
‘ఆ ఒక్కటీ అడక్కు’ తెలుగు సినిమాలో దేన్ని అడగకూడదని చెప్పారో తెలియదుగానీ … హైదరాబాదు నగర బస్సుల్లో విహరించే విద్యార్థులు మాత్రం ఆ ఒక్కటీ మోయరుగాక మోయరు. ఆ ఒక్కటీ అంటే వాళ్ల చేతుల్లో ఉండేది ఒకే పుస్తకం కదా మరి. విద్యార్థులు బస్సెక్కీ ఎక్కగానే తమ చేతనున్న ఒక్క పుస్తకాన్నీ అందుబాటులో ఉన్న ఏ ప్రయాణికుడి వళ్లోనో పడేస్తారు. కనీసం వాడిని అడగాలన్న నాగరికత వాళ్లకు ఎందుకు తెలియకుండా పోయిందో నాకు తెలియదు. అడగరు సరికదా, ఆ ప్రయాణికుడి ముఖమైనా చూడరు. ఎటో చూస్తూ, ఏదో చేస్తూ ముందు పుస్తక భారాన్ని వదిలించుకుంటారు. చైనాలో పాతరపోళ్లు బిడ్డల్ని వీపుకి కట్టుకున్నట్లుగా కొందరు విద్యార్థులు తెచ్చుకున్న సంచినయినా సరే ఎవడో ఒకటిడికి అప్పగించి సెల్ ఫోన్లని చెవుల్లో ఇరుకించుకుని ఎఫ్ఎం పాటల తోటలో పిచ్చోళ్లయి పోతుంటారు. ఇక పిడుగులు పడ్డా వాళ్లకు ఈ లోకం పట్టదు. కావాలంటే మీరూ ఒక్కసారి పరిశీలించి చూడండి. ఫోన్లని చెవుల్లో దూర్చుకుని పాటలు వినేవాళ్లకీ, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి రోగులకీ పెద్దగా తేడా కనపడదు. ఏదో లోకంలో ఉంటారు. నాకయితే వాళ్లను చూస్తే ‘మట్టి పాము’ అనీ ‘మట్టి పింజర’ అనీ మా ఊళ్లో పిలిచే అంతంతమాత్రానికి కదలని, మెదలని పాములే గుర్తుకొస్తాయి. ఇలా కుర్రకుంకల పుస్తకాలనో, సంచుల్నో మోయటం అంటే నాకు మహా చికాకు. అందుకని వీలయినంత వరకూ ఈ అనాగరిక వ్యవహారంలో చిక్కుకోకుండా జాగ్రత్త పడతాను. అయితే ముఖాలు చూడకుండానే మన మీద వాళ్ల సంచుల్ని వస్తున్న సంస్కృతిని బాగా ఒంట బట్టించుకున్న ఈ నగరపోళ్ల వెకిలికి నేను అప్పుడప్పుడూ చిక్కిపోతుంటాను. అయినా నా నిరసనను వ్యక్తం చేయకుండా మాత్రం ఉండను.
నగరం అంటే నా దృష్టిలో నాగరీకుల పురం. గ్రామీణుల కంటే, పట్టణవాసుల కంటే నగరవాసులు నాగరీకంగా వ్యవహరించాలి. అయితే తెలుగు రాజధాని హైదరాబాదులో ఆ భాగ్యమే కనపడదు.
ఇప్పుడేమన్నా టీవీలు నేర్పాయేమో తెలియదుగానీ, కొన్నాళ్ల క్రితందాకా చెన్నయ్, బెంగళూరు, విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ తరహా కుసంస్కృతి లేదు. ఇప్పుడు అక్కడకూ ఆ… ఒక్కటీ మోయకు విధానం పాకి ఉంటే, గింటే అదంతా టీవీల పుణ్యమే అయి ఉంటుంది.
నాగరీకులారా, మీ పుస్తకాన్ని మీరే మోసుకుంటున్నారు కదూ! మీ సంచిని ఇంకొకడి వళ్లో పారేయటం లేదు కదూ!!
12 Feb
ఆ ఒక్కటీ మోయకు … బస్సు భాగోతం – 2
10 Feb
బస్సు భాగోతం – ధారావాహిక … 1

నేను నాస్తికుడిని. అంటే పెద్దగా ఆస్తిలేని వాడినన్నమాట. అందుకనేగదా, రాత కూలివాడుగా బతుకీడుస్తున్నాను. హై – ధరా- బాదు – లో బస్సుల్లో తిరిగే అతితక్కువ మంది పాత్రికేయుల్లో నేనొకడిని. ఈ బస్సుల మీద వార్తలుగానీ, కవితలుగానీ, కథలుగానీ, నవలలుగానీ… ఇలా దేన్నయినా సరే టన్నుల కొద్దీ రాసిపారేయొచ్చని నాకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. నేనేంటి – ఆ మాటకొస్తే రాయటం బొత్తిగా రానే రాదని తేల్చేసుకున్నవారెవరయినా సరే గుట్టలకు గుట్టలు రాసిపారేయొచ్చు. కాకపోతే బస్సు ప్రయాణికుడయి ఉండాలి. నా విషయానికే వస్తే నగరంలో బస్సు ప్రయాణికుడిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్నాను. ఇక మీకు అనుమానం తీరినట్లేగా మరి!
ఇక ఇప్పటి నుంచీ రోజూ ‘బస్సు భాగోతం’ పేరిట రాసేయాలని నిర్ణయించేసుకున్నాను. అతే కాదు, ఇప్పటి నుంచే రాసేయటం ప్రారంభిస్తున్నాను …. కాసుకోండి మరి!
ఓ రోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ”కావేసురా, కావేసురా … నీకు ఇష్టమైన కోరిక అదీ ఒక్కటంటే ఒక్కటి కోరుకో. అది ఎలాంటి కోరికయినా ఇట్టే తీర్చేస్తాను” అంటూ పలికాడు.
”అయితే హైదరాబాదు నగర బస్సులన్నింటిలోనూ, అన్ని సమయాల్లోనూ, ప్రతి రాకపోకలోనూ విధిగా ఒక్క సీటయినా ఖాళీగా ఉండేంత అధిక సంఖ్యలో వాహనాలు నడిచేలా చేయి స్వామీ” గుక్క తిప్పుకోకుండా చెప్పేశాను నా కోరికను.
తెనుగు సినిమాలకు మల్లే ”తథాస్తు” అంటాడు కదా అని ఆయనకల్లే చూస్తున్నాను. అయితే మరో రకంగా ఆ చోద్యం ముగిసింది. నా కోరికను విన్నంతనే ఆయన ముఖ కవళికలు వేగంగా మారాయి. చేత్తో తన నుదుటి మీద గబగబా రెండుసార్లు బాదుకున్నాడు. ”అమ్మో, అమ్మో, ఇక మీదట ఎప్పుడూ కోటి సంవత్సరాలపాటు ఘోరాతి ఘోరంగా తపస్సు చేసినా సరే, పాత్రికేయ దొంగ ముండాకొడుకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్షం కానే కాను బాబోయ్!.” అంటూ దేవుడు క్షణాల్లో మాయమయిపోయాడు.
