా సేకరించే పాల నాణ్యతను అక్కడికక్కడే పరీక్ష చేస్తారు. ఇలాంటివి 1109 గ్రామ పాలసేకరణ కేంద్రాల్లో ఉన్నాయి. ఈ యంత్రం ఖరీదు సుమారు రూ.30 వేలు ఉంటుంది. అన్ని ప్రైవేటు పాల సరఫరా కంపెనీల్లో ఈ విధంగా పటిష్టమైన నాణ్యతా నియంత్రణ ఉంటుందని చెప్పలేం.

పరిశుభ్రమైన పాల ఉత్పత్తి..

నాణ్యతా నియంత్రణకు పరిశుభ్రమైన పాల ఉత్పత్తి కీలకం. దీనికోసం పాడి పశువులను శుభ్రమైన ప్రదేశాల్లోనే కట్టి ఉంచాలి. ఆరోగ్యవంతమైన పాడి పశువుల నుండి మాత్రమే పాలను సేకరించాలి. పొదుగు వాపు మొదలగు వ్యాధులు సోకిన పశువుల నుండి పాలను తీయరాదు. ఇట్టి పాలను ఇతర ఆరోగ్యవంతమైన పశువుల పాలతో కలపకూడదు. పాలు తీసేముందు పాడి పశువు పొదుగును ఒక్క శాతం పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణం (లీటరు నీటికి అరచెంచా పొటాషియం పర్మాంగనేట్‌ కలిపిన ద్రావణం) తో కడగాలి. తలవెంట్రుకలు పాలల్లో కలవకుండా జాగ్రత్త పడాలి. పరిశుభ్రంగా కడిగిన పాత్రలోనే పాలను పితకాలి. పాత్రలను క్లోరిన్‌ ద్రావణంతో (200 పిపిఎమ్‌) మొదట శుభ్రంగా కడగాలి. ఈ ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి ఒక చెంచా బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి, తయారుచేయవచ్చు. ఈ పాత్రలపై దుమ్మూ, ధూళి, క్రిమికీటకాలు పడకుండా ఎప్పుడూ మూతలు పెట్టి ఉంచాలి.

జున్ను పాలను మామూలు పాలతో కలపరాదు. ఈనిన 15 రోజుల తర్వాత మాత్రమే తీసినపాలను కేంద్రాల్లో పోయాలి. నిల్వ వున్న పాలను అప్పుడే తీసిన పాల తో కలపకూడదు. పాలు తీసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా కేంద్రాలకు చేర్చాలి.

(ఆంధ్రప్రదేశ్‌ సహకార డైరీ డెవలప్‌మెంటు సమాఖ్య మేనేజర్‌ మధుసూధనరావు, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీమతి హెచ్‌.కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగా…)

కృత్రిమ పాలు..

పైకి చూడటానికి ఇవి అసలు పాలలాగానే కనిపిస్తాయి. కానీ, పాలల్లో వుండే ఏదీ దీనిలో వుండదు. చారెడు చక్కెర, దోసెడు యూరియా, పావులీటరు మంచినూనె, అరలీటరు అసలు పాలు, కొంత సర్ఫ్‌ మిశ్రమాన్ని 20 లీటర్ల మంచినీళ్లలో కలిపి కృత్రిమ పాలను తయారుచేస్తున్నారు. వీటికి ఏవిధమైన వాసనా వుండదు. వేరుగా ఉంటే, వీటిని గుర్తించడం తేలిక. అసలు పాలల్లో కలిపితే మాత్రం గుర్తించాలంటే పరీక్షల్లో తేలాల్సిందే.

అయితే, కల్తీ పాలకు ‘ఈ పాలు’ భిన్నమైనవి. కల్తీ పాలల్లో అసలు పాలు ఎక్కువగా వుంటాయి. కల్తీ వస్తువులు తక్కువగా వుంటాయి. కానీ, కృత్రిమ పాలల్లో వుండే ఏ పదార్థమూ దీనిలో వుండదు.