26 జన
ప్రపంచీకరణ నేపథ్యంలో అవినీతి ….. ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్

- కార్పొరేట్లకు రూ.5 లక్షల కోట్ల రాయితీలు
- మంత్రులతో నిండుతున్న జైళ్లు
- ఇక కేబినెట్ మీటింగ్ జైల్లోనే
ప్రపంచీకరణ నేపథ్యంలోనే దేశంలో అవినీతి పెరిగిపోతోందని ప్రముఖ పాత్రికేయులు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ‘ప్రపంచీకరణ-అవినీతి’ అంశంపై ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలోబుధవారం ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన మాట్లాడారు. విమానయాన మంత్రి రవూఫ్ పటేల్ రోజువారీ ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్నట్లు పిఎంఓ ప్రకటించిందన్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్లో పని చేస్తున్న 40 శాతం మంది ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులుగా ఉన్నారన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఏడాది వేతనం రూ.2 నుండి రూ.3 లక్షలు ఉందన్నారు. ఆ మాత్రం వేతనం ఇచ్చే స్థితిలో కూడా ఎయిర్లైన్స్ లేదని మంత్రి చెబుతున్నారన్నారు. పిఎంఓ ప్రకటించిన వివరాల ప్రకారం మంత్రిగా ఉన్న పటేల్ ఆస్తులు 2009 ఎన్నికల నుండి 28 నెలల్లో రూ.43 కోట్లకు పెరిగాయన్నారు. మంత్రిగా బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఆస్తులు ఈ విధంగా పెరగడం అవినీతి పెరగడానికి నిదర్శనం అన్నారు. అయితే ఇదే మంత్రి హయాంలో ఇండియన్ ఎయిర్లైన్స్ పూర్తిగా నష్టాల్లోకి నెట్టివేయబడిన విషయం గమనించాలన్నారు. ఎన్ఆర్ఇజిఎస్లకు కనీస వేతనాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మంత్రులే ప్రకటించారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా 5లక్షల కోట్లరాయితీలకు డబ్బు ఎక్కడని ప్రశ్నించారు. గంటకు రూ.10 కోట్లు సంపాదించిన మంత్రి కూడా ఉన్నారన్నారు. మహారాష్ట్రలో 15 ఏళ్ళలో 50 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి విలాస్రావు దేశ్ముఖ్ ఆ రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. అత్యధికంగా 50వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విదర్భకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. అతను పెద్ద వడ్డీ వ్యాపారని అన్నారు. ఆ ఎమ్మెల్యే వేధింపుల గురించి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అరెస్టుకు యత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు వెళ్ళాయన్నారు. అవినీతితో పాలకులకున్న బంధాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందన్నారు. పోలీసులు నాగపూర్ బెంచ్ను ఆశ్రయిస్తే కోర్టు ఎమ్మెల్యేకు రూ.25వేల జరిమానా విధించిందన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 10లక్షల రూపాయల జరిమానా విధించిందన్నారు. ఆ మంత్రికి అత్యంత కీలకమైన గ్రామీణ అభివృద్ధి శాఖ అప్పగించి ప్రధాని ప్రమోషన్ కల్పించారన్నారు. ఈ విధంగా అవినీతి మంత్రులకు ప్రధానమంత్రి అండదండలున్నాయన్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఉండదన్నారు. మంత్రులంతా అవినీతి ఆరోపణలతో జైలు పాలవుతున్నారనీ, ఇక కేబినెట్ సమావేశాలు జైళ్లలో నిర్వహించుకోవాల్సిందేనని అన్నారు. అవినీతికి మేము వ్యతిరేకం అని కొందరు చెబుతుండగా మరి కొందరు ఉద్యమాల పేరుతో వీధుల్లోకి వస్తున్నారన్నారు. ఈ అవినీతికి మూలం ఏమిటీ, ఎవరి విధానాలు కారణం అనేది మాత్రం చెప్పటం లేదన్నారు. ఇదే విషయం అంధ్రప్రదేశ్తోపాటు అనేక రాష్ట్రాల్లో బయట పడిందన్నారు.
2010-11లో కార్పొరేట్లకు వాణిజ్య, కస్టమ్స్, పలు రాయితీల కింద 88వేల 263కోట్ల రాయితీ ఇచ్చిందన్నారు. కానీ రైతులకు 73వేల కోట్లు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఎక్సైజ్ పాలసీ కింద కార్పొరేట్ సంస్థలకు ఐదు లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందన్నారు. అవినీతికి బడ్జెట్లోనే చట్టబద్దతకల్పిస్తున్నారని అన్నారు. 2006 బడ్జెట్లో కార్పొరేట్ సంస్థలకు ఎంత రాయితీ ఇస్తున్నారో తెలపాలని వామపక్షాలు ప్రశ్నించాయనీ, ఆ ఫలితంగానే అవినీతి బయటకు వస్తోందని అన్నారు. ముంబాయి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. గోద్రెజ్, టాటా ఉద్యోగాలు రోజురోజుకూ తగ్గిస్తున్నాయని అన్నారు. కెజిబేసిన్ ఆంధ్రప్రదేశ్ ఆస్తి అనీ, దీనిని అంబానీల్లో ఎవరికి ఇవ్వాలనే అంశంపై పార్లమెంట్ ఓ సెషన్లో చర్చించారన్నారు. వ్యవసాయరంగం సంక్షోభానికి పాలకులే కారణమన్నారు. 1990లో వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి 14శాతం నిధులు కేటాయిస్తే ప్రస్తుతం 3శాతం కూడా కేటాయించడం లేదన్నారు. ఎఫ్డిఐలు రిటైల్ మార్కెట్లోకి వస్తే ఉన్న ఉద్యోగాలుపోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
8 జన
వ్యాపారాలు … పదవులు – ప్రపంచ తెలుగు మహోత్సవం

”ఏ పదాల వెనుక ఏమి దాగి ఉందో తెలుసుకోనంతవరకూ మనం మోసపోతూనేఉంటాం” అంటారు లెనిన్ మహాశయుడు.
ఈ నేపథ్యంలో జనవరి ఐదో తేదీ నుంచీ ఏడో తేదీవరకూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని పరిశీలిస్తే కొన్ని అసలు నిజాలు బయటపడతాయి.
ఒకనాడు శూద్రులే అయినా స్వాతంత్య్రాననంతరం ప్రభువులగా మారిన ఓ సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేసే ఒక చిన్న ఉద్దేశంతోనూ, చెత్త వ్యాపారాన్ని కైవశం చేసుకునేందుకూ, పనిలోపనిగా పదవుల్నీ దక్కించుకునే లక్ష్యంతోనూ ఈ మహోత్సవాలను రాంకీ సంస్థ నిర్వహించిందన్న విమర్శలు విన్పించాయి. ఈ రాంకీ సంస్థ ప్రస్తుత లోక్సభ నరసరావుపేట (గుంటూరు జిల్లా) సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి (తెలుగుదేశం) కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సంస్థ నిర్మాణ రంగంతోపాటు చెత్త నుంచి విద్యుదుత్పత్తి పరిశ్రమలనూ నిర్వహిస్తోంది. పనిలో పనిగా సేవ కోసమంటూ అదే పేరుతో ఓ ట్రస్టును కూడా ప్రారంభించింది.
రాష్ట్రంలోనే అత్యంత అపరిశుభ్ర పట్టణంగా నమోదయిన ఒంగోలు త్వరలో పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించనుంది. దాన్నలా ఉంచితే ఒంగోలులో ప్రస్తుతం అరకొరగా సేకరిస్తేనే 300 టన్నులకు పైగా చెత్త పోగుబడుతోంది. అదే చిత్తశుద్ధితో పనిచేస్తే వెయ్యి టన్నులకు పైగానే దొరుకుతుంది. దీనిపైనే రాంకీ దృష్టి సారించింది. ఇక్కడి చెత్తను సేకరించే పనిని కొట్టేసేందుకు పన్నాగం పన్నింది. చెత్తాచెదారంతో విద్యుదుత్పత్తి పరిశ్రమను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగానే ఒంగోలు వాసులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదే ప్రంచ తెలుగు మహోత్సవాల పేరిట తెర మీదకు వచ్చింది. ప్రకాశం జిల్లాకు ప్రత్యేకించి ఒంగోలుకు చెందిన అధికారులనూ, అనధికార ప్రముఖులనూ, పెద్దలనూ బుట్టలో వేసుకునేందుకుగాను భాషాభిమానాన్ని వాడుకుంది. నోరు జిల ఉన్నవాళ్లను వేదిక ఎక్కించి మైకు అందించింది. శాలువాల పిచ్చోళ్లకు సన్మానాలు చేసింది. మొత్తం మీద రాంకీ అనే సంస్థ ప్రజల కోసం, ప్రత్యేకించి తెలుగు ప్రజల కోసం, ప్రకాశం వికాసం కోసం, ఒంగోలు వాసుల వెలుగుకోసం పనిచేసేందుకే ఉద్భవించిందని అనిపించుకునేందుకుగాను నానా తంటాలూ పడింది. తాను ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియని ఓ గొంతుయ్య, తెలుగు యాంకరమ్మ సుభాషిణి వ్యాఖ్యాతలుగా మూడు రోజుల పాటు తిరునాళ్లు జరిపింది. తెలుగుకు తెగులు పట్టిందని ఈ మహోత్సవంలో పలువురు పాచి పాటను తెగపాడేశారు. తెగులును వదిలించేందుకు తాము ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు ఆంగ్లంలో వీరావేశంతో ప్రకటించారు. తెలుగువాళ్లంటే బట్టు పెట్టుకోవాల్సిందేనంటూ ప్రవాసాంధ్ర మహిళా మణులు తెగవాగేశారు. చీరలు కడితే చాలు తెలుగుకు వెలుగొస్తుందని తీర్మానించారు. తమ బిడ్డలకు వేద గణితం నేర్పుతూ తెలుగును బతికించేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషను చంపేసిన ఆంగ్ల భాషా మసాలను దట్టించిన ప్రసంగాలు నిజమైన తెలుగోడికి రోత పుట్టించాయంటే నమ్మాలి. ఈ కార్యక్రమంలో ప్రతి అడుగూ డబ్బు కంపు కొట్టింది. సదస్సులంటూ నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కొక్కరికి కేవలం అరగంట కేటాయించటమే ఆయా విషయాలను కరివేపాకు చందంగా వాడుకునేందున్న వాదనకు బలం చేకూరుతోంది. ఉదాహరణకు వ్యవసాయ, విద్య తదితర రంగాలు ప్రస్తుతం దివాళాదశకు చేరుకున్నాయి. అలాంటి వాటిని గురించి ఎంతటి మేథావయినా కేవలం అరగంటలో చెప్పేయటం ఏ విధంగా సాధ్యం? ఈ రంగాలకు పట్టింది చిన్నా చితకా వ్యాధులా? ఓ గొట్టాన్ని మింగిస్తే సరిపోవటానికి? సరిజేయటానికి??
ఇక సాంస్కృతిక కార్యక్రమాలు తెగ బలిసినవాళ్ల తైతక్కలే తప్ప తెలుగు వాసన, తెలుగు సంప్రదాయం చిటికెడు కానరాలేదు. పైగా విదేశీ కరాటే కంటే గొప్ప యుద్ధకళలు దేశంలో చాలా ఉన్నాయంటూ కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన ఏవేవో జిమ్మిక్కులకు వేదిక కల్పించారు. ఎవరితో ఎవరు యుద్ధం చేయాలో? ఎందుకు యుద్ధం చేయాలో? మాత్రం నిర్వాహకులు తేల్చి చెప్పలేదు. మొత్తం మీద తెలుగు సంస్కృతి అంటే ద్రవిడులను చంపేసిన అమ్మలు ఎర్రటి నాలుకల్ని వేలాడేసి పిచ్చెక్కినట్లు గిరగిరా తిరగటమేనన్న ప్రదర్శనలకూ బాగానే చోటు కల్పించారు. అక్కడ, ఇక్కడ, ఎక్కడైనా అన్నట్లుగా ఒంగోలు వీధుల్లో ప్రవహించే మురుగుకు తోడు భక్తిని కూడా యథావిథిగానే బాగా పారించేరు. అలా అలా తమ భవిష్యత్తు వ్యాపారాలకు ఎవ్వరూ అడ్డురాకుండా చూసుకునే పనిలో రాంకీ గట్టిగానే తెలుగువాడిని వాటేసుకుంది. చెత్త వ్యాపారాలకు సంబంధించి ఎవడన్నా నిజం చెప్పాలనుకునే పిచ్చోడుంటే వాడి నోరును గట్టిగా మూయించేందుకు తగినవారిని ఏర్చికూర్చి పెట్టేసుకుంది.
”తెలుగు మహోత్సవాలను రాంకీ ఒంగోలులో ఎందుకు జరపాలనుకుందో నాకు తెలియదుగానీ, రెండు మూడు రోజులలో వాళ్లే చెబుతారనుకుంటున్నాను” అంటూ రాష్ట్ర పురపాలకశాఖామాత్యుడు మానుగుంట మహీధరరెడ్డి చివరి రోజు నిర్వహించిన విజయోత్సవ సభలో విసిరిన విసురు యాదృచ్చికం కానేకాదు. వ్యాపారాలు – వాణిజ్యాల రక్షణ కోసం శాసన వేదికలు ఎంతగా ఉపయోగపడతాయో తెలిసిన రాంకీ తమ అధినేతను ఈ సారి ఒంగోలు నుంచి గెలుపించుకోవాలన్న కోరికతో ఉంది. గెలాక్సీ గ్రానైటు, ముడి ఇనుము, అపారమైన సముద్ర సంపద, 140 కిలోమీటర్ల తీర ప్రాంతం, మెగా ఓడరేవు నిర్మాణానికి అవకాశాలు ఇలా పలు ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న ఒంగోలును సొంతం చేసుకునేందుకు రాంకీ పావులు కదుపుతోంది. ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో తమ అధినేతను ఒంగోలు నుంచి గెలుపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదీ ఇప్పుడు ఊరేగుతోన్న తెలుగుదేశం పల్లకీ కాదట. వేణుగోపాలరెడ్డి తానున్న తెలుగు తక్కెడ నుంచి త్వరలో దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి. కొడితే కుంభస్థలాన్ని కొట్టి కోట్లు వెనకేసుకోవాలన్న తపనతో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు అభ్యర్ధిత్వం కోసం వేణుగానం చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఎవరో అల్లాయి, పుల్లాయి చెప్పింది కాదు. ఓ మంత్రివర్యుడు తెలుగు మహోత్సవ విజయోత్సవ సభ వేదిక సాక్షిగా వ్యక్తిగత సంభాషణల్లో వెల్లడించిన ఓ నిజం.
అదండీ సంగతి. రాంకీ తెలుగు తిరునాళ్ల వెనుక వ్యాపారాలు, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన పదవుల వ్యవహారం ఉందంటే మీరు ఏమంటారు ?
5 జన
ఔరా! ఫాదరా!!

దేవుళ్లూ, దెయ్యాలు ఉన్నారా(యా)? లేరా(వా)? అన్నమీమాంసను పక్కకు పెట్టి చూస్తే మన పవిత్ర (?) భారత దేశంలో నేనే దేవుడిని, నేనే దేవతనంటూ వీధికొక్కడొక్కడయినా, ఒక్కతయినా తారసపడటం కద్దు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి పక్కా దొంగల సంగతి కాదు.
”ప్రియమైన నా తండ్రీ, ఈ రాత్రి సమయమున ఇక్కడ సమావేశమైన మా అందరినీ చల్లగా చూడుము నాయనా’ అంటూ నిత్యం అభ్యర్థించే కోట్లాది మంది నిరుపేదలకు హితబోధలు చేసే అపర తండ్రుల (ఫాదర్ల)లో ఓ నమూనా గురించి నన్ను చెప్పనీయండి.
హైదరాబాదులో పాత్రికేయ వృత్తిదారుడినయిన నేను మా ఊళ్లో జరుగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలను వీక్షిద్దామన్న కుతూహలంతో 2012 జనవరి నాలుగో తేదీ నుంచే ఒంగోలులో మకాం వేశాను. డబ్బు తెగులు పట్టిన రాంకీ అనే సంస్థ నిర్వహిస్తోన్న తెలుగు తిరనాళ్లను ఐదో తేదీ రాత్రి వేళ నా మిత్రులతో కలిసి వీక్షిస్తుండగా భోజనానికి వెంటనే రావాలంటూ వారికి మలి పిలుపు అందింది. ఓ ఫాదరు పుట్టిన రోజుసందర్భపు పార్టీ అది. వాళ్లు పోతూపోతూ వాళ్ల అతిథినైన నన్ను కూడా (వెనకటి ఎవడో వాళ్ల లాంటి పిచ్చోడెవరో పెళ్లికి పోతూ పిల్లిని చంకనేసుకు పోయాడట!) వెంటబెట్టుకు పోయారు.