తాజాగా వున్నప్పుడు కృత్రిమ పాలు సబ్బు వాసనను కలిగి వుంటాయి. నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చల్లబరిస్తే ఏ వాసనా ఉండవు. రుచికి ఇవి చాలా ‘చేదు’గా వుంటాయి. వీటిని అసలు తాగలేం. సాంద్రత మామూలు పాలల్లాగానే వుంటుంది. నిల్వ వుంచితే పసుపురంగుకు మారతాయి. వేడిచేసినప్పుడు ఇవి సబ్బు వాసనతో పసుపురంగులోకి మారతాయి. గది ఉష్ణోగ్రతలో నిల్వ వుంచి నప్పుడు కూడా ఇవి పసుపురంగులోకి మారతాయి. వేళ్లను దీనిలో ముంచినప్పుడు సబ్బును తాకినట్లు అన్పిస్తుంది. ఉదజని సూచిక (పిహెచ్‌) అతిక్షార గుణం (10.5) తో ఉంటాయి. పంచదార, తటస్థీకరణ పరీక్షలకు స్పందిస్తాయి. వీటికి విరుద్ధంగా మామూలు పాలు ఆమ్లగుణం లేక తటస్థస్థాయిలో పిహెచ్‌ 6..4 నుండి 6.8గా వుంటూ పంచదార, తటస్థీకరణ పరీక్షలకు స్పందించవు.

కృత్రిమ పాలల్లోని కొవ్వు (కలిపే నూనె) క్యాన్సర్‌ను కలిగించగలదంట. డిటర్జెంట్‌ వల్ల కడుపులో తిప్పినట్లవుతుంది. విరోచనాలు అవుతాయి. దీనిలో కలిపే యూరియా, ఒక మోస్తరు విషపదార్థంగా పనిచేస్తుంది. తటస్థీకరణ పదార్థాల వల్ల (ఆమ్ల, క్షారాలు) కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.

ఈ కల్తీ పాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో బాగా తయారవుతున్నాయి. కానీ, ఇటీవల మన రాష్ట్రంలోనూ తయారుచేస్తున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి పాల సేకరణ కేంద్రాల ద్వారా ‘సరఫరా’ వ్యవస్థలోకి చేరుతున్నాయి. అందువల్ల, ఈ కల్తీ నివారణకు అన్ని సేకరణ కేంద్రాలలో కచ్ఛితమైన నిఘా ఏర్పాటుచేయాలి.

రాష్ట్రంలో..

మొత్తం 120.08 లక్షల టన్నుల పాల ఉత్ప త్తితో 2011-12లో జాతీయంగా మూడోస్థానంలో రాష్ట్రం కొనసాగుతుంది. ఇంతకుముందు 2008-09లో 95.7లక్షల టన్నుల పాల ఉత్పత్తిలో రెండోస్థానంలోనే ఉండేది.

ఉత్పత్తవుతున్న పాలల్లో సుమారు మూడోవంతు గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా వినియోగ మవుతుంది. మిగతావి సుమారు 80 లక్షల టన్నులు వ్యవస్థీ కృతంగా చిన్న, పెద్ద పట్టణాల్లో అమ్ముతున్నారు. అయితే, దీనిలో కేవలం, 20 లక్షల టన్నుల పాలు మాత్రమే సహకారవ్యవస్థ ద్వారా అందుతున్నాయి. మిగతావి ప్రయివేటు శుద్ధి కంపెనీల నుండి, అమ్మకందార్ల (వెండర్ల) ద్వారా అమ్ముడుపోతున్నాయి. పాలను తేలికగా కల్తీ చేయగలగటంతో పాల కల్తీ నివారణకు రాష్ట్రంలో పటిష్టమైన నిఘా, పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఇప్పుడున్న వ్యవస్థను పటిష్టపరచాలి. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంట్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ను రాష్ట్ర ఆహారభద్రత కమిషనర్‌గా ప్రకటించారు. ఏ కంపెనీ అమ్మే పాలల్లోనైనా కల్తీ జరుగుతుందని అనుమానం కలిగితే దాని గురించి ఆ కంపెనీ దృష్టికి తీసుకొచ్చినా నివారణ చర్యలు తీసుకోకపోతే, ఆహారభద్రతా కమిషనర్‌, నారాయణగూడ, హైదరాబాద్‌కు తెలియజేయాలి. వీరి టెలిఫోన్‌ నెంబర్ల (040-27560191, 27552203) కు ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలోని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను ఆహారభద్రతా అధికారులుగా ప్రభుత్వం ప్రకటిం చింది. పాలు కల్తీ అవుతున్నట్లు అనుమానం వచ్చినప్పుడు, సమీప ‘ఆహారభద్రతా అధికారి’ దృష్టికి తీసికెళ్లాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో విజయ డైరీ వారు పాలను మహిళా స్వయంసహాయక గ్రూపుల ద్వారా సేకరిస్తున్నారు.