అన్నట్లు ఎన్నెన్నో అనుభవాలరీత్యా ఏర్పడిన భయం నేపథ్యంలో ముందే ఒక్క విషయాన్ని మనవి చేసుకుంటాను… నేను ఏ మతాన్ని నమ్మేవారినీ కించపరచనుగాక పరచను. అయితే అది మతం కావచ్చు, మతోన్మాదం కావచ్చు…పాత్రికేయ వృత్తి ధర్మంగా ఉన్నదానిని ఉన్నట్లుగా రాయటం ధర్మమని నేను నమ్ముతానని, మీరు నమ్మి తీరాలి సుమా!
బాధితుల గృహం అని నామఫలకమున్న ఓ సుందర భవన రాజం ముందు మేము వాహనం దిగీదిగగానే ఓ యువకుడు స్వాగతం పలికాడు. చేతులు పట్టుకుని ఊపాడు. విడివిడిగా అందరి చెవుల్లోనూ ఏదో రహస్యం ఊదాడు. నా పరిచయం పూర్తయిన తర్వాత ” అందరికీ బీర్ ఏర్పాటు ఉంది సార్” అంటూ ఆ రాజకోట రహస్యాన్ని నా చెవిలోనూ ఊదాడా యువకుడు. వాస్తవానికి ఆ విషయాన్ని ముందుగానే నా మిత్రులు వాసన చూపించారు. అది … ఉంటే ఉండొచ్చు. దాని జోలికి వెళ్లం కాబట్టి మనం తినేసి వద్దాం అంటూ నా మిత్రుడు ముందే వివరించాడు. ఒకటో రెండో శాకాహార పదార్ధాలూ ఉంటాయి కాబట్టి నీకూ ఇబ్బంది ఉండదు అని కూడా చెప్పాడు.
సరే, మళ్లీ అసలు విషయానికొద్దాం…. మేము లోపలికి వెళ్లే సరికే సదరు ఫాదరు మరొక ‘తండ్రి’తో కలిసి భోజనం లాగించేస్తున్నాడు. ఇక్కడ నేనే చెప్పొచ్చేదేమంటే అతిథులు రాకముందే తన పని తాను సుష్టుగా చేసేస్తోన్న ఫాదరు వైఖరి నాకు ఏ మాత్రం నచ్చలేదు. దేశానికి రాజయిన సరే సంప్రదాయాలను పాటించాలిగదా? ఇక్కడ నాకు నచ్చిన విషయం గుర్తుచేస్తాను. తండ్రులు, వారి కుమారులు పాదరక్షలను వీడకుండానే అదీ ఇంట్లో భోజనం చేసేస్తున్నారు. ఇప్పుడు విందుల్లో హిందువులు కూడా అదే పాటిస్తున్నారనుకోండి. అయితే ఇలా చెప్పులతో ఇంట్లో తిరగటం సరైనదేనా అంటే… అన్ని వేళలా, చోట్లా అందులోనూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదీ మనదేశంలోయితే కాదనే అంటాను. అదే తీరున అన్ని చోట్లా, అన్నివేళలా దాన్ని విధిగా పాటించాల్సిన విధీ లేదంటాను. ఎక్కడికక్కడి పరిస్థితులను బట్టి చెప్పుల్ని వదిలేయటమో, వదిలేయకపోవటమో అనుసరించదగినదని భావిస్తాను. మాంసాహారం, పండ్లూ, కిల్డ్రింకులూ, హిమక్రీములతో షడ్రసోపేత భోజనం అవిరులు కక్కుతోందక్కడ. హోం థియేటర్ నుంచి పాశ్చాత్య సంగీతం ప్రవహిస్తోంది. సదరు ఫాదరు ఈ ఉదయమే ఘనాతి ఘనంగా జరుపుకున్న పుట్టినరోజు వేడుకల చిత్రాలు ఓ పదివేల రూపాయల విలువయిన విదేశీ డిజిటల్ ఫొటో ఫ్రేములో చలిస్తున్నాయి. సంప్రదాయం కాదుగానీ అలవాటు రీత్యా శాకాహారినైన నేను కొద్దిగా పెరుగన్నాన్ని మాత్రమే లోపలికి పంపగలిగాను. కోకోకోలా అనబడు ఓ డబ్బా కిల్డ్రింకునూ కొద్దిగా సేవించాను. కాకపోతే బాగా ఉండటంతో నాలుగంటే నాలుగు తీపితీపి కిళ్లీల్ని మాత్రం పరపరా నమిలేశాననుకోండి. అంతా అయిన తర్వాత ఆ భవనం సోయగాలను వీక్షిస్తూ, అంచనా వేస్తూ, కోట్ల మంది కనీసం అడుగు పెట్టలేని కోట ఒక్క ఫాదరుకే ఉండటాన్ని మనస్సులోనే ప్రశ్నించుకుంటూ బయటపడ్డాము. ”ఇదేముంది, ఫాదరుగారి రూము ఉందీ… అదిరిపోద్ది” నా మిత్రుడి వ్యాఖ్యానాన్ని గుర్తుచేస్తూ ఈ రచనను ముగిస్తాను.
23 డిసెం
జర్నీ … చూసేవాటిలో మొదట ఎంచుకోదగిన మoచి చిత్రం

ప్రస్తుతాన్ని వెనక్కు నెట్టి ముందుకు సాగటం ప్రయాణం అయితే రెండు విభిన్నమైన ప్రయాణాలను హృద్యంగా పట్టిచూపిన అరవ అనువాద సినిమా జర్నీ. ప్రయాణం పేరిట ఇటీవలే ఓ చిత్రం వచ్చినందునేమో, దీనికి జర్నీ అని ఆంగ్ల నామం తగిలించారు.
నేను ఆరేళ్ల హైదరాబాదువాసిగా ముచ్చటగా చూసిన మూడో చిత్రం కూడా నచ్చింది. మొదటి రెండు చిత్రాలలో ఒకటి లీడర్ కాగా రెండోది వేదం.
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులూ మిగతా హీరోలతో పోలిస్తే నిజ్జంగా మంచివాళ్లు కావటం ఈ కథకే కాదు, దారి తప్పుతోన్న యువతను కాసింత గాడిలో పెట్టేందుకు ఉపరిస్తుందేమో! అదే విధంగా ఇద్దరు కథానాయికలూ తమదైన శైలిలో కాసింత సొంత బుర్రకలిగినవాళ్లు కావటం మరో విశేషం. దీనికితోడు అమ్మాయిలు పొట్టి లాగూలు వేసుకుని సముద్రపు ఒడ్డున పరుగులు పెట్టరు. అంటే ఎక్కడా వికారం పుట్టించరు. అబ్బాయిలూ అంతే ప్రేమిస్తారు తప్ప అడ్డదిడ్డంగా పాటలు పాడే పని పెట్టుకోరు. దీన్లో ప్రేమ ఉంది… శృంగారాలూ, వికారాలూ లేవు. విరహం ఉంది… గడ్డాలు పెంచుకోవటం కన్పించదు. విషాద గీతాలు విన్పించవు.
ఈ చిత్రంలో రెండు ప్రయాణాలున్నాయని మొదట్లో అన్నాను కదూ, దానిలో ఒకటేమో బస్సు ప్రయాణం చేయకూడని పద్ధతిని చూపింది. రెండోది ఒక యువకుడు, ఒక యువతి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక సోదరి, ఆ మాటకొస్తే పౌరులందరి జీవన ప్రయాణం ఎలా ఉంటే బాగుంటుందో ఉన్నమేరకు ఆదర్శంగా చూపే ప్రయత్నం జరిగింది.
ప్రస్తుతం అన్నిచోట్లా పెద్ద సమస్యగా మారిన అపరిమిత వేగం తెచ్చిపెడుతోన్న అనర్థాలను వాస్తవానికి దగ్గరగా చూపిన దర్శకుడు అందరినీ ఆలోచింపజేస్తాడు.
ఇక రెండో ప్రయాణంలో చెప్పుకోదగిన పాత్ర మధుమతి. ముందుగా పాత్రలో నూరు శాతం వదిగిపోయిన పాత్రధారిణి అంజలికి అభినందనలు చెప్పాలి.
ఆరేళ్లు వెంటబడినా చెత్తగాడికి లొ0గక పోవటం మధుమతి ప్రత్యేకత. దానికి భిన్నంగా ఆర్రోజుల్లోనే తొమ్మిది వేలు సంపాదిస్తూ ఒద్దికగా బతికే జై ప్రేమను అంగీకరించటం విశేషం. పైగా చాటుమాటుగా, గుడ్డిగా ప్రేమలో పడిపోవటం కాకుండా అతగాడిని పోలీసయిన తన తండ్రి దగ్గరకు పంపటం, తన వెంటబడిన వాడినీ కలవమనటం, హెచ్ఐవి పరీక్ష చేయించటం, అవయవదానానికి తాను సంతకం చేస్తూ, అతనినీ ఒప్పించటం… ఈ అన్ని వ్యవహారాలోనూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పటం, ఆమె వైద్యురాలని జై అనుకున్నప్పుడు బేషజాలకు పోకుండా నర్సును మాత్రమేనని నమ్రతగా తెలపటం, అవసరమైనచోట మానవత్వంతో వ్యవహరించిన మధుమతి ఈనాటి యువతకు, ప్రత్యేకించియువతులకు ఆదర్శపాత్రం. ఇష్టపడటం మొదలు పెట్టాక అదుపు తప్పని నడవడికతో ప్రియుడిని (చూసేవాళ్లు రెచ్చిపోయే సన్నివేశాలు లేవు సుమా) సున్నితంగా అలరించటం గొప్పగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు మానవత్వంతో సేవలు చేయటం మన మనసు పొరల్లో ఎక్కడో దాగి ఉన్న దుఖ:ం కట్టలు తెంచుకుని కన్నీటి రూపాన బయటపడిపోతుంది. నేనయితే కేవలం పక్కవాళ్ల కోసమే బిగ్గరగా ఏడవలేకపోయాను. రెప్పలు దాటిన దుఖ:జలాన్ని తుడవలేక చచ్చాననుకోండి. అనన్య పాత్ర కూడా అంతే. నగరవాసుల వెగటు వ్యవహారాలు నచ్చని పల్లెటూరి అమ్మాయిప్రతిదాన్నీ అనుమానించే లక్షణమున్న పాత్ర అది. జీవిత వాస్తవాలు నేర్పిన భయం తప్ప నిజాయితీకి, ఆలోచలనకూలోటు లేదు. అలా ఇద్దరు కథాయికలూ ఎలా వ్యవహరించాలో చూపి ఆడపిల్లలు ఇలా ప్రయాణించాలని నేర్పే ప్రయత్నం చేశారు. అలా అని ఎక్కడా ఆదర్శం పేరిట సాధ్యం కాని ఉపదేశాలు, ఉపన్యాసాలతో నేలవిడిచి సాము చేయలేదు. వారి ప్రవర్తనే వారిచ్చే సందేశం.
ఇక ఈ చిత్రంలో కన్పించే ఒకటి రెండు తప్పులు కూడా లేకుండా ఉంటే బాగుండేది. నాలుగు వరుసల రహదారిలో వాహనాలు ఎదురెదురుగా రావు. అందువలన ఈ చిత్రంలో చూపిన విధంగా విజయవాడ నుంచి హైదరాబాదు బస్సు, హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎదురెదురుగా ఢీకొనటం సాధారణంగా జరగదు. రెండు వరుసల రోడ్డులో మాత్రం అలా జరగవచ్చు. అయితే నాలుగు వరుసల రహదారిలో ఒకేవైపు వెళ్లే వాహనాలతోనే ప్రమాదం.
ఆరు వేల రూపాయలు ఖరీదయిన బట్టలు నాలుగు వందలకే వస్తాయని విజయవాడ వాసులు అప్పటికప్పుడు కోఠికి పోదామని అనుకోరు. అక్కడ బీసెంట్ రోడ్డు, వస్త్రలత ఉన్నాయిగా. అక్కడకు పోదామనుకుంటారు గదా! నాలుగు వరుసల రహదారిలో ఎదురెదురు వాహనాలు ఢీకొన్నట్లు చూపటం దర్శకుడి అనాలోచన కాగా, విజయవాడవాసులను కోఠికి పంపే ఆలోచన మాటల రచయిత తప్పిదం. వీలయినచోట తెలుగు ఫలకాలను చూపించటం – అంతలోనే వాతావరణం అరవంలోకి దూకటం వీక్షకులకు ఎంతో కొంత ఇబ్బందే. హైదరాబాదులో కనిపించని ప్రైవేటు సిటీ బస్సుల్ని చూడటం కూడా ఎబ్బెట్టుగా ఉంది.
ఈ సినిమా చూసిన తర్వాత నా కన్పించిందీ… ఎదిగే తోటి తెలుగువాడిని తోటివాళ్లు కాళ్లు పట్టుకుని ఎందుకు లాగుతారంటే అనర్హులు అలా ఎదగ కూడదని మాత్రమే. పక్కనున్న తమిళ తంబిలుజర్నీలా చక్కటి చిత్రాలు నిర్మిస్తుండగా మనోడికి ఆ తెలివి లేకపోయే మరి. కాళ్లు పట్టుకుని కాదు ప్రస్తుతం మన తెలుగు చిత్రసీమను ఏలుతున్నవాళ్లందరికీ మోకులు కట్టి మరీ సముద్రంలోకి లాగి పారేయాలి. అప్పుడు అరవ అన్నల్లా కాసింత తెలివి ప్రదర్శించి, వీక్షకులకు కాసింత తెలివి పంచిపెట్టేవాళ్లకు కాసింత చోటు దొరుకుతుందేమోనని నాబోట్లకు పెద్ద ఆశ.
15 డిసెం
జనం ఛస్తే నాకేమి … బతికితే నాకేమి – మానవహక్కుల కమిషను ఛైర్మన్ తీరూతెన్ను

14 డిసెంబరు 2011. హైదరాబాదు.
ఉదయం 9.30 గంటల సమయం. బస్సులో రాంనగర్ నుంచి ఎస్సార్ నగర్ నందున్న మా కార్యాలయానికి వెళ్తుండగా ఖైరతాబాద్లోని ఓ ఇంటి గోడ మీద కన్పించిందా ఆంగ్ల ప్రకటన. మహిళల హక్కుల పరిరక్షణ సదస్సు బెంగళూరులో జరగబోతుందట. ఆ సదస్సులో మాజీ న్యాయమూర్తి వెంకటాచలయ్యతోపాటు రాష్ట్ర హక్కుల కమిషను ఛైర్మన్గా పనిచేసిన సుభాషణరెడ్డి ప్రసంగిస్తారు. అది చదవగానే నాకు గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది.
బహుశా రెండేళ్లవుతుందనుకుంటాను ఈ సంఘటన జరిగి. నా మిత్రడొకరిని కలుసుకుందామని జూబ్లీహిల్స్కు వెళ్లాను. అతని ఇల్లూ, కార్యాలయమూ పక్కపక్కనే ఉంటాయి. నేను కార్యాలయంలోనే నా మిత్రుడిని కలుసుకుంటుంటాను. ఆ రోజు కూడా కార్యాలయానికి వెళ్లగా అతను ఇంకా రాలేదనీ, ఇంట్లోనే ఉన్నాడనీ సిబ్బంది చెప్పారు. అందువలన మిత్రుడిని కలిసే వెళ్తామని ఆనాటి దినపత్రికలు చదువుతూ అక్కడే కూర్చున్నాను.
అరగంట తర్వాత నా మిత్రుడు వస్తూనే, ”అనుకోకుండా ఓ పెద్దమనిషి చెప్పా పెట్టకుండా వచ్చిందికాక నా సమయాన్నంతా తినేశాడు సుబ్బారావ్” అన్నాడు.
”ఎవరా పెద్దమనిషి” వాకబు చేశాను నేను.
”నువ్వు వింటే ఆశ్చర్యపోతావు!” అన్నాడు మిత్రుడు.
”ఇప్పుడు జరిగేవన్నీ విచిత్రాలే గదా! ఇంతకీ ఎవరా పెద్దమనిషి? పట్టు వదలకుండా మళ్లీ అడిగాను.
”నీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను, చెబితే వార్త రాసేస్తావని భయంగానూ ఉంది”
”నిన్ను ఇరుకున పడేయనులే. చెప్పు, నువ్వు రాయమంటేనే వార్త రాస్తాను. లేకపోతే లేదు. విషయం తెలుసుకోవాలిగా” అంటూ ఒత్తిడి చేశాను నేను.