* హైదరాబాద్‌లోని విజయడైరీ వారు ‘ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం’ సహకారంతో డైరీ టెక్నాలజీలో ఒక డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నారు. ఈ డిప్లొమాను విశ్వవిద్యాలయం ఇస్తుంది.

 జాగ్రత్తలు..

* కాచిన తర్వాతే తాగాలి.

* ప్యాకెట్‌ పాలు క్షేమం. వీటి పాల నాణ్యతపై నియంత్రణ ఉంటుంది.

* విడిగా అమ్మే పాలను కొనకూడదు. వీటి నాణ్యతపై ఏ నియంత్రణా ఉండదు.

* ప్యాకెట్‌పై సూచించిన గడువులోనే వాడాలి.

* ఫ్రిజ్‌లో ఎక్కువకాలం నిల్వ వుంచకూడదు.

* అనుమానం వచ్చినప్పుడు విజయ పాల విషయంలో 27019851- ఎక్స్‌టెన్షన్‌ – 224 / 260కు ఫిర్యాదు చేయాలి. మిగతా కంపెనీల పాలప్యాకెట్లపై కూడా ఇలాంటి నెంబరు వుంటుంది. ఆయా నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

శుద్ధి కర్మాగారంలో పరీక్షలు..

* ముడిపాలు రాగానే దాని వాసన, రుచిని చూస్తారు. పాలు సామాన్యంగా, రుచిగా వుండాలి. ఉష్ణోగ్రత 6 డిగ్రీల కన్నా తక్కువగా ఉండాలి. తటస్థీకరణ పదార్థాలు, కల్తీ పదార్థాలు ఉండకూడదు. ఆ తర్వాత ప్యాశ్చరైజేషన్‌ చేస్తారు.

* శుద్ధి తర్వాత, ప్యాకింగ్‌కు ముందు కూడా రుచి మామూలుగానే ఉండాలి. ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌లోనే ఉండాలి. ఆమ్ల శాతం 0.13 నుండి 0.14 శాతం మధ్య ఉండాలి. ఉష్ణ స్థిరత్వం 0.5 మి.లీ. నెగటివ్‌ ఉండాలి. ఫాస్ఫేటిక్‌ పరీక్ష నెగటివ్‌గా ఉండాలి. మిథిలిన్‌ బ్లూ రిడక్షన్‌ టెస్ట్‌ (ఎంబిఆర్‌టి) కనీసం ఐదుగంటల వరకూ రంగు కోల్పోకూడదు. గ్రేడ్‌ ప్రకారం కొవ్వు, కొవ్వుకాని కరిగిన ఘనపదార్థాలు (చక్కెరలాంటివి) ఉండాలి. బ్యాక్టీరియా ఉండకూడదు. పరీక్ష చేస్తారు. ‘ప్లేటు’ గణింపు (ప్లేట్‌ కౌంట్‌) లో ఒక మిల్లీలీటరు పాలకు 30 వేలకు మించకూడదు. అదేవిధంగా వీటిలో కోలీఫార్మ్‌ మిల్లీలీటర్‌కు పదికి మించకూడదు.

మొక్కతో కాన్సర్‌ నివారణ..! – డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

మనదేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ లభించే ఒక మొక్కతో కాన్సర్‌ను అరికట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ‘వర్జిన్‌ మాంటిల్‌’ అనే మొక్క కాన్సర్‌ కణాలను ఏకంగా చంపేస్తుందట! ఈ మొక్క ఆకులతో చేసిన టీని బ్రెస్ట్‌ కాన్సర్‌ ఉన్న మహిళలు సేవించడం గ్రామీణ పాకిస్తాన్‌లో మామూలే. ఆ మొక్కలోని పదార్థాలు కేవలం ఐదు గంటలలో కాన్సర్‌ కణాలను నిలువరించడమే కాకుండా 24 గంటలలో వాటిని చంపగలవని పరిశోధనల్లో గుర్తించారు. విశేషమేమిటంటే, కీమోథెరిపీ (మందుతో చేసే చికిత్స) లాగా ఇది మామూలు కణాలకు ఎటువంటి హానీ చేయదు. ఆఫ్రికా, యూరప్‌లో కొన్ని ప్రదేశాలలో కూడా కనిపించే ఈ దివ్య ఔషధమొక్కల శాస్త్రీయ నామం ‘ఫాగోనియా క్రేతికా’.