”మానవ హక్కుల కమిషను ఛైర్మను లేడూ …. .. వచ్చింది ఆయనే. అదిగో అక్కడ కొండ కన్పిస్తున్నది చూడు. (సమీపంలోనే ఉంది) దాన్ని గవర్నమెంటు నుంచి ఆయన బంధువు కంకర రాయి కొట్టుకునేందుకుగాను లీజుకు తీసుకున్నాడు. గత వారం రోజుల నుంచీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి కొండను పేలుస్తున్నాడు. రాళ్లు వేగంగా ఎగిరొచ్చి ఈ చుట్టుపక్కల ఇళ్లమీదా, ఇళ్లల్లోనూ పడుతున్నాయి. కొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి. కాంట్రాక్టరుకు ఎంత చెప్పినా వినకపోవటంతో తట్టుకోలేక అందరూ కలిసి పోలీసు స్టేషనుకు వెళ్లారు. పైగా మా బంధువు ఫలానా న్యాయమూర్తి అంటూ అందరినీ బెదిరించాడు. కంకర కొట్టద్దని పోలీసులు చెప్పేశారు. ఇంకొకటేందంటే, హౌసింగ్ సొసైటీ నుంచి నేను కూడా కాంట్రాక్టరు మీద చర్య తీసుకోమని అర్జీ ఇచ్చాను. ఇక చూడు, ఈ పెద్ద మనిషి ఒకటే ఫోన్లు. నువ్వు చెబితే అందరూ వింటారు చెప్పమంటాడు. అదేందండీ మీరు మానవహక్కుల కమిషను జడ్జి అయి ఉండి ఇట్లా మాట్లాడటం ఏమీ బాగాలేదే! అన్నా వినడాయె. ఏదో దగ్గర బంధువు, ఏడుస్తున్నాడని చెప్పాల్సి వచ్చిందంటాడు. చూసీ చూడనట్లు ఉండండి సార్, మిగతాది నేను చూసుకుంటానుఅంటాడాయన. అప్పటికీ ”జనం బతుకు ముఖ్యమా? బంధువు ఆదాయం ముఖ్యమా??” అని ఘాటుగానే అడిగాను. అసలు విన్పించుకుంటే గదా! వినడు, ఆలోచించడు. తలబప్పి కట్టించాడంటే నమ్ము. జనందేముంది వెర్రోళ్లు, నీబోటి నోరున్నాడు పదిసార్లు ఏది చెబితే అదే నిజమని నమ్ముతారని నాకు నచ్చజెప్పబోతాడు తప్ప తను మాత్రం ఆలోచించడు అంటూ హెచ్ఆర్సి ఛైర్మన్ భాగోతాన్ని పూసగుచ్చాడు మిత్రుడు.
జనం కన్నా తన బంధువు కాంట్రాక్టు పనులే ముఖ్యమని బల్ల గుద్దినట్లు చెప్పాడట. హక్కుల దేముంది? సార్, ఎవడి కోసం ఎవరాగుతారు? అని బుట్టలో వేసుకునే ప్రయత్నాలను ఎలా చేశాడో? వివరించాడు.
అదండీ సంగతి… జనం కన్నా, జనం బతికే హక్కు కన్నా… జనం వాదన కన్నా, తన బంధువు ఆదాయమే ముఖ్యమని తాపత్రయ పడిన ఓ మానవ హక్కుల కమిషనరు తీరూతెన్నుకు ఓ చిన్న ఉదాహరణ ఇది
14 డిసెం
తానోడి నన్నోడెనా? – - సారంపల్లి మల్లారెడ్డి
కాంగ్రెస్ ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది.
పాండవులను వారి రాజ్యాన్ని ధర్మరాజు జూదంలో ఓడి పోయాడు. చివరికి శకుని సలహాతో ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడతాడు. గెలిస్తే తాను ఓడిపోయిన రాజ్యంతోపాటు తన తమ్ములు విముక్తులవుతారని అందుకు ద్రౌపదిని ఆటలో పందెంలో పెట్టమని షరతు విధిస్తారు. జూదం వ్యామోహం గల ధర్మరాజు ద్రౌపదిని పందెం కాసి ఓడిపోతాడు. కౌరవులు ద్రౌపదిని ధృతరాష్ట్ర సభకు తెచ్చి కౌరవులకు భానిసగా ఉండమంటారు. ఆ సభలో భీష్మునితో సహా ధర్మకోవిదులందరూ ఉండగానే ద్రౌపది ఒక ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ధర్మరాజు ‘తానోడి నన్నోడెనా.? లేక నన్నోడి తానోడెనా.?’ అని అడుగుతుంది. సభలో ఉన్నవారు తానోడిన తర్వాతనే నిన్ను ఓడాడని సెలవిస్తారు. సర్వం ఓడిపోయినవాడికి నన్ను పందెంలోకాసే అర్హత ఉందా.? అని ద్రౌపది ప్రశ్నిస్తుంది. నిండుసభలో ఎవరూ ఈ ధర్మ సందేహానికి సమాధానం చెప్పలేకపోయారు. అది ”అప్రస్తుతం” అంటూ దాటవేశారు.
అలాంటి పరిస్థితే నేడు ప్రజా రాజ్యం పార్టీ(ప్రరాపా)ని ఆవహించింది. పాలక కాంగ్రెస్ను మట్టికరిపిస్తానని, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతానని ధీరోదాత్త వచనాలు పలికి తిరుపతి బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావ సందర్భంగా తొడగొట్టి ప్రకటించారు. ఆ విధంగా కాంగ్రెస్ను, దాని విధానాలను విమర్శిస్తూ ఎన్నికల్లో పోటీచేసి 18 స్థానాలు గెలుపొందారు. అందులో నుండి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎంఎల్ఏ పార్టీ ఫిరాయించారు. అతనిపై వేటు వేసే ధైర్యం ప్రరాపాకు లేకుండా పోయింది. అతను కాంగ్రెస్ సానుభూతిపరునిగా ఉంటున్నాడు. చివరకు ప్రజారాజ్యం నేత మూటాముల్లె సర్దుకొని మొత్తం తన దుకాణాన్ని మూసేసి కాంగ్రెస్ దుకాణంలో చేరాడు. పార్టీ ఏర్పర్చినపుడు కాంగ్రెస్ విధానాలను పూర్తిగా వ్యతిరేకించి నేడు ఆ విధానాలనే భుజాన వేసుకొని కాంగ్రెస్లో కలిశాడు. తాను రూపొందించిన కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసిన శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ పార్టీ తరపున స్పీకర్ను కోరారు. స్పీకర్ను కోరే సందర్భంగా ప్రరాపా ఉనికిలో ఉందా లేదా? అన్నది సంశయమే. అంతకు ముందే తెలంగాణా అంశంపై శాసనసభ సభ్యత్వాలకు టిడిపి, కాంగ్రెస్ వారు రాజీనామాలు ఇచ్చినా వారి రాజీనామాలను స్పీకర్ అంగీకరించలేదు. స్పీకరు తన విచక్షణాధికారాన్ని వినియోగించి వారి రాజీనామాల్ని తిరస్కరించడమో, లేదా ఆమోదించడమో చేయాలి. ఒకే ఫార్మేట్లో రాజీనామాలు సమర్పించిన వారిలో కొందరివి ఆమోదించారు, భావోద్వేగంతో రాజీనామాలు సమర్పించారనే సాకుతో మరికొందరివి తిరస్కరించారు. నేడు శాసనసభలో మూడింట ఒక వంతు శాసనసభ్యులు ఏ పార్టీలో ఉన్నారో అంతుచిక్కని అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించిన 16 మంది శాసనసభ్యులను ఏమి చేయాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపి క్రమశిక్షణా చర్యకు స్పీకర్ను కోరింది. స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ సభ్యత్వం రద్దు చేయమని కోరడం విచిత్రంగా ఉంది. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది.
ప్రధాని రాజీవ్గాంధీ హయాంలో ‘ పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు’ తెచ్చినపుడు కాంగ్రెస్వారు దీనిని అభ్యుదయ చర్యగా అభివర్ణించారు. కాని అప్పుడే వామపక్షాలు ఈ బిల్లులో ఉన్న లొసుగులను ఎత్తిచూపాయి. మూడింట ఒక వంతు శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడదని, పార్టీ బహిష్కరించినవారికి ఈ చట్టం వర్తించదని మెలికలు పెట్టారు. ఈ లొసుగులే కాక స్పీకర్కుగల విచక్షణాధికారాలను వినియోగించి పాలకపార్టీలకు రక్షణ కల్పించడం జరుగుతోంది. దీనిని అవకాశంగా తీసుకొని అనేక రాష్ట్రాలలో చివరికి పార్లమెంటు ఉభయసభల్లో కూడా ఈ ఫిరాయింపుల సమస్య నిరాఘాటంగా సాగిపోతోంది. కొందరు తెలివిగా మరొక పార్టీలో చేరకుండా పాలకపార్టీకీ ప్రమాదం ఏర్పడ్డపుడు సహాయం చేస్తూ వస్తున్నారు. విప్ను ధిక్కరించడం ఫిరాయింపుల బిల్లురీత్యా నేరం. ఈ నేరానికి పాల్పడిన వారిని వారి సభ్యత్వాన్ని రద్దుపర్చి తిరిగి అక్కడ ఎన్నికలు జరిపించాలి. కాని పాలకుల విచక్షణకు లోబడి ఈ చట్టం పనిచేస్తోంది. పాలకులు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొంటూ ప్రజలకు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని’ నమ్మబలుకుతున్నారు.
ఒక పార్టీ బ్యానర్తో గెలిచి కాంగ్రెస్లో చేరడాన్ని ‘ధృతరాష్ట్రకౌగిలి’ లోకి వెళ్లాడని అనడం రివాజు. ధృతరాష్ట్రుని కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది. పార్టీలో కలిసినాక కాంగ్రెస్ పార్టీ విప్కు లోబడి ఉండాలి తప్ప ఆ పార్టీ విప్ జారీ చేసే అర్హత న్యాయపరంగా ఉందా అన్నది పరిశీలించాలి. నేడు రాష్ట్రంలో పాలన అస్థిరమై, ప్రజా సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 104 ఉద్యోగుల సమ్మె, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఉపాధిహామీ పనుల అమలు చర్చకు రాకుండా పోయాయి. తమ పార్టీలో అతి ప్రజాస్వామ్యముందని చెప్పే కాంగ్రెస్, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. తన పాలనను నిలుపుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నది. దేశాన్ని బహుళజాతి సంస్థలకు తాకట్టు పెడుతున్నది. ప్రజాందోళనలపై నిర్బంధం ప్రయోగిస్తున్నది.
అవిశ్వాసంపై గట్టెక్కడానికి పార్లమెంటరీ నిబంధనలను తుంగలోతొక్కి సభ్యులపై సామ దాన భేద దండోపాయాలను ప్రభుత్వం ప్రయోగించింది.. కాంగ్రెస్ను పార్లమెంటులో గట్టెక్కించడానికి నాడు పివి నర్సింహారావు ఆనాడు అనుసరించిన ఓటుకు నోటు సంస్కృతినే రాష్ట్ర పాలకవర్గం పుణికిపుచ్చుకుంది. పార్లమెంటరీ విధానానికి తూట్లు పొడవడం కాంగ్రెస్కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే విప్ జారీ చేసినా తనకు లోబడినవారికి ఒకతీర్పు, వ్యతిరేకించినవారికి మరొక తీర్పు ఇచ్చి తన కుటిలరీతిని ప్రదర్శిస్తోంది.
13 డిసెం
‘దేగుడు” మా ప్రాంతపు ఆడవాళ్ల తిట్టు

ఈ తెనుగు పదం ఇంకెక్కడయినా విన్పిస్తుందో? లేదో? నాకు తెలియదు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మా ఈదుమూడి గ్రామంలో మాత్రం నేను చిన్నప్పటి నుంచీ విన్న, వింటున్న పదం ఇది. ఈ పదం ఆడవాళ్ల ప్రత్యేకం. వాస్తవానికి ఇది తిట్టు పదం. గ్రామ్యం. ఎవరయినా మగవాళ్లు కానిపనిచేసినా, నోరు జారినా ఆడవాళ్లు కసిగా, కోపంగా, తొలిగా ”దేగుడా” అంటూ తిడతారు. ఒక్కోసారి, కొందరు ”దొంగ నా దేగుడా” అని కూడా కలిపి మరీ తిడతారు.
మా ఊళ్లో ఏ ఏ తిట్లు తిడతారో ఇక్కడ చెప్పబోవటం లేదు సుమా. ఆడవారి తిట్ల భాషనో, మగవారు ఏ పదాలతో తిడతారో అసలే చెప్పబోవటం లేదు. కేవలం దేగుడు పదంపై నా అభిప్రాయాన్ని బ్లాగ్మిత్రులతో పంచుకుందామనే దీన్ని రాస్తున్నాను.
సరే, అసలు విషయానికొస్తే…. దేగుడు – ఈ పదం ”దేవుడు” పదానికి వికృతి. దైవం – దేవుడు అన్న సంస్కృత పదాల నుంచి పుట్టిన తెనుగు పదమే ఈ దేగుడు. ఇంత వరకూ పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదుగానీ, ఈ పద ప్రయోగమే కాస్త విచిత్రం. దేవుడు అంటే మంచివాడు అని కదా మరి దాన్నించి పుట్టిన దేగుడును తిట్టుగా ఎందుకు వినియోగిస్తున్నట్లు? తమ అనుభవాన్నుంచి ఈ పద ప్రయోగం ప్రారంభం అయి ఉండవచ్చు. అయితే ఈ పదం ఎప్పటి నుంచీ వినియోగంలో ఉందో తేలితేగానీ తిట్టుగా ఎలా మారిందన్న విషయాన్ని కచ్చితంగా తేల్చలేమని నా అభిప్రాయం. అయితే రెండు అంశాలు నేపథ్యంగా ఈ పదం వినియోగంలోకి వచ్చి ఉండవచ్చని నా అంచనా. అందులో ఒకటి – ఈ పదం గనుకు స్వాతంత్య్రోద్యమ కాలంలోనో, స్వాతంత్య్రం ఆగమించిన కాలం నుంచో గనుక ప్రారంభమయి ఉంటే మాత్రం అది త్రిపురనేని రామస్వామి చౌదరి నేతృత్వంలో మా ప్రాంతంలోనూ ప్రభావం చూపిన హేతువాద ఉద్యమ ఫలితం అయి ఉండాలి. ఎలాగంటే త్రిపురనేని, ఆయన శిష్యులు మా ప్రాంతంలో పురాణాల గుట్టును విప్పి చెప్పారు.రామాయణం – రాముడు – రావణాసురుడు, శంభూక వధ – సురులు – అసురులు ఇలా దేవుళ్ల బండారాన్ని ప్రచారం చేశారు. రచ్చబండలమీద చేరి రాక్షసుల గురించీ వివరించేవాళ్లు. దీనివలన కొంతమంది ఆలోచనాపరులు రాక్షసుల అభిమానులయ్యారు. సురాపానం చేసే సురులంటే అసహ్యం పెంచుకున్నారు. అంటే దేవుళ్లను తమ శత్రువులుగా గుర్తించారు. అలా దేవుడు అన్న పదాన్ని తప్పుడు పనిచేసిన వారికి, తమకు అన్యాయం చేసిన వారికి, తమపై నోరు పారేసుకున్న వారికీ ఆపాదించి ఛీదరించుకోవటం ప్రారంభం అయి ఉండాలి. కాలగమనంలో పలు పదాలు నోటికి తిరిగినట్లుగా మారిపోయినట్లుగానే దేవుడు పదం కూడా దేగుడుగా మారింది. అన్నట్లు మా ప్రాంతంలో ఈ పదాన్ని చేయిచేసుకునే భర్తలను తిట్టేందుకు కూడా స్త్రీలు విరివిగా వాడతారు.
ఈ పదం ఇంకా ప్రాచీనమయినదయితే మాత్రం దానికి మరో కోణం ఉంది. ఆర్యులు – ద్రావిడుల మధ్య చెలరేగిన తగాదాల్లోనే ఈ పదం పుట్టి ఉండాలి. ఆర్యులు సహజంగానే తమను ఇక్కడ ప్రతిష్టించుకునే పనిలో ఇంద్రుడు, రాముడు, కృష్ణుడిని దేవుళ్లను చేసి ద్రవిడులతో ఆటాడుకున్నారుగదా! అది గిట్టని ద్రవిడులు దేవుళ్లను తిట్టటం సహజం. రాక్షసులను (అసురులు) తమవాళ్లుగా భావించటమూ కద్దు. ఇక్కడ పాగా వేసేందుకు ఆర్యులు – తమ అస్థిత్వాన్ని కాపాడుకుని ఆర్యుల అరాచకాలను తిప్పికొట్టే పనిలో ద్రవిడులు మునిగిపోయిన క్రమంలో ఈ పదం పుట్టి ఉండాలి. తమ శత్రువులకు సంబంధించిన వాడయిన దేవుడుని, తాము చెడ్డవాడని భావించే వారికి ఆపాదించటం ప్రారంభమయి ఉండాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే దేవుడు అన్న ప్రకృతి మన గ్రామీణుల నోటపడి అది దేగుడుగా మారి ఉండాలి. ఏదేమయినా మా ప్రాంతంలో వినియోగించే తిట్టు పదం వెనుక కొంత చరిత్ర – వాస్తవం – తమ శత్రువులను కచ్చితంగా గుర్తించిన వైనం – ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ పదం అంటే నాకెంతో ఇష్టం. అది మా గ్రామ్యం. అది మా వికృతి. అది మా అనుభవం నుంచి పుట్టిన పదం.
11 డిసెం
లోక్చెత్త … సంచిక – 3

జయప్రకాష్ నారాయణతో నా స్వీయానుభవాన్ని రాసి, ఇక లోక్చెత్తను చెరిగే పనికి తాత్కాలికంగా విరామమిచ్చేదానికి అనుమతి ఇవ్వండి.
ఈ సంఘటన ప్రకాశం జిల్లాకు జెపి కలెక్టరుగా పనిచేస్తున్న కాలంలో జరిగింది. నేను అప్పుడే మా గ్రామం ఈదుమూడి నుంచి ఒంగోలుకు చేరాను. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఒంగోలును జ్వరాలు చుట్టుముట్టాయి. ఇంటికి ఇద్దరు ముగ్గురికి తక్కువగాకుండా మంచాలెక్కారు. అదే సమయంలో పురపాలక సంఘాల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఎక్కడి చెత్త అక్కడే నిల్వ చేరటంతో పట్టణమంతా ఒకటే కంపు. అసలే రాష్ట్రం మొత్తం మీద ఒంగోలు నీఛ నికృష్ట అపరిశుభ్ర పట్టణం. కార్మికుల సమ్మె కారణంగా పూర్తిగా పాడయిపోయింది. మా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. కొన్ని ప్రాంతాల్లో ఊడ్చి, కాలువల్లో పూడికలు కూడా తీశాము. అయినా యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన కార్యక్రమాన్ని ఒక యువజన సంఘం నెత్తుకుని విజయవంతం చేయటం అంత తేలిక కాదు. అందుకని మేము పడుతున్న బాధల్ని ప్రభుత్వానికి నేరుగా చెబితేనన్నా స్పందించి చర్యలు తీసుకుంటారేమోనన్న భ్రమతో కుర్రాళ్లమంతా కలిసి కలెక్టరు జెపిని కలిసి వినతి పత్రం అందజేసి ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఆ వినతి పత్రాన్ని అలా అలా చదువుతూనే పిడుగులు కురిపించటం ప్రారంభించాడు. బుద్ధున్నవాడెవడూ ఇలా కాగితాలు తీసుకుని ఏదో చేయమంటూ రాడు. మీరు కలెక్టరు ఆఫీసుల చుట్టూ తిరిగే సమయాన్ని ప్రజల కోసం వినియోగిస్తే అసలు సమస్యలే రావు. మీరు మీ ఇళ్ల నుంచి తలా ఒక చీపురు, తట్టా తీసుకుని వీధులన్నీ ఊడవండి. అంతేగానీ ఇలా అది చేయండి ఇది చేయండి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవద్దు.” అంటూ ఇంకా ఏదేదో బడబడా ఉపన్యసించాడు. చివరలో తక్షణం మేము బయటకు వెళ్లక పోతే తానే నెట్టించాల్సి వస్తుందని బెదిరించాడు జెపి. అప్పుడప్పుడే లోకాన్ని అర్ధం చేసుకుంటున్న మేము జెపి తీరుతో హతాశులమయ్యాము. వాస్తవానికి బెదిరిపోయాము. సరే, ఆయనతో వాదించే శక్తిలేక, కాళ్లీడ్చుకుంటూ ఇళ్లకు చేరాము. తర్వాతెప్పుడూ ఆయన దగ్గరకు రాయబారం వెళ్లే సాహసం చేయలేదు. మా సంఘం తర్వాత కూడా ఎన్నెన్నో ఉచిత వైద్యశిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన విషయం వేరే సంగతనుకోండి.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే…. ప్రభుత్వం చేయవలసిన పనిని వ్యక్తులుగానీ, చిన్న సంస్థలుగానీ పరిపూర్ణంగా చేయగలవా? అదే వాస్తవయితే, జెపి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్లు? స్వచ్ఛంద సంస్థ లోక్సత్తాతోనే ఈ దేశంలోని సమస్త రోగాలనూ పారదోలవచ్చుగదా? అంతా ఒక్కసారి చేయలేకపోతే ఒక్క ఊరిలోనయినా చేసి నిరూపించి ప్రజలను నమ్మించి రాజకీయాలు, శాసనసభలు, పాలన లేకుండా స్వచ్ఛంద సంస్థలకే దేశాన్ని అప్పగించేందుకు కృషి సల్పవచ్చుగదూ?
అంటే జెపికి అంతా తెలుసు. ఏమి చేసినా ప్రభుత్వమే చేయాలి. కాకపోతే ఎప్పుడన్నా, ఎక్కడన్నా అత్యవసరమైతే వ్యక్తులు పూనుకుని తాత్కాలికంగా సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చు. ప్రభుత్వేతర సంస్థలు స్పందించి చేయూత ఇవ్వవవచ్చు. అంతేగానీ వ్యక్తులో, ఏదో ఒక సంస్థో అంతా చేసేస్తే ఇదంతా ఎందుకు దండగ. అది వీలుకానందునే ప్రపంచవ్యాపితంగా రాజకీయాలు, శాసనసభలు, ప్రభుత్వాలు ఉన్నాయి. చేసినా చేయకపోయినా ప్రభుత్వానికే సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే సత్తా ఉంటుంది.
అయితే తాను తీసుకోవలసిన చర్యలు తీసుకోని జెపి కసికసిగా కుర్రాళ్లమీద కన్నెర్ర జేశాడు. ప్రభుత్వానికి వాస్తవం చెప్పలేని, ప్రశ్నించలేని ఆయన కళ్లెదుట కనపడినవాళ్లతో యుద్ధానికి దిగాడు.
ఆయనకు ఆ దృక్పధం నుంచి బయట పడనందునే ఇప్పటికీ తాను ఎన్నెన్నో విషయాల మీద తెగతెగ పోరాడుతున్నానని తరచూ చెప్పుకుంటుంటాడు. ఎన్నెన్నో లాభాల్ని తెచ్చిపెట్టానని చెప్పుకుంటుంటాడు. ఎన్నో చట్టాలు తన పోరాటం వలనే వచ్చాయని చెబుతుంటాడు. అయనో విచిత్రం. అయనదో లోకం. ఏం చేద్దాం. కారణం ఏదయినాగానీ ప్రజల సంగతి పట్టాల్సిన వాళ్లు వారికి దూరమయ్యారు. ఆ జాగాలో జరబడిన జెపీలు, స్వాములోర్లు ప్రజల్ని ప్రభావితం చేసేందుకు తెగ చెమటోడ్చుతున్నారు. కానీండి ప్రజలు తెలుసుకునే దాకా… అందరి బొక్కల్నీ విరగదీసేదాకా …. కానీండి. కానీండి.





ఆశీర్వచనాలు - అక్షింతలు